ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/అద్దంకి గంగాధరకవి

వికీసోర్స్ నుండి

పింగళిసూరన్న గిరిజాకళ్యాణములోని దని యీక్రిందిపద్యము రంగరాట్ఛందస్సులో నుదాహరింపబడి యున్నదిగాని యీపుస్తకము నాకు లభించలేదు.


క. కోపాటోపంబున ధర * ణీపాలకచంద్రముడు మునిశిఖామణులన్

ద్రోపించిన వారు దురా * లాపము లాడుచు బోయి రాసమయమునన్.


20. అద్దంకి గంగాధరకవి.

ఈ గంగాధరకవి నియోగిబ్రాహ్మణుడు; వీరనామాత్యుని పుత్రుడు. ఇతడు గోలకొండ నబాబైన ముల్కిభరాము (ఇబ్రహీమ్‌ మల్కు) వద్ద నాస్థానకవీశ్వరుడుగా నుండెను. యయాతిచరిత్రమును రచియించిన పొన్నికంటి తెలగనార్యుడుగాక తనగ్రంథమును మహమ్మదీయుల కంకితముచేసిన తెలుగుకవి యీత డొక్కడే యైనట్లు కానబడుచున్నాడు. ఈకవి రచియించిన గ్రంథములలో ముఖ్యమైనది తపతీ సంవరణ మను శృంగారప్రబంధము. ఈగ్రంథమునందు కృతినాయకుడైన మల్నిభరా మీక్రింది రీతిని వర్ణింపబడెను.-


సీ. సకలవేదపురాణశాస్త్రసారగు లైన

యొంటరివిద్వాంసు లొక్కచోట

నష్టభాషలయందు నాంధ్యంబు లేకుండు

హొంతకారికవీంద్రు లొక్కవంక

గజపతి నరపతి క్ష్మాభర్త లంపిన

యొడికంపురాయబా ర్లొక్కదండ

మేరుమందరముల మించగల్గినమన్ని

యులు దండనాథు లొక్కొక్కయెడల

జేరికొల్వ భద్రాసనాసీను డగుచు

రమ్యగుణహారి మల్కి భ రామశౌరి

భారతక్షీరమయసింధుబంధమధ్య

లలిత పుణ్యకథాసుధాలహరి దేలి. దక్షిణహిందూస్థానమునందు భామినీవంశీయతురష్క రాష్ట్రావసానదశయందు స్వతంత్రులయిన యయిదుగురు మహమ్మదీయ ప్రభువులలో నొకడయి గోలకొండ రాజ్యసంస్థాపకుడయి క్రీస్తుశకము 1512 వ సంవత్సరము మొదలు 1543 సం వఱకును రాజ్యముచేసిన కుతుబ్‌ షాకీయిబ్రహీము చతుర్థ పుత్రుడు. గోలకొండ రాజ్యస్థాపకుడయిన కుతుబ్ షా హిందువులను మాత్రమేకాక మహమ్మదీయులను సహిత మనేకులను జయించి తన రాజ్యమును వ్యాపింపజేసెను. ఆతని విజయములను గూర్చి తపతీసంవరణములోని యీ క్రింది పద్యము కొంత వివరించుచున్నది-


సీ. పడమటను సపాయి బసవని గాజేసి

యచట గొయ్యలకొండ నావరించె

దమదిమల్లాఖాను దక్షిణంబున గొట్టి

హరియించె బానుగ ల్లాదిగిరుల

నుత్తరంబున బరీదోడి పాఱగ దోలి

మెతుకుదుర్గం బాక్రమించి మించె

బ్రథమదిక్కున నొడ్డి పాత్రసామంతుల

ధట్టించి కంబముమెట్ట గొనియె

నతని బొగడంగ దగదె యాచతురసీతి

రూడిగిరిదుర్గలుంఠనప్రౌడతేజు

వాహశిఖరాధిరోహ రేవంతమూర్తి

కుతుబుశాహినిక్ష్మాపాలు గుణవిశాలు.


అయినను కృష్ణదేవరాయలు క్రీస్తుశకము 1516 వ సంవత్సరమునందు తెలుగుదేశమంతయు జయించి, ఓడ్రరాజులయిన గజపతుల కొమార్తెను తాను వివాహ మాడుటచేత తత్సంబంధమునుబట్టి రాజమహేంద్రవరము ప్రధాన నగరముగాగల యాంధ్రదేశమునంతను గజ పతులకిచ్చెను. కాని కృష్ణదేవరాయల మరణానంతరమున కుతుబ్ షా కొండపల్లివద్ద జరిగిన యుద్ధములో హిందువుల నోడించి కృష్ణా గోదావరీ మధ్యరాష్ట్రమునంతను నాక్రమించుకొనెను. ఈయంశము నే పూర్వోక్తగ్రంథములోని


"కట కేశ్వరుని దోలి కైవసంబుగకేసె

గొండంతజయముతో గొండపల్లి."


