ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/శంకరకవి

వికీసోర్స్ నుండి

చ. అధిపతి నంచు గ్రద్ద మిము నందఱ నీనగవింధ్యవాసకున్

వధ యొనరించి మాంసము లవారణగా బలిపెట్టజూచె మీ

రధములువోలెనుండ దగదన్న ఖగంబులుపల్కె మమ్ము నీ

విధమున బాపగాదలచి వీడగనాడుట మీకు ధర్మమే. [ఆ.3]


ఉ. అంతట రాగమంజరి గృహంబున సీధురసంబు గ్రోలి యే

కాంతమ యప్పురంబు చిఱుగ్రంతల నేగ దలారిమానుసుల్

చెంతల డాసి పట్టుకొని చేతుల దంపిన నన్నుమిన్న యా

ప్రాంతమునందు ద్రెళ్ళి కెళవారయుదూతిక గాంచె నాదటన్. [ఆ.4]

                           _________

27. శంకరకవి

ఈకవి హరిశ్చంద్రోపాఖ్యానమును పద్యకావ్యమునుగా రచించెను. ఈకావ్యమును నెల్లూరికావ్య మనియు, కవిని నెల్లూరి శంకరకవి యనియు, బ్రౌన్ దొరగారు వ్రాసిరికాని యావ్రాత నిరాధారమైనది. కవి గోదావరి మండలములోని వాడు; కృతి నాయకుడైన యీడూరి యెల్లనయు గోదావరీమండలములోనివా డయి యీడూరి కరణమును కార్కొలనువాసస్థుడు నయియుండెను. ఈయంశములను కవి తనపుస్తకమునం దిట్లు చెప్పినాడు.-


గీ. మతి వితర్కింప గేవలమంత్రిమాత్రు

డే ధనంజయబాహుశౌర్యాధికుండు

సత్యవర్తను డీడూరిశాసనుండు

హితవచోహరి బాచయయెల్లశౌరి.

న. అమ్మంత్రినిధానంబునకు నిజస్థానంబు మ. అరవిందాసనవాస వాద్యమరలోకారాధ్యకర్కోటకే

శ్వరకారుణ్యసదాభిరక్షితము భాస్వద్దీప్తిమద్భూసురో

త్కరనిత్యశ్రుతిపాఠనిస్వన ముదాత్తశ్రీ నజస్రమ్ంబు ని

ద్ధరణిం బేర్కొన నొప్పు గార్కొలను గోదావర్యుపాంతంబునన్.


ఒక్క కృతిపతిమాత్రమేకాక కృతిపతియొక్క తాతముత్తాతలును గోదావరిమండలములోనే పుట్టి పెరిగి యక్కడనే సంబంధబాంథవ్యములను జేసికొనుచుండిరి. కవి కృతిపతియొక్క ముత్తాతను వర్ణించుచు నతడు గోదావరి మండలములోని యుండి గ్రామములో సంబంధము చేసికొన్నట్లీ క్రింది పద్యమున జెప్పినాడు-


చ. ప్రెగడనమంత్రి బంధుజనబృందము పేర్కొన నుండిశాసనుం

డగుమతిశాలివీరసచివాగ్రణిపుత్రిక దిప్పమాంబికన్

దగుమహిమ న్వివాహ మయి ధన్యచరిత్రుల గాంచె బుత్రులన్

జగదభివర్ణనీయుల విశాలయశోవిభవాభిరాములన్.


ఈడూరికరణమునకు గృతి యిచ్చినకవియు తద్గ్రామపరిసరమున నివసించువాడే యై యుండవలెనుగాని యెక్కడనుండియో నెల్లూరినుండి వెదకుకొనుచు వచ్చినవాడయి యుండడు. కవి తన గ్రంథములోనే తానాయెల్లనార్యునికి బంధుడును విధేయుడు నయినట్లును తన్నతడింటికి బిలిపించి హరిశ్చంద్ర చరిత్రమును దన కంకితము చేయుమని కోరినట్లును చెప్పిన పద్యములలో నొకటియిందు వ్రాయుచున్నాను-


మ. నను గౌండిన్యమునీంద్రగోత్రజు సుధాంధస్సింధుకల్లోలతు

ల్యనిరాఘాటవచోధురంధరుని డేచామాత్యసత్పుత్రు బా

వనచారిత్రు శశాంకమోళిపద సేవాలబ్ధసాహిత్యస

ద్ధనునిన్ బంధు విధేయు శంకరకవిన్ దాక్షిణ్యపుణ్యాధికున్.


