ఆంధ్ర రచయితలు/నాదెళ్ల పురుషోత్తమ కవి

వికీసోర్స్ నుండి

నాదెళ్ల పురుషోత్తమ కవి

1863 - 1938

హరితసగోత్రులు. తల్లి. సుబ్బమాంబ: తండ్రి. కామయార్యుడు. జన్మస్థానము కృష్ణాతీరస్థమగు సీతారామపురాగ్రహారము. జననము: 1863 సం|| ఏప్రిలు 23 గురువారము. నిర్యాణము 27-11-1938 సం|| బహుధాన్యమార్గశీర్ష శుద్ధ పంచమి-ఆదిత్యవారము. గ్రంథములు: ఆంధ్ర ప్రబంధములు: 1. అద్భుతోత్తర రామాయణము. 2. గురుభక్తి ప్రభావము 3. కృష్ణానదీ మహాత్మ్యము 4. యాదవాద్రీశోపాఖ్యానము. 5. మహేంద్ర పురాణము 6. యామినీ వినోదము 7. బభ్రువాహన చరిత్ర 8. రంగదాసీయము 9. చతుర్ముఖి కందపద్య రామాయణము. ఆంధ్ర రూపకములు: 1. అహల్యా సంక్రందన నాటకము 2. హరిశ్చంద్ర నాటకము 3. పారిజాతాపహరణము 4. సారంగధర నాటకము. ఇత్యాదులు. శతకములు: 1. సీతారామశతకము 2. పూర్వకర్మ శతకము 3. మల్లికార్జునశతకము మున్నగునవి, మరియు. స్తోత్రకృతులు, అభివర్ననములు, కీర్తనలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథములు, హిందీనాటకములు మొత్తము 112 గ్రంథములు గలవు. వీరి విశేషవిషయములు తెలియుటకు శ్రీ నాదెళ్ళ మేథా దక్షిణామూర్తి శాస్త్రిగారు సంధానించిన " ఉత్తమ యోగివృత్తము " అను కూర్పు పరికింపవలయును.

కవిత్వ మొకకళ. కళకును శాస్త్రమునకును నెంతో యంతరము. తొలినాడు శాస్త్రకారునకు జూపిన గౌరవప్రపత్తులు, కళాకారునకు జూపలేదనుట వాస్తవము. నటవిటగాయకుల గణములోనే కవుల పరిగణనము. నేడు తలక్రిందులై కళాజీవులు గద్దెలకెక్కి కొండాడబడు చుండుటయు, శాస్త్రజీవులు అజ్ఞాతులై మూలలనుండుటయు జరుగుచున్నది. దీనిలోరహస్యము, కళ వలన బ్రతుకువానికడ నాముష్మికదృష్టి లోపించి యుండువల్ల నేమోయని తోచును. కళగాని, శాస్త్రముగాని తాత్త్విక సరణికి గొనిపోవలయును. అపుడు, ఆకళాకారుడు, ఆ శాస్త్రకారుడు నేక శ్రేణిలో గూర్చుండుటకర్హులగుదురు. కవికి "సంథ్యావందనము బావగారు" అని తిరుపతికవులు కాబోలు చెప్పినారు ఇది ఇటులు సార్వత్రికమనుటకు వీలు లేకుండ మహానిష్ఠాగరిష్ఠులగు పురుషోత్తములు కొందఱు కవిలోకమలో నుందురు. అట్టివారిలో నాదెళ్ళ పురుషోత్తమకవిగారొకరు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు వీరిని గూర్చి వ్రాసిన యీపద్యములు సరిగా దూచిన ట్లున్నవి.


అతిశాంతుం, డతిదాంతుడు

కృతకృత్యుడు, నుకవి, యెన్నియేని విషయముల్

మతినెఱిగినవిద్వాంసుడు,

స్తుతియింపదగిన పూరుషుండు సుకవులకున్.

ఒకనికి లో గని శాంతియు

సకలమ్ము నతిక్రమించు చండత, కడువై

దికకర్మ నిష్ఠయు బరో

పకృతియు బురుషోత్తముని స్వభావగుణమ్ముల్.


పురుషోత్తమకవి తొలుత రేపల్లె లోయరు సెకండరీస్కూలులో నుపాధ్యాయుడు. ఆపదవిలో నుండగానే జ్యోతిశ్శాస్త్రము, ధర్మశాస్త్రము మున్నగువానియందు పాండిత్యము సంగ్రహించెను. 1884 నుండి, బందరు వీరిని హిందీనాటక రచనకు బ్రోత్సహించుచు వచ్చినది. అదివీరి జీవిక కొక క్రొత్త మెఱుగు. "నేషనల్ ధియేట్రికల్ సొసైటి" అనుపేర బందరున నొకనాటక సమాజము వెలసినది. వారికి హిందీనాటకముల సంతరింపజేసి ప్రదర్శింప వలయునని క్రొత్త.................................... ,...................... ................... ..................... ......................

