ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/చెల్లెలి వివాహము

వికీసోర్స్ నుండి

33. చెల్లెలి వివాహము

నేనిదివఱకు వ్రాసిన "జీవాత్మ పరమాత్మల" విమర్శనము సరిచూడుఁడని వెంకటరత్నమునాయఁడుగారికి బందరు పంపితిని. ఆయన తది 20 మార్చిని నాకు మరల నంపివేసెను. వారిసూచనల ననుసరించి నే నా వ్యాసమున వలసినకొలఁది మార్పులు చేసి, శుద్ధప్రతి వ్రాసి, 3 వ మార్చిని కలకత్తాకుఁ బంపివేసి, మనస్సునఁ గొంతయుపశమనము గాంచితిని.

బాధపిమ్మట బాధనాకు గలుగుచువచ్చెను. ఇదివఱకు నేనారంభించిన 'హిందూసుందరీమణుల చరిత్రములు' పూర్తియగుచుండెను. న్యాయశాస్త్రపుఁజదువు లొకవిధముగ సాగుచుండెను. నన్నిపుడు వేధించునది కార్యభారము కాదు. నా కప్పిచ్చిన రాజారావు తనసొమ్మీయు మని తొందరచేయసాగెను. అప్పులనుగూర్చి తలంచుటయే నాకు బాధాకరముగ నుండెను. ఎటులో కష్టపడి, ధనసంపాదనము చేసి యప్పులు తీర్చుట పురుషధర్మమని నాకు నచ్చెను. సోదరుల తోడ్పాటున నీఋణశత్రువును సులభముగ నిర్జింపవచ్చునని యెంచితిని. 28 వ తేదీని ఆంధ్రసారస్వత విషయములను గుఱించి వీరభద్రరావుగారితో మాటాడుచు, వీరేశలింగముగారి జీవితచరిత్ర నేను వ్రాసెద నంటిని. "దరిద్రాణాం మనోరథా:"!

5 వ ఏప్రిలున మా పాఠశాలలో ఎడ్డీ యను యువ క్రైస్తవమతప్రచారకుఁడు ఉపన్యాసమిచ్చెను. అతనికి విపరీత క్రైస్తవమతాభి నివేశము గలదు. జ్ఞానవిచక్షణకంటె పట్టుదలయే యాతనియం దధికముగఁ గానిపించెను! ఈ మహనీయుఁడే నాయుఁడుగారు బందరునుండి కదలిపోవుటకు ముఖ్యకారణ మని నాకుఁ దెలి సెను. ఆతని వైఖరియు వేగిరపాటును, మా పాఠశాలలోని హిందూవిద్యార్థుల కందఱికి నొక్క మాఱుగ జ్ఞానస్నాన మిప్పింపఁగోరు చుండెను !

నేను సభ్యుఁడనైన లండను "మనస్తత్త్వ పరిశోధన సంఘము" వారి ప్రచురణములు నాకు క్రమముగ నందుచుండెను. వారి నూతన ప్రచురణము వినోదాంశములతో నిండియుండెను. ఆసమాజమువారి మాసపత్రికకూడ నాకు వచ్చుచుండెను. నాకోరికమీఁద వారు హిందూదేశమందలి సభ్యులకుఁ దమ గ్రంథముల ప్రతులు రెండేసియంపుట కంగీకరించిరి. అందువలన నాయుఁడుగారు నేనును గలసి యొక సభ్యునిచందా చెల్లించి, ఒక్కొక పుస్తకప్రతి నందుకొనుచుండువారము.

1899 సంవత్సరము 11 వ ఏప్రిలు వికారి సంవత్సరాది పండుగరోజున నా దినచర్య యిటు లుండెను : -

"ఏమికారణముననో కాని సతి నన్ను ప్రబలశత్రువునివలెఁజూచుచున్నది! తనకు ధన మీయలేదని నామీఁద పగఁబూనినది. ప్రస్తుత సంసారపరిస్థితులలో నే నెట్లు సొ మ్మీయనేర్తును ? ఆమెవిరోధ వై మనస్యములచే నా యుదారాశయములు తాఱుమా ఱగుచున్నవి! ఈశ్వరాదేశములగు నీయాశయముల నే నెట్లు త్యజింపఁగలను? * నేనిదివఱకు వ్రాసిన వ్యాసములు చదివి వినోదమునఁ గాలము గడిపితిని. కామశాస్త్రిగారితో నద్వైతమతమునుగూర్చి వాదించుచు, అందలి లోపములు వారికిఁ జూపించితిని."

