ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/తమ్ముని వివాహము

వికీసోర్స్ నుండి

దింపిరి. అంత మా ప్రార్థనమీఁద దాసు శ్రీరాములుగారు సభా వేదిక నెక్కి, తాము ధర్మశాస్త్రములు సాంగముగఁ జదివితి మనియు, అసలు తీర్మానమున కడ్డుపెట్టువారు జాతిద్రోహులు శాస్త్రద్రోహులు నని గంభీరస్వరమున నుపన్యసించిరి ! దీని పర్యవసానము, మొదటిసవరణ కొనివచ్చిన పండితంమన్యుఁడు సభ నుండి నిశ్శబ్దముగ నిష్క్రమించెను ! తీర్మాన మేకగ్రీవముగ నామోదింపఁబడెను ! నాఁడు వ్యవధానము లేకపోవుటచేతను, మరల భిన్నాభిప్రాయములతో సభ చీలిపోవు నను భయమునను, నాయఁడుగారు కార్యప్రణాళికనుండి వితంతూద్వాహమును గుఱించిన తీర్మానమును దీసివైచిరి. వారి యంత్యోపన్యాసము హృదయరంజకముగ నుండెను. ఈనాఁడే సుప్రసిద్ధరాజకీయవేత్తయగు గ్లాడుస్టనుగారు చనిపోయి రని తెలిసెను.

మఱునాఁడు (22, ఆదివారము) సంస్కృతపాఠశాలలో ప్రార్థన జరిపితిమి. ఇదియే గుంటూరు పుర ప్రార్థన సమాజ జననకాలము. మిత్రులతోఁ గూడి నేను బెజవాడ తిరిగివచ్చితిని. బెజవాడలో సంఘసంస్కరణ సమాజస్థాపనము యుక్తమని మాకుఁదోఁచి, 23 వ తేదీని యొకసభ చేసితిమి. పదునొక్క సభ్యులతోను, ఒక యభిమానితోను బెజవాడ "సంఘసంస్కరణ సమాజము" నెలకొల్పఁబడెను. దానికి శ్రీవేమవరపు రామదాసుపంతులుగారిని కార్యదర్శిగ నెన్నుకొంటిమి.

26. తమ్ముని వివాహము

ఇంటిలోని విలువగల వస్తువులను శిష్యుడు వెంకయ్య గదిలో నుంచి, మేము 25 వ మేయిరాత్రి బయలుదేఱి మఱునాఁటి ప్రొద్దునకు రాజమంద్రి చేరితిమి. తలిదండ్రులను తమ్ముఁ జెల్లెండ్రను జూచి సంతోషించితిని. సాయంకాలము పాపయ్యగారిని జూచి వచ్చితిని. వారి కొమార్తెను మాతమ్మునికిఁ జేసికొనవలె నని నాకెంతో మక్కువ గలదు. కాని మా యుభయ కుటుంబముల ప్రవరలకును విశ్వామిత్రఋషి. కలసి యీ కార్యమున కడ్డుపడెనని యాయన చెప్పెను. ఆ సంబంధమును వదలివేసి, మఱికొన్ని మే మప్పుడు వెదకితిమి.

నా "జనానాపత్రిక"ను ఆంధ్రదేశమందలి తమ బాలికాపాఠశాలల కన్నిటికిని దొరతనమువారు తెప్పించుకొనెడివారు. పత్రికలో 16 పుటలుమాత్రమే యుండుటచేత, తగినన్ని వ్యాసము లందుఁ బ్రచురింప సాధ్య మయ్యెడిదికాదు. కావున నీ జూలై నెలనుండియును చందా రెట్టింపుచేసి, పత్రిక విస్తీర్ణమును ద్విగుణీకృతము చేయ నిర్ధారణచేసికొని, ఈసంగతిని ప్రభుత్వపరీక్షాధిపురాలికిఁ దెలియఁబఱచితిని. దీనినిగుఱించి తమ యభిప్రాయ మేమని యామె యడుగఁగా, నామిత్రులును బళ్లారి సహాయపరీక్షాధికారియు నగు శ్రీ పి. రామానుజాచార్యులవారు తమ పరిపూర్ణానుమోదమును జూపిరి. కాని, రాజమంద్రి మండలోద్యోగియగు స్వామిరావుగారు ప్రత్యుత్తరము వ్రాయుచు, చందా యెక్కువచేయ వచ్చును గాని, పత్రికలో సంస్కరణవిషయములు ప్రకటింపఁగూడదని నుడివిరి. వారి వ్రాత యసమంజసము నప్రస్తుతము నని నేను దలంచితిని ! నేను సంఘసంస్కరణాభిమాని నైనను, వితంతూద్వాహములు సలుపవలె నని పత్రికలోఁ జాటుచుండుట లేదు. అపుడపుడు సంస్కరణమును గూర్చిన సంగ్రహవార్తలు మాత్రమే ముద్రించుచుంటిని. స్వామిరావుగారి హ్రస్వదృష్టికి ! నాకాశ్చర్యాగ్రహములు గలిగెను. ఈ విషయమై నాకు పరీక్షాధికారిణి బ్రాండరుసతి వ్రాసినలేఖకు నేను బ్రత్యుత్తర మిచ్చుచు, విద్యాధికులలోఁ గొందఱు సంకుచితభావమున సంస్కరణవిషయమై యామెకుఁ దెలిపెడి సంగతు లామె విశ్వసింపఁగూడ దని వ్రాసివేసితిని ! పత్రికలోని మార్పునకు దొరతనమువా రంతట సమ్మతించిరి.

