ఆంధ్ర రచయితలు/కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

వికీసోర్స్ నుండి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

1863 - 1940

తెలంగాణ్యబ్రాహ్మణులు. గౌతమసగోత్రులు. ఆపస్తంబసూత్రులు. తండ్రి: బ్రహ్మావధాని. తల్లి: సుబ్బమ్మ. జననము 2-2-1863. నిధనము 29-101940. అభిజనము: తూర్పుగోదావరీ మండలములోని పలివెల గ్రామము. మనుగడ: కాకినాడలో. రచనలు: సంస్కారవిషయకముగా వీరువ్రాసిన వ్యాసములు 24. అధ్యాత్మవిషయక వ్యాసములు 17. మతధర్మవిషయక వ్యాసములు 43. సాహిత్యవిషయక వ్యాసములు 60. కవిత్వవిషయక వ్యాసములు 16. ప్రకృతిశాస్త్రవిషయక వ్యాసములు 11. నన్నయ్యభట్టారక చరిత్రము, కురుపాండవ దాయభాగనిర్ణయము, మంగతాయి, సైంధవవధ (నాటకములు) ఉపన్యాసపయోనిధి (1 సంపుటము) తారకతారావళి, పర్వతసందర్శనము, మనువసు ప్రకాశిక, పెద్దాపురసంస్థాన చరిత్రము, ప్రాయశ్చిత్తపశునిర్ణయము, భాస్కరోదంతము మున్నగునవి ప్రత్యేకగ్రంథములు. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక-భారతి-శారద-ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు-ముద్దుల మూట-ఉదయలక్ష్మి-సుజాత. ఈ పత్రికలలో వీరి రచనలు గలవు.

"అల్పదోషమైనా కావ్యమందు సహించక విమర్శ చేసేటప్పుడు యమునికన్న ఎక్కువనిర్ఘృణుడని పేరుపొందిన పండితు" లని బ్రహ్మయ్యశాస్త్రిగారిని గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రశంసించిరి. వాస్తవముగా నీయన యంతటివాడే. హరిబ్రహ్మాదు లడ్డుపడినను విమర్శచేయుటలో నీయనకు జంకులేదు. సముద్రపుటుప్పునకు నడవి యుసిరకకు గలిగినసంబంధము వలె "కాకినాడ ట్రెజరీ డిప్యూటీకచేరీ గుమాస్తా" పనికి శాస్త్రిగారి యపూర్వ సారస్వత విషయవిమర్శనమునకు జక్కనిబాంధనము కుదిరినది. "అన్యథా చింతితం కార్యం దైవ మన్యత్ర" అనునట్లు భగవంతు డీ విమర్శకాగ్రేసరుని "గుమాస్తా' పని చేసికొనుమని యాదేశించినాడు. శరీర మొకచోట - మనస్సు మఱొక చోట బనిచేయుట చాలచోట్ల నున్నదేగాని క్రొత్తదికాదు. జయంతి రామయ్య పంతులుగారికి యావజ్జీవము న్యాయవాదిగా నుండవలయునని సంకల్ప ముండెడిదట. అట్టియదృష్ట మాయనకు బట్టనేలేదు. ఇంతకును జెప్పున దేమన:- బ్రహ్మయ్యశాస్త్రిగారు లేఖకవృత్తిలో నుండికూడ జగద్విఖ్యాతమైన విమర్శనము లొనరించి 'విమర్శకాగ్రేసరు' డనిపించుకొనుట బహుథా శ్లాఘనీయము.


శాస్త్రిగారు 'మెట్రిక్యులేషన్‌' పరీక్షలో నుత్తీర్ణులై ఎఫ్.ఏ. పరీక్షకు జదువుచు గారణాంతరములచే జదువువిరమించి యుద్యోగబంధములో బడవలసినవారైరి. అది యొకందులకు మేలైనది. కళాశాల చదువు కట్టిపెట్టిన తరువాత గౌముది కట్టుదిట్టముగ జదివి, సంస్కృతాంధ్రములలో దలస్పర్శి యగు పాండిత్యము సంపాదించిరి. "రప్రత్యాహారమండన మండన" మాకాలమున వ్రాసినదే. వీరు భాషాత్రయములో సమానము నసమానమునగు పాండిత్యము గడించి పండితు లనిపించుకొనినారు. ఈయనకు సాదృశ్య భాషాశాస్త్రముపై (PHILOLOGY) మక్కువ హెచ్చు. ఆ సాదృశ్య పరిశీలనము భాషయందేగాక మతములయందుగూడ బ్రవేశపెట్టిరి. హిందూమతతత్త్వము లోతుముట్టబరికించిరి. వీరేశలింగంపంతులుగారికి వీరికిని జాలకాలము హోరాహోరి యుద్ధము జరిగినదని తెలుగువా రెఱిగినదే. నాటి బ్రహ్మయ్యశాస్త్రిగారి వా గ్వజ్రప్రయోగమును బండితు లెఱిగినదే. విమర్శలో నింత నిర్దాక్షిణ్యుడు లేడనికదా గిడుగువారు చెప్పిరి.