కృతిపతియు గృతికర్తయు నిరువురును గూడ నాఱువేలనియోగులు. వారిరువురును కుతుబ్‌షా గోలకొండ నవాబుగా నున్నకాల ములో నున్నట్లు కవికృతినాయకుని గూర్చి పంచమాశ్వాసాంతమున సంబోధించిన యీ పద్యమువలన దెలియవచ్చుచున్నది.


క. అలఘుప్రతాపకుతుబన|మల కేంద్రకృపాసమగ్రమహిమాన్విత కా

ర్కొలనిగ్రామని కేతన|జనసీమారక్షణై కచాతుర్యనిధీ.


ఈకుతుబనమల కేంద్రుడు సాధారణముగా నిభరామని చెప్పబడెడి యిబ్రహీము కుమారు డయినమహమ్మదు కుతుబ్‌షా. ఇతడు క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును గోలకొండలో రాజ్యము చేసినందున, కవియు నప్పుడే యుండి పదునాఱవ శతాబ్దాంతముననో పదునేడవశతాబ్దాదియందో యీపుస్తకమును జేసియుండును. శంకరకవివిరచితమైన హరిశ్చంద్రోపాఖ్యానము మృదుమధురపాకము గలదయి రసవంత మయి సహృదయహ్లాదకరముగా నుండును. ఇందలి పద్యముల నొక్కొక్కయాశ్వాసమునుండి యొక్కొక్కదాని నిందుదాహరించెదను.


శా. ఆకర్ణింపుము పాకశాసన సుపర్వానీకసంసేవ్య భూ

లోకాధీశు డగణ్యపుణ్యుడు కృపాలోలాత్మకుం డర్థిర

క్షాకల్పద్రుమ మద్రిధీరుడు హరిశ్చంద్రాభిధానుండు ధా

త్రీకంతుం డొక డొప్పు సూనృతవచ:శ్రీవభవోపేతుడై. [ఆ.1]


చ. మును ధర యేలి చన్ననృపముఖ్యు లనేకులు చర్చచేసినన్

జనవర వారిలోన విలసన్మతిపారగు లెవ్వరైన సొం

పున దమవెంట ముంటిమొనమోపగజాలినయంతమేరయున్

గొని చనిరే ధరాతలము కొంకకుమీ యిల దానమిచ్చుచోన్. [ఆ.2]


సీ. పరమపావనతేజ పావక సదయాత్మ హరిణాంకమౌళిపర్యాయకాయ

యనఘపాతివ్రత్యమున మనోవాక్కాయకర్మవిస్ఫూర్తిచే ధర్మనిరతి

బూని చరించితినేని మత్ప్రాణేశ్వరుండు సూనృతవచోరూడి మెఱని

భూనుతకీర్తివిభూతిశోభితుడేని శీతలాకృత మౌనిశిష్యునకును విశదవాత్సల్యమున మున్ను కుశల మొసగి

పిదప గౌశికుఋణము సంప్రీతిదీర్ప

గూడునట్లుగ బెనిమిటి గొడుకు గరుణ

నరసి రక్షింపవయ్య జోహారునీకు.


శా. ఏణీలోచన నానిమిత్తమున నీ కీపాటు పాటిల్లెనే

క్షోణీనాథులరాణివాసములు చక్షుకౌతుకాపాదిని

శ్రేణీలాలితహర్మ్యవాటికలలో గ్రీడావి శేషంబులన్

బ్రాణేశాన్వితలై నిరంతరసుఖప్రౌడిన్ వినోదింపగన్. [ఆ.4]


మ. అకటా చేరెడు నేలకుం దగడె సప్తాంభోధివేష్టీభవ

త్సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోజ్జ్వల

ప్రకటానర్గళనిర్గళత్కిరణశుంభత్పాదు డై నట్టిరా

జుకుమారుం డని యేడ్చె గన్ను గవ నశ్రు ల్కాల్వలై పాఱగన్. [ఆ.5]

                           _______

28. కంచి వీరశరభకవి

ఈకవియు శంకరకవివలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు . ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమకావ్యములను రచియించినట్లు తోచుచునంది. ఇందు శంకరకవిపుస్తకమునకంటె నేబదిపద్యము లధికముగా నున్నవి. ఒకరు వ్రాయుచున్నకథ నొక రెరుగకయిరువురుకవులును గౌరనమంత్రికృతమైన ద్విపదకావ్యము ననుసరించి తమ పద్యకావ్య ములను జేసి యుండవచ్చును. ఒకవేళ నీయిద్దరిలో నొకరు రెండవ వాని కావ్యమును జూచి తరువాత దనపుస్తకమును జేసియు నుండవచ్చును. ఈయంశమును దీనిం జదువువారు నిర్ధారణ చేసికొన గలుగుట కయి యించుమించుగా శంకరకవి గ్రంథములోనుండి యుదాహరించిన పద్యముల యర్థము నిచ్చెడు పద్యములనే యిందుదాహరించు చున్నాను-


