ఆంధ్ర రచయితలు/ధర్మవరము రామకృష్ణమాచార్యులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ధర్మవరము రామకృష్ణమాచార్యులు

1853-1912

వైష్ణవులు-తండ్రి: కృష్ణమాచార్యులు. తల్లి: లక్ష్మమ్మ. జన్మస్థానము: ధర్మపురి అగ్రహారము (తాడిపర్తి తాలూకా - అనంతపురం జిల్లా). నివాసము: బళ్లారి. జననము: 1853 సం. (పరీధావి కార్తిక శు|| ఏకాదశి) నిర్యాణము: 1912 సం. విరచిత గ్రంథములు, ముద్రిత నాటకములు:- 1 చిత్రనళీయము, 2. విషాదసారంగధరము, 3. పాదుకా పట్టాభిషేకము, 4. ప్రహ్లాద, 5. సావిత్రీ చిత్రాశ్వము, 6. మోహినీ రుక్మాంగద, 7. బృహన్నల, 8. ప్రమీలార్జునీయము, 9. పాంచాలీ స్వయంవరము, 10. ముక్తావళి, 11. చిరకారినాటకము. 12. రోషనారా శివాజీ, 13. వరూధినీ నాటకము. అచ్చుకాని నాటకములు:- 1. ఉషా పరిణయము. 2. సుశీలా జయపాలీయము, 3. అజామిళ (వచన నాటకము), 4. యుధిష్ఠిర యౌవరాజ్యము, 5. సీతా స్వయంవరము, 6. ఘోషయాత్ర, 7. మదనవిలాస నాటకము, 8. ఉన్మాదరామప్రేక్షణిక నాటకము, 9. రాజ్యాభిషేకము, 10. సుగ్రీవ పట్టాభిషేకము. 11. విభీషణ పట్టాభిషేకము, 12. హరిశ్చంద్ర, కన్నడ నాటకములు: 1. ఉపేంద్ర విజయము లేక వామన చరిత్ర, 2. స్వప్నానిరుద్ధ నాటకము.

శ్రీమత్కృష్ణమాచార్యకవికి బూర్వము తెలుగులో స్వతంత్రనంవిధానము గలనాటకములు లేవు. ఉన్న నాటకములు సంస్కృతమున కనువాదములు. ఆ కారణమున నాంధ్రరంగస్థలములు విస్తరించి వెలయలేదు. పాశ్చాత్య సంప్రదాయము, ప్రాచీన సంప్రదాయము నెఱిగి యొకరకమగు క్రొత్తత్రోవదీసి నాటకములు రచించి స్వతంత్ర నాటకరచయితలకు మార్గదర్శి యనిపించుకొనిన మహాశయు డీయన. వీరి కృషిని గుర్తించి గద్వాల మహారాజవరుడు 1910 లో నీయాచార్యకవిని, రత్నస్థగితమగు పతకముతో 'ఆంధ్రనాటక కవితా పితామహు 'డని బిరుదమొసగి గౌరవించెను. విచిత్రసమ్మేళనము గావించి నాటకపాత్రములకు గేవ లాంధ్ర త్వము నాపాదించి తొలుదొల్త స్వతంత్రనాటకములు రచించినావాడగుటచే నీ కవివరున కీబిరుద మన్వర్థ మని నాడు పెక్కుపండితు లగ్గించిరి. పురప్రముఖులు ముగ్దులై యొక కిరీటమర్పించిరి. ఆచార్యుల వారు నాటక కర్తలేకాక నటకులు కూడాను. చిత్రనళీయములో బాహుకుడు, విషాదసారంగధరములో రాజనరేంద్రుడు, పాదుకాపట్టాభిషేకములో దశరథుడు, అభిజ్ఞానమణిమంతములో దుష్టబుద్ధి, ఈ పాత్రములు ప్రత్యేక ప్రశంసాపాత్రములుగా నటించెడివారు. దశరధ పాత్రధారిత్వమున కృష్ణమాచార్యులవారికి సాటి కృష్ణమాచార్యులవారే యని పలువురు చెప్పుకొందురు. ఆచార్యులవారు తమ మరణము నాటక రంగముననో న్యాయస్థానముననో యుండునని యప్పు డప్పు డనుచుండువారు. అది తధ్యముగ వారు 1912 లో నొక యభియోగము నడపుటకు వెళ్ళి 'ఆలూరు ' లో న్యాయస్థానమున నాకస్మికముగ గాలు జారిపడి 'రామచంద్రా' యనుచు నసువులు బాసిరి. వారి మృతకళేబరము నాలూరునుండి బళ్ళారికి దెచ్చి యంత్యక్రియ నడవు సందర్భమున జరిగిన యూరేగింపుటుత్సవము పలువు రిప్పటికి చెప్పుకొందురు. నాటకాచార్యుడై గడించిన కీర్తియు, న్యాయవాదియై సంపాదించిన పేరును నాడు ప్రకటితమైనవి. స్త్రీలు పురుషులు వృద్ధులు యువకులు నొక రననేమి, వేలకొలది పుష్పమాలికాదులచే నాచార్యకవి కంత్యసమ్మాన మొసంగిరి. ఇట్టి మహాశయుని శక్తి యుక్తులు ముచ్చటించు కొందముగాక !

