ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"వీరసంస్కర్త"

వికీసోర్స్ నుండి

దాల్చియున్నవి, పెద్దలగు మన చరిత్రములు ! ఇ ట్లనుటవలన పెద్దవార లందఱు దుశ్చరితులని నేఁ జెప్పుటలేదు. చిన్నవారల చిత్తముల నాకర్షింపఁగల యోగ్యత మనలో మట్టుపడుచున్న దనియే నామొఱ !

బాలుర మంచిలక్షణముల పూర్తిపట్టిక నిచ్చుట నాతలంపు గాదు. అమాయికత్వము నిష్కాపట్యము విశ్వాసము మున్నగు సుగుణములు, బాల్యమునకుఁగల సౌందర్యగౌరవములకు హేతువులు. పెద్దలను గ్రిందుపఱుచుట నా యభిప్రాయము కాదు. సుగుణములతోఁ జెన్నొందు పెద్దఱిక మెప్పుడును శ్లాఘాపాత్రమె. అమాయికత్వాదిగుణ భూయిష్ఠమగు బాల్యము, సుజ్ఞానోపేతమగు పెద్దఱికముగఁ బరిణమింపవలయు ననియె నామతము. నిష్కపటుఁడగు బాలకుఁడు, నిర్మలినుఁడును, నియమబద్ధుఁడునగు పురుషునిగ వికసన మందవలయును. బాల్యమున వార్ధకపు దుర్గుణములును, వార్ధక్యమున యౌవనమదాంధత్వమును, బొడసూపుటకంటె ననర్థ మేమిగలదు? పెద్దవారలు తమపెద్దఱికమును నిలుపుకొను నుదార చరితులై, పిన్న వారలకు శీలసౌష్ఠవ మేర్పడుటకు సహకారు లయ్యెదరుగావుత !

39. "వీరసంస్కర్త"

నా రెండవ వ్యాస మగు "వీరసంస్కర్త" సార మిచట వివరింపఁబడుచున్నది : -

'కార్లైలు'శూరనామమును వివిధవృత్తులలోనుండువారల కొసంగి యున్నాఁడు. తన విధ్యుక్తములను ధైర్యసాహససద్భావములతో నిర్వర్తించువాఁడె శూరుఁడు. కత్తిగట్టి దేశస్వాతంత్ర్యమునకై పోరాడు సైనికునివలెనే, స్వదేశమును గలంచెడి దురాచారముల నెదుర్కొని, వానిని నిర్మూలన మొనరింపనూనెడివాఁడును శూరుఁడె. సంఘసంస్కరణ విషయమునఁగూడ శూరులు గానవచ్చు చున్నారు. దేశీయుల దురభిమానదుర్భ్రమలను లెక్కసేయక, సంఘశరీరము నందలి దుష్టాంగమును ఖండించివైచు చికిత్సకుఁడై, వలసినయెడ తనసుఖమును తనయసువులను తాను బూనిన యుత్తమకార్య నిర్వహణమునకై యర్పణచేయువాఁడె శూరుఁడు. సంఘసంస్కర్త కార్యకలాపము సుఖశయ్య యని తలంపరాదు. దైవముపట్లను తోడిమానవులదెసను జెల్లింపవలసిన విధ్యుక్తములు చెల్లించుటతప్ప నన్యాపేక్షలతో సంస్కరణరంగము చొచ్చువాని కాశాభంగమె కలుగును.

కావున సంస్కర్తయు శూరుఁడె. ఎంత హీనస్థితియం దుండిన జాతిలోనైనను శుభోదయసమయమున సంస్కర్త పొడసూపు చుండును. పరదేశీయులచే జయింపఁబడిన భారతదేశము తరతరముల నుండి యంతశ్శత్రులదాడికిని లోనగుచువచ్చెను. నిరర్థకకర్మలకును, హేయదురాచారములకును భారతమాత దాస్యము చెల్లింపుచుండెను. అంత వంగదేశమున రామమోహనుఁ డుద్భవించి, సహగమననిరోధము గావించి, స్త్రీస్వాతంత్ర్యమునకు రాజమార్గ మేర్పఱిచెను. ఈశ్వర చంద్రవిద్యాసాగరుఁడు వితంతువివాహములు నెలకొల్పెను. బొంబాయి రాజధానిలో విష్ణుపండితుఁ డీసంస్కరణమునకు ప్రాచుర్యము గలిగించెను.

