ఆంధ్ర రచయితలు/శృంగారకవి సర్వారాయ కవి

వికీసోర్స్ నుండి

శృంగారకవి సర్వారాయ కవి

1864-1939

ఆరువేలనియోగి శాఖీయుడు. ఆపస్తంబసూత్రుడు. కౌండిన్యస గోత్రుడు. తల్లి: రామాంబ. తండ్రి: పల్లమరాజు. జన్మస్థానము: గోదావరీ మండలములోని ఇంజర గ్రామము. జననము: 1864 సం. రక్తాక్షి సంవత్సర ఆషాఢ బహుళ చతుర్థీ గురువారము. నిర్యాణము: 1939 మార్చి 13వ తేదీ - బహుధాన్య వత్సర ఫాల్గున బహుళాష్టమీ సోమవారము.

స్వగ్రంథ సీసమాలిక :

పరికింపు లక్షణాపరిణయంబును, శివానందలహరి, మహిమ్న స్తవంబు, మల్లేశశతకము, మఱి ముకుందశతంబు, నీతిదర్పణము, స్త్రీనీతిదర్పణము, సుభద్రా పరిణయము, దేవీ దండకము, నిందుముఖి వివాహమును, రామ జననము, నవతారచరితము, గీతతారావళి యును, బదరత్నమాల, యాంధ్ర పదజ్యోత్స్న, వ్యాకృతి రాజంబు, నీతికథాళి, సునీతిచంపు జనరలు తెలుగు, ప్రసంగ రత్నావళి, ప్రశ్నోత్తర ప్రదీపమును, స్తుతికదంబము, చాటుముక్తాళి, విదుల, బాలదీపికయు, వివేకదీపికయును, సామెతలు, స్నుషావిజయము, ఛందోలక్షణంబు, నాటకలక్షణంబు, శబ్ద లక్షణము, కావ్యలక్షణము, గుణప్రకాశిక, దివ్య భాగవత గీత, రూపకమాల, కఠోపనిషత్తు (?) పురాణమణిమంజరి, గురుకుమారచరిత, సీమరాణి, సివిక్సు, శ్రీవేంకటేశ్వర శతకమ్ము, మానసశతకము, హరి సేవాకలాపంబు, దైవస్తుతి, వినోదవల్లి, ప్రబంధ నిబంధనంబు, కవి జీవిత త్రయి, కావ్యవిశిష్టంబు, సంఖ్యాప్రదీప, మీశ్వరశతంబు సర్వనిర్వచనంబు, బంధనిబంధంబు, లలితసారస్వత లక్షణంబు, చంద్రిక, బాలవాచకము, స్వచరిత భారప్రయోగములు, పురాణకథలు, ప్రహసనమాల, యుపన్యాసవితతి, వినాయకాది విలాస నాటకంబు సూక్తి ముక్తావళి, షోడశ రాజచరిత్ర, ప్రతాపరుద్రీయము, సుగు

జ ప్రకాశిక, సూక్తి, కర్ణచరితంబు
ప్రయత కాత్యాయన పరిణయ, మనామ
య, మను డెబ్బది యొకకృతులను రచించి
హస్తిహస్త నవేందు సంఖ్యాప్రమాణ

హూణ సంవత్సరమున కనూన భక్తి
నీకునర్పించితిని జుమి నీరజాక్ష !
                                               'స్వచారిత్రము' నుండి.

