ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

షష్ఠాశ్వాసము



జనకజనకనిభవి
భ్రాజితగాంభీర్యసామరస్యవివేక
వ్యాజజగనబ్బగండ వి
రాజితకరుణాకలాప రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

2

చంద్రవంశపురాజులచరిత్రము

.
ఆ.

అఖిలమునకు స్రష్టయైననారాయణు, నాభిసరసిజమున నలినభవుఁడు
జనన మొందె నతని కొనర మానసవుత్రుఁ, డై జనించి మించె నత్రిమౌని.[2]

3


క.

అత్రిమునీంద్రుని దక్షిణ, నేత్రంబున నుదయమయ్యె నిర్మలతేజో
గాత్రుఁడు సుధాకరుఁడు శత, పత్రభవాంశంబుఁ దాల్చి బంధురయశుఁడై.[3]

4


క.

బాల్యమున నతఁడు మతిచాం, చల్యం బొకయింతలేక సమధికనిష్ఠా
కల్యాత్ముం డగుచును బా, హుళ్యం బగుతపము పద్మయోనికిఁ జేసెన్.[4]

5


క.

వృక్షలతౌషధితతులకు, నక్షత్రంబులకు ద్విజగణంబుల కమృత
ప్రేక్షణకిరణములకు న, ధ్యక్షుఁడుగా వరముఁ గొనియె నబ్జజువలనన్.[5]

6


వ.

మఱియు రాజసూయాదిమహాయజ్ఞంబులు సేసి సర్వోత్కృష్టం బైనగృహి
త్వంబుఁ గైకొని యమ్మహనీయవైభవంబున నశ్విన్యాదు లైనదాక్షాయణుల
నిరువదియేడుగురి వరియించి వారివలన నభిమతభోగము అనుభవించుచు మన్మ
థాకారం బైనసౌకుమార్యంబునం బెరుగుచుండి.[6]

7

తారాశశాంకకథ

క.

ముదమున నాశీతాంశుఁడు, త్రిదశగురుం డగుబృహస్పతికి శిష్యుండై
విదితంబుగ శాస్త్రంబులు, చదువుచు వర్తించు నతనిసదనమునందున్.

8


క.

వెరవున నీగతి గురునకు, గురుపత్నికి నధికభక్తి కొనసాగంగాఁ
బరిచర్య సేసి చదువుచు, బెరయుచు వర్తించు నతఁడు ప్రియశిష్యుండై.[7]

9


వ.

అంత నొక్కనాఁడు.

10


ఆ.

దేవవిభునిక్రతువు గావింప దేవలో, కమున కేగుచుండి యమరగురుఁడు
చదువుచుండు మనుచుఁ జంద్రుని మందిరాం, తరమునందు నునిచి యరుగుటయును.

11


చ.

వనజవిరోధియున్ వినయవర్తనుఁడై గురుపత్నికిన్ ముదం
బునఁ బరిచర్య సేయుచు నపూర్వపుశాస్త్రము లభ్యసించుచున్
దనచెలువంబురూపము నుదారతయున్ లలితాంగి యైన
యవ్వనితకుఁ జెప్పరానివలవంతలు సేయుచునుండెఁ బెంపుతోన్.

12


వ.

అప్పుడు.[8]

13


సీ.

బంగారుచెఱఁగులపట్టుపుట్టముఁ గట్టి కమ్మకస్తురితిలకంబుఁ దీర్చి
ముత్యంపుసరులును మొగపుతీఁగెయుఁ బెట్టి యవయవంబుల సొమ్ము లలవరించి
కలికికన్నులయందుఁ గజ్జలం బమరించి యరజారుకొప్పున విరులు దుఱిమి
తఱుచుగాఁ గర్పూరతాంబూలములు సేసి పాలిండ్లఁ గుంకుమపంక మలఁది


తే.

పొసఁగ వజ్రంపుఁబాపటబొట్టు పెట్టి, రవళిమెట్టెలమ్రోఁతలు రాయడింపఁ
బంచసాయకుమోహనబాణ మనఁగ, నిందుబింబాస్య మెలఁగు నమ్మందిరమున.[9]

14


వ.

ఇట్టి విలాసంబుల నుల్లసిల్లుచున్నంత.

15


క.

తారన్ సురగురుదారన్, దారాధిపవదనఁ దరళతారానయనన్
దా రాజసంబుపెంపునఁ, దారాపతి సూచె మోహతత్పరుఁ డగుచున్.[10]

16


క.

చూచి మదనాతురుండై, యాచంద్రుఁడు దేవగురునియంగన సౌభా
గ్యోచితశృంగారకళా, శ్రీచాతుర్యములఁ జిక్కి చిత్తం బలరన్.[11]

17


సీ.

తిలకించు నయ్యింతిచెలువంబుఁ బలుమాఱుఁ గిలికించితాదుల గెల్లుచూచుఁ
గోరి యవ్వనిత నిగ్గులు దేఱుపాలిండ్ల నింపారఁగాఁ గౌఁగిలింపఁగోరు

గరిమతో నాలేమ సరససల్లాపంబు లాలించి యేకాంతమాడఁగోరుఁ
దమకంబుతోడ నత్తరుణీశిరోమణీయధరసుధారసం బానఁ దివురు


ఆ.

నింతి యవయవముల నెసఁగు సౌందర్యంబుఁ, గన్నులారఁ జూచు కాంక్షతోడ
మదనబాణభిన్నహృదయయై యాతని, తలఁపుఁ దెలిసి తగులు దలఁపు చేసి.[12]

18


సీ.

ఎలనాఁగ దా వచ్చి యప్పటప్పటికి సమేలంపుమాటల మేలమాడుఁ
బలుమాఱుఁ దనమ్రోల కలికిసేఁతల కోడి వలకారితనమున వన్నెఁ బెట్టు
నన్యాపదేశంబు లాడి నెచ్చెలులచేఁ బ్రియమార నేమేనిఁ బెట్టిపంపు
నేకాంతమైనచో నెవ్వరు వినకుండ నూరకవచ్చి నర్మోక్తులాడు


తే.

గబ్బిగుబ్బచన్నుఁగవమీఁదిపయ్యెద, జాఱద్రోచు తీఁగె సాగనవ్వు
విరులుఁ జందనంబు వీడెంబు నూరక, యడుగ నంపు జారయై మృగాక్షి.[13]

19


వ.

ఇవ్విధంబున నన్యోన్యసరససల్లాపంబులవలనం బరస్పరస్నేహకుతూహలంబు లంత
కంతకుం బెరిగివచ్చుచున్న నొక్కనా డేకాంతంబున.

20


ఉ.

మేలము లాడుచుం దనసమీపమునన్ విహరించుచున్న య
బ్బాలికగుబ్బచన్నుఁగవపై యరజాఱినయుత్తరీయపుం
జేలము పట్టి రాఁదిగిచి చెక్కులు నొక్కుచు బుజ్జగించి హే
రాళము లైనమోహపువిరాళితనంబుల నాతఁ డిట్లనున్.[14]

21


క.

తరళాక్షి నీతిశాస్త్రము, లిరవుగ గురువలనఁ బెక్కు లెఱిఁగితి నింకన్
గురుపత్ని వైననీచే, వరుసన్ మరుశాస్త్ర మెఱుఁగవలయు నాకున్.[15]

22


చ.

అనవుడు లేఁతనవ్వు వదనాంబురుహంబునఁ జెంగలింప న
వ్వనరుహనేత్ర కన్నుఁగవ వాలికఱెప్పల గప్పి పెద్దయుం
బెనఁగొన మన్మథుండు పిరువీఁకులు సేయఁగఁ దత్తరించుచుం
దనువునఁ గ్రొత్తముత్పులకదంతురపఙ్క్తులు నివ్వటిల్లఁగన్.[16]

23


క.

చిత్తజుచేఁ దలిరాకుల, విత్తై తనధైర్యమెల్ల వెడల నడిచి యా

మత్తేభగమన మిగులం, దత్తరపడి సమ్మదమునఁ దమకించుటయున్.[17]

24


క.

పరకాంత బ్రాహ్మణస్త్రీ, గురునాథునిభార్య దీనిఁ గూడిన మిగులన్
దురితంబు వచ్చునని మదిఁ, బరికింపక విధుఁడు తారఁ బైకొని కలసెన్.[18]

25


వ.

ఇవ్విధంబున నయ్యిరువురు నన్యోన్యసరససంభోగంబులవలనం జొక్కి వర్తించు
చుండి రంత.

26


ఉ.

చిక్కులుపడ్డవెండ్రుకలు చిక్కినలంగినకమ్మపూవులుం
జక్కెరమోవులుం గుసుమసాయకుముద్రలు చిట్లుగందపుం
బక్కులతోడిదేహములు పాయనిమోహములున్ సమంబులై
చొక్కపుజారదంపతులు చూడఁ బ్రకాశత నొంది రెంతయున్.[19]

27


వ.

అంత నొక్కనాఁడు రోహిణీకాంతుండు గురుకాంత కిట్లనియె.

28


క.

మగువా మనచేఁతలు నీ, మగనికి వినఁబడినఁ గడుబ్రమాదము వచ్చున్
జగముల మిగులఁ బ్రకాశం, బగుచున్నది యిచట నుండ నగునే మనకున్.[20]

29


వ.

అనిన నతని నవలోకించి.

30


క.

ఎక్కడిమగఁ డెక్కడిబ్రతు, కెక్కడిసంసారచింత లేటికి నాకుం
దక్కక నీబిగికౌఁగిట, నొక్కటియై రతుల సలుపకుండినఁ జంద్రా.

31


క.

నీవెంటఁ దోడునీడై, నే వచ్చెదఁ దొడుకపొమ్మ నీకును నాకున్
దైవంబు లంకెసేసెను, జైవాతృక పంచశరుఁడు సాక్షిగ మనకున్.[21]

32


వ.

అని యిట్లు మరులేచి పలికిన నాకమలవైరియుఁ గమలలోచనం దోడ్కొని
నిజనివాసంబునకుం బోయి నిరుపాధికంబులును నిరాతంకంబులునైన యభిమత
భోగంబు లనుభవించుచుండె నంత.[22]

33


చ.

అమరగురుండు దేవపతియాగము సాంగముగా నొనర్చి సం
భ్రమమున నెల్లవారు బహుమానము సేయఁగ వేడ్కతో నిజా
శ్రమమున కేగుదెంచి వ్యభిచారితనంబునఁ జంద్రువెంట మా
రుమనువు తార వోవుటయు రోసి నిరంతరదుఃఖితాత్ముఁడై.

34


చ.

సురగురుఁ డాలిఁ గోలుపడి సోముఁడు సేసిన ధౌర్త్యమంతయున్
సురపతితోడఁ జెప్పిన వృషుం డతిభీషణకోపవేష్టితా

ధరుఁ డగుచున్ మహాత్ములగు తాపసులన్ బిలిపించి యాసుధా
కరుఁ డొనరించినట్టి కొఱగామి సమస్తముఁ జెప్పి యిట్లనున్.[23]

35


క.

మీరు సుధాకరుపాలికి, గౌరవమునఁ బోయి బుద్ధిగాఁ జెప్పి పర
ద్వారం బొనరించిన యా, వీఱిఁడి గోపించి తార విడిపింపుఁ డొగిన్.[24]

36


తే.

అని నియోగించి పంచిన యమ్మునీంద్రు, లమృతకిరణునిపాలికి నరుగుదెంచి
యతనిచేత సంభావన లర్థిఁ గాంచి, ప్రియము పుట్టంగ నెంతయుఁ బెద్ద చేసి.[25]

37


మ.

నవశృంగారవిలాసముల్ కువలయానందప్రభావంబులు
దివిజాభీష్టఫలప్రదానగుణముల్ దీపించు నీసత్పథ
వ్యవహారస్థితియుం దొఱింగి గురుభార్యన్ మోహివై తెచ్చినాఁ
డవు పాపంబులు నీచరిత్రములు చూడన్ రోహిణీవల్లభా.[26]

38


ఉ.

భూసురకాంత నెత్తుకొనిపోవుట దోషము యామినీశ నీ
చేసినదుర్వివేకములు సెప్పఁగ నొప్పము లిట్టిసేఁతకున్
వాసవుఁ డాదిగా దివిజవర్గము మిక్కిలి కోపగించినా
రీసతి నీకు నేల జగ మింతయు నీ కపకీర్తి సేయఁగన్.[27]

39


చ.

అనుటయు రోహిణీరమణుఁ డమ్మునినాథులఁ జూచి దేవమం
త్రినెలఁత నిట్లు నేను కొనితెచ్చినమాత్రన తప్పు చేసి య
య్యనిమిషభర్త మిము నిట కంపెనఁటే విడిపింప నింక నే
మని మిము దూఱువాఁడ నహహా తనచేఁతలు మీకు వింతలే.[28]

40


ఉ.

కాయజుచేత గాసిఁబడి గౌతముభార్యకుఁ బోయి కొక్కొరో
కో యని కోడికూఁత లొగిఁ గూసి మునీంద్రునిచేత శప్తుఁడై
పోయినవజ్రి మేటిదొరవోలె బృహస్పతిపత్నికై ననున్
రోయఁగనాడ నేల తనరోఁతలు లోకమువారు నవ్వఁగన్.[29]

41


తే.

అనుచు నింద్రునిమర్మంబు లైనయుల్ల, సములు పెక్కాడి యాబృహస్పతివధూటి

విడువఁ బొండన్నఁ గడుసిగ్గుపడి మునీంద్రు, లమరవల్లభుపాలికి నరుగుదెంచి.[30]

42


చ.

హిమకరుచందమంతయును నేర్పడఁ జెప్పిన నప్పురందరుం
డమరగణంబు గొల్వఁగ బృహస్పతిఁ దోడ్కొని సంభ్రమంబునన్
గమలజుపాలి కేగి గురుకాంతవిధంబును జంద్రుదుశ్చరి
త్రముఁ దెలియంగఁ జెప్పినఁ బితామహుఁ డెంతయుఁ గోపదీప్తుఁడై.

43


తే.

పెద్దల మునులఁ గొందఱఁ బిలిచి మీరు, వోయి యాశీతకరునకు బుద్ధిగలుగ
నేను జెప్పితినని చెప్పి యానిలింప, గురునియిల్లాలి విడిపించికొంచు రండు.[31]

44


క.

అని పనిచిన వారు రయం, బున నాహిమకరునికడకుఁ బోయి పయోజా
సనువాక్యంబులపద్ధతి, వినిపించి సురేజ్యుదార విడువు మనుటయున్.[32]

45


ఉ.

ఇంచుక నవ్వి శీతకరుఁ డిట్లనుఁ బద్మభవుండు చెప్పిపు
త్తెంచినమాటలన్నియును దెల్లముగాఁ బరికించి వింటి నీ
చంచలనేత్ర నే విడువఁజాలను గాదనెనేని తన్నుఁ బు
ట్టించినదైవమైన ననుఁ డీకొని యీపని మాన్పనోపునే.[33]

46


తే.

అనిన వార లుదాసీనులై పయోజ, భవునిపాలికి నరుదెంచి పద్మవైరి
బలిమిఁ జెప్పిన నేమియుఁ బలుక కాతఁ, డూరకుండెను మఱియొకయుపమ లేక.[34]

47


ఉ.

అంగిరసాదు లైనమును లగ్గురుతోఁ బురుహూతుఁ గూడి య
య్యంగజవైరిపాలికి రయంబునఁ బోయి నమస్కరించి య
వ్వెంగలి యైనచంద్రు నవివేకము గీష్పతిపత్ని యైనతా
రాంగనవర్తనంబుఁ దెలియన్ వినిపించిన నుగ్రుఁ డుగ్రుఁడై.[35]

48


మ.

దివిజానీకసమేతుఁడై చటులవృత్తిం జంద్రలోకంబుపై
నవలీలం జనుదెంచె నప్పు డతఁ డుద్యత్కోపసంప్రీణిత
ప్రవణోదగ్రభయంకరాకృతి దలిర్పన్ వీరసేనాయుతుం
డవుచున్ బిట్టెదిరించి తాఁకెను ద్రిలోకాధీశుతో నీశుతోన్.[36]

49


వ.

ఇవ్విధంబునఁ జంద్రశేఖరచంద్రులకు మహాఘోరయుద్ధం బయ్యె నప్పుడు.

50


చ.

సురగురుతోడివైరమున శుక్రుఁడు కుంభనికుంభముఖ్యశం
బరబలికాలనాభవృషపర్వపురోగము లైనరాక్షసే

శ్వరచతురంగసైన్యములఁ జంద్రునకుం బటుసంగరక్రియా
పరిణతి దోడుసూపుటకుఁ బంపె సహాయము గాఁగ నుద్ధతిన్.[37]

51


మ.

జయకాంతాపరిరంభకౌతుకములన్ శర్వామృతాంశుల్ జగ
ద్భయదాకారవిహారసంగరకళాపాండిత్యముల్ సూపుచు
న్నయెడన్ బంకజసంభవుం డమరగంధర్వాప్సరోయుక్తుఁ డై
రయ మేపారఁగ వచ్చి యాఘనులసంగ్రామంబు వారించుచున్.[38]

52


క.

హిమకరుని దోడుకొని చని, క్రమమొప్పఁగ బుద్ధి చెప్పి కామాతురభా
వము మాన్పి తారఁ గొని చని, యమరాచార్యునకు నిచ్చె నభవుఁడు మెచ్చన్.

53


వ.

అప్పుడు వాచస్పతి యాసన్నప్రసవగర్భవతి యైన తనభార్యం జూచి మదీయక్షే
త్రంబున నన్యవీర్యం బుదయించు నిక్కుమారుని విసర్జించి రమ్మనినఁ బతివచ
నం బలంఘనీయం బగుటం జేసి యప్పరమపతివ్రత యీషికాస్తంబమధ్యంబున
నక్కుమారునిం గనిన.[39]

54


తే.

దివ్యతేజోవిలాససందీప్తుఁ డగుచు, మోహనాకారమున నున్నముద్దుకొడుకుఁ
జూడ ననిమిషగురునకు సోమునకును, బుత్రమోహంబు లగ్గలంబుగఁ జనర్చె.[40]

55


తే.

వీఁడు నాసుతుండు వీఁడు నా ముద్దుల, కొడుకుఁ గుఱ్ఱ యనుచుగురుఁడు విధుఁడుఁ
బూని యొకరికొకరు పుత్రమోహంబున, జగడమాడుచున్న సమయమునను.

56


క.

దేవతలు మునులు తారా, దేవిన్ వీక్షించి వీఁడు దేవగురుసుతుం
డో వనజారిసుతుండో, నీవింతయుఁ దెలియఁజెప్పు నిక్కం బనినన్.

57


క.

నలువురు నాలుగుదిక్కులఁ, దల లెత్తుక చూడ మగఁడు దలవంపఁగ నీ
చులుకఁదన మింక నేమని, పలుకుదు నని చెప్పి సిగ్గుపడియుండుటయున్.

58


వ.

అప్పు డప్పితామహుం డప్పువ్వుఁబోణిం బుజ్జగించి యిట్లనియె.

59


క.

సి గ్గేల నీకు నీపని, యెగ్గని పాటించి యాడ రెవ్వరు నీకున్
లగ్గగు నీమగఁడును మది, నెగ్గింపం డెవ్వ రిట్లు చేయరు తన్వీ.[41]

60


ఉ.

సోమునిఁ జూచియున్ గురుని జూచియుఁ బక్షపుమాట మాను తే
జోమహనీయమూర్తి యగుచుం జెలువొందెడు నీకుమారుఁ డీ

సోమునిపుత్రుఁడో గురునిసూనుఁడో నా కెఱిఁగింపుమన్న నీ
సోమసుతుండు గాని గురుసూనుఁడు గాఁడని పల్కె నేర్పడన్.

61


వ.

ఇవ్విధంబునం బలికినయప్పలుకులు విని బృహస్పతి కుమారునియందు మోహం
బు విడిచి పత్నీసమేతుండై యరిగె మహాదేవపితామహప్రముఖు లైనదేవర్షి
గణంబులు నిజనివాసంబులకుం బోయిరి. చంద్రుండును నక్కుమారు నాలింగ
నాదివిశేషంబుల గారవించి బుధుం డనునామధేయంబు చేసి నిజభార్య యైన
రోహిణీదేవి కిచ్చిన.

62


తే.

రోహిణీదేవి యక్కుమారునకుఁ గన్న, తల్లికంటెను మిగులఁ దాత్పర్యవృత్తి
నడపి పెంచుచు నుపలాలనంబు చేసెఁ, జంద్రుఁ డెంతయు నాత్మలో సంతసిల్ల.

63


ఆ.

బుధుఁడు తపము చేసి యధికతేజోనిధి, యగుచు గ్రహపథంబునందు నిలిచి
నతఁడు మనుతనూజయగు నిళయందుఁ బు, రూరవుండు నాఁగుమారుఁ గనియె.

64

పురూరవుండు ఊర్వశీరక్తుండై విహరించుట

సీ.

భూభరణక్రియాస్ఫురణఁ గుంభీనసక్రోడేభములనైనఁ గొంచెపఱచు
దానవైఖరిఁ గామధేనుకల్పద్రుమచింతామణులనైన సిగ్గుపఱచు
సౌందర్యమున సురేశ్వరతనూభవసోమపంచబాణులనైన భంగపఱచు
విమలధైర్యంబున హిమమహీధరమేరుమందరాదులనైనఁ గ్రిందుపఱచు


తే.

దీవు లేడింటఁ దనయాజ్ఞ దేజరిల్ల, నిజచరిత్రంబు భావిభూభుజుల కెల్ల
మేలుబంతిగా వసుంధర యేలుచుండె, భూరివిక్రముఁ డైనపురూరవుండు.[42]

65


వ.

అట్టి పురూరవుండు నిజరాజధాని యైనప్రతిష్టానపురంబున రాజ్యంబు సేయు
చుండి యొక్కనాఁడు.

66


సీ.

మందారచందనమాకందశాకోటజంబీరనీపకదంబతరులు
మల్లికామాధవీమాలతీచంపకకుందాదిసంఫుల్లకుసుమలతలు
కలనాదకలహంసికాచక్రవాకవిస్తారకాసారకాసారములును
గీరపారావతళాశారికామృడభంగపరపుష్టపరితుష్టపరిచితంబు


తే.

మందమలయానిలోద్ధూతమానసుమప, రాగధూసరితాకాశభాగతలము
గలిగి వనదేవతాసముత్కరమనోభి, రామమై యొప్పుచున్న యారామములను.[43]

67


వ.

ఇట్టివినోదంబులం దగిలి వినోదించుచున్న సమయంబున.

68


సీ.

తనకొప్పులోని కమ్మనిపూవుతావులసొబగు దిక్కులనెల్ల పోడుముట్టఁ
దననీడువాలునేత్ర ముల యల్లార్పుచూపులు పాంథజనుల గుండెలు పగుల్పఁ

దనమేనిమెఱుఁగుల ధాళధళ్యంబుల మించుచూడ్కులు మిఱుమిట్లు గొనఁగఁ
దనచన్నుఁగవయొప్పిదము మన్మథునిరాజ్యలక్ష్మీవిలాస మలంకరింపఁ


తే.

దనవిలాసయానంబును దర్పకాంధ, కార మొక్కటఁ జిమ్మచీఁకట్లుఁ గ్రమ్మఁ
జెలులుఁ దానును మోహనశ్రీలు బెరయ, నింద్రుపురినుండి యూర్వశి యేగుదెంచె.[44]

69


వ.

ఇవ్విధంబునవచ్చి వినయావరత యగుచు బాలరసాలంబుమ్రోలం గ్రాలుచున్న
కమ్మపూఁదీఁగెచందంబున సమీపంబున నున్నయన్నాతిం జూచి పురూరవుం
డిట్లనియె.[45]

70


ఉ.

ఎవ్వరిదాన వీవు జలజేక్షణ నీదగు వాలుచూపులున్
నవ్వు దొలంకుమోము గమరంబు విలాసము కల్కిపల్కులున్
జవ్వన మొప్పిదంబు వలిచన్నులచెన్నును నీక యొప్పు నీ
మవ్వముఁ జూడ వారసతిమార్గము దోఁచుచునున్న దెంతయున్.[46]

71


చ.

అనుటయు నింతి యానృపకులాగ్రణిరూపవిలాసరేఖలున్
వినయవిధేయవాక్యములు వెన్నెలతేటమొగంబుఁ బ్రాభవం
బును బెనఁగొన్నతేజమును బుణ్యమయం బగుచున్నదేహముం
గనుఁగొని పంచబాణవిశిఖంబులతాఁకున కోర్వ కిట్లనున్.

72


క.