బ్రహ్మయ్యశాస్త్రిగా రెంతసునిశితవిమర్శకుడో యంత కర్మవీరుడు.--------వ్యాసములు వ్రాయుట, నుపన్యాసము లిచ్చుచు, సంస్థల----------వైజ్ఞానికవిషయ ప్రబోధముచేసిన పుణ్యచరిత్రులు--------------------కళాభిరుచికలిగి "ఆర్యబృందానంద సంధా---------------------------చెప్పుదురు. అందు వీరి

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) చేతనే వ్రాయబడిన "త్రిపురాసురవిజయ వ్యాయోగము" వీరేశలింగము పంతులుగారి "శాకుంతలము" మున్నగునవి ప్రదర్శింపబడెనట. భగవద్భక్తినిగూర్చి ప్రజాసామాన్యమునకు బ్రబోధము చేయదలచి 1880 లో "భక్త సమాజము" పేరితో నొకసంస్థ నెలకొల్పి, దాని పక్షమున బ్రతిగ్రామమునకు బర్యటనము గావించుచు నుపన్యాసము లిచ్చుచుండెడివా రట. 1883 "ఆర్యమత బోధిని" యను మఱొక సమాజము నిలిపి "వివేకానంద పుస్తక భాండాగారము" వెలయ జేసిరి. ఈరీతిగా హిందూమత ప్రచారమునకు యావచ్ఛక్తి వినియోగించి సత్ప్రచారము చేసిన సత్పురుషుడీయన. "ఆర్యమతబోధిని" మాసపత్రిక 1905 లో వీరి సంపాదకత్వమున వెలువడుట మొదలయినది. ఈపత్రిక వలన బ్రహ్మయ్యశాస్త్రిగారి పేరు నలుమూలల వ్యాపించినది. సంఘసంస్కర్తల యుద్దేశములు సన్నగిల్లజొచ్చినవి. వీరేశలింగముగారి సంఘసంస్కరణ మహోద్యమమునకు వ్యాప్తి తగ్గినది. ఆసమయముననే పంతులుగారు "సత్యవాదిని" యనుపత్రికను స్థాపించుచు నిట్లు వ్రాసినారు. "వెయ్యగా వెయ్యగా వెఱ్ఱివాడే గెలిచె నన్న ట్లీయనవ్రాతలు జనుల భ్రమపెట్టి నేను పూనినమహాకార్యమునకు గూడ విఘాతము కలిగించు చున్నందున...."


ఆనాడు "ఆర్యమతబోధిని" చదువని యాంధ్రు డుండియుండడు. ఆ పత్రిక యావిధముగా బదునై దేండ్లు నడచి యమూల్యముగ సంఘసేవ యొనరించినది. హిందూమతమును గూర్చి యెవరు నిరసన వ్యాసము వ్రాసినను బ్రహ్మయ్య శాస్త్రిగారే ప్రత్యుత్తరము విమర్శకులు నిరుత్తరులగునట్లు వ్రాసెడివారు. శ్రీ శాస్త్రిగారు మతమునేకాక సారస్వతమును గూడ నడుము కట్టి సేవించిరి.


మంత్రిభాస్కురుని గూర్చి "కవులచరిత్ర" లో వ్రాసిన విషయములు సరిగా లేవని "భాస్కరోదంతము" ప్రత్యేకముగావ్రాసి వెలువరించిరి. వీరు రచించిన "నన్నయ్యభట్టారక చరిత్రము" లో ననేకసిద్ధాంతములు భాషాప్రపంచమున జిరస్థాయులై నిలువగలిగినవి. "కాగదా" శబ్దమును గుఱించి వీరు కూర్చిన చిన్న పొత్తము నరసిన వీరికిగల భాషాశాస్త్ర విషయ పరిజ్ఞానము విశదముకాగలదు.


ఈయన పద్యకవిత్వముకూడ జక్కనిశైలిలో వ్రాయగలరు. మంగతాయి నాటకమునుండి పద్యములు కొన్ని యెన్నుకొందము.