ఆత్మస్తుతి యగుననియో, యన్యు లేమనుకుందురో యనియో మనపూర్వు లేరును స్వీయచరిత్రములు వ్రాసికొనినవారు కారు. ఆంగ్లేయులను జూచి మొట్టమొదట మన కందుకూరి వీరేశలింగము పంతులుగారీత్రోవం దీసిరి. అదియాదిగా దెనుగులో రచయిత లెందఱో శ్వీచారిత్రములు పొందుపఱుచుకొను నలవాటు చేసికొనిరి. చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి "స్వీయచరిత్రము" ప్రకటితమైనది.ఇట్టి వింకను జాలమంది రచనలు ప్రచురితములు కాని వున్నవి. శృంగారకవి సర్వారాయకవి సంధానించుకొనిన "స్వచారిత్రము" వారియనంతరము, చక్కగ నచ్చులోనికి వచ్చినది. కవి తాను దన యనుభ వాదికము వ్రాసియుంచుకొనుట, యతని తరువాత నదియెవరో బయట బెట్టి ముద్రించుట యనునది చక్కనిమార్గము. దానంజేసి, తత్కవి యాత్మస్తుతి చేసికొన్న వాడుగాదోపడు. మన సర్వారాయకవిగారి స్వచారిత్రము బహుపవిత్రమైనది. అందాత్మస్తుతిగాని, అన్యనిందగాని, అసత్యముగాని, అక్కఱలేనిదికాని యొకా యక్కరము లేదు. ఏదో జ్ఞాపకార్థము దైనందినచర్య వ్రాసికొనినటులుండెను. ఆచారిత్ర గ్రంథమే యిపుడు నాకాధారపడినది.

శృంగారకవి యనునది పౌరుషనామము విస్సాప్రగడగారు క్రమముగ నిటులైరి. వీరిపూర్వులలో వెంకయ్యగారనబడు నొకరు శృంగార పద్యములు నాలుగు రచించి తాటియాకుపై లిఖించి తమగ్రామమునకు వచ్చిన యొకమహమ్మదీయాధికారి దగ్గరకు వెళ్ళి చదివిరట. ఆయన యానందపడి "శృంగారకవివర్యా" యని ప్రశంసించి పందుము మెఱక-----ఒకగుఱ్ఱము నిచ్చి సత్కరించెనట. నాడుమొదలు పలువురును వీరిని శృంగారకవివా రనుచుండిరట

............... ................. ..................

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) చదువయినవెంటనే 1880 సం. మొదలు నర్సాపురము, కిర్లంపూడి, రాజమండ్రి, పెద్దాపురము ఆంగ్లపాఠశాలలో నుపాధ్యాయపదవి నిర్వహించిరి. 1894 లో నారంభించి 1929 దాక కాకినాడ పిఠాపురంరాజావారి కళాశాలలో నధ్యాపకత సాగించి, యెందఱనో శిష్యులను ముందునకు దీసికొనివచ్చిరి. సర్వారాయకవిగారు చాలమమదికి బద్యములు దిద్దిపెట్టినట్టుగ వారిచరిత్రయు దెలుపుచున్నది. తచ్ఛిష్యులను జెప్పుచున్నారు. ఆయనిదట్టి యుపకారిబుద్ధి.


శృంగాకవిత వ్రాయుటలో వీరికి మంచిప్రవేశము కలదు. చమత్కృతిమై భాషించుట యందును వీరు నేర్పరులు. ఈవిషయములకు వీరి 'స్వచారిత్రము' లోని కొన్ని మాటలు తీసి వ్రాసెదను.


