ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/జనకసంస్మరణము

వికీసోర్స్ నుండి

30. జనకసంస్మరణము

దినముల కొలఁది నిద్రాహారములు సరిగాలేక మేము తండ్రిని గనిపెట్టుకొని యుండుటవేతను, ఇపు డాయన పరలోకప్రాప్తిఁ జెందుటవలనఁ గలిగిన యాశాభంగపుఁ దాఁకుడుచేతను, మాసోదరుల కందఱికిని శరీరస్వాస్థ్యము తప్పిపోయెను. నన్ను రక్తగ్రహణి పట్టి పీడించెను. చిన్నతమ్ముడు సూర్యనారాయణకు తీవ్రజ్వరము వచ్చెను. అందువలన, ఇపుడు సంప్రాప్తమైన విపత్తును విచారమును మఱపించెడి యలజడికి కుటుంబము తావల మయ్యెను. కాని, క్రమముగ నందఱికిని దేహమున నెమ్మది గలిగెను. ఆదినములలో మాయందఱియాలోచనలకును మా తండ్రిని గూర్చిన సంగతులే ముఖ్యవిషయ మయ్యెను. మానాయన సదా పెరటిలోని చెట్లు పెంచుచుఁ బాటు పడుచుండువాఁడు. ఆయన నిరతము కూరగాయల మొలకలే పెంచు చుండును గాని, పూలచెట్లనిన మక్కువ లేశమును లేనివాఁడని వెనుక నే నే నాయన నొకటిరెండు మాఱులు గేలిచేసితిని. క్రియాపూర్వక మైన ప్రత్యుత్తరము నా కీయఁగోరిన వానివలె, మాతండ్రి యిటీవల నొక యాంగ్లేయుఁడు పట్టణము విడిచిపోవుచుండఁగా, జవానుల నడిగి, వానిపెరటిలోని క్రోటనులు పూలమొలకలు ననేకములు తెచ్చి, విశాలమగు మా పెరటిలో నాఁటెను. ఇపు డాచెట్లు, వింత రంగుల చిగురు జొంపములు వెట్టియు, సువాసన లీను పూవులు దాల్చియు కనులపండువు సేయుచుండెను. ఆయన మిగుల శ్రద్ధతోఁ బెంచిన నిమ్మచె ట్టీదినములలో పచ్చనిపండ్లతో నిండియుండెను. పెరటిలో నెచటఁ జూచినను మాతండ్రి పాటు గానవచ్చుచుండెను. ఆయన యేచెట్టునకుఁ గలుపు తీయుచునో, ఏమొలక తీఁగల సరదు చునో యుండునట్లు మేము భ్రమపడుచుండువారము. మాకనుల కిం కెన్నఁడు కనఁబడక, ఆయన యొక్క పెట్టున మృత్యువునోటఁ బడినట్టుగ మేము విశ్వసింపఁజాలకుంటిమి!

మే మిపుడు చేయు కర్మాంతరములవలన నా కొకింత తాపోపశమనము గలుగుట వాస్తవమే. కాని, యా వ్యర్థకర్మకలాపమువలననే జనకుని పవిత్ర సంస్మరణమునకుఁ గొంత కొఱంతయుఁ గలుగుచున్నదని నే నెంతయు విసుగుచుండువాఁడను.

ఆదినములలో మా కెల్లరకును దుర్భరముగఁ దోఁచినది పదవనాఁటి మా జనని వపనకర్మయే. దీని కంగీకరింపవలదనియు, ఆక్షేపించువారలకు మేము తగు సమాధాన మిచ్చెద మనియు, మే మెంత బోధించినను మాతల్లి వినక, పూర్వాచారపరాయణయై యీ క్రూర కర్మ కొడంబడెను. ఆసమయమున దు:ఖావేశమున నామె మూర్ఛిల్లి పోవచ్చు నని మేము భీతిల్లినను, దైవానుగ్రహమున నట్లు జరుగలేదు. తనయులవలెఁ గాక, యాకష్టసమయమున మాతల్లి ధైర్యము వహించి యుండెను. విధ్యుక్త మని తాను నమ్మిన మార్గమెంత దుస్సహమైనను, దానిచొప్పుననడచుకొనుట కాపుణ్యవతి యావంతయుఁగొంకకుండెను.