మిత్రుఁడు వెంకటరత్నము నాయఁడుగారికి 120 రూపాయల జీతముమీఁద, సికిందరాబాదు మహబాబు పాఠశాలాధ్యక్షపదవి లభించిన దని తెలిసి నే నెంతయు సంతోషించితిని. మా తండ్రిగారు నా కిదివఱకు వ్రాసిన రెండు ఉత్తరములును నా కిపుడు పరిచితులయిన హాడ్జిసనుదొరగారి కమెరికా పంపితిని. పైపరుదొరసానికి మూర్ఛా సమయమున వీనిని జూపించి, మా తండ్రిని గుఱించి యామె యేమి చెప్పునో నాకుఁ దెలియఁజేయుఁడని వారినిగోరితిని. పాఠశాలలోఁ బ్రథమోపాధ్యాయుఁడు చేయునక్రమములను గుఱించి నా దినచర్యపుస్తకమం దీక్రిందివ్యాఖ్య గలదు  : -

"ఈక్రైస్తవబృందమువారికి మనుజుల వర్తన మెటు లున్నను వారిమతమే ప్రధానమని తోఁచుచున్నది ! సజ్జనులగు హిందువులకంటె దుశ్శీలురగు క్రైస్తవులే వీరికిఁ బ్రియులు ! దేవదూతవంటి పూతచారిత్రుఁడగు నాయఁడుగారి నీ మతసంఘమువారు తమ విద్యాలయము నుండి వెడలఁగొట్టిరే! శీలసౌష్ఠవముఁ గోలుపోయిన బోధకమహాశయుల నీ పాఠశాలనుండి యెవరును గదలింపలేకున్నారు ! ఇట్టి భూలోక దృశ్యములు దేవతల పరిహాసములకుఁ దావల మగుచున్నవి."

మా చెల్లెలిపెండ్లి 3 వ మేయి తేదీని జరుగునని తమ్ముఁడు వ్రాసెను. కాని, నేను వెళ్లుటకు వలనుపడదని ప్రథమోపాద్యాయుఁడు చెప్పివేసెను. పాఠశాలాధికారికి బందరు జాబువ్రాసివేసి, 1 వ మేయి తేదీని నేను రాజమంద్రి వెడలిపోయితిని. ఎంతో ప్రయాసపడి వస్తు సామగ్రి సిద్ధము చేసితిమి. ఎట్టకేలకు 3 వ తేదీన రాత్రి చెల్లెలి పెండ్లి జరిగెను. నాలుగవనాఁడు పురములోని యుద్యోగి మిత్రులకు విందు చేసితిమి. ఈపెండ్లికి స్వల్పముగనె సొమ్ము వెచ్చించితిమి.

నేను రాజమంద్రిలోనుండు దినములలోనే విడిగా తీయించిన "హిందూ సుందరీమణుల చరిత్రముల" ప్రతులు ప్రచురమయ్యెను. వానిలోఁ గొన్ని విమర్శనార్ధమై పత్రికాధిపతులకుఁ బంపితిని. ఇప్పుడు భర్తృవిహీనయై వనరుచుండెడి మా ప్రియజనని కీపుస్తకము కృతియిచ్చి, సంతృప్తి నొందితిని.

17 వ మేయి తేదీ దినచర్యయం దిట్లు గలదు : -

"నే నీ మనోనిశ్చయములను జేసికొన్నాను : - (1) కోపపరవశుఁడను గాకుండవలెను. (2) నామాటలవలన నెవనిమనస్సును నొప్పింపవలదు (3) ఈశ్వరధ్యానమునకై తీఱికకాలము వినియోగింపవలెను. వృథాకాలక్షేపము చేయఁగూడదు. (4) ప్రలోభనముల బారిఁబడకుండ తప్పించుకొనవలెను. మనస్సునుండి విషయాసక్తిని గోసివేయవలయును." ఇవి యన్నియు మంచినియమములే. వాని నాచరణమునఁ జొప్పించుటయే కష్టతరమగు విషయము!

