ఆంధ్ర వీరులు/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక.

సహృదయులారా ?

ఆంధ్రవీరరత్నావళి యను పేరుతో ఆంధ్రులందు బ్రసిద్ధులైన లోకోత్తర పురుషుల జీవితములు కథలుగ వ్రాసి బాలురకు పద్యార్థిదశలోనే మాతృదేశాభిమానము గలిగించుట యుచితమని యీ పుస్తకమును వ్రాయ దొరకొంటిమి. మాయుద్యమము వే. సత్యనారాయణమూర్తి గారి వలన విని వేంకటరాం అండుకో వారు తాము స్వయముగ బ్రకటించి కొందుమనియు ద్వరలో బూర్తిచేయుమనియు, బ్రోత్సహించిరి. వారి యాదరణము నూతగా గొని ఉన్నత పాఠశాలయందలి మా పండిత పదవి యందలి యనుభవమును బురస్కరించుకొని యీ చరిత్ర కథాగ్రంథమును రచించితిమి.

విస్తృతమగు నాంధ్రదేశమునందు బలువురు మహనీయు లుద్భవించిరి. వారి త్యాగదీక్ష, కౌశలము ప్రపంచమునందలి యేజాతీయ నాయకునకు దీసిపోవదనుట కీ చిన్నిపొత్తము సాక్ష్యము గాగలదు. ఆంధ్రవీరుల వికాసము, రాజ్యవిస్తృతి. పతనము క్రమముగా నీపుస్తకమునందు దెలుపబడినవి. ఆంధ్రుల చరిత్రము చాల వఱకు బురాణ యుగమున నజ్ఞాతముగ గున్నదనుటకు జాణక్యుని చరిత్రమును దార్కాణముగ దీసికొన వచ్చును. తరువాత నాంధ్రులు జాతీయతా ధర్మ నిర్వహణ ప్రవీణులై పొందిన మహత్తరమగు నభ్యున్నతికి గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రము దృష్టాంతము. తరువాత బశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు తమలో దాము పోరాడుకొనుటయు జోడులు విజృంభించుటయు జరిత్ర విశేషములు. వీనిని గమనించితిమేని అసల నాంధ్రదేశము నంతయు నేకధాటిగ బాలించిన వీరుడు కులోత్తుంగ ఛోళదేవుడు. ఈతని యనంతరము ఆంధ్రదేశమును జీలికలు గావించుకొని చిన్న చిన్న రాజులు పాలించుటయు బ్రజలలో స్వాతంత్ర్యభావ ముదయించి తమలో దాము పోరాడు కొనసాగిరనుటకు బాలచంద్రుడు ఖడ్గ తిక్కనల చరిత్ర ముదాహరణముగ గొననగును. చీలిపోయిన యాంధ్ర తేజమును గేంద్రీకరించి స్వతంత్రమగు సామ్రాజ్యమును బ్రజా క్షేమకరముగా బాలించిన మహోదారుడు ప్రతాపరుద్ర చక్రవర్తి. ఈతని కాలముననే సమస్త కళలు, భాష ఆంధ్రజాతీయిత అభివృద్ధికి వచ్చినవి. పరాధీన దుర్దశ బ్రాప్తింపవలసి యుండుటచే నీ చక్రవర్తి బంధీకృతుడు గావలసి వచ్చినది. ఈయన యనంతరము దేశీయువీరులు చిన్న చిన్న రాజ్యములు స్థాపించి యెటుల నభివృద్ధిమార్గముల నన్వేషించిరో బ్రాహ్మణు వీరు లెటుల సామ్రాజ్య నిర్మాణమునకు దోడుపడిరో తెలిసికొనుటకు హరిహరరాయల బుక్కరాయల మాధవవిద్యారణ్యుల చరిత్ర సంగ్రహము సాధనము కాగలదు. ఆంధ్రసామ్రాజ్యము పునరుద్ధరించి తనకత్తి కెదురులేకుండ బోయినతావున నెల్ల జయము నొంది ద్రవిడాంధ్రోత్కలు దేశములను లోగొని ఆంధ్రదేశమును యపనులపాలుగాకుండ గాపాడినది శ్రీకృష్ణదేవరాయలు.

