ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"హిందూ సుందరీమణులు"(2)

వికీసోర్స్ నుండి

బాగుగఁ బరీక్షించి, అం దేలోపము లేదనియు, కండర సంబంధమగు వాతమే బాధకుఁ గారణము కావచ్చు ననియును జెప్పిరి. నే నధికముగఁ బరిశ్రమము చేయుచు, నా వ్యాధిని గుఱించి పలుమాఱు తలపోయుచుండుటచేతనే నామంటలు హెచ్చుచుండవచ్చు నని కూడ వారి యభిప్రాయము !

42. "హిందూ సుందరీమణులు"(2)

1900 సం. సెప్టెంబరు మధ్యమున "హిందూ సుందరీమణుల చరిత్రముల" రెండవ భాగమును బూర్తిచేసితిని. దీనికిని మొదటిభాగమునకును గొంత భేదము లేకపోలేదు. కావున దీని పీఠికలో నే నిట్లు వ్రాసితిని : - "ఇందలి కథలలోఁ గొన్నింటిని గుఱించి యొకటిరెండు సంగతులు చెప్పవలసియున్నది. సత్యభామచరిత్ర నీ గ్రంథమున నేల చేర్చితి వని కొందఱు స్నేహితులు నన్నడిగిరి. సత్యభామ గయ్యాళి యనియు, ఆమెచరిత్ర మంతగా నీతిదాయకము గాదనియు వారల తలంపు. ఇది సరియైన యూహ కాదు. సీత, ద్రౌపది మొదలగు వనితల సుగుణములు శ్లాఘాపాత్రములే యైనను, వీరి చరిత్రములొకరీతినె ప్రాఁతవడిన గుణవర్ణనములతో నిండియుండి, నవీనుల కంతగా రుచింపకున్నవి. పతిభక్తియే వీరికిఁ గల గొప్పసుగుణము. ధైర్యసాహసాదు లంతగ వీరియందుఁ గానిపింపకున్నవి. ఇట్టిస్త్రీల చరిత్రములు చదివిచదివి, సత్యభామకథ చేతఁబట్టినవారి కింపగు భేదము గానఁబడును. నిర్మలప్రవర్తనమునం దితర ముదితలకు సత్య యావంతయుఁదీసిపోక, వారియందుఁ గానరాని ధైర్యాది నూతనసుగుణములు దాల్చి, హిందూవనితల యభ్యున్న తిని గాంక్షించెడివారల కానంద మొసంగుచున్నది ! మనదేశమందు భార్యయనునది భర్తవినోదార్థ మేర్పడిన కందుక విశేష మనియె భావించుచున్నారు గాని, ఆమెయును బురుషునివలెనే స్వబుద్ధి వినియోగించి, స్వతంత్రత నూని, ధైర్యసాహసాదులు గలిగి, ఘనకార్యములు నిర్వర్తించి, కృతకృత్య కావలెనని యెవరు నంతగఁ దలంచు చుండుట లేదు ! ఈ సుగుణములు దాల్చి, మగనిపరిచారికవలె మాత్రమె చరింపక, చెల్లింపవలసిన యధికారము చెల్లింపుచు, చేయవలసిన ఘనకార్యములు చేయుచు, తన ప్రజ్ఞాచాతుర్యములు మెఱయు నట్టుగ మెలంగినది పూర్వకాలస్త్రీలలో సత్యభామ యొక తెయే ! పత్నీధర్మ మెప్పటికిని పతి ననుసరించుటయే యని తలంచెడి మన దేశమున, ప్రజ్ఞయు, స్వతంత్ర బుద్ధియుఁ గలిగి సంచరించెడి సత్యభామవంటి చానలు జాణలని ప్రతీతి గలుగుటయం దేమియాశ్చర్యము ?

"ఈ గ్రంథమునఁ జేర్పఁబడిన యింకొకకథనుగూర్చి కూడ కొంత చెప్పవలయును. మొదటినుండియు సత్ప్రవర్తనగల స్త్రీయే సుగుణవతి గాని, ఒకప్పుడు ప్రమాదవశమున తప్పు చేసి పిదప పరితపించి సన్మార్గముఁ జొచ్చిన వనిత మంచిదికాదని మనదేశమునఁ బలువుర తలంపు. ఇది సరికాదు. ఇందలి 'కాంచనమాలిని' మొదట నాటవెలఁదియె యైనను, పిమ్మట గాఢానుతాపమున సన్మార్గ మవలంబించెను. ఇట్టి మానినులును మన మన్ననలకుఁ బాత్రలే."