ఉర్వీశతిలక నాపే, రూర్వశి నొకపనికిఁగా దివౌకసమహిమల్
సర్వమును విడిచివచ్చితి, నుర్వర నొకకొంతకాల ముండెడు కొఱకున్.[47]

73


క.

నిను జూడఁగోరి వచ్చితి, ననుటయు నారాజచంద్రుఁ డయ్యిందునిభా
నవఁ దగిలి పాయనేరక, మనసిజబాణములయందు మగ్నుండయ్యెన్.

74


క.

అలఘుప్రగల్భవచనం, బుల నూర్వశిఁ జూచి యబల పుష్పాయుధుచే
నలజడిఁ బెట్టక నాతోఁ, గలిసి వినోదింపవలయుఁ గామసుఖములన్.[48]

75


వ.

అనిన నక్కాంత మహీకాంతు నవలోకించి నాయందు నీకుఁ బ్రియంబుగల
దేనియు నాసమయంబు వినుము నాకు నురణకద్వయపోషణం బవశ్యం బైన
వ్రతంబు. ఈయురణకంబులు రెండును నీచేత నపనేయంబులు గాకుండవలయు
నగ్నరూపంబుననున్న ని న్నవలోకించినప్పుడే పాసిపోవంగలదాన నాకు ఘృతంబ
యాహారంబుగా నుండునది యని సమయంబు చేసిన నొడంబడి యమ్మానవపతి
యమ్మానినితోడ సురతసుఖంబు లనుభవించుచు.[49]

76

మ.

లలితానేకవినోదముల్ సలిపెఁ గైలాసోపకంఠంబునం
దలకం జైత్రరథంబునం గమలషండాఖ్యప్రదేశంబులన్
విలసద్దివ్యమనస్సరోవరములన్ విశ్రాంతరమ్యస్థలం
బుల నాభూపతి యేకషష్టిసమ లాపూర్ణేందుబింబాస్యతోన్.[50]

77


తే.

వనజనేత్రయుఁ బ్రతిదినవర్ధమాన, మగుతదుపభోగసుఖములఁ దగిలి పాయ
లేక నృపుఁ గూడి విహరించె లెక్కలేక, బహువినోదంబులందు నిస్పృహ జనింప.[51]

78


క.

ఊర్వశి సురపురి నుండక, యుర్విఁ బురూరవునిఁ గూడియున్నకతన గం
ధర్వవరసిద్ధసాధ్యసు, పర్వులవిభవములు గొంత పాడై యుండెన్.

79


వ.

అంత విశ్వావసుం డనుగంధర్వుం డూర్వశీపురూరవులసమయం బెఱింగి వారి
కన్యోన్యవియోగంబు సేయువాఁడై నిశాసమయంబున నేకాంతసమేతులై యున్న
వారికడకు వచ్చి యొక్కయురణకంబు నహరించుకొనిపోయిన.[52]

80


ఉ.

ఆయజపోతకంబు దివియందు నిరంతరవిహ్వలధ్వనిం
గూయఁగ వేల్పుకొమ్మ నృపకుంజరుఁ గన్గొని వీఁడె యెవ్వఁడో
మాయలు పన్ని మత్ప్రియకుమారకు నెత్తుకపోయె నీవు వే
పో యిట తెత్తుగా కనిన భూవరుఁ డేమియుఁ బల్కఁ డింతితోన్.[53]

81


తే.

ఏకవస్త్రంబు ధరియించి యిందువదనఁ, గలసి యేశాంతసుఖకేలి నలరువిభుఁడు
నగ్నవేషంబుతోఁ జనినను మృగాక్షిఁ, గాంచి తనుఁ బాయునో యని కదలకుండె.

82


క.

వెండియు గంధర్వవరుల్, రెండవయురణకము నపహరించి దివికి ను
ద్దండత నరిగిన ధరణీ, మండలపతిఁ జాచి దివిజమానిని కినుకన్.

83


క.

నాపుత్రకు లభియాతుల, చేపడి యఱవఁగ నుపేక్ష సేసితి నీ కీ
కాపురుషత్వం బేటికిఁ, బ్రాపించె ననాథవృత్తి పాటిలె నాకున్.[54]

84


వ.

అని బహుప్రకారంబుల నార్తకారిణియై యురణకనిమిత్తంబుగా బెట్టిదంబులు
పలుకుచున్న నన్నరేంద్రుండు కోపించి యంధకారంబు గావున నయ్యింతి నాది
గంబరత్వంబుఁ జూడ దని ఖడ్గంబుఁ గొని దురాత్మా పోకు పోకుమని యదలిం
చుచు వెనుదగలి గగనంబునం జనుసమయంబున గంధర్వు లతిప్రకాశంబుగా
నుజ్జ్వలం బైనవిద్యుద్భ్రమంబుఁ గల్పించిన.[55]

85


తే.

నగ్నవేషంబుతోఁ జను నరవరేణ్యుఁ, గన్ను లారంగఁ జూచి యాకమలవదన
మున్ను చేసినసమయంబు మొగిఁ దలంచి, రోసి యాతనిఁ జాలించి పాసి చనియె.

86

వ.

అంత.

87


క.

గంధర్వు లురణకముల వ, సుంధరపైఁ బాఱవైచి సురపురమునకున్
బంధురగతి నేగిరి నృప, సింధురుఁ డాశాబకములఁ జేకొని వేడ్కన్.[56]

88


తే.

మగిడి శయ్యకు నరుదెంచి మగువ నచట, వెదకి కానక యత్యంతవిరహతాప
వేదనల దీనచిత్తుఁడై వెఱ్ఱివాఁడుఁ, బోలెఁ దనుఁ దా నెఱుంగక భూవిభుండు.

89


వ.

దిగంబరవేషంబునఁ బరిభ్రమించుచుండె.[57]

90


సీ.

పువ్వుదీఁగెలఁ జూచి పొలఁతుక నూఁగారుతనువల్లియని డాయఁదలఁపు సేయు
బాలపల్లవము లేర్పడఁ జూచి మృగనేత్ర యధరామృతం బని యానఁబోవుఁ
గుసుమగుచ్ఛముల పెక్కువ చూచి లలితాంగి కుచకుట్మలములని గోళ్ల నదుము
గండుతుమ్మెదపిండుఁ గనుఁగొని తన్వంగి నెఱిమీరుకొప్పని నిమురఁజూచుఁ


తే.

గోకిలాలాపములు విని కొమ్మ దన్నుఁ, బిలిచెనో యని యాలించుఁ ప్రేమతోడ
మన్మథాతురుఁ డగుచు నున్మత్తవృత్తి, నతఁడు వనవాటికలయందు నభిచరించు.[58]

91


వ.

ఇవ్విధంబున నారాజమన్మథుం డున్మత్తవేషంబున బరిభ్రమించుచు నొక్కనాఁడు
కురుక్షేత్రంబున నంభోజసరోవరతీరంబున సఖీజనం బైనయప్సరోంగనాచతుష్ట
యసమేతయై విహరించుచున్న యూర్వశిం బొడగాంచి.[59]

92


చ.

వదనము చెంగలింప నిడువాలికకన్నుల వాడుదేర స
మ్మదమును నుబ్బునం బెరయ ముత్పులకల్ తనువల్లి నిండఁగన్
గదిమినపంచసాయకవికారము లించుక కట్టిపెట్టి య
మ్మదవతిఁ జేరి యానృపకుమారుఁడు కౌఁగిటఁ జేర్చి యిట్లనున్.[60]

93


ఆ.

పువ్వుఁబోణి వినుము పువ్వును దావియుఁ బోలె గుసుమబాణకేళిఁ దేలు
చుండి నెపములేక యూరక నన్నేల, విడిచిపుచ్చి తింత వెఱ్ఱిఁ జేసి.[61]

94


క.

ఉన్మత్తవేషమున నే, నున్మాదముఁ బొంది తిరుగుచున్నాఁడను నీ
సన్మాన మింత గలిగిన, మన్మథతాపంబులెల్ల మాను లతాంగీ.[62]

95


క.

అని పలుకుచున్న బుధనం, దనునిపయిం గరుణ పుట్టి ధవళాయతలో
చన సఖులు దన్నుఁ దూఱఁగ, వినయవిధేయముగ గారవించుచుఁ బలికెన్.

96


క.

ఈజగమంతయు నేలెడు, రాజువు నీ కేల దైన్యరస మీవిరహ

వ్యాజమున నిను నలంపుచు, నీజాడలఁ బెట్టె దైవ మే మనవచ్చున్.[63]

97


క.

అని పలికి గారవించుచు, ననురాగము చెంగలింప నారాత్రి నరేం
ద్రునకు మనోభవసౌఖ్యము, లొనరించి బహుప్రకారయుక్తుం జేసేన్.[64]

98


వ.

ఇవ్విధంబున సురతసుఖంబు లనుభవించిన మఱునాఁడు ప్రభాతసమయంబున
నారాజవదన యారాజుతో నిట్లనియె.

99


మ.

ధనదప్రాభవ నీప్రసాదమున నంతర్వత్నినై యున్నదా
నను సత్పుత్రకుఁ డొండు కాలమునకున్ జన్మించునా డీవు వ
చ్చిన నీ కెల్లశుభంబులుం గలుగు విచ్చేయంగదే యంచుఁ బ
ల్కిన రాజేంద్రుఁడు పట్టణంబునకు నేగెన్ సమ్మదం బొప్పఁగన్.[65]

100


క.

ఊర్వశి దనచెలులకు న, య్యుర్వీశుఁడు దానుఁ గలిసియుండుటయును గం
ధర్వులు పోయినపోకలు, సర్వంబును దెలియఁజెప్పెఁ జతురప్రౌఢిన్.

101


ఉ.

ఆచెలు లవ్విధంబు దెలియన్ విని నివ్వెఱఁగంది యూర్వశిం
జూచి లతాంగి యీనృపతిసూనుఁడు రెండవమన్మథుండు నీ
కీచతురాత్ముతోఁ గలయు టించుక చాలదె యేము సైతమున్
వాఁచినవారియట్లు గరువంబునఁ గన్గొనుచుంటి మివ్విభున్.[66]


ఆ.

ఇతనితోడఁగూడి యింకను గొంతకా, లము కుసుమబాణలలితసుఖము
లనుభవింపు మనిన నగుఁగాక యని సమ్మ, తించి యిష్టలీలఁ దేలుచుండె.

103


వ.

అంతఁ బురూరవుండు సంవత్సరకాలంబునకు వచ్చిన నూర్వశి యాయు వను
కుమారుం గాంచి యతనికి సమర్పించి యారాజుతోడం గలసి తొంటియట్ల
యిష్టవినోదంబులు సలుపుచుండె. వెండియుఁ బుత్రపంచకంబునకు జననకారణం
బైనగర్భంబుఁ దాల్చె నాసమయంబున.

104


క.

విరసంబునఁ దము నిరువుర, విరిదట్టుగఁ జేసినట్టి విశ్వావసుఁ డా
ధరణీవల్లభుపాలికి, గరిమం జనుదెంచె సకలగంధర్వులతోన్.[67]

105


వ.

ఇట్లు వచ్చి గంధర్వు లానరేంద్రు నవలోకించి నీవు మాకపటకృత్యంబులవలన ననేక
దుర్దశలం బొందితివి కావున నీకుం గరుణించి వరంబు లిచ్చెదము వేఁడుమనిన
నతం డట్లకాక యని వినమ్రమస్తకుండై సకలారాతిభయంకరప్రతాపంబును
జితేంద్రియసామర్థ్యంబును నానామిత్రబాంధవదీనావనప్రభావంబును నమితబల

కోశాదినానామహిమలు నూర్వశీసాలోక్యంబుం గలుగునట్లుగా వేఁడిన నను
గ్రహించి యొక్కయగ్నిస్థాలి యచ్చి యిట్లనిరి.[68]

106


మ.

మనుజాధీశ్వర యిమ్మహానలము నామ్నాయానుసారక్రమం
బునఁ ద్రిత్వం బొనరించి యాగము జగత్పూతంబుగాఁ జేయు మా
ఘనపుణ్యంబున నీకు నిట్టిమహిమల్ గల్గుం జుమీ యూర్వశీ
వనీతాసంగమవైభవస్థితులతో వాంఛాసముద్వృత్తమై.[69]

107


వ.

అని చెప్పి గంధర్వులు వోయిన బుధనందనుండు నగ్నిస్థాలిఁ గైకొనివచ్చి బహు
విచారభ్రాంతివలనం జిత్తంబు గలంగి తనలో నిట్లనియె.

108


మ.

నను గంధర్వవరుల్ వరం బడుగుమన్న దుర్వివేకంబుతో
ననలస్థాలియ కొంటిఁగాని ప్రమదం బారంగ నీయూర్వశీ
వనజాతేక్షణ నాకు నిం డనుచు నే వాంఛింపలేనైతి నె
ట్టన నాయత్నము కొండఁ ద్ర వ్వెలుకఁ బట్టంబోయిన ట్లయ్యెఁగా.

109


ఉ.

ఎక్కడియజ్ఞకర్మ మిఁక నెక్కడియూర్వశి యేడ జీవనం
బెక్కడి కెక్కడంచు మది నెంతయు రోసి వనాంతరంబులో
నొక్కెడ నమ్మహానలము నుంచి పురంబున కేగి యాత్మలోఁ
బొక్కుచు నర్ధరాత్రమున బుద్ధిఁ దలంచుచు నాతఁ డిట్లనున్.

110


మ.

కృప గంధర్వులు నాకు నిచ్చిన మహాగ్నిస్థాలి య ట్లేటి కా
విపినాంతంబున వైచి వచ్చితి మనోవిశ్రాంతి దుర్యత్నముల్
విపరీతంబునఁ దోఁచెఁ బోయినపనుల్ వే చెప్పగానేల నే
నిపు డచ్చోటికిఁ బోయి తెచ్చి సవనం బీడేర్తు సాంగంబుగన్.

111


సీ.

అని యిట్లు దలపోసి యాప్రొద్దె కదలి యయ్యడవిలోనికి వచ్చియగ్ని నచటఁ
గానక యొకశమీగర్భస్థమై యున్నయశ్వత్థభూరుహం బచటఁ గాంచి
యయ్యగ్ని యీతరువయ్యెఁగా కేమని తలపోసి తాపసోత్తములతోడ
వేదమాతృకయైన విమలమంత్రం బనుష్ఠించుచుఁ దత్తరుచ్ఛేదనంబు


తే.

రమణఁ జేసి తన్మంత్రాక్షరముల సంఖ్య, నమరునంగుళములనిడుపైన యరణి
నెమ్మి నొనరించి యం దనలమ్ము వడసి, యజ్ఞ మొనరించె లోకంబు లభినుతింప.

112


వ.

ఇట్లు కృతకృత్యుండై యప్పుణ్యకర్మంబువలన నూర్వశీసాలోక్యంబు మొదలుగా
సమస్తంబునుం బడసి గంధర్వాదినానాలోకంబుల విహరించుచు రాజసూయా
శ్వమేధాదియజ్ఞంబులు యథాయోగ్యంబులుగా ననుపించుచు రాజ్యంబు
సేయుచుండి.[70]

113


తే.

ఆదిమనుకాలమం దేకమైన క్రతుమ, హాగ్ని వైవస్వతాగ్నిమన్వంతరమున

గరిమతోడ నాహవనీయగార్హపత్య, దక్షిణాగ్నులు నాఁ ద్రివిధంబు లయ్యె.

114

పురూరవవంశానుక్రమము

వ.

అట్లు పురూరవుం డూర్వశియందు నాయువును ధీమంతుండును నమావసుండును
విశ్వావసుండును శతాయువుఁ జిరాయువు ననుకుమారుల నార్వురం గాంచె
నందు సమావసుం డనువానికి భీమసేనుండు పుట్టె వానికిఁ గాంచనుండును వానికి
సుహోత్రుండును వానికి జహ్నుం డనురాజర్షియుం బుట్టిరి.

115


సీ.

అమ్మహీతలభర్త యజ్ఞంబుఁ గావించువేళ గంగానది వెల్లివిరిసి
యాగవాటముమీఁద నరుదేరఁగాఁ జూచి యత్యంతకోపరక్తాక్షుఁ డగుచు
నాయజ్ఞపురుషు నాత్మారోపణము చేసి యోగసమాధిమై నుండి యమ్మ
హాధునియుద్ధకంబులన్నియు నిశ్శేషముగఁ గ్రోలి నిలిచిన మునులు సురలు


తే.

వివిధభంగుల నుతియించి వేఁడుకొన్నఁ, గరుణ మదిఁ బుట్టి పూర్వప్రకారమున నొ
నర్చి కూఁతుగ నమ్మహానది నను గ్ర, హించి గ్రమ్మఱఁ గ్రతువు గావించె నతఁడు.[71]

116


వ.

అది కారణంబుగా గంగానది జాహ్నవి యనం బరఁగె నట్టిజహ్నునకు సుమం
తుండు పుట్టె వానికి జనకుండు పుట్టె వానికి బలాశ్వుండు పుట్టె నతనికిఁ గుశుండు
పుట్టెఁ గుశునకుఁ గుశాంబకుశనాభాధూర్తరజోవసువులన నలువురు పుట్టిరి
వారిలోనం గుశనాభుండు.

117


మ.

శతమన్యుప్రతిమానుఁ డైనసుతు నిచ్ఛం గోరి భక్తిం దపం
బతిఘోరంబుగఁ జేయుచుండ సురలోకాధీశుఁ డుద్యత్కృపా
యతచిత్తంబునఁ దాన వచ్చి తనయుండై జన్మ మొందెన్ సము
న్నతతేజోఘనుఁడైన గాధియను భూనాథోత్తమశ్రేష్ఠుఁడై.[72]

118


చ.

సురపతితుల్యుఁ డానృపతిసూనుఁడు ధర్మము దప్పకుండ నీ
ధరణితలంబు సర్వమును దానపరాక్రమలీల నేలుచుం
బెరిగియుఁ బెక్కుకాల మిల బిడ్డలు లేక యనేకలేఖులన్
వరములు వేఁడి సత్యవతినా నొకకన్యకఁ గాంచెఁ బెంపుతోన్.[73]

119


క.

ఆతరుణిఁ బెండ్లియాడెడు, ప్రీతిన్ రుచికుం డనంగ భృగువంశవిభుం
డేతెంచి గాధి నడిగిన, నాతఁడు నగి తపసి వృద్ధుఁడని మదిఁ గొంకెన్.[74]

120


ఉ.

ఆరుచికుండు వెండియుఁ గుళాంబతనూజునిఁ బెద్ద చేసి యీ
నీరజనేత్ర కేను ధరణీవర యుంకువయేమియైన నీ

కోరిక దీరునట్లు సమకూర్చెదఁ బెండిలి సేయుమన్న నా
క్ష్మారమణుండు శాపభయమానసుఁడై మునిఁ జూచి యిట్లనున్.[75]

121


ఉ.

ఇమ్మదిరాక్షి నీకుఁ బ్రియమేని మునీశ్వర యేకనీలక
ర్ణమ్ములు చంద్రచంద్రికల నవ్వెడుమేనులు తీవ్రవాయువే
గమ్ములు గల్గునట్టి తురగంబులు వేయిటిఁ గొంచు వచ్చి మా
కి మ్మటులైన నీతరుణి నిచ్చి ప్రియంబుగఁ బెండ్లి సేసెదన్.[76]

122


ఆ.

అనిన నట్ల కాకయని వరుణాలయం, బునకుఁ బోయి నిజతపోమహత్త్వ
మునఁ దురంగతీర్థ మనుమహాక్షేత్రంబు, నందుఁ గోరినట్ల హరులఁ బడసి.[77]

123

జమదగ్నివిశ్వామిత్రులజన్మప్రకారము

ఆ.

తెచ్చి కౌశికునకు నిచ్చి యమ్మునిపతి, సత్యవతి వరించి సమ్మదమున
నిజగృహస్థధర్మమున నైహికములెల్లఁ, దప్పకుండ నడపి తపము చేసె.[78]

124


క.

ఆమ్మునినాథుఁ డపత్యా, ర్థమ్ము విమలమంత్రసంయుతమ్ముగ ఋతుకా
లమ్మునఁ దన భార్యకుఁ జరు, విముగఁ బాకంబు సేసి యీనున్నయెడన్.[79]

125


ఆ.

పతికి మ్రొక్కి సత్యవతి పల్కె మాతల్లి, పుత్రహీన తోడఁ బుట్టు నాకుఁ
గలుగునట్టు గాఁగఁ గరుణించి యాయమ, కిండు కొంతచరువు నిందులోన.

126


వ.

అనిన నట్ల కాక యని ఋతుస్నాతయైయున్న తన్మాత రావించి యిరువురకు యథా
యోగ్యంబుగా బ్రాహ్మణక్షత్రియపాత్రంబులయిన సౌమ్యక్షాత్రమంత్రంబులఁ
జరుద్వయంబుఁ జేసి యయ్యిరువురకు నిచ్చి యుపయోగింపుండని చెప్పి సమి
త్కుశఫలార్థంబుగా వనంబునకుం జనియె నంతఁ దల్లి కూఁతున కిట్లనియె.[80]

127


ఉ.

లోకములోన సర్వజనులుం దనపుత్రులు మంచివారుగాఁ
గైకొనఁ గోరుచుండుదురు గావున నీపతి సత్సుతార్థియై
నీకని పెట్టినట్టి చరు వెంతయు మంచిది లాఁతి గావునన్
నాకబళంబు గీడని మనంబున నిప్పుడు నిశ్చయించితిన్.[81]

128


తే.

ఆఁడుబిడ్డ సహోదరుఁ డఖలగుణస, మగ్రుఁడుగఁ గోరుఁ గావున మదిఁ దలంచి
మనము చరువులు రెండును మాఱుపడఁగ, నారగింతము మంచిది యట్టులైన.[82]

129

తే.

బ్రాహ్మణుని బలవీర్యసంపద నిరర్థ, కంబు భూలోకమంతయు ఘనపరాక్ర
మప్రతాపంబు లేపార మహిమతోడ, నేలు నాపుత్రుఁ డది నీకు మేలుగాదె.[83]

130


వ.

అని బేలు పెట్టి కూతురుం దానును జరుద్వయంబు వీడుపడ నుపయోగించి నిజ
గృహంబులకుం జని రంత.[84]

131


చ.

వనముననుండి వచ్చి భృగువంశశిఖామణి భార్యఁ జూచి నీ
జననియు నీవు నాపలుకుచందముఁ దప్పిచరుద్వయంబు నే
డొనరఁగ మార్పడంగ నుపయోగము చేసితి రింతయేల పో
వనరుహనేత్ర రౌద్రగతి వర్తిలుచున్నది నీదుగర్భమే.

132


మ.

భయదక్షత్రియకర్మఠుండును మహాభాగుండు శస్త్రాస్త్రపా
ణియుఁ గానున్నసుతుండు పుట్టెడుసుమీ నీయందు వేదాంతవే
దియు నత్యంతతపోధనుండు నవనీదేవాన్వయాచారవ
ర్తియుఁ గానున్నతనూభవుండు గలుగుం దెల్లంబు మీతల్లికిన్.[85]

133


చ.

అనవుడు వేఁడినిప్పువలె నవ్వచనంబు మృగాక్షి నెమ్మనం
బునకు నసహ్యమైన మునిముఖ్యుపదంబులమీఁద వ్రాలి యో
యనఘ భవత్ప్రసాదజనితాత్మజుఁడే యిటువంటిక్రూరక
ర్మనిరతుఁ డప్రబుద్ధ నపరాధిని నన్ను ననుగ్రహింపవే.[86]

134


క.

మీపలికినట్టివన్నియు, నాపుత్రునియందు వలదు నరవరధర్మ
వ్యాపారము మనుమనియం, దాపాదింపుదురు కాని యని పలుకుటయున్.[87]

135


వ.

అట్ల కాక యని యనుగ్రహంబు సేసిన కొండొకకాలంబునకు నాసత్యవతి జమదగ్ని
నిం గాంచెఁ దదీయజనని విశ్వామిత్రుం గాంచె నంత నారుచికుండు తపోవనంబు
నకుం జనియె సత్యవతి కౌశికి యనుపుణ్యనదియై ప్రవహించె జమదగ్నియు నిక్ష్వాకు
వంశసంభవుండైన రేణువను రాజుపుత్రియైన రేణుకను వివాహంబై దానియందు.[88]

136


మ.

 సకలక్షత్రకులప్రభంజనకళాసంపన్నబాహాబల
ప్రకటీభూతసమస్తలోకుఁడు మహీభారావతీర్ణప్రభా

నకళాకర్మఠవైష్ణవాంశజననవ్యాపారశౌర్యుండు శం
భుకుమారప్రతిమానుఁడై పరశురాముం డుద్భవించెన్ ధరన్.[89]

137


వ.