మాతండ్రి చనిపోయిన 11 వ నాఁడు రాజమంద్రి "ప్రార్థనసమాజము"వారు ప్రత్యేకసభ నొకటి సమకూర్చిరి. ఆసమయమున రెబ్బాప్రగడ పాపయ్యగారు అధ్యక్షులుగ నుండిరి. మా జనకునిగూర్చి నే నపు డొక యాంగ్లవ్యాసమును జదివితిని. అందలి ముఖ్యభావము లిచటఁ జేర్చుచున్నాను: -

"చనిపోవునప్పటికి మాతండ్రికి సుమా రఱువది సంవత్సరముల వయస్సు. ఆయన జన్మస్థలము తణుకుతాలూకాలోని గోటేరు. వారిది గౌరవనీయమగు నియోగిబ్రాహ్మణ కుటుంబము. విద్యాగంధ మెఱుంగని యాయన తండ్రి ప్రయాసమునఁ దనపెద్ద సంసారమును బోషించుకొనుచుండువాఁడు. ఆగ్రామమున నింటికిఁ జేరువనుండు తన పొలమును సొంతముగ సేద్యము చేసికొని, ఆయన సతీసుతులను బోషించుకొనుచుండువాఁడు. మాతాత కృష్ణమ్మగారి కైదుగురు పుత్రులును, ముగ్గురు పుత్రికలును గలరు. ఆయన కష్టములు నానాఁట ఫలించెను. కుమాళ్లు ఒక్కరొక్కరే పెద్దవారలు ప్రయోజకులునై, కుటుంబపోషణ భారమును తామే వహించిరి. చిన్నవాఁడు మా తండ్రికి విద్య నేర్చుటకు స్వస్థలమున నవకాశము లేకపోయెను. కాని, ఆయన యింట వ్యర్థకాలక్షేపము చేయనొల్లక స్వతంత్రజీవన సంపాద్యము చేయఁబూనెను. విద్య యంతగ రాకుండెడి యువకులకు జీవనోపాధి గలిపించుటకై యాకాలమున నరసాపురమున బోధనాభ్యసన పాఠశాల యొకటి యేర్పడియుండెను. మాతండ్రి యందుఁ జేరెను గాని, అచట బోధింపఁబడెడి చరిత్రము భూగోళము మున్నగు నూతన విషయములు తలకెక్కక, కొలఁది దినములకే యాయన యచటినుండి తప్పించుకొనిపోయెను ! అంత సర్వేశాఖలో నుద్యోగము సంపాదించి, పలుమాఱు పని విరమించుకొనుచు వచ్చినను, తన యుద్యోగకాల మంతయు నాయన, యా శాఖలోనే పనిచేసెను.

"సర్వేయుద్యోగమం దాయన యాంధ్రదేశ మంతటను సంచారము చేసెను. ఉత్తరజిల్లాలే కాక, దత్తమండలములుకూడ మానాయన సందర్శించెను. ఎక్కువగ ధన సంపాదనము చేసి, జ్యేష్ఠసోదరునికి సొమ్మాంపి, మంచిభూవసతి సంపాదించెను. ధన సంపాదన విషయమై మాతండ్రి త్రొక్కినత్రోవ సరియైన దని చెప్పువాఁడను గాను. కుటుంబపోషణము చేసికొనుటయం దెట్టి ప్రవర్తన మైనను కూడు నని సామాన్యజనులవలె నమ్మి, ఆయన తన చర్యలను సమర్థించు కొనుచుండువాఁడు.

1882 వ సంవత్సరమున తనయుల విద్యాభివృద్ధినిమిత్తమై మాతండ్రి రేలంగినుండి రాజమంద్రికి సంసారమును తరలించెను. త నున్నతవిద్య నభ్యసింపకున్నను, ఆంగ్లేయ విద్యాసంస్కారము కలిగినఁ గాని తనకుమాళ్లు వృద్ధినొందరని గ్రహించి, ఆయన వారి విద్యకొఱకై పడరాని పాట్లుపడెను. మేము రాజమంద్రిలోఁ జదువుచుండినపుడు, నెలకు పదునైదు రూపాయీల జీతముమీఁద మానాయన గోదావరి విశాఘపట్టణ మండలములందలి గడుమన్యములలోఁ దిరుగుచు, ఒక్కొక్కప్పుడు వన్యమృగములనోటఁ బడ సిద్ధ మగుచు, పుత్రుల విద్యాభ్యున్నతికై యపారస్యార్థత్యాగము చేసెను ! కాని, యిటీవల కొంతకాలమునుండి యాయన వ్యాధిగ్రస్తుఁడై యుద్యోగము లేక యుండుటవలన, కుటుంబము అప్పుల పాలయ్యెను. ఋణములు తీర్చి వేయుటకై కష్టార్జితమగు భూమినంతను అమ్మివేయుట కాయన సంశయింపకుండెను. ఆయన పడిన కష్టముల ఫలితముగ, కుమాళ్లలోఁ బెద్దవార మిరువురము విద్యాపరిపూర్తిచేసి ఉద్యోగమునఁ బ్రవేశించిమి. కాని, మా కష్టమంతగ ననుభవింపకయే, ఆయన పరలోక ప్రాప్తిఁ జెందిరి !