మద్రాసునందలి "సంఘసంస్కారిణీ" పత్రిక నాపుస్తకమును విమర్శించుచు నిట్లు వ్రాసెను : - "ఈ గ్రంథకర్త తెలుఁగు జనానా పత్రికను బ్రచురించియు, సద్గ్రంథములు ప్రకటించియు, ప్రస్తుత పరిస్థితుల వైపరీత్యమున నజ్ఞాన తిమిరమున మునింగిన స్త్రీజాతి నుద్ధరింపఁ బ్రయత్నించుచున్నాఁడు. ఇట్టి పుస్తకములు మూలమున స్త్రీలకు ప్రమోదముఁ గలిగింప వీరియుద్యమము. ఎక్కువగఁ బరిశ్రమించి, పురాణములందుండిన యుత్తమస్త్రీల చరిత్రములు వీరు తెలుఁగున రచించి ప్రకటించిరి. ప్రాచీనప్రకృతభామినుల సుగుణములతో విలసిల్లు సత్యభామకు స్వానుభవసాహాయ్యమున ద్రౌపది చేసిన యమూల్యోపదేశములు, ఈకాలపుఁ బుణ్యాంగన లనుసరింప యోగ్యముగ నున్నవి. ధనాశచేఁ దన మానము నమ్ముకొని తుద కదృష్టవశమున పరితాపము నొంది నూతనజీవమున విరాజిల్లెడి కాంచనమాలినికథవలన, ఎంత దుస్థితికి వచ్చినయింతియైన నధైర్యపడక పూనికతోఁ శీలసౌష్ఠవముఁ బడసినచో బూజనీయ యగు ననుట స్పష్టము. * * * "

జనానాపత్రిక కొంతకాలమునుండి ముప్పదిరెండు పుటలు గల పుస్తకరూపము దాల్చెను. కావున నెలనెలయును సామాన్య వ్యాసములేకాక, యేదో యొకపుస్తకభాగముకూడ నందుఁ బ్రచురింపవలసి వచ్చెను. కొంతకాలముక్రిందట హిందూపత్రిక కొక యాంగ్లస్త్రీ "ఇంగ్లీషువారి సంసారపద్ధతు" లను గుఱించి వ్రాసిన వినోదకరములగు వ్యాసములు నేను, జదివియుంటిని. ఇపు డొకవిద్యార్థి చేతిలో నీ వ్యాసము లన్నియుఁ గూర్చిన పుస్తక మొకటి చూచితిని. గ్రంథకర్త్రి మైసూరు స్త్రీవిద్యాలయ ప్రథమోపాధ్యాయిని యగు రిడ్సుడేలుకన్యక యని నా కపుడు తెలిసెను. ఈపుస్తకము నాంధ్రీకరించి 'జనానాపత్రిక' లోఁ బ్రచురింప ననుజ్ఞ నీయుఁడని యామెకు 17 వ సెప్టెంబరున వ్రాయఁగా, అందుల కామె యిష్టపడెను.

19 వ సెప్టెంబరు దినచర్యయం దిట్లు గలదు : - "పాప హేయఁపుఁ దలంపులు నన్ను సదా వేధించుచున్నవె ! చెన్నరాజ ధానియందు ఆస్తిక మతప్రచారకుఁడవు కమ్మని నాకు నిన్న కొందఱు మిత్రులు వ్రాసిరి. ఆహా, ఈ పదవికి నే నెంతయు ననర్హుఁడనుగఁదా ! పాపి యగువాఁడు తోడిపాపుల కెట్లు తోడునీడ కాఁగలఁడు ? నా కీగౌరవము ముమ్మాటికిని వలదు ! నాకు పాప మాలిన్యములయందే యనురక్తి !"

నా కీమధ్య లభించిన మార్టినో రచనములు నే నిపుడు తఱచుగఁ జదువుచుంటిని. అప్పుడప్పుడు ఆంధ్రసాహిత్య గ్రంథములు చదివి సతికి వినిపించి యర్థము చెప్పుచుండువాఁడను.

30 వ సెప్టెంబరు ఆదివారము మధ్యాహ్నమున నేను గదిలోఁ జదువుకొనుచుండఁగా పొరుగునుండి కేకలు వినఁబడెను. నేను వాకిటికి వచ్చి చూడఁగా, మా జామచెట్టుమూల నొక ముసలివాఁడు దాఁగి యుండెను. వానిచేతిలో కంచుగిన్నె యొకటి యుండెను ! నా ప్రశ్నలకు వాఁ డేమియు ప్రత్యుత్తర మీయక, దిగాలుపడి చూచెను. ఇంతలో జనులు మా యావరణములోనికి వచ్చి యామనుష్యునిఁ బట్టుకొనిరి. పాప యాముసలివాని మొగము కడుదీనముగ నుండెను. గిన్నె దొరకెను గాన, వానిని వదలివేయుఁ డని నే నంటిని. ప్రజలు వానిని బోనీయక పోలీసు స్టేషనుకుఁ గొనిపోయిరి. పిమ్మట నొకరక్షక భటుఁడు వచ్చి దండనాధిపు నెదుట నేను సాక్ష్య మీయవలయు నని చెప్పి, నా పేరు వ్రాసికొని పోయెను. మఱునాఁడు నేను న్యాయస్థానమునకుఁ బోయియుంటినిగాని, నాసాక్ష్యము గైకొనకయే యధికారి దొంగకు మూఁడు నెలల ఖైదుశిక్ష విధించెను. ఈచోరీ విషయమున నన్ను బో నెక్కించి నాచే సాక్ష్యము పుచ్చుకొని, నాకు శ్రమయు నవమానము గలిగింపఁ దాను సమ్మతింపకుంటి నని న్యాయాధికారి యనునప్పుడు, నేను మరియాద కాయనకు వందనము లిడినను, న్యాయసభలో సత్యము పలుకుట నీచమా యని యాశ్చర్య పడితిని.