మఱియు విశ్వామిత్రునకు భార్గవుం డైనశునశ్శేఫుండు దేవతలవలన దత్తపుత్రుం
డయ్యె నాశునశ్శేఫునకు దేవరాతుండు పుట్టె మఱియు విశ్వామిత్రునకు మధు
చ్ఛందకృతదేవాష్టకహారీతులనువారు జన్మించి పరమర్షికన్యకల వివాహం బైరని
యమావసువంశంబు చెప్పి పరాశరుండు వెండియు నిట్లనియె.

138

నహుషక్షత్రవృద్ధరజిప్రముఖులజననము

తే.

విను పురూరవునకు నగ్రతనయుఁడైన, నాయు వనురాజు రాహువు నాత్మపుత్రిఁ
బరిణయం బొనరించె నాభామయందుఁ, గనియె నేవురుకొడుకుల గరిమతోడ.

139


వ.

వారినామధేయంబులు వినుము నహుషక్షత్రవృద్ధరంభరజ్యనేనస్సులనం బ్రసి
ద్దులైరి.

140


తే.

వారిలోన నేనుం డనువానికిని సు, హోత్రుఁ డుదయించె నతనికిఁ బుత్రు లైరి
కృత్సమదకాశ్యకాశులు కీర్తిధనులు, రాజసూయాదియజ్ఞముల్ రమణఁ జేసి.

141


ఆ.

అందుఁ గృత్సమదునియందుఁ జాతుర్వర్ణ్య, సంప్రవర్తకుండు శౌనకుండు
పుట్టెఁ గాశ్యునందు భూరితపోనిధి, తనయుఁ డయ్యె దీర్ఘతపుఁ డనంగ.[90]

142


వ.

ఆదీర్ఘతపునకు ధన్వంతరి జనియించె నట్టిధన్వంతరికిఁ గేతుమంతుండు పుట్టె వానికి
వారణాసీపతియైన దివోదాసుండు పుట్టె వానికిఁ ద్రివర్ధనుండు పుట్టె నతండు.

143


ఆ.

కువలయంబు నాఁగగుఱ్ఱంబు నెక్కి యీ, కువలయమున దినముఁ గ్రుమ్మరంగ
నతఁడు కువలయాశ్వుఁ డనునామధేయంబు, గలిగి గౌరవమున నలరుచుండు.

144


ఆ.

వత్స వత్స యనుచు వాత్సల్యమునఁ దండ్రి, తన్నుఁ బిలుచుచున్న తన్నిమి త్త
మున నతండు వత్సుఁ డనుమహీవిభుఁ డయ్యె, వత్సదేశ మయ్యె వానిపేర.

145


ఉ.

శాత్రవమండలేశ్వరుల సంగరరంగములన్ జయించఁగా
శత్రుజయుండు నాఁ బరఁగె సత్యము దప్పక రాజ్యవైభవం
బాత్రిదశేంద్రుఁ బోలి యరయంగ ఋతుధ్వజుఁ డయ్యె నిమ్మెయిన్
క్షత్రియవంశజాతులకుఁ గల్గు సమంచితనామకర్మముల్.[91]

146


వ.

అట్టి కువలయాశ్వుండు పరమపతివ్రతయైన మదాలసయందు నలర్కుండను రాజుం
గాంచె నయ్యలర్కుండు.

147


తే.

అవనియెల్లను నఱువదియాఱువేలు, వత్సరంబులు నూత్నయౌవనము దనకు
గెంటిపోకుండఁ బాలించెఁ గీర్తి వెలయ, భూపకోటి యలర్కునిఁ బోల రెందు.[92]

148

రజియనువాని కింద్రపదము వచ్చుట

వ.

అయ్యలర్కునిపుత్రపౌత్రాంతరంబు లనేకతరంబులు గలిగె వారియందుఁ జాతు
ర్వర్ణ్యంబులు ప్రవర్తిల్లె నిది కౌశేయవంశప్రకారం బని వెండియు.

149


క.

అనఘాత్మ విను పురూరవు, మనుమం డగురజి ప్రతాపమహితుల సుతులం
గనియెను బంచశతకముల, ననిమిషపతి నైన గెల్చు నతిబలయుతులన్.

150


శా.

ఆకాలంబున దేవదానవులు ఘోరాకారసంగ్రామకే
ళీకౌతూహలచిత్తులై యరిగి నాళీకాసనుం గాంచి దే
వా కయ్యం బొనరింపుచో జయమునన్ వర్తిల్లువా రెవ్వరో
మాకుం జెప్పుమటన్నఁ బద్మజుఁడు సమ్యగ్బుద్ధితో నిట్లనున్.[93]

151


క.

నిజము పురూరవుమనుమఁడు, రజి యెవ్వరివంక నిలిచి రణరంగములో
భుజబలముఁ జూపు వారలె, విజయముఁ జేకొందు రనుచు వినిపించుటయున్.[94]

152


క.

అనిమిషులకంటె ముందఱ, దనుజులు సనుదెంచి రాజతనయునిఁ బ్రార్థిం
చిన నతఁడు వారినందఱిఁ, గనుఁగొని యిట్లనియె వినయగౌరవ మొప్పన్.

153


క.

అనిలోన మీకుఁ దోడై, యనిమిషులను గెలిచి విజయ మనురాగముతో
నొనరింతునేని మీ కిం, ద్రునిఁగా నను జేయనోవుదురె మీ రనినన్.

154


క.

మాకెల్లఁ గర్త పుణ్య, శ్లోకుఁడు ప్రహ్లాదుఁ డతనిశుభముకొఱకె పో
యీకయ్య మిట్లు గాదని, నీ కింద్రత్వంబు నొసఁగ నేర్తుమె యనుచున్.

155


ఆ.

ఇయ్యకొనక దనుజు లేగిరి పదపడి, యమరవరులు వచ్చి యసురవీరు
లట్ల వేఁడుకొన్న నారాజు దైత్యులఁ, బలికినట్ల సురలఁ బలుకుటయును.[95]

156


వ.

నిలింపులు దమలో విచారించి కార్యదాహంబునం జేసి దేవేంద్రత్వం బతని కిచ్చు
టకు వొడంబడిరి రజియును దేవసైన్యసహాయుండై రణంబున దైత్యదానవుల
మర్దించి విజయంబుఁ గైకొనియున్న యతనిపాలికిఁ బురందరుండు వచ్చి సాష్టాంగ
దండప్రణామం బాచరించి చేతులు మొగిచి యిట్లనియె.[96]

157


చ.

కడుభయ మైనవేళఁ గృపఁ గాచిన యాతఁడుఁ గన్నతండ్రియున్
జడియక యొక్కరూ పగుట సత్యము దుష్టవిరోధికోటిచే
బొడమిన భీతి మాన్పి దయఁ బ్రోచితి గావునఁ దండ్రి నీవు నే
కొడుకను నీమహామహిమకుం దగువాఁడనె కాక లాఁతినే.[97]

158


ఆ.

ఇంతకంటె నీకు నింద్రత్వ మేటికి, నేమి ఘనము మానవేంద్రచంద్ర
నన్నుఁ గరుణఁ జూచి నాలోకమున నిల్పి, యలరఁజేయుమన్న నవ్విభుండు.

159


మ.

పగవాఁడైనను వచ్చి క్రిందుపడి తాఁ ప్రార్థించినన్ వానికిం

దగుసంభావన లిచ్చిపుచ్చుటయె పోధర్మంబు లోకేశ్వరుం
డగు దేవేంద్రుడు వచ్చి నాయెదుర దైన్యవ్యక్తు లాడంగ నీ
చగుణంబుల్ పచరింపఁగాదని కృపాసందీప్తచేతస్కుఁడై.[98]

160


క.

అనిమిషపతి కింద్రత్వం, బనురాగముతోడ నిచ్చి యమరావతికిం
జనుమని నిజపురమునకును, జననాథుఁడు వచ్చియున్నసమయమునందున్.

161


క.

నారదుకుటిలవిచార, ప్రేరితులై వానిసుతులు పితృధనమగు నా
స్వారాజ్యపదముఁ గైకొనఁ, బౌరుషమున నింద్రువీటిపై నరుగుటయున్.[99]

162


ఆ.

పాకశాసనుండు నాకంబు విడిచి యెం, దేని మానిపోయె మానవేంద్రు
తనయు లమరపురముఁ దామ కైకొని యజ్ఞ, భాగములు నిలింపపతుల కీక.[100]

163


తే.

తామ గైకొని పెక్కేండ్లు ధర్మవృత్తి, నున్న సమయంబునం దింద్రుఁ డొక్కనాఁడు
దేవతాగురుపాలి కేతెంచి మంత, నమున నిట్లని పలికె దైన్యంబు గదుర.[101]

164


క.

మునినాథ పురోడాశం, బునకుం గడువాఁచి నోరు పుతపుత మనఁగా
నిను వేఁడెద యజ్ఞములకుఁ, జనియించుక దాఁచి తెచ్చి చవిచూపఁగదే.[102]

165


క.

అనిన బృహస్పతి మిక్కిలి, దనమనమున వగచి దేవతాపతికి శుభం
బును రిపులకు నశుభంబును, నొనఁగూడఁగ నాభిచారహోమము చేసెన్.[103]

166


ఉ.

అందుల కీడు దాఁకి మనుజాధిపుపుత్రులు దుర్వివేకముల్
చెంది మహాక్రతుక్రియలు చెల్లుట కోర్వక వేదమార్గముల్
నింద యొనర్చుచున్ ద్విజుల నెక్కొని చంపుచుఁ బాపకర్ములై
యందఱుఁ దమ్ముఁదామె హతులై చెడిపోయిరి నాడునాటికిన్.[104]

167


వ.

ఇ ట్లుపాయంబున రిపులవలన జయంబుగొని యింద్రుండు నిజపురోహితువలన
నాప్యాయితయజ్ఞభాగుండయి దినంబున సుఖంబుండె నీచరిత్రంబు వినినవారికి
స్థానభ్రష్టత్వంబు లేదని చెప్పి మఱియు నిట్లనియె.[105]

168


తే.

క్షత్రవృద్ధునిసంతతి జగతియందు, బహుపరంపరలై కడుఁ బ్రబలమయ్యె

రంభుఁ డనురాజు దనకుఁ బుత్రకులులేక, తపము సేయుచునుండె నుదగ్రవృత్తి.

169

యయాతిచరిత్రము

వ.

మఱియు నహుషునకు యతియయాతిసంయాత్యాయాతినియతికృతు లను
కుమారు లార్వురు పుట్టి రందు యతి రాజ్యసుఖంబు లొల్లక యతీశ్వరుండై
పోయె యయాతి రాజ్యాభిషిక్తుండై భార్గవపుత్రి యైనదేవయానయు వృష
పర్వపుత్రియైన శర్మిష్ఠయును ధర్మపత్నులుగా నభిమతసుఖంబు లనుభవించు
చుండ.

170


క.

యదుదుర్వసు లనుపుత్రకు, లుదయించిరి దేవయాన కున్నతమతులై
ముద మొదవఁగ శర్మిష్ఠకు, నొదవిరి ద్రుహ్యానుపూరు లుత్తము లగుచున్.

171


క.

జననాథుఁడు శర్మిష్ఠకు, ననురాగము చేసి దేవయానకు నహితం
బొనరించుచుండ శుక్రుఁడు, జనవరునకు శాప మిచ్చె జరుఁడై యుండన్.[106]

172


వ.

ఇట్లు జరాభారపీడితుండై యయాతి శుక్రునియనుగ్రహంబుఁ బడసి తనకుమా
రులనందఱం బిలిచి యిట్లనియె.[107]

173


ఆ.

వినుఁడు తనయులార విషయోపభోగంబు, లందు నేను తనివిఁ బొందకున్న
వాఁడ నింక వేయివత్సరంబులకు నిం, ద్రియములెల్లఁ దృప్తి దేలు నాకు.

174


క.

కావున మీలో నొకరుఁడు, నావార్ధక మర్థిఁ బూని నవయౌవనమున్
నావలనం గొనుఁ డీపనిఁ, గావించినవాని రాజుఁగా నొనరింతున్.

175


తే.

అనినఁ బూరుఁడు దక్కఁ దక్కినతనూజు, లందఱును దండ్రిపలుకుల కపహసించి
జవ్వనం బిచ్చి ముదిమి గోఁజాల మనుచుఁ, దలఁగిపోయిన నహుషపుత్రకుఁడు గినిసి.[108]

176


వ.

భవదీయప్రసూతు లైనవారు రాజ్యార్హులు గారని శాపం బిచ్చి తనవచనంబు
లాదరించిన పూరునకు ముదిమి యిచ్చి యతని జవ్వనంబుఁ గైకొని యథాకా
లోపపన్నంబు లైనకొమోహభోగంబులు ధర్మమార్గంబు దప్పకుండ సమ్యక్ప్ర
కారంబున విశ్వాచి యనునప్సరతోడంగూడ ననుభవించి సహస్రవత్సరంబులు
పరిపూర్ణం బైననొక్కనాఁడు యయాతి దనమనంబున.[109]

177


తే.

అనుభవించితి నిన్నినా ళ్లఖిలవిషయ, భోగములు కోర్కు లేమియుఁ బొలిసిపోవు

విపులతర మైనవహ్ని హవిస్సువలన, హానిఁ బొందక వర్ధిల్లు నట్ల తలఁప.[110]

178


క.

జీర్ణించు వెండ్రుకలు గడు, జీర్ణించును లోచనములు చెవులును ముక్కు
జీర్ణించుగాని యాశలు, జీర్ణింపవు ముదిమి నరునిఁ జెందినవేళన్.

179


క.

అవివేకులు దృష్ణలచేఁ, దగిలి ప్రవర్తింతు రధికతరదుఃఖములన్
సువివేకులు దృష్ణలచేఁ, దవులక వర్తింతు రధికతరసౌఖ్యములన్.[111]

180


ఉ.

ఏను సహస్రవర్షములు నీగతి నీవిషయోపభోగసౌ
ఖ్యానుభవస్థితిం బ్రమద మారఁగ నుండితి నెట్టులుండినన్
మానదు తృష్ణ యింక ననుమానము మాని సుఖైకభోగముల్
మానినఁగాని కోరికలు మానవు కాకని నిశ్చితాత్ముఁడై.[112]

181


క.

పూరునకు యౌవనముఁ గడు, గారవమున నిచ్చి వార్ధకముఁ బూని ధరి
త్రీరమణుఁ డతని నవనీ, భారధురంధరునిఁ గాఁగఁ బట్టము గట్టెన్.

182


వ.

కట్టి యయాతి వనంబునకుఁ దపంబు సేయం జనియెఁ బూరుండు పూర్వాదిదిశా
చతుష్టయంబునకు యదుప్రముఖుల నలుగుర రాజులం జేసి సకలంబునకుఁ దాన
కర్తయై రాజ్యంబు సేయుచుండె నిట్లు పరమధర్మపరుం డైనయయాతిపుత్రకు
లందు జ్యేష్ఠుం డైనయదునివంశంబుఁ జెప్పెద.

183

యదువంశమహిమానువర్ణనము

క.

వెలయఁ జరాచరభూతం, బులకును ధర్మార్థకామమోక్షము లొసఁగం
గల నారాయణుఁడట యదు, కులసంభవుఁ డయ్యె మంచికుల మది గాదే.[113]

184


క.

పరమపవిత్రుం డగునా, హరి కృష్ణుఁ డనంగ మానవాకృతితో నీ
వరవంశంబునఁ బుట్టెను, నరు లీకథ వినినఁ గలుగు నానార్థంబుల్.

185


వ.

అని యనేకవిధంబులఁ గృపావర్ధిష్ణుం డైనశ్రీకృష్ణుని ప్రశంస చేసి పరాశరుండు
మైత్రేయున కిట్లనియె.[114]

186


ఆ.

విను సహస్రజిత్తుఁ డనఁగఁ గ్రోష్టుఁ డనన, లుండు నహుషుఁ డనఁగ లోకనుతులు
నలుగు రుదయమైరి నందనుల్ యదునకుఁ, బూరుషార్థచయము పుట్టినట్లు.

187


వ.

అందు సహస్రజిత్తునకు శతజిత్తుండును వానికి హేహయతాలజంఘవేణుహ
యులను బుత్రత్రయంబు పుట్టె నందు హేహయునకు ధర్ముండును ధర్మునకుఁ
గుంతలుండునుం బుట్టి రట్టికుంతలునిపేరఁ గుంతలదేశం బయ్యె నట్టికుంతలునకు

సభాజిత్తుండును వానికి మహిష్మంతుండునుం బుట్టిరి. వానిపేర మాహిష్మతీ
పురం బయ్యె నట్టిమహిష్మంతునికి భద్రశ్రేణియు వానికి దుర్దముండును వానికి
ధనకుండును వానికిఁ గృతవీర్యుఁడును కృతాగ్నియు కృతధరుండును గృతౌ
జుండు నన నలువురు పుట్టిరి. వారిలోనఁ గృతవీర్యునకు నర్జునుండన సహస్ర
బాహుండు పుట్టి.

188


క.

అత్రికి ననసూయకు స, త్పుత్రకుఁడై విష్ణునంశమునఁ బుట్టిన ద
త్తాత్రేయమౌనికృపకుం, బాత్రుండై యతనిఁ గొలిచి పరమప్రీతిన్.

189


ఉ.

ఆహవభూమియందు నభియాతులచే నపరాజితత్వమున్
బాహుసహస్రకంబు నిరపాయపరాక్రమము ధరిత్రి ను
త్సాహ మెలర్ప నేలుటయు సర్వజనప్రియవర్తనంబు నా
శ్రీహరిచేతఁ జావు దనుఁ జెందఁగ గోరె వరంబు లర్థితోన్.[115]

190


క.

సప్తాశ్వసదృశతేజో, దీప్తుండై రిపుల గెలిచి దీనావనుఁడై
ప్రాప్తశ్రీనిధి యేలెను, సప్తద్వీపములతోడి జగతీతలమున్.[116]

191


క.

భవ్యగతి కార్తవీర్యుం, డవ్యాహతవిభవయుక్తుఁ డగుచు ననష్ట
ద్రవ్యులఁగా జనులను లో, కవ్యవహారంబు నడపఁ గౌతుక మమరన్.[117]

192


ఉ.

ఊర్జితధర్మవృత్తి గ్రతువుల్ పదివే లొనరించి మించి యా
నిర్జరకోటిఁ దన్పి కమనీయగతిన్ నిజబాహువిక్రమో
పార్జిత మైనయర్థము వ్యయం బొనరించి యెలర్చెఁ గార్తవీ
ర్యార్జునచక్రవర్తి సముదంచితనిర్మలపుణ్యమూర్తియై.[118]

193


ఆ.

అట్టికార్తవీర్యుఁ డంగనాజనసహ, స్రముతోడఁ గూడి నెమ్మి నేగు
దెంచి నర్మదానదీజలంబులలోన, నొనరఁ గేళి సలుపుచున్న యంత.[119]

194


క.

ఆవేళ యక్షకిన్నర, దేవాసురులను జయించి దిగ్విజయముతో
రావణుఁ డఖలామరవి, ద్రావణుఁ డరుదెంచి విడిసెఁ దనసైన్యముతోన్.[120]

195


వ.

ఇట్లు విడిసి.

196


క.

రేవానదిలోపల సం, ధ్యావిధు లొనరించుచున్న నది యెఱిఁగి ధరి

త్రీవిభుఁడు వేయిచేతుల, నావాహిని నీరు దొట్టునట్లుగఁ జేసెన్.[121]

197


క.

పదపడి చేతులు దిగిచిన, నదిజలములతోడఁ గూడ నానావిధసం
పద లెల్ల వఱదఁబోయినఁ, ద్రిదశాంతకుఁ డలిగి కోపదీప్తహృదయుఁడై.[122]

198


క.

చతురంగబలముతో ను, ద్ధతుఁడై కృతవీర్యపుత్రుఁ దాఁకిన నతఁ డా
శతమఖవిరోధి మార్కొని, యతిభీషణవృత్తిఁ బోరి యతులితశక్తిన్.[123]

199


తే.

పశువుఁ బట్టినకైవడిఁ బట్టి తెచ్చి, బందిగములోన శృంఖలాబద్దుఁ జేసి
పెక్కువత్సరములు చెఱఁబెట్టి విడిచె, నాపులస్త్యాదిమౌనీంద్రు లడిగికొనఁగ.[124]

200


క.

ఈ తెఱఁగున బహుబలసం, స్ఫీతుండై యెదురు లేని పెంపునఁ బంచా
శీతిసహస్రాబ్దంబులు, భూతలమంతయును నేలె భూరిప్రౌఢిన్.[125]

201


తే.

అతఁడు కాలావసానంబునందు నరిగి, యాదినారాయణాంశజుం డైనపరశు
రాముశాతకుఠారధారావిభిన్న, బాహుమస్తకుఁడై కాంచెఁ బరమపదము.[126]

202


వ.

అట్టికార్తవీర్యార్జునునకు నూర్వురు కుమారులు జన్మించి రందు శూరసేన వృష
సేన మధు జయధ్వజు లన నేవురు ముఖ్యులైరి. వారియందు జయధ్వజునకు తాళ
జంఘుండు పుట్టె. ఆతాళజంఘునకుఁ దాళజంఘాఖ్యులు నూర్వురు తనయులు
జనించి రం దగ్రజుండు వీతిహోత్రుండును దదనుజన్ముండు భరతుండు ననం
బరగిరి. అందు భరతునకు వృషుండును, వృషునకు మధుండును వానికి వృష్ణి
ప్రముఖులు నూర్వురుకొడుకులునుం బుట్టిరి. ఆవృష్ణిపేర వృష్ణివంశంబు ప్రవృ
త్తంబయ్యె. మఱియు యదుపుత్రుం డైనక్రోష్టునకును.

203


ఆ.

వంశకారుఁ డైన ధ్వజినీశుఁ డనుకళా, వంతుఁ డుదయమయ్యె వానియందు
స్వాతి పుట్టె వానివరపుత్రుఁ డై ఋశం, కుండు జననమయ్యె గుణయుతుండు.

204


క.

పంకజహితనిభుఁ డైనఋ, శంకునకును జిత్రరథుఁడు జన్మించె నిరా
తంకయశుఁ డతఁడు లోకవ, శంకరు శశిబిందుఁ గాంచె సత్పుత్రునిఁగాన్.[127]

205


వ.

అతఁడు చతుర్దశలోకచక్రవర్తి యై.

206

చ.

ఒలసినవేడ్క నానానృపతి యొక్కముహూర్తమునందు లక్షభా
ర్యల వరియించి యందఱకు నన్నివిధంబుల నిష్టసౌఖ్యముల్
సలుపుచునుండు నొక్కొకవిలాసిని వేవురు వేవురాత్మసూ
సులఁ గనఁగా జగన్నుతఘనుల్ పదికోట్లతనూజులై రొగిన్.[128]

207


ఉ.

నీతివివేకధుర్యగుణనిర్మలులై పదికోట్లపుత్రులున్
భూతలమంతయున్ నిజవిభూతి యెలర్పఁగ నేలుచుండఁగా
నాతతచక్రవర్తి మహిమాతిశయంబున నేడుదీవులుం
బ్రీతి వహింప నేలె శశిబిందుఁడు సాధుజనైకవిందుఁడై.[129]

208


ఉ.

ఆపదికోట్లపుత్రులకు నగ్రజుఁ డైనపృథుశ్రవుండు ధా
త్రీపతి యయ్యె నానృపవరేణ్యునకుం దముఁ డుద్భవించె నా
భూపకులావతంసునకుఁ బుత్రకుఁడై యుశనుండు పుట్టె వాఁ
డేపున దక్షిణల్ ద్విజుల కిచ్చి యొనర్చె దశాశ్వమేధముల్.[130]

209


మణిగణనికరవృత్తము.

ఉశనునిగతిమతియుతుఁ డనఁదగు న
య్యుశనునకును దనయుఁడు గలిగె జగ
ద్విశదయశుఁడు జనవినుతుఁడు కరుణా
తిశయుఁడు నితవుఁడు దినకరనిభుఁ డై.

210


వ.

వానికి మధుండు పుత్రుండయ్యె వానికిఁ బరాజితుండును రుతుండును పృథు
రుక్తుండును జ్యామఘుండును పలితహరితుండును నన నేవురు పుత్రులైరి
వారియందు.

211

తనపుత్రుం డగువిదర్భునకు వయోధికస్త్రీని పెండ్లి సేసిన జ్యామఘునివంశానుక్రమము.

క.

జ్యామఘుఁడు శైబ్య యనుకాం, తామణి వరియించి తాను దానికి వశుఁడై
యామగువ దనకు నేలిన, స్వామివిధంబునను రాజసంబున నుండెన్.[131]

212


క.

