ఆంధ్ర గుహాలయాలు/ఆంధ్ర గుహాలయాలు

వికీసోర్స్ నుండి

ఆంధ్ర గుహాలయాలు

విజయవాడ అక్కన్న మాదన్న గుహాలయము:

విజయ వాడ వద్ద గల ఇంద్రకీల పర్వతపు తూర్పు, పశ్చిమ వాలు భాగాలలో గల గుహాలయములలో తూర్పు భాగాన గల అక్కన్న మాదన్న మండప మనెడి రెండవ గుహాలయము ముఖ్యమైనది. ఇది పెద్దది, అందమైనది. ఇందు ముందు భాగాన ఒక స్థంభ వరండా కలిగి దాని వెనుక భాగమున మూడు దేవ గృహాలను కలిగి యున్నది. శిల్ప రూపాలు మొదలగున నేమియు లేకుండా యున్నది. స్తంభాలు అష్ట కోణాకార విభాగమును కలిగి యున్నవి. ఈ స్తంభాలు పల్లవేతర వాస్తు రీతిని తెలుపు చున్నవి. కాని గ్రౌండ్ ప్లాను పల్లవ రీతితో యున్నది. ఈ గుహ ప్రాంతీయ పోషణతో ఏర్పరచబడినది భావించుట కూడ గలదు. ఇచటి క్లుప్త శాసనంలోని 'ఉత్పతి పిడుగు అనెడి బిరుదును బట్టి ఇది క్రీ.శ. 7 వశతాబ్దమునకు చెందినదిగా తెలుసుకొనుటకు ఉపయోగ పడుచున్నచి.

మొగల్ రాజ పురం గుహాలయాలు:

మొగల్ రాజ పురం గుహాలయాలు విజయవాడకు తూర్పున మూడు మైళ్ల దూరములో ఉత్తర దక్షిణములుగ యున్న కొండలలో గలవు. మొగలరాజ పురము గ్రామమునకు అగ్నేయమున గల పర్వతమున ఒకటవ గుహాలయము పర్వత దక్షిణ భాగాన రెండవ, మూడవ గుహాలయాలు, అచటనే (దుర్గ దేవాలయమునకు పశ్చిమాన) రెండు ఫర్లాంగులలో గల మరొక పర్వత ఉత్తర భాగాన నాల్గవ గుహాలయము, దీనికి వాయువ్యాన గల మరొక కొండపై ఐదవ గుహాలయము గలవు.

ఒకటవ గుహాలయము మూడు దేవ గృహములను కలిగి యున్నది. వీటి ముందు అన్నింటికి కలిసి ఒక వరండా కలదు. ఇది ముఖ భాగమున రెండు స్తంభాలను కలిగి మండప ఎడమ కుడి కొనలలో రెండు అర్థ స్తంభాలను కలిగియున్నది.

రెండవ గుహాలయము సుమారు 7 అ॥ 6॥ చతురస్రము గల ఒకే దేవ గృహమును కలిగి దాని ముందు దేవ గృహమునకన్న రెండింతలు గల దీర్ఘ చతురస్రాకార వరండా కలిగి యున్నది. దీని ముఖ భాగమునకు సపోర్టుగా రెండు సాధారణ స్తంభాలు, వరండాకు ఎడమ కొసలలో రెండు స్తంభాలు కలవు.

మూడవ గుహాలయము చాల వరకు రెండవ గుహాలయమువలె యున్నది. కాని దీని దేవ గృహము చిన్నదిగా యున్నది. సుమారు 6 చ॥ అ॥ యున్నది. దీని ముందు గల మండపము సుమారు 12 అ. 9 అం. చతురస్రాకారముగ యున్నది. కానీ దీని ముఖ భాగము కపోత(కార్నిస్)ను, అందు చైత్య కూడులను మూడింటిని కలిగి యుండుటే గాక దీని వెనుకగా పై అంతస్తు గుహాలయ అంతర పట్టికలను, సాదా లూపములను కలిగి యున్నది. ఈ గుహా స్తంభాలు ఘన చతురుస్రాకార, అక్టాగనల్ సెక్షన్ విభాగాలను కలిగి యున్నవి. ఇచటి దేవ గృహములో వెనుక కుడ్య ముఖ భాగాన మొరటుగా రూపొందింప బడిన దుర్గ ప్రతిమ గలదు.