వీరభద్రరావుగారు బెజవాడనుండి వెడలిపోయిన పిమ్మట, మాయింట నొక వైదిక బ్రాహ్మణ కుటుంబమును రెండవభాగమున నుంచితిమి. ఆ పెద్దయావరణమున మే మొంటరిగ మసలుటయు, ఆ చిన్న యింట మాతోఁగలసి వేఱొకరు కాఁపురము చేయుటయును గూడఁ గష్టమే !

నాకు గుండెదగ్గఱ మంట యనుదినమును గనఁబడుచుండెను. కోకో గాని తమిదయంబలి గాని పుచ్చుకొని చూడు మని వైద్యుఁడు చెప్పఁగా, నే నిట్లు చేసితిని గాని లాభము లేకపోయెను. పాఠశాలలో పని యెక్కువ యగుటయే దీనికిఁ గారణ మని నేను నమ్మితిని. ఇది యొకటియే గాక, పత్రికలకు వ్రాయుట, సభలు సమావేశములు సమకూర్చుట, గృహచ్ఛిద్రములను గుటుంబ ఋణములను గూర్చి సదా తలపోయుట, - మున్నగు పను లన్నిటివలనను నా దేహపటుత్వము తగ్గుటయే దీనికిఁ గారణము కావచ్చును.

నే నిపుడు "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" తెలుఁగుచేసి, యీ సంవత్సరము అక్టోబరునుండియు "జనానాపత్రిక" లోఁ బ్రచురింపసాగితిని. పత్రికలో వ్రాసినభాగముల ప్రతులు పుస్తకరూపమున ప్రత్యేకముగఁ గొన్ని తీయించుచు వచ్చితిని. ఈవిధముగ నాపుస్తకమంతయు 'జనానాపత్రిక' యెనిమిదవ సంపుటాంతమున, అనఁగా 1901 సం. జూనునెల పత్రిక సంచికతోఁ బూర్తిపఱిచితిని. తెలుఁగుపద్యములు వ్రాయు నభ్యాసము నాకు లేదు. కావున మాతృకలో నుల్లేఖింపఁబడిన టెన్నిసను మున్నగు నాంగ్లకవులపద్యముల భావము నేను జెప్పఁగా, నామిత్రులు కామశాస్త్రిగారు చక్కని తెలుఁగు పద్యములు రచించి నా కిచ్చుచు వచ్చిరి. అవి నేను బుస్తకమునఁ జేర్చితిని.

43. చీఁకటివెన్నెలలు !

నేను మాతండ్రిగారి యాబ్దికమునకై అక్తోబరు చివరభాగమున రాజమంద్రి వెళ్లినపుడు, సంసారమును బెజవాడకుఁ దరలించుటను గుఱించి మా తమ్మునితో మరల ముచ్చటించితిని. అందఱము నొకచోటనె యుండినఁగాని మా రాబడి యెంత హెచ్చినను, మేము సొమ్ము కూడఁబెట్టలేమని గ్రహించితిమి కాని, మాచెల్లెలు కనకమ్మ పురుడు రెండునెలలలో రావచ్చును గావున, మావాండ్రు రాజమంద్రి యిపుడు విడుచుటకు వలనుపడకుండెను. అందుచేత వర్తమానమున మా సమష్టికాఁపురపు సంగతి కట్టిపెట్టితిమి.

30 వ అక్టోబరు వార్తాపత్రికలలో మోక్షమూలరు పండితుఁడు పరమపదముఁ జెందెనని యుండెను. ఆ మహామహుఁడు హిందూమతగ్రంథ ప్రచురణమునకై చేసిన యపార పరిశ్రమము కడు శ్లాఘనీయమైనది. ఆకాలమున దొరతనమువారు రాజమంద్రి కళాశాలను మూసివేతురనియును, ఒక క్రైస్తవ సంఘమువారు దానిని గైకొని నడుపుదు రనియును వదంతులు ప్రబలెను. ఇవి యందఱికిని విషాదమును గలిగించెను. అంతట ప్రభుత్వమువారు తమ మనస్సును మానుకొనినట్లు విని సంతోషించితిమి.

రచనావిషయమున నొకపనితో రెండుఫలితము లొనఁగూర్ప నేను బ్రయత్నించుచు వచ్చితిని. 11 వ నవంబరున నాగుండెమంట లొకింత చల్లార్చుకొనుటకో యనునట్టుగ, "వెన్నెల"ను గుఱించి