భామినులకు వశులై యీ, భూమండలిలోనఁ దిరుగుపురుషులలోనన్
జ్యామఘుఁడె యెక్కు వనుచును, వేమఱుఁ జెప్పుదురు జనులు విచ్చలవిడితోన్.

213


క.

ఆలు దనరాజ్యమంతయుఁ, బాలించఁగ దానిఁ గొల్చి బంటై యుండెన్
లీలఁ దనవంటిరాజులు, మేలంబున నపహసింప మెలఁగుచు వేడ్కన్.[132]

214


వ.

ఇట్లు భార్యావశుండై జ్యామఘుండు సంతానార్థంబుగాఁ దపంబు సేయం
జనుటయు.

215

ఉ.

వైరిపతుల్ మహోగ్రరథవారణఘోటకకపఙ్క్తియుక్తులై
భూరిబలంబుతో నతనిభూమి సమస్తము చూఱలాడఁగాఁ
జారులచే నెఱింగి నృపచంద్రుఁడు భార్యయనుజ్ఞఁ బూని దు
ర్వారపరాక్రమక్రమవిరాజితుఁడై రథ మెక్కి సేనతోన్.[133]

216


మ.

చని సంగ్రామమునందు దారుణరిపుక్ష్మాపాలలోకంబులన్
ఘనవజ్రప్రతిమానశాతవిశిఖాఘాతంబులం బ్రాణముల్
గొనినన్ మార్కొని నిల్వలేక కడుసంక్షోభించి నానాదిశాం
తనితాంతక్షితిభృద్గుహావళులలోనం దూఱి రత్యుద్గతిన్.[134]

217


వ.

ఇవ్విధంబున నరాతిచక్రంబు పరాక్రమింపనోపక నిజపుత్రమిత్రకళత్రబంధుబల
కోశాదినానాసంపదలతోడఁ దమతమనివాసంబులు విడిచి పలాయితు లైన
రాజన్యచూడామణి విజయసంపన్నుండై శత్రువులసమీపంబున మగిడివచ్చువాఁ
డెదుర.[135]

218


మ.

కనియెన్ దైన్యరసప్రపూరితముఖిన్ గండస్థలవ్యస్తహ
స్తను బాష్పాంబునిమజ్జమానకుచ నంచత్ప్రాయనాత్తోపకం
ఠను సంత్రాసవిలోలలోచననిరూఢన్ స్రస్తధమ్మిల్లబం
ధను నత్యంతభయాపనేయజనశూన్యన్ రాజకన్యామణిన్.[136]

219


చ.

కనుఁగొని జేరవచ్చి భయకంపితగద్గదకంఠనాద యై
జనకునిఁ దల్లిఁ బేరుకొని సంతతముం బరిదేవనంబు మా
వని నృపకన్య నూఱడిల నమ్మికమాటలు పల్కి దానిచే
నొనరఁగఁ బేరుఁ బెంపుఁ గులమున్ విని మన్మథరాగచిత్తుఁ డై.[137]

220


ఉ.

ఈయెలనాఁగఁ దోడుకొని యిప్పుడ యేను పురంబులోనికిం
బోయి మదీయమోహమును బుత్రులు లేమియు శైబ్యతో నభి

ప్రాయ మెలర్పఁజెప్పి యనురాగముతోడ వివాహమయ్యె
నాయెడఁ దప్పుఁబట్టదు మనంబున నాసతి గొడ్డు గావునన్.

221


వ.

అని నిశ్చయించి యక్కన్యారత్నంబుఁ దోడుకొని యతిప్రయత్నంబున రథం
బెక్కించుకొని విజయలక్ష్మీసమేతుండై వచ్చునప్పు డతనికిఁ దోడుగాఁ బౌరజన
భృత్యామాత్యవర్గంబుతో శైబ్య వచ్చి జీవతేశ్వరు సవ్యభాగంబున నున్నయ
క్కన్యఁ జూచి కలుషతామ్రలోచనయై యదరిపడి యిట్లనియె.[138]

222


ఉ.

ఈహరిణాక్షి యెవ్వరిది యేటికిఁ దెచ్చితి నీకు దీనిపై
మోహము గల్గెనో ముదిసి ముప్పున నన్నుఁ దిరస్కరించి యు
ద్వాహముగాఁ దలంచితొ కదా యనినం గడుభీతమానసుం
డై హృదయంబు జల్లుమన నంగనతోడ నృపాలుఁ డిట్లనున్.

223


తే.

కోడ లిది మనయింట నీకోమలాంగి, యుండఁదగు నని తెచ్చితినో మృగాక్షి
నీకుఁ బ్రియమేని నీయొద్ద నిలుపుకొనుము, కాకయుండిన వేఱొకకడకు ననుపు.

224


చ.

అనవుడు నేను వంధ్యను నరాధిప వేఱొకభార్య లేదు నీ
కును సుతుఁ డెవ్వఁ డీతరుణి కోడలుగాఁ గత మేమి యన్న న
వ్వనిత యొడంబడం దగినవాక్యముఁ గానక కొంతసేపు మె
ల్లన వినయంబుఁ జేసి తెరలంబడి యాసతితోడ నిట్లనున్.[139]

225


తే.

నీవు గొడ్రాలవై యుండెదే కుమారుఁ, డుదయమందకపోవునో యువిద సుతుఁడు
గలిగినప్పుడు కోడలు గలదె నీకు, ననుచు నేరమిమొఱఁగు లిట్లాడుటయును.[140]

226


తోటకవృత్తము.

దరహాసముతో వనితామణి యా, ధరణీవరుఁ బ్రమదంబున మం
దిరసౌధములోనికిఁ దెచ్చి మనో, హరసౌఖ్యము లందుచు నాతనికిన్.[141]

227


క.

గర్భంబుఁ దాల్చి యాసతి, యర్భకునిం గాంచెఁ బటుతరాహితరాజ్య
స్వర్భానుఁ డైనయతని వి, దర్భుం డనుపేరు పెట్టి ధర్మస్థితితోన్.[142]

228


క.

తామును గొనివచ్చిన కన్యామణిఁ బరిణయము చేసి యాతనయుని ధా
త్రీమండలాధిపతిగా, జ్యామఘుఁ డొనరించి తపము సలుపఁగఁ జనియెన్.

229


వ.

అట్టి విదర్భుపేర నారాజ్యంబు విదర్భదేశం బయ్యె నట్టివిదర్భునకుఁ గ్రథకైశిక
రోమపాదు లనంగ నిరువురుకుమారులు జన్మించి రందు.

230


సీ.

రోమపాదునకు విభ్రుఁడు పుట్టె వానికి ధృతి పుత్రుఁడయ్యె నాధృతికిఁ గౌశి
కుఁడు గల్గె నాకౌశికునకుఁ జేది జనించి నాచేదివంశజు లైనవారు

చైద్యులై ధరణిఁ బ్రశస్తి కెక్కిరి వారిచేత నాదేశంబు చేదిదేశ
మన నొప్పెఁ గ్రథకైశికున కిందుమతి యనుకూఁతుకుఱ్ఱయు మఱి కుంతి యనఁ గు


తే.

మారుఁడును గల్గి రాయిందుమతిఁ గకుత్స్థ, వంశజుం డైనయజుఁడు వివాహమయ్యె
గుంతి యత్యంతభోగనిరంతుఁ డగుచు, ధరణిఁ బాలించెఁ గడలేనిధర్మములను.[143]

231


వ.

ఆకుంతికి వృష్ణియు నతనికి ధృతియును ధృతికి దాశార్హుండును నతనికి వ్యోముం
డును వానికి ననుండును ననునకుఁ బూరుహోత్రుండును వానికి నంశుండును
నతనికి సత్వతుండును నతనికి సాత్వతుండునుం బుట్టిరి.

232


క.

జ్యామఘువంశానుక్రమ, భూమీశులకథలు భక్తిపూర్వకముగ ని
చ్ఛామతుల విన్నవారికి, నేమియుఁ బాపములు సెంద వేకాలమునన్.

233


వ.

మఱియు సాత్వతునకు భజమానదివ్యాంధదేవావృధమహాభోజవృష్ణు లనంగ
నార్వురు పుట్టి రందు భజమానునకు నిమియును వృక్ణుండును వృష్ణియు శత
జిత్తును సహస్రజిత్తును యుతజిత్తును ననంగ నార్వురుకుమారులు పుట్టిరి
మఱియును.

234


క.

దేవావృధునకు బభ్ర్యుడు, దేవవిభుం డుద్భవించె దీప్తయశుండై
యావసుధేశుని చరితము, లీవార్ధిపరీతభూమియంతయు నెగడెన్.[144]

235


వ.

మఱియు మహాధర్ముం డైనమహాభోజునకు భోజమూర్తులు పుట్టిరి. వృష్ణికి
సుమిత్రుండు పుట్టె వానికి నమిత్రుండును శిబియునుం బుట్టి రందు నమిత్రు
నకు నిఘ్నుండు పుట్టె వానికిఁ బ్రసేనసత్రాజిత్తులనంగ నిరువురు పుట్టి రందు
సత్రాజిత్తుండు.

236

సత్రాజిత్తునకు సూర్యునివలన శ్యమంతకమణి లభించుట

మ.

వనజాతప్రభవాండపూరితమహాధ్వాంతప్రణాశప్రభా
ఘనసాహస్రగు నబ్దమాససకళాకాష్ఠానిమేషాదికా
లనియుక్తుం బరముం బరాపరకళాలక్షీకృతుం జిత్రభా
నుని నారాధన సేసె రాజితతపోనుష్టానకర్మంబులన్.[145]

237


తే.

అతనిసద్భక్తియుక్తికి నాత్మ మెచ్చి, నీరజాప్తుండు ముందర నిలుచుటయును
దుర్నిరీక్ష్యప్రభలచేతఁ దోఁచుచున్న, దేవదేవునిఁ గానక దృష్టి చెదరి.[146]

238


శా.

ఓనారాయణమూర్తి నీమహిమ నే డుగ్రాగ్నిపిండోపమం

బై నాదృష్టికిఁ దోఁచుచున్నయది దివ్యంబైనయాకారముం
గానం జేసి కృతార్థుఁ జేయు మని భూకాంతుండు ప్రార్థించినన్
భానుం డెంతయు నాదరం బొదవ సంభావించి సంప్రీతితోన్.[147]

239


క.

తనగ్రైవేయకములలో, ఘనతేజము గల శమంతకంబనురత్నం
బొనరఁగ దెచ్చి రహస్యం, బున నాతనికంఠలగ్నమును జేయుటయున్.[148]

240


క.

మిత్రుని నీషత్పింగళ, నేత్రుని నత్యంతవామనీకృతసమ్య
గ్గాత్రునిఁ గవిజనమతిస, త్పాత్రునిఁ బొడగాంచె లోకబాంధవు సూర్యున్.[149]


ఆ.

చూచి పెక్కు గతులఁ జొక్కుచు ముందర, నున్ననతనితోడ నొక్కవరము
నిత్తు వేఁడుమనిన నీశమంతకరత్న, మిమ్మటన్న నిచ్చి యినుఁడు సనియె.

242


వ.

సత్రాజిత్తుండును లోకబాంధవదత్తం బైనశమంతకరత్నంబు నాయకరత్నంబుగాఁ
గంఠమాలికయందు నిడి మగిడి ద్వారకాపురంబునకు వచ్చుచున్నంతఁ దదీయ
రత్నప్రభాజాలంబులవలన రెండవసూర్యుండునుంబోలె నశేషసముద్భాస
మానుం డైనవానింజూచి పౌరజనంబు లత్యాశ్చర్యధుర్యాయత్తచిత్తులై చని.[150]

243


మ.

భవసంహారుని నాదిదేవుని మహీభారావతారక్రియా
ప్రవణవ్యాజమనుష్యరూపుని నదభ్రప్రాభవోద్దామవై
భవతేజోవిభవప్రతాపుఁ గరుణాపారీణునిన్ యాదవ
ప్రవరుం గృష్ణునిఁ గృష్ణవర్ణతనునిం బద్మాయతాక్షున్ హరిన్.[151]

244


క.

కని దండనమస్కారము, లొనరించి కరములు మొగిచి యోదేవ దివం
బున నున్నసూర్యదేవుఁడు, చనుదెంచుచు నున్నవాఁడు సాంద్రప్రభలన్.[152]

245


వ.

అనినం ద్రికాలవేది యగు దామోదరుండు దరహసితవదనుం డగుచు వారలతో
నిట్లనియె.[153]

246


క.

రాజీవాప్తుఁడుగాఁడు ప, యోజహితుం బ్రీతుఁ జేసి యొకరత్నము స
త్రాజిత్తుడు గొనిరాఁ ద, త్తేజంబు వెలింగె నిట్టి దీప్తిచ్ఛటలన్.

247

వ.

అని యాశ్వాసించి పుచ్చె నంత సత్రాజిత్తుండును నిజనివాసంబునకు వచ్చి సుఖం
బుండె నాశమంతకరత్నంబు.[154]

248


క.

ఎనిమిదిబారువు లర్థము, దినదినమును గురియుచుండ దీనార్థిజనా
వనుఁడై సత్రాజిత్తుఁడు, ఘనసంపదవలన మహిమ గైకొనియుండెన్.[155]

249


మ.

ఉపసర్గాధికహీనవృష్టి పటువాయువ్యాజనానాసరీ
సృపదుర్భిక్షజలాగ్నిదుష్టవిమతక్షోభాదిదోషంబులం
దపనీతం బగుచున్ మహామహిమతో నారాష్ట్ర మత్యంతధ
ర్మపరంబై వెలిఁగెన్ శమంతకమహారత్నప్రభావంబునన్.[156]

250


వ.

అంత నొక్కనాఁడు మురాంతకుం డత్యంతగుణవంతం బైనశమంతకంబు మహీ
కాంతుం డైనయుగ్రసేనుని నిశాంతంబున నుండ నర్హం బతని కిప్పింతమని
యేకాంతంబున నభ్యంతరజనంబులతోడం జింతసేసి బలవంతంబు చేసిన బంధు
ద్రోహం బగునని కొంకి యెప్పటియట్ల యుండెఁ దద్వృత్తాంతంబంతయు
సత్రాజిత్తుం డెఱింగి యంతరంగంబున గలంగి.[157]

251


క.

ఇమ్మణిరత్నము గృష్ణుం, డిమ్మనినఁ బ్రియంబుతోడ నీవలయును నీఁ
బొమ్మని త్రోచినఁ గడువిర, సమ్మగు బలవంతుతోడి చల మేమిటికిన్.[158]

252


తే.

అని తలంచి సహోదరుఁ డగు ప్రసేను, నపుడ రప్పించి యిచ్చిన నతఁడు దాని
గంఠమాలికలో గ్రుచ్చి కట్టికొనియె, నెంత యాప్తులచేతికి నీఁదలంకి.[159]

253


చ.

నరవరసూనుఁ డొక్కఁ డొకనాఁడు తురంగము నొక్కి వేఁటమై
నరిగి వనంబులోనఁ దిరుగాడఁగ సింహము వచ్చి యావిభుం
దురగముతోడఁ బట్టికొని దుష్టగతిన్ వధియించి మించి త
ద్వరమణిరత్నముం గొని జవంబునఁ బోవుచు నున్నయత్తఱిన్.[160]

254


తే.

చటులగతి ఋక్షపతి యైన జాంబవంతుఁ, డామృగేంద్రముఁ బరిమార్చి యాశమంత
కంబుఁ గొనిపోయి తనదుబిలంబుఁ జొచ్చి, తనయుఁ డగుసుకుమారున కొనర నిచ్చె.[161]

255


సీ.

అంత యాదవవీరు లాప్రసేనునిచావు విని యెంతయును దుఃఖవివశు లగుచు
దామోదరుఁడు శమంతక ముగ్రసేనున కిప్పింత మనుచుండు నెల్లనాఁడు

దానికి సామవాదముల సత్రాజిత్తుఁ డీనేరఁడని కదా యిప్పు డతని
తమ్మునిఁ జంపి రత్నముఁ దెచ్చుకొన్నవాఁ డింతసాహసకృత్య మెవ్వఁ డోపుఁ


తే.

బరులవలనఁ గీడు వొరసినఁ జెడకుండఁ, నాదరమునఁ బ్రోచు నవ్విభుండు
తానె కరుణ మాని దండించువాఁడగు, నేని సుజనవర్గ మేమి సేయు.[162]

256


వ.

అని యిట్లు పలుకుచున్న లోకాపవాదంబునకు వెఱచి నారాయణుండు.

257

శ్యమంతకమణిమూలంబున శ్రీకృష్ణునకు జాంబవతీసత్యభామలు భార్య లగుట

సీ.

సేనలుఁ దాను బ్రసేనుండు మును గానకరిగినచొప్పున నరిగి యొక్క
యెడ మృగేంద్రునిచేతఁ గెడసిన యానిఘ్నసుతు నెల్లవారికి జూపి సింహ
పదమార్గమున నేగి భల్లూకనిహతపంచాస్యకళేబర మచటఁ గాంచి
ఋక్షవల్లభుజాడ నేగి ముందఱ నొక్కగిరిగహ్వరముఁ గని కేశవుండు


తే.

నిఖిలబలమును నచ్చోట నిలిపి బిలము, దఱియఁ జొచ్చి కొండొకనేల యరిగి యచట
గాంచె నానామణిప్రభాకలితమహిమ, తోరమైయున్న జాంబవంతునిపురంబు.[163]

258


క.

అక్కడ నొక్కకుమారుని, నక్కున నిడి యొక్కదాది యనురాగముతో
మిక్కిలి నుపలాలింపగ, నక్కమలాక్షుండు వినియె నవ్వాక్యంబుల్.[164]

259


(శ్లో.

సింహః ప్రసేనమవత్సింహో జాంబవదా హతః,
సుకుమారక మా రోదీ స్తవ హ్యేష శమంతకః)


ఆ.

హరి ప్రసేనుఁ జంపె నమ్మృగేంద్రంబును, జాంబవంతుచేతఁ జచ్చె నిపుడు
గలిగే నీశమంతకము నీకు సుకుమార, యేడు పుడుప వన్న యింకనైన.

260


వ.

అని యిట్లు పలుకుచున్న దాది పలుకు లాకర్ణించి ముందట.

261


తే.

జలజనాభుఁడు పొడఁ గాంచె జాంబవత్కు, మారుకంఠప్రదేశమం దంచితప్ర
భావిభాసితమై నూత్నభానురుచికి, మాఱుమలయుచు నున్నశమంతకంబు.[165]

262


క.

చేరంగవచ్చి శౌరి కుమారునికంఠమున నున్నమణిరత్నము దు
ర్వారగతిఁ బుచ్చుకొన్న మ, హారభసముతోడ దాది యాక్రోశించెన్.[166]

263


ఆ.

అంత జాంబవంతుఁ డత్యంతదారుణ, కోపదీప్తుఁ డగుచు నాపురాణ
పురుషవరునితోడఁ బోరాడె నేకవిం, శతిదినంబు లతులసాహసమున.

264


చ.

వనరుహనాభురాక గరువంబునఁ గోరుచు సేనలెల్ల నే

డెనిమిదినాళ్లు సూచి యతఁ డీల్గెనొ కాకని ద్వారకాపురం
బున కరుదెంచి భక్తిపరిపూర్తి దిలోదకపిండదానముల్
గొనకొని చేసె బంధుజనకోటి యథావిధిపూర్వకంబుగన్.[167]

265


ఆ.

అందువలనఁ గృష్ణఁ డాప్యాయితశరీరుఁ, డగుచు నతులశక్తి నని యొనర్పె
నిపుడు జాంబవతుఁ డాహారనిద్రలు, లేమిఁ జేసి బలిమి లేక పోరె.[168]

266


ఉ.

బల్లిదు లైనఋక్షయదుభర్త లుదగ్రపరాక్రమంబులన్
మల్లు పెనంగునంత మురమర్దనుముష్టిహతాఖిలాంగుఁడై
తల్లడపాటు చిత్తమునఁ దార్కొన బీరముఁ గట్టిపెట్టి యా
భల్లవిభుండు గృష్ణునకు భక్తిమెయిం బ్రణమిల్లి యిట్లనున్.[169]

267


మ.

మును లంకాపురిలోన రావణుబలంబుల్ రాముసైన్యంబుతో
నని గావించు నెడన్ నిశాచరుల నుద్ఘాటించి రామావనీ
శుని మెప్పించితి నట్టి నా కొకమనుష్యుం డెంత నాపేరు వి
న్నను దేవాసురవీరసైన్యములకైనన్ గర్వముల్ బెండగున్.[170]

268


ఉ.

నిన్ను మనుష్యమాత్రుఁడని నిక్కముఁ జెప్పఁగరాదు సత్వసం
పన్నత జూపి నన్ను బహుమానము సేయఁగవచ్చినట్టి యా
పన్నగశాయి యట్ల కనుపట్టెద వింక ననుగ్రహింపవే
యన్న మురాంతకుండు దరహాసము మోమున నివ్వటిల్లఁగన్.[171]

269


చ.

తను నెఱిఁగించి చిత్తమునఁ దార్కొని యున్నకృపాంబురాశిలో
ననయము నోలలార్చి చటులాహవభేదము లెల్లఁ బుచ్చివై
చినఁ బరమానురాగమునఁ జెంది ముకుందుని మేడలోనికిం
గొని చని పూజ సేసి తనకూఁతును జాంబవతిం బ్రియంబునన్.[172]

270


ఉ.

కానుక యిచ్చి పెండ్లి యొడికంబుగఁ జేసి శమంతకంబుతో
మానితవస్తుజాలము సమగ్రముగా నుపదాన మిచ్చినన్
దానవసూదనుండు ప్రమదంబున జాంబవతీసమేతుఁడై
తా నరుదెంచె లోకవిదితంబుగ ద్వారకకున్ బ్రియంబుతోన్.[173]

271

ఉ.

వచ్చినకృష్ణుని సుజనవత్సలుఁ గన్గొని ద్వారకాజనుల్
ముచ్చట లెల్ల దాపుకొని మ్రొక్కుచు సొక్కుచు సంతసంబునన్
మచ్చికలుం బ్రమోదములు మన్ననలుం గని రవ్విభుండుఁ దా
నచ్చపలాక్షి జాంబవతి నంతిపురంబున నుంచి పెంపుతోన్.

272


శా.

సత్రాజిత్తున కాశమంతకము వాత్సల్యంబుతో నిచ్చి లో
కత్రాసం బగునిందఁ బాపుకొని నిష్కాపట్యుఁడై దేవకీ
పుత్రుం డుండె జగంబు లెల్లను జగత్పూతాత్మునిన్ శుద్ధచా
రిత్రుం గృష్ణుని మెచ్చి రాదరవిహారీభూతచేతస్కులై.[174]

273


మ.

తనచిత్తంబు భయంబుఁ బాయుటకు సత్రాజిత్తుఁ డాత్మీయనం
దనఁ జంద్రాస్యను సత్యభామ యనుకన్యారత్నమున్ గోపికా
జనవక్షోరుహశాతకుంభకలశాంతర్న్యస్తకస్తూరికా
ఘనసారాంచితపీనవక్షునకు వేడ్కన్ బెండ్లి గావించినన్.[175]

274


క.

కృతవర్మయు నక్రూరుఁడు, శతధన్వునికడకుఁ బోయి సమధికకోపా
న్వితులై సత్రాజిత్తుని, యతిధౌర్త్యం బుగ్గడించి యని రాతనితోన్.[176]

275


ఆ.

మునుపు సత్యభామ మనలోన నొకరున, కిత్తు ననుచు నిశ్చయించి పలికి
యాలతాంగి నిప్పుడబ్జాక్షునకుఁ బెండ్లి, సేసె మము నిన్ను సిగ్గుపఱచి.[177]

276


తే.

ఇంత సేసిన దుష్టాత్ము నెట్టులైన, సంహరించి శమంతకచారురత్న
మపహరించినఁ బగయెల్ల నణఁగిపోవు, ననిన శతధన్వుఁ డగుఁగాక యనుచు నుండె.

277

సత్రాజిత్తుని జంపి శ్యమంతకము నపహరించిన శతధన్వుని శ్రీకృష్ణుండు సంహరించి అక్రూరునియొద్దనున్న ఆశ్యమంతకమణిని గ్రహించుట

వ.

అంత నొక్కనాడు దేవకీనందనుండు పాండునందనులు వారణావతంబున దుర్యో
ధనుకపటకృత్యంబుల నైనలక్కయిండ్ల నగ్నిభయంబుఁ బొరయకుండ రక్షించు
వాఁడై యరిగినసమయంబు వేచి.[178]

278


క.

రాత్రి సుఖనిద్రఁ జెందిన, సత్రాజిత్తును వధించి శతధన్వుఁడు త
త్పుత్రకళత్రము లఱవఁగ, క్షాత్రంబున నాశమంతకముఁ గొని చనియెన్.[179]

279


క.