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) పురుషోత్తమకవి యిపుడు తెలుగువాడై, "బుధవిధేయిని" యను పత్రిక సంపాదించుట కారంభించెను. ఆయన తెలుగు పత్రికా సంపాదకుడైనను భారతీయుడు. తనపత్రికలో "నేషనల్ కాంగ్రెసు" ను గూర్చి ప్రచారవ్యాసములు వ్రాసి ప్రకటించెను. కాంగ్రెసుపై ఉరుదుభాషలో మహ్మదీయుల కుపన్యసించిచెప్పిన ప్రబోధకులు పురుషోత్తమ కవిగారు. కవికి జాతీయభావములు నిండార నుండవలయునుగదా!


పదవడి, వీరు 1887 మొదలు 1908 దాక హిందూబ్రాంచి స్కూలు హెడ్మాష్టరుగా శిష్యులను దిద్దెను, ఈ యుద్యోగము లన్నియు బురుషోత్తమున కార్థికములు. హార్దికముగా వీరునిర్వహించుచున్నది సారస్వతోద్యోగము. వీరు హెచ్చుగా బంధగర్భ కవిత్వాభిమానులు. చతుర్ముఖి కందపద్య రామాయణము, చిత్రకంద పద్యరత్నాకరము, మల్లికార్జున మకుటాంచ త్కందగీత గర్భితోత్సల చంపక మాలాష్టోత్తర శతకము ఇత్యాదులందుల కుదాహరణములు. చతుర్విధ కవితా ధురంధరులని వీరికి గల బిరుదము. పురుషోత్తమకవి శతక కవితా ధోరణి యీతీరు గలయది:


చ. ఒగి నగుమోముతో ముదమునొందగ జేయును ముద్దుపాప తా

వగనగ నెట్టులే గనెడువారి నడంబడు గంటి పాప చూ

డగ దిగువ స్వడి న్నిలుకడం దగ కాడును నీటిపాప తా

బగ లెగురుంగదా మదిని బాపగ జేయకు మల్లికేశ్వరా!


క. నగు మోముతో ముదము నొం

దగ జేయును ముద్దుపాప తా వగ నగనే

దిగువ వ్వడి న్నిలుకడం

దగ కాడును నీటిపాప తాబగ లెగురున్.


గీ. ముదము నొందగ జేయును ముద్దుపాప

కనెదు వారి నడంబడు గంటిపాప నిలుకడం దగ కాడును నీటిపాప

మదిని బాపగ జేయకు మల్లినాథ!


ఈపద్యములు మల్లికార్జున శతకములోనివి. చంపకమాలిక కడుపులో కంద - గీతములు రెండును నిమిడియున్నవి. జాగరూకతతో నీ మూడుపద్యములు చూచినచో గవిగా రెంత పరిశ్రమించిరో వెల్లడి కాగలదు. సాధారణముగా బంధకవితలు రచన రామణీయకము కొఱవడి యుండును. పురుషోత్తమకవిగారి శైలిమాత్రము మధురధారకలది-బంధకవిత్వములో నీయన యందెవేసినవా రనుట కెన్నో కృతులు తారకాణ లున్నవి. అది యటుండె; వీరి యద్భుతోత్తరరామాయణము నందలి వివధవర్ణనాంశములు గల పద్యములు కొన్ని:


క. అసలది వసంత మాయెను

బసరంగు సరింప విడిచె బడ జల్లిన య

ట్ల సదా యలరారుగదా

మిసమిస నదృశము లయ్యె మేదిని దరుపుల్.


క.వట ఫలము చుబుక మపునవి

నటు పటు దంతములు దాడిమాంచిత బీజో

త్కటములు మౌక్తికకుంద

స్ఫుటములు విశ్శ్రేణిబోల్ప బొలుపగువళులన్.


క. మదగజముల గేరెడినో

కుదిరిక యంచరులకు గూర్పగోరెడి నోయా

పదముల యెదుగుడు గమనిక

కుదిరెడి నే నాగకవులకు స్వర్ణింపన్.

నీసంవిధముగా మనోహరరీతిని చతుర్విధకవితలు సంతరించిన సుకవి పురుషోత్తములు కుమారరత్నము నాదెళ్ళ మేధా దక్షిణామూర్తి శాస్త్రిగారు తెలుగు రచయితల నెఱగినవారు.

                          ____________