"ఈకష్టసమయమున నా హృదయమును దుర్భరవిషాదముచేఁ గలంచునది, ఆయనయెడ నేను జెల్లింపని విధ్యుక్తములసంస్మరణమే ! పలువిషయములలో మేము మాజనకునిదెస నపరాధులము ! మేము హాయిగ నుండునపుడు, ఆయన కష్టముల పాలయ్యెడివాఁడు. మాకొఱకింతగాఁ బాటుపడిన తండ్రినిఁ దగినట్టుగ సుఖపెట్టమైతిమిగదా యని మేము వగచుచున్నాము. ముం దాయన కెప్పుడో 'కట్నము గప్పుద' మను మా యాశ లన్నియును ఆయన మృత్యువువలన వట్టి యడియాస లయ్యెను !

"సంఘసంస్కరణమును గుఱించియును, ప్రార్థన సమాజము నెడలను మాతండ్రిగారి దృక్పథ మెట్టులుండినని మీ రడుగవచ్చును. ఆయన పూర్వాచారాపరుఁ డయ్యును, వివిధప్రదేశములు సందర్శించి విదేశీయోద్యోగులతోడి సంపర్కము గలిగియుండిన హేతువున, ఆయనభావములకుఁ గొంత వైశాల్య మబ్బెను. రాజమంద్రిలో తన కుమారులలో పెద్దవా రిరువురును సంఘసంస్కరణ సమాజమునఁ జేరి పాడగుచుండిరను వదంతులు ప్రబలినను, ఆయనకుఁ జీమకుట్ట దయ్యెను ! పుత్రుల మతాభిప్రాయములపట్ల నాయన మంచి సహన బుద్ధి గలిగియుండెను. నే నిచటి ప్రార్థనసమాజమునఁ జేరి తీవ్రముగఁ బనిచేయుచు, "సత్యసంవర్థనీ పత్రికను" నెలకొల్పి నడుపుచుండెడి 1891 - 92 సంవత్సర ప్రాంతములందు, నేను నాస్తికుఁడనై దుష్కార్యము లాచరించుచుంటి నని పలువురు మొఱలిడినను, ఆయన నిశ్చలుఁడై యుండెను ! మాతండ్రిగారి మత విశ్వాసములు కొంతవఱకు ప్రజాభిప్రాయములకు భిన్నములే. కావున నేకేశ్వరోపాసకుఁడనకు నాయం దాయన కొంత సానుభూతి గనఁబఱుచుచుండువాఁడు.

"లోకవ్యాపారములలో మాతండ్రి న్యాయశీలుఁడు. తా నెన్నఁడును న్యాయసభల కెక్క లేదనియు, అసత్య మాడలేదనియును ఆయన చెప్పుచుండువాఁడు. ఆయన యెవరిని గాని హింసించుటయు, మోసపుచ్చుటయు నే నెఱుంగను. పైకి మొరటుగఁ గానిపించినను, ఆయన కోమలహృదయమున నొప్పువాఁడు.