ఈ గుహాలయ ముఖభాగపు తూర్పు విభాగాన శిథిల దశలోని త్రిమూర్తులు గల కూడు యుండగా, పశ్చిమ విభాగాన అసంపూర్తిగా వున్న త్రిమూర్తుల చిత్రము గలదు. ఈ శిల్పమునకు పశ్చిమాన ఎవరినో వధించుచున్న యుద్దవీరుని అర్థ శిల్పము, క్రీ శ. 8 లేక 9 వ శతాబ్దమునకు చెందిన శిథిలమైన (తొలి) తెలుగు శానము గలవు. ఒకటవ గుహాలయము తొలి దశకు చెందినదిగను: రెండవ మూడవ గుహలు తరువాతి దశకు చెందినవిగను చెప్పవచ్చును. మూడవ, నాల్గవ గుహలు చాల వరకు తమిళ ప్రాంత మందలి పల్లవ మహేంద్ర వర్మ గుహలను పోలి యున్నవి.

నాల్గవ గుహాలయము మొగల్ రాజ పురం గుహాలయలన్నింటి లోకి పెద్దదేగాక శిథిలము కాకుండా యున్న పరిణతి చెందిన దశకు చెందినదిగా చెప్పవచ్చును. (5 , 6 చిత్ర పటములుచూడుము)

ఇది ఓపన్ ముఖ మండపమును కలిగి యున్నది. గుహాలయ ముఖ భాగమున entablature నందు గల కాపిటల్ భాగమున తరంగ కార్బెల్ కలదు. అంతే కాక సాదాగా అడ్డానికి రూపొందించ బడి యున్న చూరు అత్తడ (eavesboard) కపోత (roll-cornice) క్రింధి భాగమున గలవు. కపోత. పై విభాగాలలో 'చైత్య' (కూడు) లేక నాసిక విభాగాలు గలవు. వీటి మద్య భాగాన దేవీ సమేతుడైన విష్ణు, దేవీ సమేతుడైన శివుడు, మూడు శిరస్సుల బ్రహ్మ వరుసగా కుడి నుండి ఎడమవైపుగా రూపొందింప బడి యున్నారు. ఈ "కూడు ' లేక నాసిక ల crest భాగమున ' సింహాలలాట' విభాగము గలదు. కార్నిస్ పై విభాగమున వెనుకగా ఏనుగులు, సింహముల అర్థ శిల్పముల వరుస కలదు. వీటి పై భాగాన మధ్యగా శిథిల దశలో గల అర్థ శిల్ప రూప తాండవ శివుడు గలదు. మండప ముఖ భాగమున గల పల్లవ మహేంద్ర వర్మ రీతిలో గల లావు పాటి సదురం....కట్టు....సదురం. రకమునకు చెందిన స్తంభములు గలవు. వీటి లోపలి ముఖ భాగపు పై సదుర ముఖ భాగాన గల 'పధకము' లు (medallions) విష్ణు, కృష్ణుల గజేంద్ర మోక్ష, పూతన సంహార ఘట్టములు, గందర్వలను గలిగియున్నవి. గుహ యొక్క ముఖ భాగ స్తంభముల వరుసలోనే కుడి ఎడమ కొసలలో ముందుకు చొచ్చుకొనియున్న స్తంభాలు గలవు. ఈ కొసలలోనే రెండువైపులా దిక్పాలురు గలరు. వీరు చెరొకరు ఎడమ, కుడి చేతులను బరువైన గదపై కలిగి మరొక చేతిని(తూర్పువైపు ద్వారపాలుడు) కటి హస్తరీతిలోను,(మరొకరు) విస్మయ హస్తరీతిలోను కలిగియున్నారు. వీరి ఉత్తరీయము యజ్ఞోపవీత వైపుగా దేహముపై కలిగి పల్లవరీతిలో వలె కుడిచేతిపై ఆనియున్నది. ద్వారపాలురు తలలపై కొమ్ములు గలిగి, వాటి మధ్య శిరోవస్త్రము కలిగియున్నారు.