ఈ వేసవిని రాజమంద్రిలో తమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గలసి నేను న్యాయశాస్త్ర గ్రంథములను చదివితిని. ఆతఁడు రెండవతరగతి పరీక్ష నిచ్చి యిపుడు రాజమంద్రిలో న్యాయవాదిగ నున్నాఁడు. మొదటి తరగతిపరీక్ష కాతఁడును, రెండవతరగతికి నేనును బోవలెనను సంకల్పముతో నిపుడు శ్రద్ధతోఁ జదివితిమి. తమ్ముఁడు కృష్ణయ్యకు ప్రథమశాస్త్ర పరీక్ష యాంగ్ల పఠనీయపుస్తకములు బోధించితిని. పెద్దవార మిద్దఱము నింత జదువుచుండినను, చిన్న వారలు కృష్ణయ్య సూర్యనారాయణ వ్యర్థకాలక్షేపము చేయుచున్నారని వారలను జీవాట్లు పెట్టువాఁడను. నా యారోగ్యము నసిగా లేదు. నా కంటెను తమ్ముఁడు వెంకటరామయ్య బలహీనుడె యని విచారించు చుండువాఁడను. జనని వ్యాధినిగుఱించి వైద్యాధికారి నడుగఁగా, ఆమె రోగనివారణము కష్టసాధ్య మనియు, తశ్శాంతిమాత్రము చేయవచ్చు ననియును, ఆయన చెప్పెను. నా దేహారోగ్య మెటు లుండినను, ఆత్మారోగ్యము మాత్రము క్రమముతప్పి యుండెను. నా యాత్మకు పాపేచ్ఛ యనునది జీర్ణ వ్యాధిగఁ బరిణమించెను ! ఆత్మావ్యాధులు సులభ నివారితము లని పూర్వము నే ననుకొనువాఁడను గాని, అంతకంటె మొండిరోగము లుండవని నా కిపుడు ద్యోతక మయ్యెను.

1 వ జూన్ తేదీని మిత్రుఁడు కనకరాజు భార్య చనిపోయె నను దు:ఖవార్త విని, నా సంతాపమును సానుభూతిని దెలుపుచు నాతని కొకలేఖ వ్రాసితిని. 18 వ జూన్ ప్రొద్దున బెజవాడ పయనమయితిని. రెయిలులోఁ గూర్చుండి నే నిట్లు తలపోసితిని : -

"ఈ సెలవులలో రాజమంద్రిలో నుండురోజులలో నేను తల్లితో ధారాళముగ మాటాడలేకపోయితిని. విపరీత మిత భాషిత్వము నన్నావహించి యుండెను. దీనికితోడు, ఆమె రుసరుసమనుచు, విరోధ భావమున మెలంగెడిది. తుదిదినములలో మా తండ్రియు నిట్లే యుండెడివాఁడు. కావుననే నే నాయనతో మనసిచ్చి మాటాడనేరకుండెడివాఁడను !" రెయిలులో నేను విశాఖపట్టణమునుండివచ్చు దాసుగారిని గలసికొంటిని. మరల మేము మిత్రులమయితిమి. నేను బెజవాడలో దిగునప్పటికి నన్నుఁ గలసికొనుటకు రాజారావు, విద్యార్థి పానకాలును గనిపెట్టుకొని యుండిరి. రాజారావునింట నేను భుజించితిని. బెజవాడలో ఆస్తికసమావేశము జరిపింతుమని ప్రకటించిన రాజగోపాలరావు మీఁద నేను కోపించితిని.

34. "జీవాత్మ - పరమాత్మలు"

ఆ వేసవిసెలవుల పిమ్మట బెజవాడలో యథాప్రకారముగ నాపనులు నేను జేయుచువచ్చితిని. పుట్టినిల్లగు కట్టుంగ