కృతవర్మాక్రూరుల యను, మతమునఁ దమతండ్రిఁ జంపి మణిరత్నం బా
శతధన్వుఁ డపహరించిన, మతమంతయు సత్యభామ మది నెఱిఁగి వెసన్.[180]

280

ఆ.

అరద మెక్కి యతిరయంబునఁ దగువారుఁ, దాను వారణావతమున కరిగి
పాండుసుతులఁ గూడి ప్రమదంబుతోనున్న, యబ్జనాభుకడకు నరుగుదెంచి.

281


చ.

ఉడుగనిబాష్పపూరముల నుగ్మలి యవ్విభుపాదపద్మముల్
దడుపుచు నర్ధరాత్రి శతధన్వుఁడు తండ్రి నకారణంబ రూ
పడఁచుటయున్ శమంతకమహామణిరత్న మతిప్రయత్న మే
ర్పడఁ గొని చన్న ధౌర్త్యము నపారపుదుఃఖముతోడఁ జెప్పినన్.

282


క.

వెఱఁగంది శౌరి యిట్లనుఁ, దెఱవా మీతండ్రి నిట్లు దెగ చంపిన యా
మొఱకు శతధన్వు నిప్పుడ, నఱకెద మోమోటలేక నాచక్రమునన్.[181]

283


క.

అని సత్యభామ నూరా, ర్చి నళినదళలోచనుండు చెచ్చెరఁ గుంతీ
తనయుల వీడ్కొని నిజపుర, మునకుం జనుదెంచెం బయనముల వేగమునన్.

284


తే.

వచ్చి యేకాంతమునఁ దమవారలైన, యుగ్రసేనాదిబలభద్రయోధవరుల
తోడ శతధన్వుచేసిన తులువతనము, నెఱుకపడఁజెప్పి వెండియు నిట్టులనియె.

285


మ.

రవిదత్తం బగునాశమంతకమహారత్నార్థమై దారుణా
టవిలో నాఁడు ప్రసేనుప్రాణములు గెంటంజేసె సింహంబు బాం
ధవుఁ డయ్యు శతధన్వుఁ డిప్పు డిదె సత్రాజిత్తునిం జంపె ని
ట్లు వృథాదుర్మరణంబునం బడిరి తోడ్తో నన్నయుం దమ్ముఁడునున్.[182]

286


క.

అని పలికి శౌరి సీరిం, గనుఁగొని యిట్లను శమంతకము ముల్లోకం
బునకు నుపకారభూతము, మనకర్హముగాక యితరమనుజుల కగునే.[183]

287


తే.

ఇంత సేసినదుష్టాత్ము నిపుడె పట్టి, గెడపకుండిన మన కపకీర్తి వచ్చు
ననిన శతధన్వుఁ బరిమార్చి యమ్మణీంద్ర, మర్థితోఁ బుచ్చుకొన సీరి యాస సేసి.[184]

288


తే.

శౌరికంటెను గోపరసప్రపూర్ణ, హృదయుఁడై యుండె నావిధం బెల్ల నెఱిఁగి
వెఱచి శతధన్వుఁ డెంతయు విహ్వలించి, యన్యు లెఱుఁగకయుండ నేకాంతమునను.[185]

289


క.

కృతవర్మకడకుఁ జని య, చ్యుతుఁడు తనుం జంప నున్నయుద్యోగముఁ జె
ప్పి తనకుఁ దోడై రమ్మని, యతనిం బ్రార్థించి పిలిచె నాహవమునకున్.[186]

290


క.

అవ్వచనములకు మదిలో, నవ్వుచుఁ గృతవర్మ పలికె ననుఁ బిలిచెదు నీ
వవ్వనజాక్షుని మార్కొన, నివ్వెడఁ గుందనము నీకు నేటికిఁ గలిగెన్.[187]

291


ఉ.

ఏనును నీవు నేల జగ మింతయు నొక్కటఁ గూడి వచ్చినన్

దానవవైరి ముందరఁ బ్రతాపముఁ జూపగ రాదు కావునన్
మానుము దుర్విచారము మనంబున నెమ్మెయి మానకుండినన్
మానముఁ గోలుపోదు వనుమానము మాను మనం గలంగుచున్.[188]

292


మ.

అతఁ డక్రూరునిపాలి కేగి తనకార్యంబంతయుం జెప్పి య
చ్యుతునిన్ మార్కొనిపోరఁ దోడుపడుమంచున్ బిట్టు ప్రార్థించినన్
శతధన్వా యెటువంటిదుర్మతివి నీసామర్థ్య మాశౌరిపై
మతి నూహింప వినాశహేతువగు నీమాటల్ వినంగూడునే.[189]

293


వ.

అదియునుంగాక యమ్మహాత్ముండు నిశాచరాధిపశుద్ధాంతకాంతావైధవ్యకారణా
వక్రవిక్రమోపక్రమచక్రపాణియును, పాపప్రహారప్రకంపితజగత్ప్రయప్రాణి
యును, పురందరాదిదిక్పాలకఫాలపట్టికాసంఘటితపదారవిందుండును, సనకస
నందనాదిభక్తజనవిందుండును నైన గోవిందుం డెవ్వరికి నజేయుండు గావున
బుద్ధిమంతుండవై యెటకేనియుం దొలంగిపొమ్మనిన నొడంబడి యతం డిట్లనియె.[190]

294


ఉ.

ఏ నెటకేనియుం దొలఁగి యేగెద నీమహనీయరత్నమున్
మానుగ నీవు దాఁపుము రమాపతిబారికిఁ దప్పి వచ్చినన్
గానుక నాకు నిచ్చె దిటుగా కొకటైనను నిన్నె చేరెడుం
గాని కడున్ రహస్యముగఁ గైకొనుమా నిను నమ్మి యిచ్చెదన్.[191]

295


చ.

అని తన చేతిరత్నముఁ బ్రయత్నము మీఱఁగ నిచ్చె నిచ్చినన్
మనమున సంతసిల్లియు సమంజసబుద్ధిఁ దలంచి యింక నీ
పని యొరుతోడఁ జెప్పనని బాస యొనర్చినఁ గాక యొల్ల నే
ననుటయు నట్లకాక యని యాతనికిన్ శపథంబు పల్కినన్.[192]

296


ఆ.

సంతసిల్లి యాశమంతకం బతిరహ, స్యంబు గాఁగ దాఁచె నంతలోనఁ
దన్నుఁ బట్టికొనఁగఁ దగువారిఁ గృష్ణుండు, పనుచు టెఱిఁగి యతఁడు భయము గదుర.

297


క.

అతితీవ్రవాయువేగియు, శతయోజనవాహినియును సమధికసత్వో
ద్ధతియును నగుగోడిగఁ దా, శతధన్వుం డెక్కి చనియె సత్వరవృత్తిన్.[193]

298


వ.

అంత బలదేవుండు దోడురా వాసుదేవుండు సైన్యసుగ్రీవమేఘపుష్పవరాహ

కంబులను తురంగంబులం బూన్చినరథంబు సూతుం డైనదారుకుండు తెచ్చు
టయు రథారోహణంబు చేసి యతిత్వరితవేగంబున వెనుకొని చనిన.

299


చ.

గురుతరవాయువేగమున గోడిగయున్ శతయోజనంబు లు
ద్ధురగతిఁ బాఱిపాఱి దగతో మిథిలానగరోపగంఠభా
సురసహకారనీపవటచూతమధూకకదంబమాధవీ
మరువకశోభితోపవనమధ్యమునం బడి చచ్చెఁ జచ్చినన్.[194]

300


తే.

పాదచారియై రయమునఁ బాఱిపోవఁ, జొచ్చుటయు దవ్వుదవ్వులఁ జూచి శౌరి
సీరి కిట్లను నీవిందు నీరథంబు, నందుఁ జూచుచునుండు మే నరిగి యిపుడు.

301


మ.

తులువం జంపి శమంతకంబుఁ గొనివత్తున్ మీరు మెచ్చంగ నే
నలఘుప్రౌడి నటంచుఁ దేరు డిగి రంహస్ఫూర్తి సింహంబు పే
రలుక నీచమృగంబుపై నరిగినట్లై క్రోశ మే తెంచి ద
వ్వుల నోహో నిలు పోకు మంచు శతధన్వుం బల్కి యత్యుగ్రతన్.[195]

302


ఉ.

వారిజలోచనుండు బలవద్రిపుమండలఖండనక్రియా
దారుణశాతచక్రమునఁ దచ్ఛిర ముగ్రతఁ ద్రుంచి యాతనిం
జేరఁగఁబోయి మస్తకముచీర పటంబులు కంఠహారకే
యూరము లాదిగా వెదకియుం బొడగానఁడు రత్నరాజమున్.[196]

303


వ.

ఇట్లు కానక మగిడివచ్చి యావృత్తాంతంబంతయు బలభద్రునకుం జెప్పుటయు
నతండు దన్ను మొఱఁగి యారత్నం బీజాలండో యని విశ్వసింపక కోపించి
యిట్లనియె.[197]

304


క.

తమ్ముఁడవని ని న్నేగతి, నమ్మంగావచ్చు నెట్లు నాకొసఁగక ర
త్న మ్మటమటించుకొంటివి, పొమ్మిఁక నీతోడిపొత్తు పొరపొచ్చె మగున్.[198]

305


చ.

అనుటయుఁ బద్మనాభుఁడు హలాయుధుఁ గన్గొని యేను నీకు వం
చన మొనరించి దివ్యమణి యైనశమంతము దాఁచలేదు నీ
మనమున శంకగల్గిన ప్రమాణము చేసెద నీవు గోరినన్
వనరుహమిత్రుచేతఁ గొనివచ్చెద నవ్విభుకంఠమాలికల్.[199]

306

మ.

అని యిట్లెన్నివిధంబులం బలికినన్ హాలామదోద్వేగలో
చనఘూర్ణీకృతుఁడై హలంబురుభుజాస్తంభంబుపై నిల్పి కో
పనిరూఢోక్తులఁ గృష్ణునిం బలికి నీబంధుత్వమున్ ద్వారకా
జనసాంగత్యము నొల్లనే నిఁక యథేచ్ఛావృత్తిమైఁ బోయెదన్.[200]

307


వ.

అని పలికి మహారోషంబున బలభద్రుండు కృష్ణుండు దన్ను నెంత పెనంగి ప్రార్థిం
చినను విడుపించుకొని మావంతునిచేత విడివడిన భద్రదంతావళంబు చందం
బున మిథిలాపురంబునకుం జని జనకచక్రవర్తిచేతఁ బూజితుండై యారాజయో
గివలన నథ్యాత్మవిషయంబులయిన యితిహాసంబులు వినుచు ధృతరాష్ట్రనందనుం
డైనదుర్యోధనునకు గదావిద్య నేర్పువాఁడై సంవత్సరత్రయం బుండె నంత.[201]

308


ఆ.

ద్వారవతికి మగిడివచ్చి దామోదరుం, డిట్టినింద దనకు నేలవచ్చె
ననుచు రేయిపగలు నాత్మఁ జింతించుచు, నుచితవర్తనమున నుండె నంత.[202]

309


ఆ.

జలజనయనువలన సంశయం బేమియు, నొందకుండు టెఱిఁగి యుగ్రసేన
బభ్రుముఖ్యు లరిగి బలభద్రుఁ దొడ్కొని, తెచ్చి రతని కలఁకదేర్చి పురికి.

310


క.

ఆరీతిని రత్నం బ, క్రూరుఁడు గొనిపోయి దాఁచి గోప్యము సేసెన్
వారక నిత్యము నెనిమిది, బారువు లర్థంబు గురియఁ బరమప్రీతిన్.[203]

311


వ.

కుబేరుండునుంబోలె మహాధనవంతుండై యుండి తనయర్థంబు నిరర్థకం బగువ్య
యంబు సేయక పరమేశ్వరార్పణంబుగా యజ్ఞంబులు సేయుచుండి యజ్ఞదీక్షా
పరు లైనక్షత్రియవైశ్యుల వధియించినవారు బ్రహ్మహంత లగుదు రని పెద్దల
చేత నెఱుంగుటం జేసి సవనదీక్షాకవచంబువలన సురక్షితుండై యఱువదిరెండు
సంవత్సరంబు లుండె నమ్మణిప్రభావంబునఁ జేసి యాదేశంబు మారికోపసర్గాది
దోషంబులు లేక విలసిల్లె నంత.[204]

312


ఆ.

భోజముఖ్యులయిన రాజు లక్రూరుని, బంధువరులు రాచపాడి దప్పి
సత్వతప్రపౌత్రు శత్రుఘ్నుఁ డనువానిఁ, ద్రుంచి రాగడమున దొమ్మిచేసి.[205]

313


తే.

తన్నిమిత్త మక్రూరుఁడు దనకు నెంత, యొప్పములు వచ్చునో యని యుండ వెఱచి
భోజసహితుఁ డై కాశికాపురికిఁ బోయెఁ, బోయినమొదలు యాదవభూమియందు.[206]

314


సీ.

జగతిపైఁ గాలవర్షంబులు లేవయ్యె సస్యంబు లెల్ల నాశంబుఁ బొందె
నత్యంతదుర్భిక్షమై దేశములు నొచ్చె ధారణ లెంతయుఁ దఱిగివచ్చె

వ్యాధులు దఱుచయి బాధించెఁ బ్రజలను జావు లగ్గలమయ్యె జనులయందుఁ
బ్రళయానిలంబు లుత్పాతంబుగా వీచె ఘోరాగ్నిభయములు గోడుకొనియె


తే.

దుష్టభుజగంబు లందందఁ దోలికఱచెఁ, గ్రూరమృగచయమెల్లఁ ద్రెక్కోలుగొనియె
జారచోరభయంబులు సంక్రమించె, ద్వారకానగరంబునఁ దఱుచుగాఁగ.[207]

315


క.

ఇట్టి మహోత్పాతంబులు, పుట్టినఁ గృష్ణుండు వృష్ణిభోజాంధకులన్
జుట్టములఁ బిలిచి వారల, కట్టియుపద్రవముఁ జెప్పె నతిదుఃఖితుఁడై.

316


తే.

చెప్పి దీనికిఁ బ్రతికార మిప్పు డేమి, చేయుదము బుద్ధిమంతులు సెప్పుఁడనిన
నందకుం డనుయదువృద్ధుఁ డబ్జనాభుఁ, జూచి యిట్లని పలికె నస్తోకమతిని.[208]

317


క.

విను మాధవ యక్రూరుని, జనకుండు శ్వఫల్గుఁ డమరసన్నిభుఁ డతఁడుం
డిన దేశంబులలో నెం, దును జెందవు మారికాదిదుర్దోషంబుల్.

318


వ.

తొల్లి కాశీరాజు తనదేశంబున ననావృష్టిదుర్భిక్షమారికాదిదోషంబులు పుట్టిన
శ్వఫల్గుం బ్రార్థించి వారణాశీపురంబునకుఁ దోడ్కొనిపోయి సకలకల్మషంబులు
వాపుకొని యాసన్నప్రసవయై యున్న తనభార్యగర్భంబులో నున్నయిక్కన్నియ
నిమ్మహాత్మునకు వివాహంబు చేసి కృతార్థుండ నగుదునని యున్న నది పండ్రెం
డేండ్లు జనించక తల్లియుదరంబునంద పెరుగుచు నొక్కనాడు తల్లిసంకటపాటు
నకు దుఃఖించి తండ్రి ట్లనియె.[209]

319


తే.

ఇంక మూఁడేండ్లకునుగాని యే జనింప, నన్నిదినములు దిన మొక్కయావు లెక్క
ధరణిదేవోత్తములకును దాన మొసఁగు, మట్లయైనను నా కుదయంబు గలుగు.

320


ఆ.

అనిన నట్లకాక యని నిత్యకృత్యంబు, నతఁడు గురున కొక్కయావు లెక్క
దాన మొసఁగుచుండెఁ దత్పుణ్యవశమునఁ, గూఁతు రుదయమయ్యెఁ గొమరు మిగిలి.

321


వ.

అది నిమిత్తంబుగా నక్కన్నియకు గాందినీనామధేయంబు చేసి శ్వఫల్గున కిచ్చె
నాదంపతులకుఁ బరమభాగవతోత్తముండైన యక్రూరుండు జన్మించెఁ దల్లిదం
డ్రులు సేసిన పుణ్యంబువలన నతఁ డున్నదేశంబులు సుభిక్షంబులైయుండు ననవ
రతయజ్ఞదీక్షారతుం డైనపుణ్యపురుషుండు సమస్తదురితంబులఁ బాపనోపు
నతండు చేసినయల్పాపరాధంబు నేరంబుగా విచారింపక లోకోపకారంబుగా
విచారించునది యనిన నందకువచనంబు లాదరించి.

322

క.

బాణాంతకుఁ డక్రూరుని, ప్రాణార్థంబులకుఁ దప్పనని శపథం బ
క్షీణగతి నిచ్చి పిలువఁగ, క్షోణీసురవరులఁ దగినచుట్టలఁ బనిచెన్.[210]

323


తే.

గాందినేయుఁడు శౌరివాక్యములు నమ్మి, ద్వారకకు వచ్చి పూర్వప్రకారమునను
యాగములు సేయుచుండెఁ గృష్ణార్పణముగఁ, దచ్ఛమంతకరత్నార్థధాముఁ డగుచు.

324


మ.

కురిసెన్ వానలు సస్యవృద్ధి గలిగెన్ గొల్చెక్కుడై యమ్మె నె
వ్వరు రోగంబులచేతఁ జావరు మృగవ్యాళాదిదుర్దోషముల్
విరిసెన్ సాధుమతంబు లెల్ల నడిచెన్ విఖ్యాతసౌఖ్యంబుతో
ధర శోభిల్లె శమంతకాఖ్యమణిరత్నస్థైర్యసంపత్తిచేన్.[211]

325


వ.

ఇట్లు సకలదురితనివారణం బగుటకు వెఱఁగుబడి పుండరీకాక్షుండు తనమనం
బున నిట్లని వితర్కించె.

326


సీ.

కడునల్పపుణ్యులు గాందినియును శ్వఫల్గుండును వారలకొడుకుఁగుఱ్ఱఁ
క్రూరుఁ డితనిపుణ్యము చెప్పఁబడఁజాల దితనికి మహిమ దా నెట్లు గలిగె
నదియునుగాక నిత్యమును దప్పకయుండఁ గ్రతువులు సేయుచు సతతభూరి
దక్షిణల్ ద్విజులకుఁ ద్రవ్వితండములుగా నిచ్చుచున్నాఁడు నే నెఱుఁగకుండ


తే.

నింత యర్థంబు వీనికి నెట్లు గలిగె, నింతతేజోవిశేషంబు నిట్టిపాటి
మహిమయును గల్గుటెల్ల శమంతకప్ర, భావ మిది నిశ్చయంబని తలఁచి యంత.[212]

327


క.

ఒకనాఁడు సకలయాదవ, నికరంబులతోడ గాందినీసుతుఁ బిలిపిం
చి కడుంబ్రియపూర్వకముగఁ, బ్రకటవినోదములు నడపెఁ బరిహాసముగన్.

328


వ.

ఇవ్విధంబున నక్రూరునిచిత్తం బక్రూరంబుగాఁ బ్రతులు సేసి యిట్లనియె.

329


సీ.

అనఘ నీచేఁ గమలాప్తదత్తం బైనయాశమంతక మవశ్యంబు నుండు
నే నెఱుంగుదు నది యెఱిఁగియు నీ వనవరతయజ్ఞక్రియాపరుఁడ వగుటఁ
చూచి నీతో నది సూచింపకుండితి నది నాకుఁ దెలియదో యని రహస్య
వృత్తిమై దాఁచితి నీవు గావున దాఁగినట్లయ్యె నీవిధం బరసిచూడ


తే.

వీర లిందఱు నామీఁద విశ్వసింప, కున్న వా రపకీర్తి నా కొదవకుండఁ
జూపుమా సకలబంధులుఁ జూడవలయు, నిందు నీ కపరాధ మొక్కింతలేదు.

330


వ.

అనిన గాందినీనందనుండు దేవకీనందనుపలుకుల కులికిపడి మొగంబు వెల్లనై
ధైర్యం బొక్కింత చేసికొని తనమతంబున.

331


క.

మానికము దాఁచి లేదని, పోనాడి మొఱంగి తొలఁగిపోయిన నెందుం
బోనియ్యఁ డడిగినప్పుడె, యేను సమర్పింతు ననుచు హితమతితోడన్.[213]

332

క.

మును శతధన్వుఁడు దనకి, చ్చినచందముఁ దెలియఁజెప్పి చెచ్చెరఁ దనక
ట్టినపట్టుదట్టిపొరలో, నునిచినరత్నంబు దిగిచి యొసఁగెన్ హరికిన్.

333


పంచచామరము.

సముజ్జ్వలారుణప్రభావిశాలభాసురోదయా
ర్కమండలోపమానమై జగజ్జనైకదుర్నిరీ
క్ష్యమై సభాజనప్రశస్తసాధువాదయోగ్యమై
శమంతకాఖ్యరత్న మొప్పె శౌరిసమ్ముఖంబునన్.[214]

334


వ.

ఇట్లు జాజ్వల్యమానంబై వెలుంగుచున్న రత్నంబు సకలజనంబులు పట్టిపట్టిచూచి
సాధువాదంబులఁ బెద్దయుంబ్రొద్దు గొనియాడి రప్పు డక్రూరుండు కమలనా
భున కిట్లనియె.[215]

335


క.

లోకేశ యిమ్మణీంద్రము, నీకృప నామీఁదఁ జాలనిలిచినకతనం
జేకొని దాఁపఁగ నెఱసిరి, నాకుఁ గలిగె నిట్లు కానినాఁ డోపుదునే.[216]

336


ఉ.

ఇమ్మహనీయరత్నమున కెంతయు నాసలఁ జిక్కి చచ్చినా
రమ్మెయి నాప్రసేనుఁడుఁ దదగ్రజుఁడున్ శతధన్వుఁడున్ వినా
శమ్మును బొందె నట్లగుట సంతతమున్ దలపోసి యేను బ్రా
ణమ్ములు నమ్మకుండుదు జనస్తుత నేఁడు సుఖంబుఁ జెందితిన్.

337


క.

లోకోపకారముగ నిది, నాకడ దాఁచితిని దీని నారాయణ యీయీ
పోకలు దెలిసియు నడుగక, నీ కీననియుండితిన్ వినిశ్చితబుద్ధిన్.

338


చ.

అడుగక కాని దాఁచినపదార్థము లిచ్చుట నీతిగాదు నీ
వడిగితిగాన నిప్పుడు సమర్పణసేసితి నింక నాయెడన్
గొడవలు లేవు నీమనసుకోరిక యేగతి నుండునట్లుగా
నడుపుము భక్తవత్సలత నన్నుఁ గృతార్థునిఁ జేయు కేశవా.[217]

339


తే.

అనిన గాందినినందను నమ్మురారి, గౌరవించుచు నుచితవాక్యములు పలుకు
చుండె జాజ్వల్యమానమై యొప్పుచున్న, మానికముమీఁది పేరాస మానలేక.

340

శ్రీకృష్ణుం డక్రూరునకు శ్యమంతకమణి నొసంగుట

ఆ.

తనకు మీఁదు గట్టి తగనియ్యఁ బాఱినాఁ, డనుచు సీరపాణి యాససేసెఁ
దండ్రిసొమ్ముగానఁ దనకిత్తురో యని, సత్యభామ మిగులఁ జనువు నెఱపె.

341


క.

వారిరువురు దమలోపలఁ, బేరాసల నుండు టెఱిఁగి పీతాంబరుఁ డ
క్రూరునిదెసఁ గలిగినకరు, ణారసము దొలంకులోచనంబులతోడన్.[218]

342

క.

సతతంబు బ్రహ్మచర్య, వ్రతస్థులకుఁ గాని యున్నవారలకును సం
గతిగా దీమణిఁ దాల్పఁగ, నతిశయదుఃఖంబుఁ బ్రాణహానిం జేయున్.[219]

343


సీ.

షోడశసాహస్రసుందరీజనమోహితుఁడఁగాన నే నోప నెడభరింప
నామీఁదికూర్మి యెన్నఁడుఁ బోయ దటుగాన సత్యభామకుఁ బూన్ప శక్తి లేదు
ప్రతిదినంబును మద్యపానంబు గావించు బలభద్రునకు భరింపంగ రాదు
సతులతోఁగూడ సంసారముల్ సేసెడువా రెవ్వరును దాల్చలేరు భూమిఁ


తే.

గాన నాకును జూడ నిష్కల్మషుండు, బ్రహ్మచర్యవ్రతస్థుఁడై పరఁగు భాగ
వతుఁడు సంతతయజ్ఞదీక్షితుఁడు నైన, యట్టి యక్రూరునకు నిది యర్హమగును.