"మాతండ్రి మంచమెక్కి వేదన పడుచుండెడి యంత్యదినములలో, నలుగురు సోదరులమును రేయుంబవళ్లు ఆయనను కనిపెట్టి యుండువారము. రాత్రులు నిద్రను నిరోధించితిమి. అట్లుగాక, ఒకరి వెనుక నొకరము మేము మాతండ్రిని గాచుచు,. నిదురించుచుండుట మంచి దని బంధువులు యోజన చెప్పిరి. కాని, వంతులచొప్పున వేచి యుండుట యనునది, వంతులచొప్పున ప్రేమించుటవలె మాకుఁ దోఁచెను ! ఒక్కొక్కప్పుడు మాలో నెవరముగాని నిద్రాపారవశ్యమున నైనను, ఒండొరుల బోధనముననైనను, ఒకింత కునికినప్పుడు, తండ్రి మూలుగు చెవులఁబడగనే అదరిపడి లేచి కూర్చుండువారము ! ఇట్లు మేము చనిపోవుతండ్రిని మిగుల శ్రద్ధతోఁ గనిపెట్టితిమి. ప్రేమ పూరితహృదయు లగు పుత్రులు తనకు సపర్యలు చేయుచుండిరని గాంచి సంతృప్తి నొందుటకైన మాతండ్రి కొకింత స్పృహ వచ్చి ప్రాణము నిలుచునేమో యని మే మాశించుచుంటిమి. కాని, యీశ్వరోద్దేశము వేరయ్యెను.

"మా కత్యంతప్రేమాస్పదుఁడగు పితృని కళేబరము ఛితిపై నొక త్రుటిలో మటుమాయమయ్యెను. మృత్యుదేవతా ! మా జనకుని యసువులఁ గొనిపోయిన నీవు, విచ్చల విడిగ సంచారముచేసెడి నా విషయేచ్ఛల నేల సమయింపఁజాలవు? కొంతకాలముక్రిందట పాపచింతనలు నామనసునఁ జెలరేగి యుండునపుడు, ఒకచిన్న తమ్ముని మరణ రూపమున భగవంతుఁడు నాకు హృదయప్రబోధముఁ గలిగింపఁజూచెను. మరల నిటీవల నా యంతరంగము హేయవాంఛలకును పాపసంకల్పములకును నాటపట్టయ్యెను. నా మదోన్మత్తత నడగించుటకు నాకేదో మూఁడునని యెదురు చూచుచుంటిని. ఇవ్విధముగఁగాని నాకుఁ బ్రాయశ్చిత్తము గలుగదని యెంచి భగవంతుఁడు నా కీవిపత్సందేశము నం పెనని నే నెంచుచున్నాఁడను. "మా జనకుని పవిత్ర జీవితము మాసోదరు లందఱికిని పరస్పర ప్రేమముఁ బురికొల్పును గాక! మా తండ్రి కీలోకమున సమకూరని శాంతి సౌఖ్యములు పరాత్పరుని సన్నిధానమునఁ బ్రసాదిత మగునుగాక!"

నా ప్రసంగానంతరమున మిత్రులు పెద్దాడ సాంభశివరావు గారు మా జనకుని సౌజన్యమును గూర్చి ముచ్చటించిరి. అగ్రాసనాధిపతియగు పాపయ్యగారు మానాయన సుగుణములను బ్రశంసించిరి. ఎన్నఁడుగాని తనకుమారులు చెడువార లనియు నాస్తికు లనియు మాతండ్రి మొఱలిడలేదని వారు చెప్పిరి. అమిత సహన సౌజన్యములు గలిగి మాజనకుఁడు మనుచుండెడివాఁడని పాపయ్యగారు వక్కాణించిరి.

31. ప్రాథమిక పరీక్ష

మాతండ్రి చనిపోయిన చాలకాలమువఱకును, నా కాయనను గుఱించి భయంకరమగు కలలు వచ్చుచుండెడివి. మా కిపుడు కష్టపరంపర సంభవించె ననియు, మాతల్లి మున్నగు వారును మృతి నొంది రనియు నేను సుషుప్త్యవస్థయందు భ్రమనొందుచుండువాఁడను. ఇపుడు సంవత్సరపు తుదిదినము లగుటచేత మా పాఠశాలకుఁ బరీక్షలు చేయఁజొచ్చితిమి. నామిత్రులు వెంకటరత్నము నాయఁడుగారు కృష్ణామండలపూర్వభాగమునకు ప్రాథమిక పరీక్షాధికారిగ నియమింపఁబడిరి. ఆయన నన్నును, మఱికొందఱు స్నేహితులను సహాయ పరీక్షాధికారులుగ నియమించిరి. అందువలన నించుక ధనలాభమె కాక, మనసునకుఁ గొంత విరామమును, వారియొక్కయు నితర స్నేహితులయొక్కయు నమూల్య సహపాస భాగ్యమును నాకు లభించెను.