"ఒకప్పుడు ముత్తుస్వామిశాస్త్రిగారితో వీరేశలింగముగారింటికింబోవ దటస్థించినది. ఆయన నన్ను గూర్చుండుమనలేదు. ఎవరువీ రనియడుగలేదు. ముత్తుస్వామిగారే వీరు మాస్కూలుపండితులుసుమండీ! యని ముచ్చటించిరి. అప్పుడు మీయింటిపే రెవరనిరి. శృంగారకవి వారంటిని. మీపూర్వులు శృంగారకవిత్వము చెప్పువారు కాబోలునేయనిరి. పూర్వమే కా దిప్పుడును జెప్పుట కలదంటి. ఏమి చెప్పితి రనిరి. లక్షణా పరిణయము, ముకుందశతకము. శివానందలహరి, మహిమ్నము మున్నగున వని చెప్పితి. మీపూర్వులేమి చెప్పిరనగా బెక్కులున్నవి యని పలికితిని. ఏది యొకపద్య మనిరి. "వరమా సురమా విరమా భరమా పరమాన్య నన్ను బటుదయ బ్రోవన్ 'సురమానినీ సుతవిలాసరమా పరమాత్మ శ్రీవిజయగోపాలా'" యని చదువ నర్థము చెప్పుమనగా జెప్పితి. కాని తొలుదొల్త గౌరవింపకుండుట, పదపడి పిల్లవానివలె నర్థము చెప్పు మనుట నాకు గష్టమై వెంటనే "భరతా దరతా సరతా ! విరతా మరతాపహరణ విమలహృదయ, కుందరదా దరదా వరదా ! శరదా శరదాభ శ్రీవిజయగోపాలా' యని చదివితి. అర్థమేదీ యనగానే మీముఖత: వినుటకు జుడీ యంటి, 'ఇదే మనవారివెఱ్ఱి. ఇంత క్లిష్టముగా జెప్పుట యెందుకో యనిరి. వెఱ్ఱియేమి? వివేకమే. కవిసమర్థత యిట్టివాని వలననేగదా తెలియునది యంటి. ఆయన మరల నర్థము మాట యెత్తక చాచివైచి ప్రబంధముల ధోరణిలోనికి దింపిరి. ప్రొద్దు పోవుటచే మేము వెడలి వచ్చితిమి."

ఈకవి మొత్తము చిన్నవి, పెద్దవి కలసి డెబ్బదియొక్క కృతి రచించెను. వీనిలో గొన్ని పాఠశాలాపాఠ్యములుగా నెన్నుకొనబడినవి. నాలుగైదుతక్క దక్కినవెల్ల నచ్చుపడినవి. ఏగ్రంథమునకు బెద్ద ప్రఖ్యాతి వచ్చినటులు లేదు. కవిత నిర్దుష్టముగానుండి ధారళముగ నడచును. అంతకుదప్ప రసపాసముల యందము వారికవితలో దక్కువ. కవి వైష్ఠికుడు, భక్తుడుగాన భగవత్పరములైన దండకములు, శతకములు పెక్కులు వ్రాసెను. ఒక్కటియు గక్కూరితిపడి నరాంకితములు సేయలేదు. దైన్యముతో నన్యుల నచ్చుకొఱకై యాచింపలేదు. అది యీకవిలోగల విశిష్టగుణము. వీరాంధ్రీకరించిన దండియనామ స్తవములో రెండు పద్దెములివి.

ఉ. పంచశరుండు కొంచకెద బచ్చన వింట విమోహనాస్త్ర మ

త్తెంచి యహంకరించి వెనుదీయక యేయగ బంచవక్త్ర! రో కైలాసంబుగదల్ప లోదెలసి త్రొక్కం దావకాంగుష్ఠ రే

ఖాలీలంబడి మోములన్ రుధిర మొల్కన్ మొఱ్ఱలంబెట్టడే!

సర్వారాయకవిగారి నిర్యాణ మతివిచిత్రతరమైనది. 1939 మార్చి 13 వ తేదీ సోమవారము యథాపూర్వముగ మేలుకొని నిత్యకృత్యము దీర్చెను. తీర్చి సూర్యనారాయణస్తుతి పఠించి స్నానముచేసి, ధౌత వస్త్రములు కట్టి దేవతార్చనముచేసి భోజనము మాత్రము చేయక భూమిమీద ప్రాక్ఛిరముగ శయనించి తనువువిడిచిరి. ఇట్టి యెఱిగిన మరణ మెవరికో గాని తటస్థింపదు. వీరికి జ్యోతిశ్శాస్త్రమున మంచి ప్రవేశమున్నది. ఆకారణమున నిర్యాణతిథి తెలిసికొని యిటులు జ్ఞానివలె మరణించెను.

                          ____________