దీని వరండాయందు స్వేచ్ఛగా నిలబడియున్న నాలుగు స్తంభములు, రెండు స్తంభములు ఏర్పరిచి యున్నందున వరండా రెండు విభాగాలుగా విభజింపబడి యున్నది. వీటి వెనుక ఒక అధిష్టానముపై మూడు గుహాలయాలు గలవు. మధ్యది ఆఖరు దాని కన్నను కొంత పెద్దదిగా యున్నది, ఈ గుహాలయము శివునికి అంకితమైనది. కానీ ఇరువైపుల విష్ణు, బ్రహ్మలు గలరు. ఈ గుహాలయము ముందు గల 'ముఖమండప' ప్రక్క భాగాలలో స్తంభమండపములు గలవు. తూర్పుది స్పష్టముగా రూపొందించబడినప్పటికి. పశ్చిమ భాగముది అసంపూర్తిగా వదిలివేయ బడియున్నది. ఇట్టి విధానము ఎల్లోరా, ఐహోలె మొదలగు ప్రాంతాలలో గల తూర్పు చాళుక్య సాంప్రదాయమును తెలుపుచున్నవి. ఇదియే త్రికూట ఆలయ నిర్మాణాలకు మార్గదర్శకమని భావించవచ్చును.

ఐదవ గుహాలయము తూర్పుముఖముగా వున్నది. దీని ముఖమండపము వెనుక ఒకే దేవగృహము గలదు దీనికి సిలాప్టర్ ద్వార విభాగము గలదు. దేవ గృహమునకు ఇరుపైవులా ఇద్దరు ద్వార పాలురు గలరు. వీరు ఖడ్గము, డాలు గలిగి తమిళ ప్రాంతమందలి శియమంగళ గుహాలయములోని ద్వార పాలురవలె వున్నారు. మండప మందు అనేక స్తంభములు గలవు. గుహ ముఖ భాగపు (facade) దక్షిణ కొస భాగాన చొచ్చుకొని యున్న కుడ్య స్థంభము పూర్ణఘటను గలిగి యున్నది. ఈ పూర్ణ ఘట రూపము ఔరంగాబాదు, ఎల్లోరా మొదలగు ప్రాంతాల బౌద్ధ నిర్మాణాలలోను, ఐహోలె వంటి ప్రాంతాలలోను కల తొలి హైందవ దేవాలయములలో అగుపడును.

ఉండవల్లి గుహాలయము:

ఉండవల్లి గుహాలయాన్ని ప్రాంతీయముగా అనంతశయన గుడి (గృహ) యందురు. రెండవ అంతస్తు లోని అనంత శయన విష్ణు ప్రతిమ వలన దీనికీ పేరొచ్చినది. ఇది కృష్ణ ఉత్తర ఒడ్డున వున్నవిజయవాడకు ఎదురుగా కృష్ణ దక్షిణ ఒడ్డున (గుంటూరు జిల్లాలో) గుంటూరు విజయవాడ మధ్య (విజయవాడ తరువాత రెండు మైళ్ళ దూరంలో) గల తాడేపల్లి రైల్వేస్టేషన్ కు వాయవ్యమున ఉన్నది. ఇచటి గుహాలయము ఈశాన్య ముఖముగా వున్నది.

గ్రౌండ్ ప్లోర్ భాగము తప్ప మిగిలిన ఈ గుహాలయపు మూడు అంతస్తులు సుమారు 50 అడుగుల ఎత్తు గలిగి, వీటి ముందు భాగము 90 అడుగుల పొడవు యున్నది. గ్రౌండ్ ప్లోర్ అసంపూర్తిగా వున్నది. సాదా హాలు కలిగి లావైన ఘన చతురస్రాకార స్థంభములు గలిగి వున్నది. కాని ఒకటవ ప్లోర్ భాగము, విశాలముగా వున్నది. ఇందలి స్తంభాలు మొరటుగా, ఘన చతురస్ర, అక్టాగనల్ విభాగాలను గలిగి, పైభాగాన బరువైన తరంగ కార్బెల్, దాని పైన ఒక frieze of geas అటుపై బరువైన 'కపోత ' (roll cornice) (దానికి చైత్య "కూడు " విభాగాలు) గలవు. గుహ లోపలి విభాగము స్తంభ మండపాన్ని గలిగి దాని వెనుక గోడ భాగమున దేవ గృహమున దేవ గృహము ఏర్పరచబడి దేవత ప్రతిమ లేక శివలింగ స్థాపనకు 'పీఠము' ఏర్పరచబడి యున్నది. ఈ మధ్య (కేంద్ర) దేవ గృహమే గాక దీనికి ఎడమ రెండు, కుడివైపున మరొక దేవ గృహములు కలవు. ఎడమ వైపు కొసనున్నది చిన్నది. ఈ దేవ గృహలన్నిటికి ఒక స్తంభ మండపము గలదు. కేంద్ర దేవగృహానికి కూడ ప్రత్యేక స్తంభ మండపము గలదు. ఉత్తరపు చిన్న దేవ గృహమందే ద్వార పాలురు గలరు. ఇచటి దేవ గృహాలు, మండపాలు ఎల్లోరా గుహాలయములను పోలి యున్నవి. మెదటి అంతస్తుకు గ్రౌండ్ ప్లోర్ నుండి మెట్లు లేవు. కాని మొదటి అంతస్తు నుండి పై అంతస్తుకు మెట్లు గలవు. దీనిని బట్టి గ్రౌండ్ ప్లోర్ ఇచటి దేవ గృహలలో మలి దశకు చెందినదై వుండ వచ్చునని చెప్ప వచ్చును.