గీ.వేశ్య కావిమోవి వెలయిచ్చువా రెల్ల

వంట బట్టి పీల్చు భంగి గానె

యేక పాత్రమువననె యెంగిలి నాకయే

కాఫి త్రాగుచుంద్రు కలసి జనులు

ఆ.వె.వణ్యభామినిచే బడ్డ పుణ్యశాలి

పుడమి గాంభీర్యహీనుడై చెడకయున్నె

జలజలత యంటిసంతస సరసు లొగిని

నమిత గాంభీర్యహీనత నందినట్లు

గీ. ఆట వెలదుల యిండ్లును నమ్మవారి

గుడులు గాలిగోపురములు గోవెలలును

దోటలు పురమందిరములు పూటకూటి

యిండ్లు జూదంబునకు దగు నిక్కలరయ.

వేశ్యలందు కలుగుమోజు! వేడ్క సేయ నౌ డినీజు

పొందువలన బుట్టు పుండు! మందు వేయమానకుండు

దేహమెల్ల నౌను పుల్ల! గేహమెల్ల నౌను గుల్ల

కీర్తి యంత మాసిపోవు! నార్తి హెచ్చ వచ్చు జాపు

ఏమిలాభమనుచు నీవు! భూమి గణిక పొందుతావు

వలదు వలదు వలదుమా! సాని గూడ జనమ నూ


గీతములు, గడ్డెపరక, కోకిలగీతములు, గోమహిషసంవాదము,---------సందర్శనము, మొదలగు ఖండకృతులు గనిన వీరి పద్య-------------


(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) 1930 సం. సెప్టెంబరు నెలలో కాశీభట్ట లింగమూర్తి యను నాయన రాజమహేంద్రవరమున మరణించెను. హిందూపత్రికాలేఖకుడు పొరపాటున బ్రహ్మయ్యశాస్త్రిగారు చనిపోయినట్లు "హిందూపత్రిక" కు లేఖ వ్రాసిపంపెను. "హిందూ" పత్రికను జూచి "ఆంధ్రపత్రిక" యు నావార్త వెలువరించినది. దానినిబట్టి నాలుగైదునాళ్లలో నీ కానివార్త నలుమూలల వ్యాపించినది. సంపాదకీయవ్యాసములు, సానుభూతిసభలు, సాంత్వనలేఖలు బయలు దేరినవి. బ్రహ్మయ్యశాస్త్రిగారు హాయిగా గాకినాడలో గ్రంథరచనము చేసుకొనుచునేయున్నారు. ఈక్షేమము మరల ఆంధ్రపత్రికకు బంపపడినది. పత్రికాసంపాదకులు తా మసత్యవార్తను విశ్వసించి యటులు వ్రాసినందులకు వగచుచు బ్రహ్మయ్యశాస్త్రులుగారు పూర్ణారోగ్యవంతులుగా నుండుటకు బద మానందము ప్రకటించిరి. ఈ చమత్కారవిషయమును శాస్త్రిగారు "నా విబుధలోక సందర్శన" మనుకావ్యమున వ్రాసి తమ మధురకవితాధారను తెలుగువారికి జూఱలిచ్చిరి.


తునిసంస్థానాధీశ్వరు లీవిమర్శ కాగ్రేసరునిచే రెండువత్సరము లుద్యోగమునకు సెలవుపెట్టించి "పెద్దాపుర సంస్థానచరిత్ర" వ్రాయించిరి. వీరిచారిత్రకపరిశోధన కది యాదర్శము. మాధవవిద్యారణ్యులు, శిష్టు కృష్ణమూర్తికవి, నారాయణభట్టు, నాచన సోముడు మున్నగువారి ప్రత్యేక జీవితములు వ్రాసిన చరిత్రజ్ఞ డీయన. వీరి వక్తృత్వ మనన్యసామాన్యము. ఉపన్యాసము నడుమ నెవరైన బ్రతిపక్షులు వికట ప్రశ్నలు వేయగా వీరు సద్యస్స్పురణము కలిగి చక్కని సమాధానము చెప్పి మఱి మాటాడ నిచ్చెడివారుకారు. మాట మథురము. భావము తీవ్రము. దీనికి బ్రహ్మయ్యశాస్త్రిగారు పెట్టినదిపేరు.


ఇట్టి మహితాశయునియెడ విమర్శకాగ్రేసరుడని, మహోపాధ్యాయుడని, ఉపన్యాస పంచాననుడని, ఆర్య మతోద్ధారకు డని బిరుదము లన్వర్దములు కాకుండు టెట్లు ?

                              ________