కృష్ణమాచార్యులవారి తండ్రిగారు మంచి పండితులు. తాత ముత్తాతలుకూడ విఖ్యాత విద్వాంసులు. తండ్రిగారు బళ్ళారి "వార్థ లా కాలేజి లో నాంధ్ర పండితపద మలంకరించిరి. జనకుని సన్నిధినే కృష్ణమాచార్యుడు సంస్కృతాంధ్రములు కఱచెను. మేధాశక్తి గొప్పది యగుట నిట్టే చక్కని సాహిత్వమలవడుట తటస్థించినది. దానివలన బహుగ్రంథపరిశీళనము గావించి పాండిత్యమునకు స్వయముగా మెఱుగు పెట్టుకొనెను. అష్టశతావధాన ప్రదర్శనము గావించి కొక్కొండ వేంకటరత్న మహా మహోపాధ్యాయుని వంటి వారిచే మెప్పుల గాంచెను. అదియటుండ, నీయన కాంగ్ల భాషాభ్యాసము చేయవలయునని అభినివేశము కలిగినది. పట్టుదల గలవారగుట ఎవ్.ఏ పరీక్షలో నుత్తీర్ణత నందిరి. తరువాత అదవాని 'తాలూకాకచేరీ' లో గొన్నాళ్ళు లేఖకులుగా గుదరవలసి వచ్చినది. కవికి దౌర్గత్యముకూడ నొకకళ యైనదిగదా ! పాపము నాటికి వీరిది పేదకుటుంబము. ఆదవానిలో సంసారము సరిగ జరుగక బళ్ళారికి వచ్చి కంటోన్‌మెంటు మేజస్ట్రేటు కోర్టు లో ప్రైవేటు వకీలు ' గా పనిచేయ మొదలిడిరి. ఆయుద్యోగము వీరి దరిద్ర దేవతను దఱిమివైచినది. వకీలు వృత్తి యందు వీరికి లభించిన యుత్తేజనము ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుషిప్ పరీక్షకు బురికొల్పి యందుత్తీర్ణుని గావించెను. నాటినుండి వీరి న్యాయవాదవృత్తి నిరాఘాటముగ సాగి న్యాయస్థానమున కెక్కు నభియోగము లన్నిటను వీరి దొక పక్ష ముండి తీరునంత యున్నతికి గొంపోయెను. ప్రతిపక్షులను సాక్షులను ప్రశ్నించుటలో వీరినేర్పు గొప్పది. వీరి వాదము వినుటకు బ్రజలు గుమిగూడి యుండువారట. బళ్ళారి ప్రాంతీయు లిప్పటికిని వీరి న్యాయవాద దక్షత వేనోళ్ళ జెప్పుకొందురు.

ఈయాచార్యకవి యద్భుత మేధాశక్తి యెన్నో కళలను గ్రహించినది. ఆయుర్వేదము వీరు లెస్సగ నెఱుంగుదురు. అది వీరి వంశపారంపర్యముగ వచ్చు విద్య. నాడీపరీక్షలో నీయన సిద్ధహస్తులట. జ్యోతిశ్శాస్త్రమునను వీరి ప్రవేశము చాల గొప్పది. వారి నాటకములలో నిందులకు నిదర్శనములు పెక్కుగలవు. చదరంగ మాడుట యన్న వీరికి చెప్పరాని మక్కువ. నెలల తరబడి యనన్య మనస్కులై యాడుచుండువారని ప్రతీతి. అభినయశాస్త్రము వీరికి బరిచితము. డిబేటింగు సొసైటీ నొకటి స్థాపించి పలువురు పురప్రముఖులనందు సభ్యులుగా జేర్పించి 'షేక్సుపియరు ' నాటకములలో ముఖ్యపాత్రల నభినయించెడి వారు. ఆ సరసవినోదినీసభకు నాడు పెద్ద ప్రఖ్యాతి వచ్చినది. నాటకబృందముపై గల దొల్లిటి హేయభావము తొలగించిన దీసభయే. ఈ సభామూలమున నొకసారి 'ఆంధ్రకవిపండిత సంఘ సమ్మేళ ' మాచార్యులవా రతి విజృంభణముగా జరిపిరి. మఱొకసారి ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావుగారి 'ఆంధ్ర వాల్మీకి రామాయణ ' కృతిసమర్పణోత్సవమునకు వీరి నధ్యక్షులుగా నెన్నుకొనిరి. అప్పుడు వీరి 'పాదుకా పట్టాభిషేకము ప్రదర్శింపగా రూ. 1500 వచ్చినవి. అవి కోదండ రాముని కైంకర్యమునకే యర్పింప బడినవి. వీరి నాటకములకు బ్రజాసామాన్యములో గల గౌరవమునకిది మంచి తారకాణ. అంకములలోని కథ రంగములుగా విభజించుట వీరి నాటకములలోని క్రొత్తపద్ధతి. ఇది పాశ్చాత్య సంప్రదాయము. నాటకము విషాదాంతము చేయుట వీరి కనభీష్టము కాదు. 'సారంగధర ' ను జూచిన మనకది యవగతము. కాళ్ళు చేతులు విఱుగ గొట్టబడి సారంగధరుడు చనిపోయెను. అంతతో నాటకము సమాప్తము. మఱియొక సంప్రదాయముగల కవియైనచో నిది యిట్లు వ్రాసి యుండడు. ఇదియు నాంగ్లేయమే. సారంగధరునిపై నిందమోపిన చిత్రాంగిని విచారించుటకు రాజనరేంద్రుడొక న్యాయస్థానసభ చేసెను. అది సరిగ నినర్గసుందరముగ నుండి కృష్ణమాచార్యులు గారు గొప్ప న్యావాదియని సాక్ష్యమిచ్చు చున్నది.