344


మ.

అని యారత్నము కాందినేయునకు నెయ్యంబారఁగా నిచ్చి పొ
మ్మని వీడ్కొల్పిన సంతసంబు మదిఁ బొంగారంగ నాఁ డాదిగా
జనులెల్లం గొనియాడ లోకవిదితాచారుండు గ్రైవేయకం
బునకున్ నాయకరత్నమై మెఱయఁగాఁ బూనె మునీంద్రోత్తమా.[220]

345


తే.

శౌరి తన కైనమిథ్యాభిశస్తిదోష, మంతయును బాపుకొని సముదగ్రవైభ
వమునఁ బెంపారె ద్వారకావతిపురమున, భక్తరక్షావిచక్షణప్రౌఢి మెఱసి.[221]

346


తే.

మునివరోత్తమ యీకథ వినిన సాధు, జనులు మిథ్యాభిశక్తిదోషములు లేక
పుత్రపౌత్రాభివృద్ధిచేఁ బొదలియుండు, దురు యశం బెల్లదిక్కులఁ బరిమళింప.

347

అనమిత్రప్రభృతులవంశానుక్రమము

వ.

అని చెప్పి పరాశరుండు వెండియు సోమవంశంబు కొఱంత సెప్పువాఁడై
యిట్లనియె.

348


క.

అనమిత్రునకును శినియున్, శినికిన్ సత్యకుఁడు నాతనికి సాత్యకియున్
జనియించిరి యుయుధానుఁ, డను వేఱొకపేరు గలిగె నాసాత్యకికిన్.

349


క.

అనమిత్రుని యన్వయమున, జనియించె శ్వఫల్గుఁ డతనిచరితం బెల్లన్
మునువింటి వామహీపతి, తనయుం డక్రూరుఁ డయ్యెఁ దాపసముఖ్యా.

350


ఆ.

అంధకునితనూజులై రుచికంబళ, కుకురబర్హు లనఁగఁ బ్రకటయశులు
పుట్టి రామహీశపుంగవవంశజు, లంధకాఖ్యు లైరి యనఘచరిత.

351


క.

అనునకు నానకదుందుభి, జనియించెఁ బునర్వసుండు తత్సుతుఁడై యా
తని కుదయించెను నాహుకుఁ, డన నాతనిపుత్రుఁ డయ్యె నానరపతికిన్.

352


వ.

దేవకోగ్రసేను లనుపుత్రద్వయంబును వృకదేవయు నుపదేవయు దేవరక్షితయు
శ్రీదేవియు శాంతిదేవియు సహదేవియు దేవకియు ననంగ నేడుగురు కన్యక

లును బుట్టి రయ్యిందువదనల నందఱు వసుదేవుండు వివాహంబయ్యె నుగ్రసేను
నకునుఁ గంసప్రముఖులైన కుమారులు పదుండ్రు పుట్టిరి.

353


క.

భజమానునకు విదూరథుఁ, డు జనించె నతనికి శూరుఁడు గలిగె నాభూ
భుజూనకుఁ బ్రతిక్షత్రుం డను, సుజనహితుఁడు పుట్టె విజయశోభితుఁ డగుచున్.

354


క.

వానికి భోజుఁడు భోజ, క్ష్మానాథునకును హృదీకజననాథుఁడు నా
భూనాథునకును గృతవ, ర్మానందప్రముఖు లుదయమయిరి గరిమతోన్.

355


క.

శూరుఁడు మారిష యనువని, తారత్నమునందుఁ బుత్రదశకముఁ బడసెన్
వారలలో వసుదేవుఁడు, ధీరుండై జగములందుఁ దేజముఁ గాంచెన్.

356


ఉ.

ఆవసుదేవుజన్మసమయంబున వేల్పులు గూడి ధాత్రిలోఁ
మావిభుఁ డీమహాత్మునికుమారకుఁడై యుదయించి శ్రీలుమా
కీవుతమంచు మించి మొరయించిరి యానకదుందుభిప్రవా
ద్యావళిఁ దన్నిమిత్త మతఁ డానకదుందుభి యయ్యె ధాత్రిలోన్.[222]

357


వ.

మఱియు నవ్వసుదేవునికి భగినులై పృథయును శ్రుతదేవయు శ్రుతకీర్తియు
శ్రుతశ్రవయు రాజాధిదేవియు ననువా రేవురుకన్యకలు పుట్టి రందు.[223]

358


క.

కుంతి యనుధరణినాథుఁడు, సంతానములేక శూరుసమ్మతమున నా
యింతులలోపలఁ బృథ యను, కాంతం గొనిపోయెఁ బుత్రికామోహమునన్.

359


ఉ.

ఆనళినాక్షి పౌరవకులాగ్రణి పాండునిఁ బెండ్లియాడి ధ
ర్మానిలవాసవాంశభవు లైనయుధిష్ఠిరభీమపార్థులన్
సూనుల మువ్వురం బడసె సూర్యువరంబునఁ బెండ్లి లేనినాఁ
డానతవైరిఁ గర్ణుఁ డనునంగపతిన్ గనియెం బ్రియంబుతోన్.[224]

360


క.

ఆవనిత సవతి మాద్రీ, దేవి వడసెను నకులసహదేవు లనంగా
దేవత లగునశ్వినుల మ, హావరముల పెంపువలన నాపాండునకున్.

361


వ.

మఱియు శ్రుతదేవను వృద్ధధర్ముం డనుకరూశపతి వివాహంబై దానియందు నేవురు
కుమారులం బడసె రాజాధిదేవి నవంతీశ్వరుండు వివాహంబై విందానువిందుల
నిరువురం బడనె శ్రుతశ్రవ యనుదానిఁ జేదివిభుండయిన దమఘోషుండు
వివాహంబయి శిశుపాలుం డనుకుమారునిం బడసె.

362


సీ.

పూర్వకాలంబునఁ బురుషోత్తమునితోడివైరంబువలన నుదారవిక్ర
మాసురపతి దితియందు హిరణ్యకశిపుఁ డనఁబుట్టి నృసింహువలన
వధ నొంది వెండియు నధికప్రతాపంబు దనర దశాననత్వము వహించి
యఖిలభోగంబుల ననుభవించి త్రిలోకసేవితుఁ డగురాముచేతఁ జచ్చి

తే.

పిదప శిశుపాలుఁడై పుట్టి పిన్ననాటఁ, గోలెఁ బూర్వవిరోధంబు కొనలుసాగ
భూమిభారావతరుణుఁడై పుట్టినట్టి, మురహరునిచేత మృతిఁ బొంది ముక్తిఁ గాంచె.[225]

363


వ.

అనిన మైత్రేయుం డిట్లనియె.

364


ఉ.

అందముగా నతండు దివిజాదులు గాననివైభవంబులం
బొందుచు నాహిరణ్యకశిపుత్వమునన్ దశకంధరాకృతిం
జెంది ముముక్షుభోగములు చేకొన కాశిశుపాలుఁడై ముదం
బందుచు విష్ణునందు లయ మౌటకుఁ గారణ మేమి గల్గెనో.[226]

365


వ.

అనినం బరాశరుం డిట్లనియె.

366


సీ.

ఆదైత్యనాథువధార్థమై హరి నారసింహరూపంబును జెందినపుడు
పరమాత్ముఁ డగురమాపతి యని మది వివేకింపక రాజసోద్వృత్తుఁ డగుచు
మృతిఁబొందె బూర్వసంచితపుణ్యఫలమున దశకంధరుండై ప్రతాపమునను
సకలలోకంబులు సాధింప సర్వకంటక మైనరాజసప్రకృతివలన


తే.

జానకీసక్తచిత్తుఁడై శాశ్వతాప, వర్గ ఫలదాయి యగు రామవసుమతీశు
నధమమానవనాథుఁగా నాత్మఁ దలఁచెఁ, గాని హరి యని తలపోయఁ గానఁడయ్యె.[227]

367


తే.

పూర్వపుణ్యఫలంబునఁ బొలిచినట్టి, యంచితైశ్వర్యసంపద లనుభవింప
నాదిజన్మంబులును జాల కతఁడు చేది, రాజుకులమున శిశుపాలుఁడై జనించె.

368


తే.

అఖిలభూమండలశ్లాఘ్యమైన సకల, భాగ్యమహిమ లవ్యాహతప్రౌఢి ననుభ
వించి రాజసోద్రిక్తుఁడై మించి పూర్వ, జన్మవైరానుబంధంబు సంధిలంగ.[228]

369


ఆ.

పిన్ననాటఁగోలె వెన్నునిఁ జంపుదు, ననుతలంపుఁ దన్ను నతఁడు వెదకి
యేమఱించివచ్చి యెప్పుడు చంపునో, యనుతలంపుఁ గలిగి యాతఁ డుండె.

370


ఉ.

పిమ్మట వారిముందర నుపేంద్రునిఁ గైకొన కచ్యుతాదినా
మమ్ము లుపన్యసించి పలుమాఱును నవ్వుచు నిందసేయుచి
త్తమ్మునఁ దద్విరోధగతి దప్పక యోజనసేయుచుండి ని
త్యమ్మును నాత్మరక్ష విదితంబుగఁ జేయుఁ దదీయభీతుఁ డై.

371

వ.

ఇట్లు మనోవాక్కాయకర్మంబులందును.

372


సీ.

ఇంద్రనీలచ్ఛాయ నేపారుమేనును బంగారుచాయలపచ్చడంబు
వెలిదమ్మిపువ్వులఁ దెగడునేత్రమ్ములు చక్కనిపీనవక్షస్స్థలంబు
కౌస్తుభమణితోడి గ్రైవేయకంబును మృగనాభితిలకంబు మెఱయుమోము
శార్ఙ్గగదాశంఖచక్రహస్తంబులు లాలితస్త్రీవత్సలాంఛనంబు


తే.

కటకకంకణమణిముద్రికాకిరీట, హారకేయూరమణికుండలాభిరామ
మైనకృష్ణునిదివ్యరూపాతిశయము, మఱపుపుట్టక తలఁచు నమ్మనుజవిభుఁడు.[229]

373


వ.

ఇవ్విధంబున నవ్వాసుదేవుని వైరాను భావంబునఁ బర్యటనభోజనస్నానాసన
శయనాదికాలంబులను జాగ్రత్స్వప్నసుషుప్త్యాద్యవస్థలయందును తదాసక్త
చిత్తుండై యుండె.[230]

374


సీ.

ఉదయించి వచ్చుఖద్యోతబింబము శౌరిచక్రమో యని భీతి సంచలించు
శక్రచాపముతోడి జలధరం బుఱిమిన హరిశార్ఙ్గగుణనాద మని కలంగుఁ
బరిపూర్ణచంద్రబింబము వాసుదేవుని పాంచజన్యం బని భ్రమత నొందుఁ
బొలుచు నీరదవిధంబులు విష్ణుకౌమోదకీనందకములని దీనుఁ డగును


తే.

నపరసంధ్యారుణం బైనయాకసంపుఁ, గనకవస్త్రంబు విష్ణుదిగాఁ దలంచు
సంతతంబును వేఱొకచింత లేక, బాల్యమునఁగోలె నాశిశుపాలనృపతి.[231]

375


వ.

ఇవ్విధంబునం బరమార్థతత్వభావుం డయినయవ్వాసుదేవునియందు లయం
బయినచిత్తంబుతో నుండి యంతరంగంబున సంగరోద్వృత్తుండై భగవద్ధస్తనిర్ముక్త
చక్రధారావిదారితమస్తకుండై సకలకలుషంబులం బాసి సాయుజ్యంబునుం
బొందెను.[232]

376


క.

రిపులకు నీగతి మోక్షము, కృపసేయ సమర్థుఁ డైనకేశవునకు న
చ్చపుభక్తితో భజించిన, ప్రసన్నులకు నొసఁగు టరిది పనికాదు సుమీ.[233]

377

వ.

అని పలికి వెండియు తరువాతికథావిధానం బెఱింగించువాడై యిట్లనియె.

378


తే.

రమణరోహిణీదేవకీప్రముఖసతుల, బ్రీతితో వసుదేవుండు పెండ్లియాడ
నందు రోహిణీదేవికి నాదిరుద్ర, మూర్తి సంకర్షణుండు రాముఁడు జనించె.[234]

379


వ.

ఆబలభద్రవంశపరంపర లనేకంబు లయ్యె.

380


తే.

దేవకీదేవి కావసుదేవునకుఁవగు, మారషట్కంబు జనియించి వారలెల్లఁ
గంసుచేఁ జచ్చి రేడవగర్భమునను, యోగనిద్రను సిద్ధి నచ్యుతుఁడు నసుప.

381


వ.

వచ్చి దేవకీదేవిగర్భంబున నున్నయర్భకుం గొనిపోయి రోహిణీజఠరంబున నునిచె
నిట్లు సంకర్షణభావంబు నొందుటం జేసి బలభద్రుండు సంకర్షణుండయ్యె. అంత
నెనిమిదవగర్భంబున సకలజగన్మహాతరుమూలభూతుండును, అతీతానాగతవర్త
మానకాలసమేతుండును, సమస్తసురాసురమునిజనజ్ఞానగోచరుండును, మహీ
భారావతరణమనుష్యకర్మసమాచరణుండును, నిరంతరకృపావర్ధిష్ణుండును, నైన
కృష్ణుండు పుట్టె.[235]

382


ఆ.

యోగనిద్ర హరినియోగంబునను నందు, కాంత యగుయశోదగర్భమునను
జనన మొందెఁ గాళి యనుమహాశక్తియై, పుడమిజనులచేతఁ బూజనొనుచు.[236]

383


వ.

కృష్ణుండు పదాఱువేలు న్నూటయెనమండ్రుభార్యల వివాహంబై వారియందు
లక్షయం నెనుబదివేవురుకుమారులం బడసి, వారిపుత్రపౌత్రవర్గంబు లసంఖ్యం
బులయ్యె. ఇట్లు యాదవవంశవిస్తారంబు వేఱువేఱు నుపన్యసింప నూఱుసంవత్స
రంబులు చెల్లు.

384


క.

పదివేలును పదివేలును, మొదలన్ గుణియించి నియుతమున నది నిహతం
బొదవింపఁగ నగు సంఖ్యలు, యదువీరప్రముఖు లైనయవనీనాథుల్.

385


ఉ.

సంగరభూమియందు మును చచ్చినదానవదైత్యదేవతా
పుంగవు లందఱు ధరణిఁ బుట్టిరి యాదవవంశ్యులై ధరి
త్రిo గడుసాధుబాధ లొనరించుచు నుండిరి తత్కులంబులో
నం గులదీపకుండు యదునాథుఁడు కృష్ణుఁడు మించెఁ బుణ్యుఁడై.[237]

386


వ.

మఱియు యయాతి రెండవపుత్రుం డైనదుర్వసువంశంబు తండ్రిశాపంబునఁ
బౌరవకులంబునం గలసె. ద్రుహ్యువంశంబురాజులు మ్లేచ్ఛకిరాతధర్మంబులం

బొందిరి, అనువంశసంభవు లయ్యంగవంగకళింగాదిరాజపరంపరలై విస్తరిల్లిరి.

387


క.

ధీరుఁడు యయాతి ధరణీ, భారధురంధరునిఁ గాఁగఁ బట్టము గట్టెన్
సౌరభ్యఘనయశఃక, ర్పూరున్ గారుణ్యహృదయపూరున్ బూరున్.

388

పౌరవవంశానుక్రమము

వ.

అట్టిపూరునకు జనమేజయుండును జనమేజయునకుఁ బ్రచిన్వంతుండు నాతనికి
ప్రవీరుండును ప్రవీరునకు సుమనసుండును అతనికి సుద్యుమ్నుండును వానికి
బహుగుండును నతనికి సంయాతియు వానికి సహంయాతియు వానికి రౌద్రా
శ్వుండును రౌద్రాశ్వునకు ఋతేపుప్రభృతులు పదుండ్రును బుట్టిరి. అందు ఋతే
పునకు రంతినారుండును వానికి సుమతియు నప్రతిరథుండును ధ్రువుండును అంతి
నారుండు నననలువురు పుట్టిరి. అప్రతిరథునకుఁ గణ్వుండును కణ్వునకు మేధాతిథి
యునుం బుట్టిరి. వానివంశపరంపరలు కాణ్వాయనులను బ్రాహ్మణులైరి. మఱియు
నప్రతిరథునకు నైలీనుండు పుట్టె, వానికి దుష్యంతుండును నతనికి భరతుండును
నతకి బృహత్క్షత్రుండును నతనికి సేనజిత్తుండును నతనికి బ్రహ్మదత్తుండును నతనికి
జయత్సేనుండును నాతనికిఁ గురుండును నతనికి దిలీపుండును దిలీపునకుఁ బ్రతీపుం
డును ప్రతీపునకు దేవాపిశంతనుబాహ్లికులును శంతనునకుఁ జిత్రాంగదవిచిత్ర
వీర్యులునుం బుట్టి రందుఁ జిత్రాంగదుండు బాల్యంబునఁ జిత్రాంగదుం డనుగంధ
ర్వునితోడ యుద్ధంబు చేసి హతుండయ్యె విచిత్రవీర్యుండు.

389


ఆ.

కాశిరాజకన్యకల నంబికాంబాలి, కల వివాహమై వికాసవీలఁ
దదుపభోగరతులఁ దగిలి క్షయవ్యాధిఁ, బొంది యతఁడు దినిజపురికి నరిగె.

390


వ.

అంత సత్యవతీనియుక్తుండై కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబిక
యందు ధృతరాష్ట్రుని నంబాలికయందుఁ బాండురాజును విచిత్రవీర్యునిభోగస్త్రీ
యందు విదురుం బుట్టించె నందు ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధన
దుశ్శాసనప్రముఖులు నూర్వురు పుట్టిరి. పాండురాజునకుఁ గుంతీమాద్రుల
యందు ధర్మానిలశక్రాశ్వినులవరంబున యుధిష్ఠిరభీమార్జుననకులసహదేవు
లనంగా నేవురు పుట్టిరి. వారలందఱకుఁ బాంచాలి ధర్మపత్ని యయ్యె. దానియం
దు ధర్మరాజునకుఁ బ్రతివింద్యుండును భీమసేనునకు శ్రుతసోముండును
నర్జునునకు శ్రుతకీర్తియు నకులునకు శతానీకుండును సహదేవునకు శ్రుతధర్ముండు
నను నుపపాండవులు పుట్టిరి. మఱియు ధర్మరాజునకు నౌధేయియందు దేవకుం
డును భీమసేనునకు హిడింబయందు ఘటోత్కచుండును నకులునకు రేణుమతి
యందు నిరమిత్రుండును సహదేవునకు విజయయందు సుహోత్రుండును అర్జు

నునకు నులూచియందు నిలావంతుండును చిత్రాంగదయందు బభ్రువాహనుండు
ను సుభద్రయందు నతిబలపరాక్రముం డైనయభిమన్యుండును అభిమన్యునకు
విరాటపుత్రి యైనయుత్తరయందు పరీక్షిత్తుండును బుట్టిరి. ఆపరీక్షిత్తుండు వర్త
మానకాలంబున రాజ్యంబు చేయుచున్నవాఁడు. అట్టి పరిక్షిత్తునకు మహాధర్మ
శీలుం డైనజనమేజయుండు పుట్టి వేదవ్యాసశిష్యుం డైనవైశంపాయనువలన
శ్రీమహాభారతంబు విని యనేకయజ్ఞంబులు సేసి సాంప్రతంబున రాజ్యంబు సేయ
నున్నవాడుఁ మఱియును.[238]

391


ఆ.

భూతవర్ధమానభూపాలకులనెల్ల, వింటి తేటపడ భవిష్యదవనీ
పతులలోన ఘనులఁ బ్రకటించి చెప్పెద, వినుము సావధాన విమలబుద్ధి.

392


క.

జనమేజయుండు త్రిజగ, జ్ఞానవినుతుం డైనయాశతానీకుని బు
త్రునిఁ గాంచు నమ్మహీపతి, జనకునిచందమున ధర్మసంతతి నమరున్.

393


ఆ.

యాజ్ఞవల్కివలన నధ్యయనముఁ గృపా, చార్యువలన నస్త్రశస్త్రములును
శౌనకమునివలన సచ్చిదానందవి, ద్యలు నెఱంగు లోకములు నుతింప.

394

కలియుగదోషాదివివరణము

వ.

అట్టి సూర్యసోమవంశంబుల రాజపరంపరలు కలియుగంబునఁ గొంతకాలంబు
నకు హీనబలులై యల్పవైభవంబుల రాజ్యంబులు సేయుచుండి తమతమయధ
ర్మవర్తనంబుల వినాశంబై పోవంగలవారు. వారిప్రధానులు స్వామిద్రోహం
బులు సేసి రాజ్యంబులు గైకొని యేలంగలవారు. మూర్థాభిషిక్తు లైనరాజన్యుల
వెడలనడిచి గంగాప్రయాగమధ్యదేశంబులు పద్మవర్యులనుమాగధు లేలం
గలవారు నర్మదాతీరదేశంబుల వ్రాత్యు లైనబ్రాహ్మణులు చేకొనంగలవారు.
చంద్రభాగాతీరంబు లైనకాశ్మీరదేశంబు లాభీరు లేలంగలవారు. వీరలెల్ల తుల్య
కాలవ్యవహారవయోధర్మపరాయణులై యుండెదరు.

395


క.

అల్పప్రసాదములుఁ గడు, నల్పవివేకములు నాయు వల్పము ముఱి య
ల్పాల్పపరిజ్ఞానంబులు, నల్పము లగువైభములు నగు రాజులకున్.[239]

396


ఉ.

కోపము దుర్వివేకమును క్రూరతయున్ జపలత్వమున్ మన
స్తాపము దుష్టవృత్తియును ధౌర్యము చౌర్యము హీనభావమున్
బాపము గల్గు మర్యులకుఁ బాడియుఁ బౌరుషమున్ బ్రతాపమున్
దాపసముఖ్య లేదు వసుధన్ గలికాలము పోవునంతకున్.[240]

397


వ.

మెలఁకువ లధమాధమములు, పలుకు లసత్యములు లేవు పౌరుషములు నే
ర్పులు రిత్తబ్రతుకులు తఱచు, గలవని చెప్పంగరాదు కలియుగవేళన్.[241]

398

క.

ఆవులఁ బడిఁ బొడుచుటయును, స్త్రీవధ లొనరించుటయును శిశువుల హత్యల్
గావించుటయును నైజము, లై వెలయును జగమునందు నఖిలజనులకున్.[242]

399


సీ.

పరధనపరదారహరులు నల్పాల్పసారులున్ మృతప్రాయమూర్తులు నసత్య
వచనులు పాషండవర్తనులును భూమిఁ దఱచుగాఁ గలరు వేదములు యజ్ఞ
తతులును లేవు సంతతము నుత్తమవంశజాతులు మ్లేచ్ఛకిరాతవ
రాదుల సేవించి యధమాధమము లైనపను లాచరింపుదు రనదవృత్తి


తే.

బలిమిగలవాఁడె రాజు సంపదలు గలుగు, నతఁడె మాన్యుఁడు సభల మాట్లాడనేర్చు
నతఁడె పూజ్యుండు కొల్చినయతఁడె హితుఁడు, జనుల కెల్లను గలియుగసమయమునను.[243]

400


వ.

మఱియు ధనంబ కులాభిజాత్యహేతువు బలంబ ధర్మహేతువు మనోహరంబ
దాంపత్యహేతువు శౌర్యంబ వ్యవహారహేతువు స్త్రీత్వంబ యుపభోగహేతువు
లింగధారణంబ యాశ్రయహేతువు అన్యాయంబ వృత్తిహేతువు దౌర్బ
ల్యంబ యధమహేతువు దానంబ ధర్మహేతువు స్వీకారంబ వివాహహేతువు
సద్వేషధారణంబ పాత్రహేతువు నై యనేకభీషణదోషనిశేషంబులు సమస్త
వర్ణంబులయందును గలిగియుండు. మనుష్యులకు నూటయిరువదివత్సరంబు
లాయువు పరిమాణం బగు మధుశాకమూలపత్రపుష్పాదు లాహారంబుగాఁగల
యవి తరువల్కలాజినపర్ణంబులు వస్త్రంబులగు నొక్కొకరికి బహుప్రజావృద్ధి
యగు దానం జేసి శీతవాతపీడితులు గాఁగలవారు. శ్రౌతస్మార్తంబులు విప్లవంబు
లుగాఁ గలయవి యిట్టివర్తనంబులు గలకలికాలంబునందు.[244]

401


ఉ.