ఇంక మనరాజధానిమాట యేమని యెవరైన నడుగవచ్చును. విద్యాధికతా ధనసంపన్నతలు వెలసియుండు దిక్కున సంస్కర్త యుద్భవము గాలేదు. దాక్షిణాత్యులలో నెల్ల నిట్టి భాగ్యము మన యాంధ్రులకే సంప్రాప్తమయ్యెను. 'నాటుపుర' మందలి యొక విద్యా బోధకునికీ గౌరవము లభించెను ! 1881 వ సంవత్సరము డిసెంబరు 11 వ తేదీని రాజమంద్రిలో జరిగిన ప్రథమవితంతువివాహము శ్రీకందుకూరి వీరేశలింగముపంతుల నామమునకు దేశవిఖ్యాతిని గలిగించెను. కారణము లేని కార్యమెన్నఁడును గలుగనేరదు. ప్రస్తుతమున నాంధ్రు లెంత హీనదశలో నున్నను, పూర్వకాలమున ప్రక్యాతిగనిన జాతియె వారిది. కృష్ణదేవరాయల కాలమున నాంధ్రరాజ్యము దక్షిణహిందూ దేశమంతటను వ్యాపించియుండెను. వారిభాష లాలిత్యనృదుత్వములకుఁ బర్యాయపదమయ్యెను. వారి కవితా సారస్వత మౌన్నత్యము దాల్చెను. అదివఱకె ఆంధ్రదేశమునకు రాజమహేంద్రవరము మధ్యస్థాన మయ్యెను. దక్షిణదేశవాహినులలో మిన్న యగు గోదావరినదీతీరమున నాపురము భాసిల్లుచుండెను. ఆపట్టణమున నన్నయభట్టు తన యాంధ్రభారతమును రచియించి, ఏలికయగు రాజనరేంద్రుని కంకిత మొనరించెను. ఆ ప్రాంతములందె ఆంధ్రకవిసార్వభౌముఁ డగు శ్రీనాథుఁడు గ్రుమ్మరుచుండువాఁడు.

వీరేశలింగకవి ఆంధ్రులలో నాంధ్రుఁడు. వీరిది విద్వద్వంశము. ప్రవేశపరీక్షవఱకె యీయన యాంగ్లవిద్య నేర్చియుండినను, ఆంగ్ల సారస్వత సారమును గ్రోలినవాఁడని చెప్పవచ్చును. విద్యాబోధకవృత్తి నవలంబించిన యీయువకుఁడు, స్త్రీ విద్యాభిమానియై బాలికాపాఠశాల నొకటి ధవళేశ్వరమున స్థాపించెను. పత్రికలకు వ్యాసములు వ్రాసి పంపుచు, పిదప 'వివేకవర్థని' యను పత్రికను నెలకొల్పెను. మొదట పద్యములు రచియించుటతోనె కాలము గడపినను, అంతకంత కీయన గద్యరచన మారంభించి, సంస్కరణ విషయములను జర్చింపసాగెను. వితంతూద్వాహములను ప్రోత్సహింప నొక సమాజమును స్థాపించి, అంత వీరేశలింగముపంతులు ఆసంస్కరణమును గుఱించి విజ్ఞాపనములు ప్రకటించెను. కార్యరూపము దాల్చినఁగాని యెట్టి సంస్కరణమునకును దృఢత్వస్థిరత్వము లేర్పడవనినమ్మి, యాయన 1881 వ సంవత్సరము 11 వ డిసెంబరున రాజమహేంద్రవరమున ప్రథమతితంతువివాహము జరిగించిరి.