వీరి నాటక చక్రములో 'చిత్రనళీయము ' మిన్నందిన ప్రఖ్యాతి గొన్నది. అందలి పద్య గద్యములు ప్రబంధములకు దీటు వచ్చినవి. అది ప్రదర్శించుట కొక పాటినటకుడు పనికిరాడు. సంపూర్ణమైన యర్థజ్ఞానము కలిగిన మరల నిట్టి కవిత్వము వ్రాయ గలనన్నవాడు వీరి నాటకములు నోట బట్టగలడు. తెలుగులో ననువాదములు రెండుమూడు తప్ప స్వతంత్ర నాటకములు రచించు నలవాటు నాటికి లేకుండుటచే బ్రాబంధిక వాసన వీరి నాటకములలో నననేల, ఆనాడు వ్రాసిన నలుగురైదుగురు కవుల నాటకములలో గూడ వెల్లి విరిసినది.

ఆచార్యులు గారి చిత్రనళీయము చూడుడు. ప్రథమాంకములో స్వయంవరరంగమున భారతిచేత దమయంతికి భుజంగ ప్రయతాదులైన యెన్ని ప్రాబంధిక వృత్తములతో జెప్పించెనో ! ఇప్పుడు బొత్తిగా నాట కములలో బద్యములను బరిహరింపవలయు ననుచున్నారు, అది యౌచితీపోషక మని - అటువంటి యిప్పుడు పృధ్వీవృత్తములు - మత్తకోకిలములు దృశ్యకావ్యములలో నుపయోగించుట యొకరకముగానుండును. నాటినటకులుకూడ సర్వసమర్ధులు ఇప్పు డిట్టివి యాడువారు నూటికి గోటికిని - ఇంచుమించుగా శ్రీనివాసరావుగారివి, కృష్ణమాచార్యులు గారివి కూడ బద్యనాటకప్రాయములు. అడుగడుగునకు బద్యము. తిరుపతి వేంకటకవుల పాండవనాటకములలోను పద్యములపా లెక్కువయే. కానివారు కొంతశైలి తేలికపఱిచిరి.

చిత్రవళీయము చతుర్థాంకములో "శరద్రాత్రి" ని వారివారి యుపాలంభనములు యిరువదియైదు పద్యములలో నాచార్యులవారు వర్ణించి వైచిరి. నిజముగా నాపద్యము లే వసుచరిత్రాది ప్రబంధములకునందని యుదాత్తభావములు కలవి. భాషయు నట్టిదే. విరహ వ్యధావిధురుడైన బాహుకభూమికాధారి యొక్క పెట్టున నాపద్యములు చదువవలయునన్న డొక్క బ్రద్దలగును. నాటి నటకులు కాబట్టి చిత్రవళీయాదుల కంత ప్రఖ్యాతి ప్రజాసామాన్యములో గూడదీసికొని రాగలిగిరి. నటకులై ఖండాంతర ప్రసిద్ధిగాంచిన తాడిపర్తి రాఘవాచార్యులుగారికి మనఆచార్యులుగారు మేనమామ. వీరి నాటకపద్యములు చాలమందికి నోటికి వచ్చినవే యై యుండును. అయినను రెండుమచ్చు:

అతిమాత్రంబుగ దు:ఖమున్ సుఖము దైవాతీనతం గర్మ సం
గతిమై బ్రాణికిగల్గుగా యిపుడు దు:ఖప్రాప్తి మల్లాడె శ్రీ
యుతుడాభూభూరమణుండు వెండియును నేడోఱేపో యాకాల దు
స్థితి దీఱంగను సర్వసౌఖ్యముల నిశ్చింతాత్మీతం జెందడే?

బళి రే కంటినిగంటి సప్తజలధి ప్రావేష్టితాఖండ భూ
లలనాధీశ కిరీట వారిరుహరోలంబాయమాస ప్రభో
జ్జ్వలితారిందమనూపురాత్త సదసేవాప్రీతగోత్రాధవున్
నళభూమీధవు నాశ్రితౌ ఘ కరుణా నవ్య ప్రభామాధవు