భూమిని ధర్మముల్ నిలుపఁ బూని ముకుందుఁడు సర్వలోక
రక్షామణి భక్తవత్సలుఁడు సాత్వికబుద్ధి యెలర్ప శంబళ
గ్రామమునన్ బ్రధానుఁ డను బ్రాహ్మణునింట జనించుఁ గల్కియై
యామహనీయమూర్తి తెగటార్చును మ్లేచ్ఛకిరాతజాతులన్.

402


మ.

నిజధర్మంబున వేదముల్ ధరణిపై నిండన్ బ్రతిష్ఠించి సా
ధుజనవ్రాతము నాదరించి యొకచో దోషంబు లేకుండఁ జే
సి జగంబుల్ పరమానురాగమునఁ దాఁ జెందించువాఁడై యథో
క్షజుఁ డుండున్ బటుసాత్వికస్ఫురణతోఁ గల్కిస్వరూపంబునన్.[245]

403

తే.

కలియుగము దీఱి కృతయుగకాలమైన, ధర్మమార్గంబు నాల్గుపాదముల నడచు
ననిమిషులు భూమి కరుదెంచి మనుజకోటిఁ, గలసి వర్తింతు రత్యంతగౌరవమున.[246]

404


క.

కలియుగదోషములకుఁ గడు, నులికి తపము లాచరించుచున్ననరేంద్రుల్
నలినాప్తసోమవంశజు, లెలమిన్ దొల్లింటియట్ల యేలుదు రవనిన్.[247]

405


వ.

అని యిట్లు సూర్యసోమవంశానుచరితంబులపరిపాటి నెఱింగించి పరాశరుండు
వెండియు నిట్లనియె.[248]

406


మ.

విను మైత్రేయ జనార్ధనాంశభవులై విశ్వంభ రామండలం
బున ధర్మస్థితి నుల్లసిల్లి మహిమన్ బొల్పారుభూపాలుర
న్వినినన్ బేర్కొనినన్ శుభంబు లొదవున్ నిత్యంబు యజ్ఞంబు చే
సినపుణ్యంబులు గల్లు మానవులకు శ్రీమీఱ నేకాలమున్.[249]

407


సీ.

ఇక్ష్వాకుమాంధాతృఋతుపర్ణయువనాశ్వసగరశంతనుహరిశ్చంద్రనహుష
రామలక్ష్మణభగీరథశశిబిందుభార్గవనిమిసంయాతికార్తవీర్య
నలరంతిదుష్యంతనాభాగముచికుందపురుకుత్సవైదేహపూరుభరత
రఘుదిలీపసుహోత్రరంతిపురూరవజ్యామఘతృణబిందుసోమదత్త


ఆ.

భీష్మధర్మపుత్రభీమభీబత్సపాం, చాలకేకయవైరాటసత్యసేన
ముఖ్యనృపులచరితములు విన్నఁ బేర్కొన్న, మహితశుభము లొదవు మానవులకు.

408


వ.

ఇట్లు సూర్యసోమవంశాధిపతులం జెప్పి మఱియును.

409


ఉ.

చాటుతరప్రబంధకవిసన్నుత సంగరపార్థ ధీరతా
హాటకశైల నిత్యవినయప్రతిభావిభవాఢ్య భూమిభృ
త్కూటగుహాపహిత్థనృపకుంజర సంగడిరక్షపాల క
ర్ణాటనరేంద్రదత్తసముదంచితశాశ్వతరాజ్యవైభవా.[250]

410


క.

రాజీవనయనపదయుగ, రాజీవభ్రమరశత్రురాజన్యరమా
రాజీవకుముదబాంధవ, రాజీవహితప్రతాప రాజీవముఖా.[251]

411

శాంతి.

బాహువిక్రమప్రతాపబాహులేయసంగరో
త్సాహ సాహసాభినేయసావాసాంక సర్వస
న్నాహవాహినీసమేత నవ్యకీర్తిచంద్రికా
రోహిణీహృదీశ దాసరోహణావనీధరా.[252]

412


గద్య. ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెల
గంటి సూరయనామధేయప్రణీతం బైన ఆదిమహావురాణంబగు బ్రహ్మాండంబు
నందలి పరాశరసంహిత యైనశ్రీవిష్ణుపురాణంబునందుఁ జంద్రుండు బృహస్పతి
పత్ని నపహరించుటయు పురూరవుకథయును రుచికుండు సత్యవతి వరించుటయు
విశ్వామిత్రజమదగ్నులజన్మంబును రజిపుత్రు లింద్రునిరాజ్యం బపహరించుటయు
యదువంశకీర్తనంబును జ్యామఘుచరితంబును శమంతకరత్నోపాఖ్యానంబును
వసుదేవాదియాదవులజన్మంబును పౌరవవంశకీర్తనంబును పాండవ
క్రమంబును కలియుగధర్మంబు నన్నది షష్ఠాశ్వాసము.