వాక్కునకులేని చైతన్యవిశేషము కార్యమునకుఁ గలదు. మాటలకు లొంగక నిదురించెడి సంఘము పనుల కదఱిపడి లేచి, ఆలోచనచేయఁదొడంగెను. అంత, వితంతూద్వాహసంస్కరణము నణఁచి వేయ సంఘములోని పూర్వాచారపరులు విశ్వప్రయత్నములు చేసిరి. పంతులను పంతుల మిత్రులను వారు బహిష్కరించిరి. వీరేశలింగముగారి యనుచరు లంత నొక్కరె బహిష్కారభీతిచే నొత్తిగిల్లినను, ఆయనమాత్రము గొంకకుండెను. 1888 వ సంవత్సరమునఁ దన ప్రియమిత్రుఁడు గవర్రాజుగారు మృతినొందినను, వీరేశలింగము పంతులుగారు ధైర్య స్థైర్యములు వీడకుండిరి. తా నొకఁడె రణరంగమున నిలువవలసివచ్చినను, వీరేశలింగముపంతు లించుకయైనను జలింపని ధీరత్వమునఁ బోరు సల్పెను. కావుననె యా మహాశయునికిని, ఆయన చేపట్టిన యుద్యమమునకును సంపూర్ణ విజయము చేకూరెను. కాకినాడ వాస్తవ్యులు పైండా రామకృష్ణయ్యగారు వితంతూద్వాహములకు వలసిన ధనసాహాయ్యముచేసిరి. బహిరంగమున పంతులుగారితో భోజనముచేయ సాహసింపని విద్యాధికు లెందఱో యాయనకుఁ దోడుపడిరి. మొదటినుండియు విద్యార్థు లాయనకు సహచరులుగ నుండిరి. వీరేశలింగముగారి వితంతూద్వాహసంస్కరణము రానురాను దేశీయుల యామోదము వడసెను. ఆసంస్కరణ మిపుడు పల్లెలకును పట్టణములకును బ్రాకఁజొచ్చెను.

ఇట్టి వీరేశలింగసంస్కర్త శూరుఁడెకదా ! ఈతఁడు కట్టుకథలలోని ఓడిను, పరదేశవీరుఁడగు క్రాంవెలు, నరరక్తపాత మొనరించిన నెపోలియను, కనుల మిఱుమిట్లు గొలిపెడి కవితానై పుణ్యము గల షేక్స్‌పియరును గాకపోవచ్చును ! ఇతఁడు మన తోడియాంధ్రుఁడు. షేక్స్‌పియరురునకుఁగల కవితాశక్తియు, క్రాంవెలునకుఁ గల బాహుబలమును, ఈతనికిఁ గలదని చెప్పువాఁడను కాను. కాని, సంస్కరణ విషయమున వీరియందువలెనే యీయనయందును శౌర్యగుణము ప్రస్ఫుట మయ్యెను. శూరునికి సద్భావము ప్రథమలక్షణము. వీరేశలింగము పంతులను సద్భావమున మించువా రుండుట యరుదు. ఆచార కాలసర్పము కోఱలు పెఱికి, మఠాధిపతుల తీవ్రాస్త్రములను వమ్ముచేసి, సంఘమువారి శాపముల విఫలమువేసి, మన హాస్యములను క్రౌర్యములను సహనబుద్ధితో క్షమించిన యీధీరుని పేరు, లూధరు, తియొడోరు పార్కరు, రామమోహనరాయలు మున్నగు యోధుల నామముల ప్రక్క కనకాక్షరములతో లిఖియింపఁదగినదియెకదా ! ధైర్యమునందు, బుద్ధిస్వాతంత్ర్యమునందు, క్షితిని జయింపఁజాలిన క్షమా గుణమునందును, దక్షిణహిందూదేశమున నీతనితో సరిసమాను లెవ్వరు? ఉత్ప్రేక్షాతిశయోక్తులతోఁ బ్రొద్దుపుచ్చ నాయుద్యమము కాదు. కేవల సత్యమునుగూర్చిన నా నిశ్చితాభిప్రాయమె నేను వక్కాణించుచున్నాను. ఈనాయకుఁడు అసమానప్రజ్ఞయు, స్వతంత్రబుద్ధియు, సమధిక వాక్ఛక్తులతో వెలయుచున్నాఁడని చెప్పువాఁడను గాను. ఆయనకుఁగల లోపములు నాకంటె నెవరికిని బాగుగఁ దెలియవని చెప్పఁగలను. ఐనను, నిశ్చితబుద్ధి, స్వార్థత్యాగము, నయసంపద - వీనియందు మాత్రము ఉన్నతస్థానమునకును, అగ్రస్థానమునకును, నానాయకుఁ డర్హుఁడని నమ్మువాఁడను.