నేను రాజమంద్రిలో నుండు దినములలోఁ దఱచుగ పురమందిరము పోయి, పత్రికలు చదువుచుండువాఁడను. "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" అను శీర్షికతో నొక యాంగ్లస్త్రీ వ్రాసిన వ్యాసములు హృద్యములుగ నుండెను.

నే నెచట నుండినను, నాకు పత్రికావ్యాసరచనమునుండి మాత్రము విరామము లేకుండెను ! ఆనెల జనానాపత్రికకు వ్యాసములు వ్రాయుచు, నేను తమ్ముఁడును జూన్ 8 వ తేది యంతయుఁ గడపితిమి. మఱునాఁడు మద్రాసునందలి "ఫెలోవర్కరు" పత్రిక కొక చిన్న యాంగ్లవ్యాసము వ్రాసి పంపితిని.

మా తమ్ముఁడు కృష్ణమూర్తి కిపుడు వచ్చిన యొకటి రెందు సంబంధములకు మే మంగీకరింప లేదు. మేయి 30 వ తేదీని మా నాయనయు, కృష్ణయ్యయును వివాహసంబంధ నిశ్చయమునకై కాళ్ళ గ్రామము వెళ్లి, నాల్గవ జూనుతేదీని రాజమంద్రి తిరిగివచ్చిరి. అచటి సంబంధమే తమకు నచ్చె ననియును, పెండ్లి 9 రోజులలో జరుగు ననియును వారు చెప్పిరి. 12 వ జూనున మే మందఱము బండ్లమీఁద ధవళేశ్వరము వెళ్లి, అచ్చట మాతోడియల్లుడు పోడూరి కృష్ణమూర్తి గారియింట బస చేసితిమి. పెండ్లి కూఁతునివారు సత్రములో దిగిరి జనార్దనస్వామి యాలయములో ప్రాత:కాలముననే వివాహము జరిగెను. పెండ్లికూఁతుని కను లొకించుక తెలుపైనను సౌందర్యవతియె యని చూప రనుకొనిరి. మా తలిదండ్రులు సాయంకాలమునకు రాజమంద్రి వెడలిపోయిరి. నేను, సోదరులు, మిత్రులును ఆదినమున ధవళేశ్వరములో నిలిచి, ఆనకట్ట మున్నగు దృశ్యములు చూచి వచ్చితిమి. మఱునాఁటి ప్రొద్దున పెండ్లివా రందఱిని రాజమంద్రియందలి మా యింటికి గృహప్రవేశమునకుఁ గొనివచ్చితిమి.

18 వ జూను సాయంకాలమున పురమందిరమున ప్రత్యేక ప్రార్థనసమాజసభ యొకటి జరిగెను. "సత్యసంవర్థనీ"పత్రిక యిఁక ముందు నా యాజమాన్యమున బెజవాడలో ముద్రణమై, రాజమంద్రిలో ప్రచురింపఁబడునట్టుగ తీర్మానమయ్యెను !

అంత మేము బెజవాడ వెడలిపోవలసిన తరుణము వచ్చెను. నాభార్య మాతో రాలేకపోయెను. అందువలన, నాకును చిన్న తమ్ముఁడు సూర్యనారాయణకును బెజవాడలో భోజనసౌకర్య మొనఁగూర్చుటకై, మా చిన్నప్ప మాతో వచ్చెను. 20 వ తేదీని మేము బెజవాడ చేరి, వీరభద్రరావుగారిని గలసికొంటిమి. తన చిన్నకుమారుఁ డిటీవల చనిపోవుటచేత, ఆయన దు:ఖతోయములఁ దోఁగియుండిరి.

27. ప్రహసన విమర్శనము

మరల బెజవాడపాఠశాలలోఁ జేరి నా కార్యక్రమమును జరుపుకొను చుంటిని. ప్రార్థనసమాజసభలు నితరసంస్థలును యథాప్రకారముగనేసాగుచుండెను. జూన్ 26 వ తేదీని జరిగిన ప్రార్థనసభలో నేను భాగవతమునుండి కొన్ని పద్యములు చదివి, వాని సారమునుగూర్చి ప్రసంగించితిని. ప్రార్థనసమయమున తమ్ముఁడు సూర్యనారాయణను సద్దు చేయవలదని వారించితిని. ఆరోజునసాయంకాలమునందు ప్రాఁత