చ. ఉరుతరసత్యవాక్యవినయోచితభూరిగుణప్రసిద్ధికిన్

నరపతు లేమిలెక్క పదునాలుగులోకములయందు జూడ గి

న్నరసురయక్షకింపురషనాయకులం దొక డైన లేడు ని

ర్భరమహితప్రభావమున బన్నిద మిత్తు బురారిసన్నిధిన్. [ఆ.1]


ఉ. మానవనాథ యీకొఱత మాటల దీఱదు గాధినూను డీ

పూనిక దప్ప డింక గొనిపోయిరె మున్ను ధరిత్రి చేరెడం

తైన నర్తేంద్రముఖ్యులు దివాకరవంశ పయోధిచంద్ర నీ

మానితవాగ్వదాన్యమహిమం బెడబాయు టదేమి చూడగన్. [ఆ.2]


చ. ధృతిమెఱయంగ నే నిటుపతివ్రత నేని, ధరిత్రిమీద మ

త్పతిఘనసత్యవాక్యనయభాసుర డేని కృశాన నీ విదే

హితమతి శీతలాకృతి వహించి ధరామరవర్యు భూవిభున్

సుతు డగులోహితాస్యు దయజూచి మునీంద్రుఋణంబుదీర్పుమా. [ఆ.2]


ఉ. ఏమనవచ్చు మున్ను ధరయేలినరాజులదేవులెల్ల స

త్కామవినోదవైభవసుఖప్రదలై నసియింప, నిన్ను బల్

బాముల గప్పి కాఱడవిపాలుగ ద్రిప్పి కృతఘ్న బుద్ధిచే

నీమము దప్పి యమ్ముకొన నేరుపు గల్గె లతాంగి యేమనన్. [అ.4] శా. సప్తద్వీపసముద్రముద్రితమహాసర్వంసహాచక్రసం

ప్రాప్తశ్రీకమనీయలక్షణజగత్ప్రావీణ్యసత్యవ్రతో

ద్దీప్తప్రాభవు డైనరాజసుతు డర్థిన్ దైన్యభావోదయ

వ్యాప్తిన్ బెత్తెడునేల కైన దగడే యంచు న్విలాపించుచున్. [ఆ.5]

                           __________


29. తెనాలి రామకృష్ణుడు.

ఈతనికి మొట్టమొదట రామలింగ మని పేరనియు, ఆపేరుతో నితడు శివభక్తిపరాయణు డయి లింగపురాణమును తెనిగించెననియు, చెప్పుదురుగారి యిది యెంతవరకు నిజమో తెలియదు. ఈతనిచే నాంధ్రికరింపబడినదన్న లింగపురాణ మిప్పు డెక్కడను గానబడదు. అప్పకవి మొదలగువారు రచించిన లక్షణగ్రంథములలో నందలిపద్య మొక్కటియు నుదాహరింపబడి యుండకపోవుటచే పూర్వకాలము నందుసహితమట్టి గ్రంథ మున్నట్టు తోచదు. ఈకవి మొట్టమొదట శివభక్తు డయినను విష్ణుభక్తులగు చంద్రగిరిరాజులను సంతోషపెట్టుటకయి తరువాత విష్ణుభక్తు డయి వైష్ణవులను గురువులనుగా గైకొనె ననియు గూడ జెప్పుదురు. ఈకథ సత్యమైనను గావచ్చును. ఇతడు రచియించినట్టు చెప్పెడు చాటుపద్యములలో గొన్నిటిలో నీతనిపేరు రామలింగమని కానబడుచున్నది. అందొకపద్యము నిందుదాహరించుచున్నాను-