సంఘసంస్కరణము తీక్ష్ణత దాల్చియుండెడి యాపూర్వదినములలో వీరేశలింగ సంస్కర్తకు చెడుగనిన బొత్తిగ నోరిమి లేకుండె డిది. యుద్ధరంగమున మృదువగు సాధనములు ప్రయోగింప నాయన కిచ్చలేదు. దౌష్ట్యము నొక్క పెట్టున దుడ్డుఁగఱ్ఱతో మోదుటకె యాతఁ డభ్యాసపడియుండెను. ఆయన ప్రహసనములు వ్యక్తిగతములని యందఱు నెఱుఁగుదురు. ఆప్రహసనములందలి ముఖ్యపాత్రలు సజీవులగు మనుజులె. రాజమహేంద్రనగరవీథులలో రాత్రులు పడుపు టిండ్లకుఁ జేరెడి విటకాండ్రును, న్యాయసభలలో నున్నతాసనము లధిష్ఠించు నీతిదూరులగు నుద్యోగస్థులును - వీరందఱును తన ప్రహసనములకై ప్రత్యేకముగఁ గల్పింపఁబడిన పాత్రలనియె కాక, నీతిపథమునకు న్యాయమార్గమునకును ముఖ్యముగఁ దనకును ఆగర్భ శత్రువులనియె యాయన దలంచువాఁడు ! వారియెడ నాయన గాంచిన గాఢమైన, హృదయ పూర్వకమయిన, క్రోధమునకుఁగల రహస్య మిదియె !

తనప్రక్క టుపాకి వ్రేలాడుచుండ, ఒఱనుండి తీసిన కత్తిని ఝళిపించుచు యుద్ధసన్నద్ధుఁ డగు వీరభటునివలె వివేకవర్థనీ పత్రిక యాదినములలో వారమువారమును నీతిన్యాయముల నుల్లంఘించు వారలతోఁ బోరుసల్పుచుండెడిది. అందలి యుపన్యాసముల కెట్లు దౌష్ట్యద్రోహములు వడంకుచుండెనో యిప్పటికిని గొంద ఱెఱుంగుదురు. ఆయన ప్రహసనము కటువుగ నుండునట్లె, వారివ్యాసము గాంబీర్యము వహించి యుండెను.

వీరేశలింగముపంతులపేరు సంఘసంస్కరణ విషయములందు వలెనే సాహిత్యపునరుద్ధరణమునందును విఖ్యాతి గాంచెను. ఈరచయిత ప్రకృతాంధ్రవచన చతురాననుఁడు.

సంస్కృత సారస్వత సాంగత్యమున నాంధ్రకవిత్వము పూర్వము వినుతికెక్కినరీతిని, ఆంగ్లసాహిత్యసంపర్కమున ప్రకృతమున నాంధ్రవచనము సుస్థితికి వచ్చెను. ఈకార్యము వీరేశలింగకవి కృతమె కావున, దీనికీర్తి యంతయువారిదె. వీరిశీలమువలెనే, వచనశైలియు, స్వచ్ఛత, మృదుత్వము, బలిమియును దాల్చియున్నది.

మొదటి యాంధ్రకవులవలెనే యీప్రథమాంధ్ర వచనరచయితయు, భాషాంతర గ్రంథరచనముతోనె కాలము గడపవలసి వచ్చెను. అన్యభాషలోఁగల సొంపులను మాతృభాషలోనికిఁ గొనిరావలసిన భార మాయన వహింప వలసివచ్చెను. ఆయన సొంతకావ్యము లల్లుట కిదియె వ్యాఘాత మయ్యెను. ఇదిగాక, బంగాళీసారస్వతమున ప్రథమవచన రచయితలగు రామమోహన విద్యాసాగరులవలె, వీరేశలింగము పంతులు కూడ సంఘసంస్కరణమునకె వచనగ్రంథముల నధికముగ రచియించెను. సత్యమును విస్పష్టముగను, విపులముగను, మోమోటములేకయు నాయనఁ జెప్పవలెను గావున, ఆయన శైలియు స్వచ్ఛముగను స్పష్టముగను సూటిగను నుండెను ! ఇంతియకాదు. ఈ గుణములతోను, సంస్కరణాభిలాషతోడను విలసిల్లెడి వచన శైలిని మనయాంధ్రమునకుఁ గల్పించి కానుకగనొసంగిన కీర్తిని శాశ్వతముగ నీమహామహుఁడు సంపాదించెను !

40. సమష్టికుటుంబ కష్టములు

1900 సంవత్సరము 19 వ వ యేప్రియలున నాకష్టములను దలపోయుచు, ఎచటఁ జూచిన నప్పులు, ఇంటిలోనిపోరు, చెడుతలంపులు, కార్యగతముకాని సంకల్పములు, - ఇవియె నాముఖ్య శోధనములని గుర్తెఱిఁగితిని. 21 వ తేదీని జరిగిన 'నియోగి సహాయక సభ'కు నేనగ్రాసనాధిపతిని. నారెండవ పెదతండ్రికుమారుఁడగు పట్టాభిరామయ్యకు ముప్పదిరూపాయిలు వేతన మపుడీయఁబడెను.