అను సీసపాదము చెప్పుచున్నది.కుతుబ్ షాయొక్క యనంతరమునందాతని ద్వితీయపుత్రుడైన జామ్‌షీదు రాజ్యమునకు వచ్చి క్రీస్తుశకము 1543 వ సంవత్సరము మొదలుకొని 1550 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసెను. ఇతడు మహాక్రూరుడు, రాజ్యాశచేత తనయన్నగారి నేత్రములను తీయించి వేసి యాతని నంధునిగా జేసిన పాపాత్ముడు. ఈతని దుష్టస్వభావము నెఱిగి భయపడి పాఱిపోయి యిభరామ్‌షా తనయన్నగారి మరణమువఱకును విజయనగరమునందు కృష్ణదేవరాయని యల్లుడైన రామరాజుయొక్క సంరక్షణమునందుండెను. ఇతడక్కడనున్న కాలములోనే రామరాజభూషణుడు మొదలయిన కవులతోడి సహవాసముచేత సంస్కృతాంధ్ర సాహిత్యమును సంపాదించి, కవిత్వమునం దభిరుచిగలవాడయి క్రీస్తుశకము 1550 వ సంవత్సరమునందు తాను రాజ్యమునకు వచ్చినది మొదలుకొని యాంధ్రకవుల నాదరించి పెక్కుకృతుల నొందెను. ఇతడు తన రాజ్యకాలములో హిందువులతో మైత్రిగలవాడయి హిందూరాజులను వారివారి కవీశ్వరుల తోడ గూడ తన యాస్థానమునకు బిలిపించి తఱచుగా పండితగోష్ఠిని కాలము గడుపుచువచ్చెను. ఈతడొక్కసారి తన యాస్థానమునకు పెమ్మసాని తిమ్మనాయనిని, అనంతపురపు హండెయప్పయను, మట్ల అనంతరాజును, బంగారేచమనాయనిని, పేరమల్లారెడ్డిని, పిలిపించి వారివారి కవీశ్వరులు వారివారిని స్తుతించిన పద్యములను వినుచుండగా కాపువా డయిన మల్లారెడ్డి కవీశ్వరుడు చెప్పిన యీక్రింది పద్యమునకు రాజులందఱును గోపించి యుద్ధసన్నద్ధులయినప్పుడు మల్కిభరామువారిని వారించి శాంతపఱచినట్టొక పుస్తకమున వ్రాయబడియున్నది.


చ. బలరిపుభోగ కృష్ణనరపాలునిపేరకుమారమల్ల మీ

కలితయశ:ప్రభావములు కన్గొనలే కలకట్టుమన్నెమూ

కలు తల లొల్లరో బిరుదుగద్దియముల్ చదివించుకొందు రౌ

కొలదియెఱుంగజాల కలకుక్కలు చుక్కలజూచి కూయవే.


పయిని జెప్పిన యితరరాజుల కవులు చెప్పినపద్యములుకూడ నింపుగా నుండవచ్చును గాన వాటిని వరుసగా నిందు క్రింద బొందుపఱుచు చున్నాను.-


ఉ. చాలుగుఱాలు మాళిగడిసంగడిరాజులు గొల్వరండహో

హాలమహోగ్రఫాలదహనాక్షునియంతటిధాటివాడు నా

యేలిక వేంకటాద్రిధరణీశునితిమ్మడు పెమ్మసానిభూ

పాలుడు హెచ్చు ధాత్రి గలపార్థివు లెల్లను లొచ్చు వీనికిన్.


ఉ. మట్టకరాడు బెట్టురికి మన్నెకుమారుల సీమ ధూళిగా

గొట్టకమాన డేగద యకుంఠితసింహతలాధిరాయ డీ

పెట్టినదండు దీడు రణభీష్ముడు హండియయప్ప శౌరికిం

బెట్టుడు వేగ దండములు బింకము లేటికి శత్రుభూపతుల్.


ఉ. కొద్దినిరాడు దిండుఱికి కోటులుకొమ్మలు గొన్నశూరు డా

గద్దఱిగబ్బిరాచపులి గండరబాలుడు మట్లనంతు డే

ప్రొద్దును వైరిభూభుజులపొంక మడంపనె పుట్టినాడు మీ

పెద్దఱికాలు సాగ విక బ్రేలకుడీ గడిమన్నెభూపతుల్.


ఉ. టెక్కున గొండతో దగరు డీకొని తాకినజోక గాక యీ

బిక్కపకీరుమన్నెసరిబేసిదొరల్ మొన లందు నిల్వ నా నిక్కము బంగరేచనృప నీవు రణస్థలి మోహరించినన్

బక్కున లోకముల్ పగిలిపాఱవె కూలవె దిగ్గజంబులున్.


ఈ యిభరామమల్కు (ఇజ్రహీమ్ మల్కు) క్రీస్తుశకము 1567 వ సంవత్సరమునందు రాజమహేంద్రవరముమీదికి దండెత్తి వచ్చి దానిని జయించి శ్రీకాకుళము వఱకునుగల కళింగదేశము నంతను స్వాధీనము చేసికొనెను. ఇతడు హూణశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున, ఈతని యాస్థానకవియైన గంగాధరకవియు నాకాలమునందే యున్నవాడు. ఈకవికృత మయిన తపతీసంవరణము సరసమయిన దయి మంచి కల్పనలగలిగి దాదాపుగా వసుచరిత్రమునుబోలి వఱలు చున్నది. ఈతని కవిత్వధోరణిని దెల్పుటకై తపతీసంవరణములో నుండి రెండు పద్యముల నిందు జూపుచున్నాను.


ఉ. అక్కమలాక్షి హస్తములయందము నేమనివిన్నవింతు నే

నొక్కొకవేళ నక్కి పలయోష్ఠి సమీపమునందునున్నచో

జొక్కపుదమ్మిపూవు లనుచుం దరుణభ్రమరాళి వ్రాలు బెం

పెక్కినపల్లవంబు లనునిచ్చను డాయును గండుగోయిలల్. [ఆ.2]


మ. చివురుందామరపాకులన్ సలలితశ్రీఖండపంకంబులన్

నవనీహారజలాభిషేచనములన్ నాళీకపాళీమృణా

ళవితానంబుల మౌక్తికగ్రధితమాల్యశ్రేణులన్ బాలప

ల్లవతల్పంబుల శీతలక్రియలు చాలం జేసి రయ్యింతికిన్. [ఆ.3]