రెండవ అంతస్తులోని దేవ గృహ ఉత్తర దక్షిణాలుగా వున్నది. మొదటి అంతస్తు దేవ గృహము వలె తూర్పు పడమరలుగా లేదు. ఇచటి స్తంభ మండపము 50 అ॥ పొడవు 28 అ॥ వెడల్పు గలిగి యున్నది. దేవ గృహము 12అ॥ పొడవు, 13 అ॥ 9 అం॥ వెడల్పు గలిగి యున్నది. ఈ పరిణామముల వలననే ఇది ఉత్తర దక్షిణాలుగా శిలాఖండ పరిమితి వలన రూపొందించ వలసి వచ్చెను. ఇచటి దేవగృహలో అనంత శాయి విష్ణు ప్రతిమ తూర్పు పడమరులుగా రూపొందించబడి ఉత్తర కుడ్యము దగ్గరలో వున్నది.

ఇది పల్లవ రీతి గుహగా భావించ బడుచున్నప్పటికీ ఇది పల్లవేతర గుహలైన ఔరంగాబాద్ బౌద్ధ గుహాలయములను కొంతవరకు పోలియున్నది. పల్లవ మహేంద్ర వర్మ తరువాతి కాలమునకు చెందిన మహాబలి పురమందలి మహిష మర్థిని గుహాలయముతో పోల్చుటకు ఇది సరిపడుట లేదు. కాని ఇచటి మండప, దేవగృహ, స్తంభముల సింహాలు (ఒక పాదము పైకి యుండుట) మహేంద్ర వర్మ తరువాతి రీతి నిర్మాణాలుగా సూచించును. మూడవ అంతస్తులోని గుహ ముఖ భాగము (facade) లోని 'కూడిశాలా'(?) వరుసలు మామల్ల పూర్వ వాస్తు రీతిలో అగుపడవు. కాని పట్టడకల్, ఎల్లోరాలలో రాష్ట్ర కూట నిర్మాణాలలో వలె అగుపడును. దక్కన్ లోని ఇట్టి గుహాలయాల వివరాల గూర్చి బాగా తెలిసినటువంటి, ఈ గుహాలయాల ప్రాంతాలను పాలించినటువంటి రాజ వంశజులు విష్ణు కుండినులు లేక తూర్పు చాళుక్యులై యుండవచ్చు.

ఆఖరిదైన పై అంతస్తు మూడు దేవ గృహాలను కలిగి యున్నది. భైరవ కోన గుహాలయాల స్తంభాలు వంటివి ఇచట మనకగుపడును.

ఇచటి కొండ పైననే అసంపూర్తిగా వదిలి వేయడిన నాలుగు గుహాలయాలు గలవు. వీటిలో ఒకటి మూడు దేవగృహలను మిగిలినవి ఏక దేవ గృహాన్ని కలిగి యున్నవి.

ఇవేగాక మహాబలిపురములోని అర్జున తపో సంఘటనలోని రథము వంటి దేవ గృహవలె ఇచట ఆరు (రథముల వంటి నిర్మాణములు) గలవు (10 వ చిత్రపటము చూడుము). బరువైన 'కపోత' (heavy roll comics) సాదా కుడ్య స్తంభాలు, 'కూడు 'లేక 'మకుర పంజర ' లతోబాటు 'అధిష్టాన ', 'కుముద ', 'వేదిక ', 'శిఖర ', 'కలశ ' విభాగాలను కూడ కలిగి యున్నవి. లింగ ప్రతిష్ఠాపన దేవ గృహాన చేయ బడి యున్నది.