————

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. శ్రీజనకజనకనిభవిభాజికగాంభీర్యసామరభ్యవివేక = లక్ష్మీదేవికి తండ్రియైన సముద్రుని బోలి ప్రకాశించునట్టి గంభీరభావంబును జనకచక్రవర్తిని బోలి ప్రకాశించునట్టి సామరస్యముతోడి వివేకంబును గలవాఁడా, జగనబ్బగండ = ఇది బిరుదుమాట, విరాజితకరుణాకలాప = ప్రకాశించునట్టి దయయే ఆభరణముగాఁ గలవాఁడా.
  2. స్రష్ట = సృష్టికర్త.
  3. శతపత్రభవాంశంబునన్ = బ్రహ్మయొక్క అంశమును, బంధుర = అధికమైన.
  4. సమధికనిష్ఠాకల్యాత్ముఁడు = మిక్కుటమైననిష్ఠతో శుభస్వరూప(నిర్మల)మైన మనసు గలవాఁడు, పద్మయోనికిన్ = బ్రహ్మను గూర్చి.
  5. అమృతప్రేక్షణకిరణములకున్ = అమృతమును చిలుకుచున్నకిరణములకును.
  6. గృహిత్యము = గృహస్థునితనము, దాక్షాయణులన్ = దక్షునికూఁతులను.
  7. బెరయుచున్ = అతిశయించుచు.
  8. వనజవిరోధియున్ = చంద్రుఁడును, చెలువంబు = సౌందర్యమును, వలవంతలు = మోహములు, పెంపుతోన్ = గౌరవముతో.
  9. పుట్టము =- వస్త్రము, కమ్మ = మధురమైన, కలికి = విలాసయుక్తములైన, కజ్జలంబు = కాటుకను, తుఱిమి = లోపల చొప్పించి - ముడిచి, పాలిండ్లన్ = స్తనములయందు, రవళి = ధ్వనించుచున్న. రాయడింపన్ = ఒరయఁగా - హెచ్చఁగా ననుట, ఇందుబింబాస్య = చంద్రబింబమును బోలిన మొగముగలది.
  10. తరళతారానయనన్ = తిరుగుచున్న నల్లగ్రుడ్లతోఁ గూడినకన్ను గలదానిని.
  11. మదనాతురుండు = మన్మథునిచే పీడింపఁబడినవాఁడు.
  12. తిలకించున్ = చూచును, కిలికించితాదులన్ = కిలికించితము మొదలుగాఁగల శృంగారచేష్టలను [కిలికించితము = సంతోషరోషాశ్రుభయాదుల కలయిక], గెల్లుచూచున్ = నిక్కి చూచును, నిగ్గులుదేఱు = నిగనిగలాడు, ఏకాంతము = రహస్యము, ఆనన్ = త్రాగ, తివురున్ = యత్నించును, భిన్న = భేదింపఁబడిన, తగులు = పొందునట్టి.
  13. సమేలంపు = కలగలుపుగల, మేలమాడున్ = సరసములాడును, కలికినేఁతలకున్ = విలాసచేష్టలకు, వలకారితనమునన్ = మోహముగల స్వభావముతో, వన్నెబెట్టున్ = అలంకరించుకొనును. అన్యాపదేశంబులు = వేఱొకదాని జూపి తనయభిప్రాయమును దెలుపునట్టిమాటలు, నర్మోక్తులు = శృంగారహాస్యాస్పదములైన ప్రియవాక్యములు, తీఁగసాగన్ = దీర్ఘధ్వని కలుగునట్టుగా.
  14. మేలములు = పరిహాసపుమాటలు, చేలము = వస్త్రము, విరాళితనంబులన్ = ఆసక్తతలతో.
  15. ఇరవుగన్ = విశదముగా.
  16. చెంగలింపన్ = వ్యాపింపఁగా, వాలిక = వాలుగల, పిఱువీఁకులు = పీఁకుపీఁకుళ్లు, ముత్పులకదంతురపఙ్క్తులు = సంతోషమువలనఁ గలిగినగగుర్పాటుయొక్క యెక్కుడైన చాళ్లు, నివ్వటిల్లఁగన్ = అతిశయింపఁగా.
  17. తలిరాకులవిత్తై = చిగురుటాకులపరంపర గలదై - చిగుళ్లను కత్తులచేతిబాధచే చలించినదై యనుట, తమకించుటయున్ = వేగిరపడఁగా.
  18. పరికింపక = విచారింపక, విధుఁడు = చంద్రుడు, పైకొని = పైఁబడి.
  19. కమ్మ = పరిమళముగల, చక్కెరమోవులు = చక్కెరవలె మాధుర్యము గలయధరములును, ముద్రలు = చిహ్నములు, పక్కులతోడి = పెల్లలతోఁ గూడిన.
  20. చేఁతలు = చేష్టలు, ప్రకాశంబు = ప్రసిద్ధము.
  21. తొడుకపొమ్ము = తోడుకొనిపొమ్ము, జైవాతృక = చంద్రుఁడా.
  22. మరులేచి = మోహ మతిశయించి, నిరుపాధికంబులు = చింతలేనివి, నిరాతంకంబులు = భయము లేనివి, సాంగముగాన్ = తుదముట్ట.
  23. కోలుపడి = పోఁగొట్టుకొని, ధౌర్త్యము = ధూర్తత్వము, వృషుండు = ఇంద్రుడు, భీషణకోపవేష్టితాధరుఁడు = దారుణమైన కోపముచేత చుట్టఁబడిన (అదరుచున్న) పెదవులు గలవాఁడు, కొఱగామి = చెఱుపు - దుష్కార్యము.
  24. పరద్వారంబు = అన్యమార్గమును - అక్రమమును, వీఱిఁడిన్ = దుష్టుని, ఒగిన్ = క్రమముగా.
  25. సంభావనలు = మర్యాదలను.
  26. కువలయానందప్రభావంబులు= భూమండలమునకు సంతోషము పుట్టించునట్టి మహిమలు - కలువలకు వికాసము గలుగఁజేయునట్టి మహిమలు అని యర్థాంతరము, దివిజాభీష్టఫలప్రదానగుణములు = దేవతలు కోరినఫలములను ఇచ్చునట్టి గుణములు - దేవతలకోరికదీర అమృతమును వర్షించునట్టి గుణములను, సత్పథవ్యవహారస్థితి = మంచిమార్గమును అనుసరించినవాఁడు అను వాడుకయొక్క రీతిని - నక్షత్రవీథియందు మెలఁగుటను అని యర్థాంతరము.
  27. యామినీశ = చంద్రుఁడా, దుర్వివేకములు = వివేకముమాలినపనులు, ఒప్పములు = చెడ్డవి.
  28. తప్పు చేసి = తప్పుగా నేర్పఱిచి, అంపెనఁటే = పంపెనా, తనచేతలు = ఆయింద్రుని చేష్టలు.
  29. కాయజుచేత = మన్మథునిచేత, శప్తుఁడై = శపింపఁబడినవాఁడై.
  30. ఉల్లసములు = మర్మభేదములైన పరిహాసపుమాటలు.
  31. నిలింపగురుని = బృహస్పతియొక్క.
  32. సురేజ్యుదారన్ = బృహస్పతిభార్యను.
  33. పుత్తెంచిన = పంపిన, తెల్లముగాన్ = విశదముగా.
  34. ఉదాసీనులు = అనాదరము చేయఁబడినవారు, ఉపమ = ఉపాయము.
  35. అంగజవైరి = శివునియొక్క, వెంగలి = మూర్ఖుఁడు, గీష్పతి = బృహస్పతి, ఉగ్రుఁడు = శివుఁడు - భయంకరుఁడు.
  36. దివిజానీక = దేవతాసేనతో, చటులవృత్తిన్ = పరుషవ్యాపారముతో, ఉద్యత్కోప...రాకృతి = అతిశయించిన కోపముచేత చక్కఁగా తృప్తినొందింపఁబడి యాదరింపఁబడుచున్న మిక్కిలి భయంకరమైన యాకారము - అధికకోపముచే నైనభయంకరమైన యాకృతి, తలిర్పన్ = వికాసమును వహింపఁగా.
  37. పటుసంగరక్రియాపరిణతిన్ = సమర్థమైన యుద్ధవ్యాపారముయొక్క పరిపూర్తిచేత.
  38. పరిరంభ = ఆలింగనమువలని, శర్వామృతాంశులు = శివుఁడును చంద్రుఁడును, సంగరకళా = యుద్ధ మనెడి విద్యయందలి, ఏపారన్ = అతిశయింప.
  39. ఆసన్న = సమీపించిన, అలంఘనీయము = దాఁటఁదగనిది, ఈషికాస్తంబమధ్యంబునన్ = కసపుగంటనడుమ.
  40. అగ్గలంబుగన్ = అధికముగా.
  41. ఎగ్గు = కీడు - దోషము, లగ్గు = మేలు - శుభము, నెగ్గింపడు = రోఁతపడఁడు.
  42. కుంభీనసక్రోడేభములన్ = ఆదిశేషుని ఆదివరాహమును అష్టదిగ్గజములను, సురేశరతనూభవసోమపంచబాణులన్ = జయంతుని చంద్రుని మన్మథుని.
  43. శాకోట = వెల్లతేఁకుచెట్టు, నీప = కడపచెట్టు.
  44. సొబగు = బాగు, సోడు = బ్రహ్మరంధ్రము, చిమ్మచీఁకట్లు = అధికమైన చీఁకట్లు, బెరయన్ = పొందఁగా.
  45. బాలరసాలంబు మ్రోలన్ = లేఁతతియ్యమామిడిచెట్టునొద్ద, క్రాలు = వర్తించు.
  46. తొలంకు = చిందు, కల్కి = మనోజ్ఞమైన, వలి = వలుదలైన, మవ్వము = ఒప్పిదము - విధము.
  47. దివౌకస = దేవతానంబంధియైన.
  48. ప్రగల్భ= ప్రౌఢమైన, అలజడి = సంకటము.
  49. ఉరణకద్వయ = గొఱ్ఱెపిల్లలజంటయొక్క, అపనేయంబులు = పోఁగొట్టఁదగినవి, నగ్నరూపంబునన్ = దిగంబరత్వముతో.
  50. ఉపకంఠంబునందు = సమీపమునందు, ఏకషష్టసమలు = అఱువదియొక్కయేండ్లు.
  51. నిస్పృహ = ఆపేక్షలేమి.
  52. సమయంబు = ఏర్పాటు, వియోగంబు = ఎడఁబాటు.
  53. అజపోతకంబు = గొఱ్ఱెపిల్ల, విహ్వలధ్వనిన్ = పరాధీనతచేత నైన ఆర్తధ్వనితో, వేల్పుకొమ్మ = దేవతాస్త్రీయైన యూర్వశి.
  54. అభియాతుల = పగవారియొక్క, కాపురుషత్వంబు = కుత్సితపురుషునితనము.
  55. విద్యుద్భ్రమంబున్ = మెఱపుయొక్క చలనమును.
  56. నృపసింధురుఁడు = రాజశ్రేష్ఠుఁడు, శాబకములన్ = పిల్లలను.
  57. పరిభ్రమించుచున్ = తిరుగుచు.
  58. పెక్కువ = ఆధిక్యమును, కుట్మలలములు = మొగ్గలు, గండు = బలిసిన, పిండు = సమూహము,
    తన్వంగి = కృశాంగముగల యూర్వశియొక్క, నెఱి = వక్రత, అభిచరించున్ = అంతట తిరుగును.
  59. ఉన్మత్తవేషంబునన్ = పిచ్చివానివేషముతో, అంభోజసరోవరతీరంబునన్ = తామరలకొలనిదరిని.
  60. చెంగలింపన్ = వికసింపఁగా, వాలిక = దీర్ఘములైన, సమ్మదమును = సంతోషమును, ఉబ్బును = పొంగును, ముత్పులకలు = సంతోషముచే నైన రోమాంచములు, కదిమిన = ఆక్రమించిన.
  61. తావి = పరిమళము, ఊరక = నిమిత్తములేక.
  62. ఉన్మాదముఁ బొంది = పిచ్చిపట్టి, సన్మానము = మన్నన.
  63. వ్యాజమునన్ = నెపముచేత, అలంపుచున్ = శ్రమపెట్టుచు.
  64. చెంగలింపన్ = అతిశయింపఁగా.
  65. ధనదప్రాభవ = కుబేరుని ప్రభుత్వసంపదవంటి ప్రభుత్వసంపద గలవాఁడా, అంతర్వత్నిని = గర్భిణిని.
  66. నివ్వెఱఁగంది = మిక్కిలి యాశ్చర్యమును పొంది, గరువంబునన్ = గౌరవముతో.
  67. విరిదట్టుగన్ = ఎడఁబాయునట్టుగా, గరిమ = గౌరవముతో.
  68. నమ్రమస్తకుండు = మిక్కిలి వంపఁబడినమొగము గలవాఁడు, సాలోక్యంబు = సమానలోకత్వము.
  69. ఆమ్నాయ = వేదములను, త్రిత్వము = మూడుగా నగుట, జగత్పూరంబుగాన్ = లోకపావనముగా.
  70. యథాయోగ్యంబులుగా = తగినట్టు, అనుష్ఠించుచున్ = నడపుచు.
  71. వెల్లివిరిసి = ప్రవహించి, ఆత్మారోపణము చేసి = తనయం దావహింపఁజేసికొని, ధుని = నది, నిశ్శేషముగన్ = మిగులు లేకుండ.
  72. ఇచ్ఛన్ = మనసునందు, ఉద్యత్కృపాయతచిత్తంబునన్ = పుట్టుచున్న దయచేత విశాలమయిన మనసుతో.
  73. లేఖులన్ = దేవతలను, పెంపుతోన్ = గౌరవముతో.
  74. కొంకెన్ = సంకోచించెను.
  75. ఉంకువ = ఓలి - కన్యాశుల్కము.
  76. నవ్వెడు = పరిహసించునట్టి.
  77. వరుణాలయంబునకు = సముద్రమునకు, హరులన్ = గుఱ్ఱములను.
  78. ఐహికము = ఇహలోకకర్మము.
  79. అపత్యార్థమ్ము = సంతానమునిమిత్తము, చరువు = అగ్నియందు వేల్చుటకుఁ దగినపక్వాన్నము, పాకంబు చేసి = వండి, ఈనున్నయెడన్ = ఇయ్య యత్నించియున్నసమయమునందు.
  80. పాత్రములు = తగినవి, సౌమ్యక్షాత్రమంత్రంబులన్ = శాంతతను క్షత్రియులకు ముఖ్యమైన శౌర్యమును కలిగించునట్టి మంత్రములచేత, చరుద్వయంబు = రెండు చరువులు.
  81. లాఁతి =అన్యురాలను, కబళంబు = చరు వనుట.
  82. అఖిలగుణసమగ్రుఁడు = ఎల్ల మంచిగుణములచేతను పూర్ణుఁడు.
  83. ఏపారన్ = అతిశయింప.
  84. బేలు పెట్టి = వంచించి, వీడు పడన్ = మాఱుపడ.
  85. భయదక్షత్రియకర్మఠుండు = భయంకరమైన క్షత్రియకర్మలను నడపువాఁడు, మహాభాగుఁడు = గొప్పతనమును వహించినవాఁడు, వేదాంతవేది = ఉపనిషదర్థముల నెఱింగినవాఁడు, అవనీదేవాన్వయాచారవర్తి = బ్రాహ్మణవంశస్థులనడవళ్లు గలిగి వర్తించువాఁడు, తెల్లంబు = స్పష్టము.
  86. అసహ్యము = సహింపరానిది, వ్రాలి = పడి, భవత్ప్రసాదజనితాత్మజుఁడే = నీయనుగ్రహముఁవలనఁ బట్టిన కొడుకా, అప్రబుద్ధన్ = అజ్ఞానురాలను.
  87. ఆపాదింపుదురు = కలుగఁజేయుదురు.
  88. కొండొక = కొంత
  89. సకల...లోకుఁడు = ఎల్లరాజవంశములను భంగపెట్టుట యనువిద్యతోఁ గూడిన భుజబలముచేత ప్రసిద్ధినొందిన సకలలోకములు గలవాడు, మహీ...శౌర్యుండు = భూభారమును అణఁచునట్టి మహిమ యనెడు కళ ననుసరించిన పనులను నడపునట్టి విష్ణ్వంశమైనపుట్టుకయు వ్యాపారమును శూరత్వమును గలవాఁడు, శంభుకుమారప్రతిమానుఁడు = శివుని కుమారస్వామిని పోలినవాడు.
  90. చాతుర్వర్ణ్యసంప్రవర్తకుండు = బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రు లనెడు నాలుగువర్ణములవారి నడవళ్లను ప్రవర్తింపఁజేయువాఁడు.
  91. శాత్రవమండలేశ్వరులన్ = శత్రురాజులను, త్రిదశేంద్రున్ = ఇంద్రుని.
  92. గెంటి = తొలఁగి, భూపకోటి = రాజసమూహము.
  93. సంగ్రామకేళీ = యుద్ధక్రీడయందు, నాళీకాసనున్ = బ్రహ్మను, సమ్యగ్బుద్ధితో = మంచిబుద్ధితో.
  94. వంక = తట్టు.
  95. దైత్యుల బలికినట్ల = రాక్షసులతో చెప్పినట్టె.
  96. నిలింపులు = దేవతలు, కార్యదాహంబునం జేసి = (పొసఁగిన) కార్యమువలని సంతాపముచేత.
  97. జడియక = తప్పక యనుట.
  98. క్రిందుపడి = అణఁగి, సంభావన = మన్నన, దైన్యవ్యక్తులు = దీనత్వముతోడిమాటలు, పచరింపన్ = ప్రకటింప, కాదు =తగదు, కృపాసందీప్తచేతస్కుఁడు = దయను ప్రకాశపఱుచునట్టి చిత్తవృత్తి గలవాఁడు.
  99. కుటిలవిచార = కపటమైన యాలోచనచేత, పితృధనము = తండ్రి సొత్తు, స్వారాజ్యపదము = స్వర్గరాజ్యస్థానమును - స్వర్గలోకపుదొరతనమును, వీటిపైన్ = పట్టణముమీఁదికి.
  100. ఎందేనిన్ = ఎక్కడనో, మానిపోయేన్ = అణఁగిపోయెను.
  101. మంతనమునన్ = ఏకాంతమునందు.
  102. పురోడాశంబునకున్ = హవ్యమునకు.
  103. వగచి = విచారపడి, అభిచారహోమమున్ = పరహింసాకరమైన హోమమును.
  104. చెల్లుటకు = జరగుటకు, నెక్కొని = పూని, తమ్ముఁదామె = తమకుఁదామె.
  105. రిపులవలనన్ = శత్రువులవలన, ఆప్యాయితయజ్ఞభాగుండు = యజ్ఞభాగములచేత తనువునొందింపఁబడినవాడు - యజ్ఞభాగములచేఁ దనిసినవాఁడనుట.
  106. జరుఁడు = ముసలివాఁడు.
  107. జరాభార = ముదిమియొక్క యతిశయముచేత.
  108. కోఁజాలము = తీసికోలేము, కినిసి = కోపించి.
  109. యథాకాలోపన్నంబులు = తగినకాలములయందు పొందఁబడినవి, సమ్యుత్ప్రకారంబున = క్రమమైనరీతితో.
  110. పొలిసిపోవు = నశింపవు, విపులతరము = మిక్కిలి యధికము.
  111. తృష్ణలచేన్ = ఆశలచే, తగిలి = ఆసక్తులై.
  112. ప్రమద మారఁగ = సంతోష మతిశయించంగా, అనుమానము = ఊహ - అది గావలె ఇది గావలె నని యూహించుట యనుట.
  113. నారాయణుఁడఁట యదుకులసంభవుఁ డయ్యె = నారాయణుండు యదుకులసంభవుఁ డయ్యెనఁట యని యన్వయము.
  114. వర్ణిష్టుండు = వర్ధిల్లుస్వభావము గలవాఁడు.
  115. అభియాతులచేన్ = శత్రువులచేత, అపరాజితత్వమున్ = ఓటమిలేని తనమును, ఎలర్పన్ = చిగుర్ప - పెరుగ.
  116. సప్తాశ్వసదృశతేజోదీప్తుండు = సూర్యునితేజస్సును బోలిన తేజస్సుచేత ప్రకాశించువాఁడు, దీనావనుఁడు = దరిద్రులను రక్షించువాఁడు, జగతీతలమున్ = భూప్రదేశమును.
  117. భవ్యగతిన్ = (లోకమునకు) మేలు గలుగునట్టిరీతితో, అవ్యాహతవిభవయుక్తుఁడు = కొట్టుపడనియైశ్వర్యముతో కూడుకొన్నవాఁడు, అనష్టద్రవ్యులఁగాన్ = చెడనిధనము గలవారినిఁగా - ధనసమృద్ధి గలవారు అగునట్టుగా.
  118. ఊర్జిత = నానాట పెరిగి స్థిరపడిన, తన్పి = తృప్తి నొందించి, ఎలర్చెన్ = వికాసమును వహించెను.
  119. నెమ్మిన్ = నెమ్మదితో.
  120. అఖిలామరవిద్రావణుఁడు = ఎల్లదేవతలను తఱుముఁగొట్టినవాఁడు.
  121. తొట్టు = ఉబుకు.
  122. వఱద = ప్రవాహము, త్రిదశాంతకుఁడు = దేవతలపాలిటి యముఁడైన రావణుఁడు.
  123. ఉద్ధతుఁడు = నిక్కు గలవాఁడు, శతమఖవిరోధిన్ = ఇంద్రునికి పగవాఁడైన రావణుని, భీషణవృత్తిన్ = భయంకరమైనవ్యాపారముతో.
  124. బందిగములోనన్ = చెఱసాలయందు, శృంఖల = సంకెల.
  125. సంస్ఫీతుండు = విజృంభించినవాఁడు.
  126. శాతకుఠారధారావిభిన్నబాహుమస్తకుఁడు = కఱకైనగండ్రగొడ్డటిపాదరచేత నఱకఁబడిన భుజములును తలయుఁ గలవాఁడు, కాంచె = పొందెను.
  127. పంకజహితవిభుఁడు = సూర్యునిం బోలినవాఁడు, నిరాతంకయశుఁడు = కళంకములేని కీర్తి గలవాఁడు, లోకవశంకరుఁడు = లోకమునంత వశవఱుచుకొన్నవాఁడు.
  128. ఒలసిన = పొందిన.
  129. ఆతత = అధికతరమైన, సాధుజనైకవిందుఁడు = సాధువులైన జనులచేతనే తెలియఁబడువాఁడు.
  130. భూపకులావతంసునకు = రాజవంశశ్రేష్ఠునకు.
  131. స్వామి = ఒడయఁడు.
  132. మేలంబునన్ = సరసత్వముతో.
  133. వైరిపతులు = శత్రురాజులు, చూఱలాడఁగాన్ = కొల్లపెట్టఁగా.
  134. దారుణ = క్రూరులైన, శాతనిశిఖాఘాతంబులన్ = తీక్ష్ణములైన బాణముల వ్రేటులచేత, సంక్షోభించి = కలఁతపడి, నానాదిశాంతనితాంతక్షితిభృద్గుహావళులలోనన్ = నలుదిక్కుల కడలయందలి విశాలములైన కొండగుహలపఙ్క్తులయందు, అత్యుద్గతిన్ = అతివేగముగలగమనముతో.
  135. అరాతిచక్రంబు = పగవారిగుంపు, కోశాది = బొక్కసము మొదలగు, పలాయితులైనన్ = పాఱిపోఁగా.
  136. ప్రపూరిత = మిక్కిలి నిండింపఁబడిన, గండస్థలన్యస్తహస్తను = చెక్కిళ్లయం దుంచఁబడినచేతులు గలదానిని, బాష్పాంబునిమజ్జమాన = కన్నీళ్లచేత తడియుచున్న, అంచత్ప్రాయన్ = మనోజ్ఞమైన యావనము గలదానిని, అత్తోపకంఠన్ = పొందఁబడిన సమీపము గలదానిని, (లేక) అంచత్ప్రాయనాత్తోపకంఠన్ = మనోఙ్ఞయౌవనముచేత పొందింపఁబడిన సమీపము గలదానిని, సంత్రాసవిలోలలోచననిరూఢన్ = భయముచేత చలించుచున్నచూపులను వహించినదానిని, ప్రస్తధమ్మిల్లబంధన్ = వీడినకొప్పు గలదానిని, అత్యంతభయాపనేయజనశూన్యన్ = మిక్కుటమైనభయమును పోఁగొట్టునట్టి జనులు లేనిదానిని.
  137. పేరుకొని = పేరు గ్రుచ్చి - తలఁచుకొని యనుట, పరిదేవనంబు = విలాసంబును.
  138. కలుషతామ్రలోచన = కోపముచేత ఎఱ్ఱవాఱినకన్నులు గలది.
  139. వంధ్యను = గొడ్డురాలను, తెరలంబడి = తేఱుకొని.
  140. నేరమిమొఱఁగులు = నేర్పుచాలని వంచనమాటలు.
  141. ధరహానముతోన్ = చిఱునవ్వుతో.
  142. స్వర్భానుఁడు = రాహువు.
  143. నిరంతుఁడు = అంతము లేనివాఁడు.
  144. వార్ధిపరీత = సముద్రముచే ఆవరింపఁబడిన.
  145. వనజాతప్రభవాండపూరితమహాధ్వాంతప్రణాళప్రభాఘనసాహస్రగున్ = బ్రహ్మాండమునందు నిండిన దట్టమైనదీఁకటిని చెఱుచునట్టి వెలుఁగుచేత ఘనమైన వేయికిరణములు గలవానిని, పరమున్ = సర్వోత్కృష్షు డైనవానిని, పరాపరకళాలక్షీకృతున్ = పరావరవిద్యలచేత సాక్షాత్కరింపఁబడినవానిని, చిత్రభానునిన్ = సూర్యుని.
  146. నీరజాప్తుండు = సూర్యుఁడు, దుర్నిరీక్ష్యప్రభలచేతన్ = చూడశక్యముగాని కాంతులచేత.
  147. ఉగ్రాగ్నిపిండోపమంబు = తీక్ష్ణమైన నిప్పుముద్దవంటిది.
  148. గ్రైవేయకము = కంఠభూషణము, కంఠలగ్నము = మెడను పొందినది యగునట్టుగా.
  149. ఈసత్పింగళనేత్రునిన్ = కొంచెము పసుపువన్నె గల కన్నులుగలవానిని, అత్యంతవామనీకృతసమ్యగ్గాత్రునిక్ = మిక్కిలి పొట్టిగా చేయఁబడిన మంచిదేహము గలవానిని.
  150. అశేషదిశాసముద్భాసమానుండు = ఎల్లదిక్కులయందు చక్కగా ప్రకాశింపుచున్నవాఁడు.
  151. భవసంహారునిన్ = పుట్టుకలను మాన్చువానిని, మహీభారావతారక్రియాప్రవణవ్యాజనునుష్యరూపునిన్ = భూభారమును దించుటయనెడుపనియందలి యాసక్తతయనెడు నెపముచేత నైన మనుష్యరూపము గలవానిని, అదభ్రప్రాభవోద్ధామవైభవతేజోవిభవప్రతాపున్ = అల్పము కానిమహిమయు, అధికమైన యైశ్వర్యమును, తేజోవైభవమును, పరాక్రమమును గలవానిని.
  152. దివంబునన్ = ఆకాశమునందు.
  153. త్రికాలవేది = భూతభవిద్యద్వర్తమానము లనెడు మూడుకాలముల నెఱిఁగినవాఁడు.
  154. ఆశ్వాసించి = సమాధానపరిచి.
  155. దీనార్థిజనావనుఁడు = దరిద్రులను యాచకులను రక్షించువాఁడు.
  156. ఉపవర్గ...దోషంబులన్ = మారీఉపద్రవము మొదలగు ఉత్పాతములు మితిమీఱిన వానలు వానలేమి పెనుగాలి వీచుట బహువిధములైన సర్పములవలనిభయము కఱవు నీళ్లు నిప్పు దుర్జనులు శత్రువులు వీరివలని కలఁతపాటు మొదలుగాఁగలలోపములు, అపనీతంబు = తొలఁగింపఁబడినది.
  157. నిశాంతంబునన్ =ఇంట, బలవంతంబు = నిర్బంధముఁ, కొంకి = సంకోచించి.
  158. త్రోచినన్ = విడనాడినను.
  159. తలంకి = వెఱచి.
  160. ఒక్కఁడు = ఒక్కఁడే, వేఁటమైన్ =వేటాఁడుటకొఱకై.
  161. ఋక్షపతి = ఎలుఁగులరాజు.
  162. సామవాదములన్ = మంచిమాటలతో, ఒరసినన్ = కలిగినను.
  163. కెడసిన = చచ్చిన, భల్లూకనిహతపంచాస్యకళేబరము = ఎలుగుగొడ్డుచేత చంపఁబడిన సింహముయొక్క దేహమును, గహ్వరమున్ = గుహను, తోరము = అధికము.
  164. అక్కునన్ = ఱొమ్మునందు, ఉపలాలింపఁగన్ = బుజ్జగింపఁగా.
  165. అంచితప్రభావిభాసితము = ఒప్పిదమైన కాంతిచేత ప్రశాశించునది. నూత్నభానురుచిన్ = బాలసూర్యునివెలుఁగునకు, మాఱుమలయుచున్ = ప్రతిఘటించుచు.
  166. దుర్వారగతిన్ = అడ్డములేనివిధమున, మహారభసముతోడన్ = మిక్కిలితత్తఱపాటుతో, ఆక్రోశించెన్ = ప్రలాపించెను.
  167. గరువంబునన్ = గౌరవముతో, ఈల్గెనొకాకని = చచ్చెనేమో యని, కొనకొని = సాంతముగా.
  168. ఆప్యాయితశరీరుఁడు = బడలిక తీఱిన దేహము కలవాఁడు, అని యొనర్చె= యద్ధము చేసెను.
  169. మల్లు పెనంగునంతన్ = మల్లయుద్ధము చేయునపుడు, ముష్టిహతాంగుఁడు = పిడికిటిపోటులచేత కొట్టువడిన యెల్లయవయవములు గలవాఁడు, తల్లడపాటు = విచారము, బీరమున్ = శూరత్వమును, కట్టిపెట్టి = మాని, భల్లవిభుండు = భల్లూకరాజు, ప్రణమిల్లి = నమస్కరించి.
  170. ఉద్ఘాటించి = చంపి, బెండగున్ = నిస్సారములగును.
  171. నివ్వటిల్లఁగన్ = అంకురింపగా.
  172. అనయము = మిక్కిలి, ఓలలార్చి = తేల్చి, చటులాహవఖేదములు = ఘోరయుద్ధమువలని బడలికలు, పుచ్చివైచినన్ = పోఁగొట్టఁగా.
  173. ఒడికంబుగన్ = ఒప్పిదముగా, ఉపదానము = అరణము, దానవసూదనుండు = రాక్షసులను చంపువాఁ డైన శ్రీకృష్ణుఁడు, లోకవిదితంబుగన్ = ఎల్లజనులకుఁ దెలియునట్లు.
  174. లోకత్రాసంబు = లోకమునకు భయంకరము.
  175. గోపికా...వక్షునకున్ = గొల్లపడుచులయొక్క స్తనములనెడు బంగారుకలశములయందు పూయఁబడినకస్తూరిగందముచేత మనోజ్ఞమై విశాలమైనఱొమ్ముగలవానిని.
  176. ధౌర్త్యంబు = ధూర్తత్వము - ఆకతాయతనము.
  177. సిగ్గుపఱచి = అవమానపఱిచి.
  178. వేచి = కనిపెట్టి.
  179. క్షాత్రంబునన్ = చలముతో.
  180. మతము = అభిప్రాయము - వృత్తాంతమనుట.
  181. తెగి = సాహసించి, మొఱకు = మూర్ఖుఁడైన.
  182. గెంటంజేసెన్ = పోఁగొట్టెను.
  183. సీరిన్ = బలరాముని.
  184. కెడపకుండినన్ = చంపకున్న.
  185. విహ్వలించి = చిత్తస్వాస్థ్యము తప్పి.
  186. ఉద్యోగము - ప్రయత్నము, ఆహవమునకున్ = యుద్ధమునకు.
  187. వెడఁగుందనము = పిచ్చితనము.
  188. దుర్విచారము = చెడ్డయాలోచన.
  189. బిట్టు = మిక్కిలి.
  190. నిశాచరా...చక్రపాణి = రాక్షసరాజులయొక్క యంతఃపురస్త్రీల విధవత్వమునకు కారణమైన ఋజువైనపరాక్రమమును జూపుటకు చక్రమును చేతఁబట్టినవాఁడు, పాపప్రహారప్రకంపితజగత్ప్ర యప్రాణి = పాపమును (తొలఁగ) కొట్టుటచేత వణఁకఁజేయఁబడిన మూడులోకములలోని ప్రాణులును గలవాఁడు, ఫాలపట్టికాసంఘటిత = పట్టెలవంటి నొసళ్లయందుఁ జేర్పఁబడిన, విందుఁడు = తెలిసికొనువారుగాఁ గలవాఁడు.
  191. దాఁపుము = దాఁచిపెట్టుము.
  192. బాస = ప్రమాణము.
  193. గోడిగన్ = ఆడుగుఱ్ఱమును.
  194. ఉద్ధురగతిన్ = మిక్కిలివడిగలనడకతో, దగతోన్ = దప్పితో, ఉపకంఠ = సమీపమునందలి.
  195. రంహన్స్ఫూర్తిన్ = వేగముయొక్క స్ఫురణతో, క్రోశము = ఒకకోసెఁడుదూరము.
  196. బలవద్రిపుమండల = బలవంతులైన శత్రుసమూహములయొక్క, దారుణశాతచక్రమునన్ = భయంకరమై కఱకైన చక్రముచేత, మస్తకముచీర = తలగుడ్డ, పటంబులు = పైబట్టలు, పొడగానఁడ = చూచినవాడు కానేకాకపోయెను - కనఁబడకపోయె ననుట.
  197. మొఱంగి = వంచించి, ఈజాలండో = ఇయ్యఁడో యేమో.
  198. అటమటించుకొంటివి = అపహరించుకొంటివి, పొత్తు = స్నేహము, పొరపొచ్చెము = మిక్కిలి తక్కువైనది.
  199. శంక = సందేహము.
  200. హాలామదోద్వేగలోచనఘూర్ణీకృతుండై = మద్యపానమువలని మత్తుచేత నైన కన్నులయొక్క త్రిప్పుట గలవాఁడై.
  201. మావంతునిచేతన్ = మావటివానిచేత, భద్రదంతావళంబు = భద్రజాతియేనుఁగు.
  202. రేయిపగలు = రాత్రియుఁ బగలును.
  203. వారక = తప్పక.
  204. సవనదీక్షాకవచంబువలన = యజ్ఞదీక్షయనెడు కవచమువల్ల, మారికోపవర్గాధిదోషంబు = మారీ ఉపద్రవము మొదలైనకీడులు.
  205. రాచపాడి = రాజనీతి, ఆగడముగన్ = దుష్టప్రవర్తనముచేత.
  206. ఒప్పములు = ఆపదలు.
  207. దుర్భిక్షము = కఱవు, ధారణ = క్రయనిర్ణయము, గోడుకొనియెన్ = దుఃఖపెట్టెను, త్రెక్కోలు గొనియెన్ = హింసింప నారంభించెను, సంక్రమించెన్ = ఆక్రమించెను.
  208. ప్రతికారము = ప్రతిక్రియ.
  209. కల్మషంబులు = కీడులను, ఆపన్నప్రసవ = కనప్రొద్దు లైనది.
  210. చుట్టలన్ = చుట్టములను.
  211. కొల్చు = ధాన్యము, విరిసెన్ = తొలఁగెను.
  212. త్రవ్వితండములు = అపరిమితములు.
  213. పోనాడి = పరిహరించి.
  214. సముజ్జ్వలా...మానము = మిక్కిలి వెలుగునట్టియెఱ్ఱనికాంతులయొక్క యతిశయముచేత ప్రకాశమానమైన యుదయకాలమునందలి సూర్యబింబముతో పోల్పఁదగినది, దుర్నిరీక్ష్యము = చూడనలవి గానిది, సభా...యోగ్యము = సభయందలి జనులవలన ప్రశంసింపఁబడునట్టి మేలు మేలు అను వాక్కులకుఁ
    దగినది.
  215. జాజ్వల్యమానము = దేదీప్యమానము.
  216. నెఱసిరి = పూర్ణ మైనసంపద.
  217. గొడవలు = అపరాధములు.
  218. తొలంకు = పొంగు.
  219. సంగతి = యుక్తము.
  220. నెయ్యం బొరఁగాన్ = స్నేహ మతిశయింపఁగా, గ్రైవేయకంబునకున్ = కంఠహారమునకు.
  221. మిథ్యాభిశప్తి = అసత్యాపవాదరూపమైన.
  222. ఆనకదుందుభిప్రవాద్యావళిన్ =తప్పెట భేరీ మొదలుగాఁగల వాద్యసమూహమును.
  223. భగినులు = తోడఁబుట్టిన ఆఁడువారు.
  224. పౌరవకులాగ్రణి = పూరువంశశ్రేష్ఠుఁడు, ధర్మానిలవాసవాంశభవులు = యముఁడు వాయువు దేవేంద్రుఁడు వీరియంశములయందు జనించినవారు, ఆనతనైరి = వంపఁబడినశత్రువులుగలవానిని - ఎల్లశత్రువులను లోఁబఱచుకొన్నవానిని.
  225. పిన్ననాటఁగోలెన్ = బాల్యమునుండియు, కొనలు సాగన్ = వర్ధిల్లఁగా.
  226. ముముక్షు = మోక్షాపేక్షగల.
  227. రాజసోద్వృత్తుఁడు = రజోగుణనంబంధమైన నిక్కు గలవాడు, సర్వకంటకము = ఎల్లవారికి బాధకము, రాజసప్రకృతి = రజోగుణయుక్తమైన స్వభావము, సక్తచిత్తుఁడు = ఆసక్తితోడి మనసుగలవాఁడు, శాశ్వత...దాయి = శాశ్వతమైన మోక్షఫలము నిద్చునట్టివాఁడు.
  228. అవ్యాహతప్రౌఢిన్ = కొట్టుపడనిసామర్థ్యముతో, వైరానుబంధంబు = విరోధముయొక్క సంబంధము, సంధిలంగన్ = అనుసరింపగా.
  229. కటకకంకణమణిముద్రికా = అందెలు కడియములు రత్నములు చెక్కినయుంగరములు, అభిరామము = ఒప్పిదమైనది.
  230. పర్యటన =తిరుగుట, తదాసక్త = ఆకృష్ణునియందంటిన.
  231. ఖద్యోతబింబము = సూర్యబింబము, శక్రచాపము = ఇంద్రధనుస్సు, జలధరము = మేఘము, గుణనాదము = అల్లెత్రాటిమ్రోఁత, పొలుచు = కంటికి తోఁచునట్టి, నీరదవిధంబులు = మేఘములయొక్క రీతులు, అపరసంధ్యారుణంబు = సాయంసంధ్యయందు ఎఱ్ఱగాఁ దోచునట్టి, ఆకసంపుఁగనకవస్త్రంబు = ఆకాశమనెడు బంగారుపచ్చడమును, విష్ణుదిగాన్ = విష్ణునిదిగా, సంతతంబును = ఎల్లప్పుడు.
  232. లయంబు = అభేదమై కలసినది, సంగరోద్వృత్తుండు = యుద్ధోత్సాహము గలవాఁడు, భగవద్ధస్తనిర్ముక్తచక్రధారావిదారికమస్తకుండు = భగవంతుఁడైన శ్రీకృష్ణునిచేతినుండి విడువఁబడినచక్రధారలచేత భేదింపఁబడినతల గలవాఁడు, కలుషంబులన్ = పాపములను, సాయుజ్యమున్ = మోక్షమును.
  233. అచ్చపుభక్తితోన్ = స్వచ్ఛమైన భక్తితో, ప్రపన్నులకున్ = శరణాగతులకు, అరిదిపని = దుర్లభమైనపని.
  234. రమణన్ = ఒప్పిదముగా, సంకర్షణుండు = ఎల్లలోకములను లయకాలమునందు చక్కఁగ నాకర్షించువాఁడు.
  235. సంకర్షణభావము = లెస్సగా ఆకర్షించునట్టి భావమును, సకలజగన్మహాతరుమూలభూతుఁడు = ఎల్లలోకము లనెడు గొప్పవృక్షమునకు వేరైనవాఁడు - లోకములకెల్ల ముఖ్యకారణమైనవాఁ డనుట, అతీతానాగతవర్తమానకాలసమేతుండు = కడచినదియు రాఁగలదియు జరుగునదియు నైనకాలములతోఁ గూడుకొన్నవాఁడు - కాలత్రయమునందు నుండువాఁడనుట, మనుష్యకర్మసమాచరణుండు = మనుష్యులు చేయుపనులను నడపువాఁడు.
  236. నియోగంబునన్ = ఆజ్ఞచేత.
  237. సంగరభూమి = యుద్ధభూమి.
  238. దేవరన్యాయంబునన్ = (దేవరేణసుతోత్పత్తి) అనెడు న్యాయముచేత - మఱఁదివరుసచేత,
    సాంప్రతంబునన్ = ఆకాలమందు.
  239. వివేకము = యక్తాయుక్తపరిజ్ఞానము, పరిజ్ఞానము = ఎల్లవిషయములందును సామాన్యమైన తెలివి.
  240. ధౌర్త్యము = ధూర్తత్వము, చౌర్యము = దొంగతనము, హీనభావము = హీనత్వము, పాడి = న్యాయము.
  241. మెలఁకువలు = జాగరూకతలు, రిత్త = వట్టిది - శూన్యము, బ్రతుకులు = బ్రతుకుఁదెరువులు, తఱచు = బహువిధము.
  242. పడఁబొడుచుట= పడఁగొట్టుట - చంపుట, హత్యలు = చంపుటలు, నైజములై = స్వభావసిద్ధములై.
  243. ఆల్పాల్పసారులు = మిక్కిలి యల్పమైనబలముగలవారు, మృతప్రాయమూర్తులు = కొంచెము తక్కువగా చచ్చిన యాకృతిగలవారు, పాషండవర్తనులు = వేదవిరుద్ధములైన నడవళ్లు గలవారు, ధీవరాదులన్ = చేఁపలఁ బట్టి జీవించునట్టి బెస్తలు మొదలగువారిని, అనదవృత్తిన్ = అనాథవర్తనతో.
  244. భీషణ = దారుణములైన, విప్లవంబులు = చెడినవి.
  245. ప్రతిష్టించి = స్థాపించి.
  246. తీఱి = కడచి.
  247. నలినాప్తసోమవంశజులు = సూర్యచంద్రవంశములయందు జనించినవారు.
  248. వంశానుచరితంబులు = వంశములను అనుసరించిన చరిత్రములను,
    పరిపాటిన్ = క్రమముగా.
  249. విశ్వంభరామండలంబునన్ = భూమండలమునందు.
  250. ధీరతాహాటకశైల = ధైర్యముచేత మేరుపర్వతమైన వాఁడా, నిత్యవినయప్రతిభావిభవాఢ్య= స్థిరమైనవినయముతోడి ప్రతిభ కలిమి గలవాఁడా (ప్రతిభ = సమయోచితస్ఫురణగల బుద్ధి), భూమిభృత్కూటగుహావహిత్థనృపకుంజర = కొండకొమ్ములయందును గుహలయందును దాఁగిన రాజశ్రేష్ఠులు గలవాఁడా.
  251. శత్రురాజన్యరమారాజీవకుముదబాంధవ = పగవారైన రాజులయొక్క సంపదలనెడు కమలములకు చంద్రుఁడైనవాఁడా, రాజీవహితప్రతాప = సూర్యునిప్రతాపమువంటి ప్రతాపము గలవాఁడా.
  252. బాహులేయసంగరోత్సాహ = కుమారస్వామిదయిన యుద్ధోత్సాహమువంటి యుద్ధోత్సాహము గలవాఁడా, సాహసాభినేయసాహసాంక = సాహనముచేత అభినయింపఁదగిన విక్రమార్కుఁడుగలవాఁడా - సాహసాంకుఁ డనుబిరుదు వహించి విక్రమార్కునికంటె సాహసముగలవాఁడా యనుట, నవ్యకీర్తిచంద్రికారోహిణీహృదీశ = అపూర్వమైనకీర్తి యనెడు వెన్నెల చేత చంద్రుఁడైనవాఁడా, దానరోహణావనీధరా = దానమునందు రత్నపర్వతమైనవాఁడా.