ఈ మహాత్ముని వాజ్మయసేవ, దేశసేవ, మాతృదేశాభిమానము నద్వితీయము. సమగ్రమగు నాంధ్రత్వ మంతయు నితనియెడ నిండి నిబిడీకృత మయ్యెను. ఆంధ్రుల పతనమునకు సూచనలు కృష్ణదేవరాయల తుది కాలము నుండియే యేర్పడెను. తరువాత నేకామిషవాంఛతో హిందూ మహమ్మదీయులకు రాజకుటుంబమునకు గలతలు సంభవించెను. అన్నింటిని సవరించి రాజ్యము పునరుద్ధరించిన వాడు రామరాజు. పూర్వులకంటె నీత డత్యున్నత వహించెను గాని యీతడు ఘోర మృత్యు ముఖమున నదృశ్యు డగుటతో నాంధ్రుల సంపద, పెంపు, ఉన్నతి నసించెను. ఇవియే పరాధీనతకు మొదటి దినములు. తరువాత నెంత వీరుడేని స్వతంత్రరాజ్యము స్థాపింప వీలు లేకపోవుటయు బరస్పరాసూయలు ప్రజల టయు ధర్మ సంస్థాపనార్థము వీరు లాత్మార్పణము గావించుటయు యాచశూరుని చరిత్రమువలన దెలియును. అంతటితో ఆంధ్రుల స్వాతంత్ర్య వికాసము కడబట్టి చిన్న చిన్న జమీనులతో దృప్తిపడవలసి వచ్చినది. మొగలు రాజ్యములలో నొకటగు గోలకొండ రాజ్యమునందు మంత్రులుగ నుండి ఆర్షధర్మములను యవనులు ద్రోహము గావింపకుండ జెల్లెలి కట్టవలె నడుపడి మంత్రిపదవిని నామమాత్రముగా నుంచుకొని ఆంధ్రదేశము నేక హేలగా బాలించిన యక్కన్న మాదన్నలనాడు మఱల నాంధ్ర వికాసము తలయెత్తినది. దురాగతులగు రాజద్రోహులచే మిగుల ఘోరముగా అక్కన్న మాదన్న లేనాడు గోలకొండ రాజవీధిలో జంప బడిరో ఆంధ్రజాతీయ పతనము దర్శింపజాలక యాత్మ రక్తముతో నాంధ్రమాత పదము లభిషేకించి యేనాడు అక్కన్న మాదన్నలు త్యాగము ప్రకటించిరో యానాటితో నాంధ్రులు చరిత్రశరణ్యులై పూర్వ వికాసము నంతయు గోలుపోయిరనియు నాటినుండి స్వతంత్ర రాజ్యస్థాపకుడగు వీరుడు జనింప లేదనియు నెఱుంగనగును.

ఈవిధముగా గ్రీస్తుశకము పూర్వము నుండి పదునెనిమిదవ శతాబ్దము వఱకు గల సంగ్రహచరిత్ర యీగ్రంథమున నిముడ్పబడెను. ప్రకాశకు నీ పొత్తములు ఆంధ్రవీర రత్నావళి అనుటకంటె ఆంధ్రవీరు లనుట యుక్తమని పేరు మార్చుటలో స్వతంత్రించిరి. ఈ చిన్ని పుస్తకము ఆంధ్రుల హృదయమున నాంధ్రప్రతిభను ద్యోతకము చేయునేని ధన్యులము. గ్రంథము గ్రాంథికభాషలో జరిత్రానుకూలముగ వ్రాసితిమని పాఠకులకు విన్న వించుచున్నారము.

ఇట్లు భాషాసేవకులు

శేషాద్రి రమణకవులు.

శతావథానులు

నందిగామ

29-4-1927


_______