ఉ. లింగనిషిద్ధు గల్వలచెలింగని, మేచకకంధరుం ద్రిశూ

లింగని సంగతాళి లవలింగని, కర్దమదూషిత న్మృణా

లింగని, కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృనా

లింగని, రామలింగకవిలింగనికీర్తి హసించుదిక్కులన్. కూర్మపురాణమునందు రాజలింగకవి కవిస్తుతిచేయుచు "రంగనాథుని రామలింగకవిని" అని రామలింగనామమునే వాడియున్నాడు. ఈరామకృష్ణకవి గృష్ణామండలములోని తెనాలిగ్రామమునందు శాలివాహనశకము 1384 వ సంవత్సరమున ననగా క్రీస్తుశకమ 1462 వ సంవత్సరమున జనన మొందెననియు, ఈతనియింటిపే రీశ్వరప్రెగడవారనియు, పయికాలమును సూచించెడి యీతని జన్మపత్రికవలన నితడు మంచిలగ్నమున బుట్టినట్టు కానవచ్చుచున్నదనియు, అఱువదిసంవత్సరములక్రిందట తమదక్షిణహిందూస్థానకవిచరిత్రమునందు కానలి వేంకటరామస్వామిగారు వ్రాసియున్నారు. అయినను మన కీతనికాలమును గూర్చి యిప్పుడు దొరకిన నిదర్శనములనుబట్టి చూడగా పూర్వోక్తకాలము సరియైనదని నమ్ముటకు వలనుపడదు. రామకృష్ణకవి దని చెప్పబడెడు జన్మపత్ర మిటీవలివారిచేత సృష్టింప బడిన దయి యుండవలెను. అటుగాక యితడు పయిని జెప్పబడిన సంవత్సరమునందే జన్మించి యుండినపక్షమున, ఈకవి కృష్ణదేవరాయలు సింహాసనమునకు వచ్చునప్పటికే దాదాపుగా నేబదియేండ్ల ప్రాయము గలవా డయి యుండవలెను. రామకృష్ణకవి యప్పయదీక్షితుల వారితోను తిరుమల తాతాచార్యులతోను సమకాలికు డయి చంద్రగిరిరా జగు వేంకటపతిరాయల ప్రభుత్వకాలములో నుండినవా డయినట్లు కొన్నినిదర్శనములు కనబడుచున్నవి. ఈవేంకటపతిరాయలు వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయల యనంతరమున తనరాజధానిని విజయనగరమునుండి చంద్రగిరికి మార్చుకొని క్రీస్తుశకము 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినవాడు. కృష్ణరాయని మరణానంతరమున నేబదియైదుసంవత్సరములకు రాజ్యమునకు వచ్చిన వేంకటపతిరాజుయొక్క రాజ్యకాలములో నున్న రామకృష్ణకవి నిజముగా నొకవేళ కృష్ణదేవరాయల కాలములో గూడ నుండుటయే తట స్థించినపక్షమున, అత డప్పుడు బాలు డయియుండెవలెనుగాని జన్మపత్రమునందు జెప్పబడినప్రకారము వయసుమీఱినవా డయియుండ జాలడు. కాబట్టి యాజన్మపత్ర మెంతమాత్రమును విశ్వాసపాత్రమయినది కాదు. ఈ కాలవ్యత్యాసమును సరిపఱుచుట కయి కొంద ఱప్పయ్యదీక్షితులవారుకూడ కృష్ణదేవరాయలకాలమునాటివారే యని చెప్పుచున్నారు. అప్పయ్యదీక్షితులవారు మిక్కిలి వృద్ధు లగువఱకును జీవించినవా రగుటచేత బాల్యమున కృష్ణరాయని దినములలో నుండిన నుండవచ్చునుగాని యీసంస్కృత విద్వత్కవి వేంకటపతిరాయల యాస్థానమునందే యుండి ప్రసిద్ధు డయినవాడు. ఈదీక్షితులవారు కాంచీపురమునకు నలుబదిమైళ్ళ దూరములోనున్న యదెపోల మను నగ్రహారమున నీశ్వరాంశచేత నారాయణదీక్షితులకు పుత్రుడయి పుట్టెననియు, ఇతడు తనపండ్రెండవసంవత్సరమునాటికే వేదాధ్యయనము చేసి "శివార్చనచంద్రిక" "శివతత్త్వవివేకము", "శివమణిదీపిక" "ఆత్మార్పణము" మొదలయిన శైవగ్రంథము లనేకములు చేసెననియు, వాదమునందు వేంకటపతిరాయలసంస్థానమున రాజగురువయిన తాతాచార్యుల నోడించి రజసమ్మానము పొందెననియు కావేరీతీరమునందనేక యాగములుచేసి యవసానదశయందు కాశీవాసము చేయవలెనని యఱువది యేండ్లు నిండినతరువాత ప్రయాణ మయిపోవుచుండగా త్రోవలో చిదంబర పురనివాసు లాతనిపోనీయక తమయూరనుండునట్లు ప్రార్థించి నిలిపినందున నపరకాశి యగు చిదంబరమునందుండి యందే దేహవియోగము నొందెననియు అతడు నూటికంటె నెక్కువపుస్తకములు రచించెననియు చెప్పుదురు. ఇప్పు డీమహాకవి రచించిన గ్రంథము లనేకములు నశించినవి. కువలయానందమనెడి యలంకారశాస్త్రము సుప్రసిద్ధమయి సర్వదేశములయందును వ్యాపించియున్నది. తనతండ్రికి గలిగిన గెలుపులను వర్ణించుచు నీలకంఠవిజయమను సంస్కృతగ్రంథమును జేసిన