అబలా సచ్చరిత్ర రత్నమాల/విరాబాయి

వికీసోర్స్ నుండి

విరాబాయి

    సంగ్రామే సుభటేంద్రాణాం కవినాం కవిమండలే
    దీప్తిర్వాదీప్తిహానిర్వా ముహుర్తాదేవ జాయతే.*

విరాబాయి చితూరు సంస్థానాధీశ్వరునిభార్య. ఈమె అక్బరు బాదుషాకాలము నందుండిననట్లి తిహాసమువలన దెలియుచున్నది. కాని యీమె జన్మమరణ సంవత్సరములును, జననీజనకుల నామములును దెలియు మార్గ మెందును గానరాదు.

విరాబాయి స్వశౌర్యమవలన అక్బరు నోడించి తన భర్తను విడిపించెను. అక్బరు బాదుషా చితూరుపై రెండు పర్యాయములు దండెత్తినను ఫేరిస్తాయను ఇతిహాసకారుడు వ్రాసిన గ్రంథమునం దొకసారి దండువెడలుటయే వర్ణింపబడి యున్నది. స్వజాతీయుడగు బాధుషాయొక్క పరాభవము నాత డెట్లు వ్రాయగలడు? ఒకా నొక రజపూతస్త్రీచే నోడింపబడి పలాయితు డైనందున బాదుషాకీర్తికి సంభవించిన కలంక మగుపడ కుండుటకయి తురుష్కులైన యితిహాసకారు లెవ్వరును చరిత్రములలో నీసంగతి వ్రాయనేలేదు. కాని యాసమయము నందు చితూరుదరబారు నందున్నవారప్పటి యుద్ధమును చక్కగా వర్ణించియున్నారు.


  • యుద్ధమునందు వీరుల శౌర్యాశౌర్యములును, కవి సంఘమునందు కవులయొక్క చాతుర్యాచాతుర్యములును ఒకక్షణమాత్రములో వెల్లడియగును. అక్బరుబాదుషా తనయమిత సైన్యముతో చితూరుపై దండు వెడలినప్పు డచట నుదయసింగు డనురాజు రాజ్యము జేయుచుండెను. ఉదయసింగు రాణా యంతటి పిరికి రాజపుత్రుడు మరియొక డుండడు. అక్బరుబాదుషా దండెత్తి వచ్చిన వార్తవిని రాణాగారికిభయమువలన దేహముకంపమెత్తెను. కాన ఆయన విజయులగు తురుష్కు సేనలతోడ బోర సాహసింప లేడయ్యె. అందుపై నాతని శూరులగు సరదార్లందరుకుంభ రాణా మొదలగు నాతని పూర్వుల ప్రతాపమును దెలిపి యుద్ధమునకు బురికొల్పసాగిరి. కాని యతడు యుద్ధమునకు వెడల డయ్యెను. రాణా సంగ్రామమునకు వెరచుట గని, యాతని సరదార్లు మిగుల నాగ్రహించి "మీరు శత్రువుల నెదిరించి యుద్ధము చేయకుండిన యెడల మిమ్మును రాజ్యభ్రష్టులను జేయుదుము" అనిరి.

ఇట్లందరు నేకతీరుగా జెప్పినందువలన విధి లేక భయముచే దేహము వడక, నాయధైర్యశిరోమణి వీరులగు తన సైనికులతో యుద్ధభూమిని సమీపించెను. కాని సాగరమువలె నలుగడల నిండియున్న యవనసైన్యములంగని భీతిచే గొంతవడి నేమియు దోచక నిలుచుండెను. తదనంతర మెటులనో యారాజు తన సైన్యములకు యుద్ధమున కనుజ్ఞయిచ్చెను. రజపూత శూరసైనికు లందరు మిగుల శౌర్యముతోడ బెనగజొచ్చిరి. వారు జయకాంక్షవలన నెంతపోరినను, ముఖ్యనాయకుని యధైర్యమువలనను, పరబలాధిక్యమువలనను వారికి జయము కలుగు మార్గము కానరాకుండెను. చితూరు కొర కాశూరు లెంత శౌర్యము గనబరచినను అదియంతయు నిష్ఫలమై ఉదయసింహునకు బరాభవము కలిగెను. అక్బరుబాదుషా తక్షణమే యా పిరికిరాజును బట్టి చెరలోనుంచెను. అందుపై జేయునది లేక రజపూతవీరులు గ్రామమునకు దిరిగిపోయిరి. వారిలో కొందరు తమయిండ్ల కరుగగా వారి స్త్రీలు పరాభవము నొందివచ్చిన భర్తలను, పుత్రులను, సోదరులను లోపలికి రాకుండ తలుపులుమూసి వారిని తిరస్కరింపుచు నిట్లనిరి. "రజపూతకులమునందు మీరేల జన్మించితిరి ? సిగ్గులేక మీ మొగములు మరల మాకు జూపకుడు. సంగ్రామ మరణముగాని, జయముగాని దొరకిననే మీకు కీర్తియు, యశమును కలుగును."

ఉదయసింహుని తురుష్కులు చెరబెట్టిరని తెలియగా రాజభవనమునందంతట నెటుచూచిన దు:ఖమయముగానే యుండెను. అప్పుడు రజపూతు వీరులందరు సభచేసి "ఉదయసింహ మహారాజుగారి నెటుల విడిపించనగు ? శత్రువుల నోడించుట యెట్లు" అని చింతింపసాగిరి. ఇటుల వారనేక తీరుల విచారించి, తోచక చింతాక్రాంతులై కొంతవడి యూరకుండిరి. ఆ సమయమునం దాపట్టణమంతయు మిగుల నుదాసీనముగా నుండెను. కాని మరల క్షణకాలములో నొక యువతి వారి నానందసాగరమునం దోలలాడించెను. ఆస్త్రీ ఉదయసింహుని పత్నియగు విరాబాయియే! నాభర్తను మ్లేచ్ఛులు కైదుచేసిరి. రజపూతు లోడిపోయిరి. చితూరు యిక తురకల యధీనమగును. మనమందర మానీచుల స్వాధీన మగుదుమ"ను నట్టి విచారము లనేకము లామె మనంబున నుద్భవింపసాగెను. రాజభవనమునందు నిరుపయోగములై పడియున్న యనేక శస్త్రములామె కంటపడగా నామెయందు నడగియున్న శౌర్యాగ్ని ప్రజ్వలింపసాగెను. అంత నామె నిలువక, యుద్ధమున కనుకూలమగు పురుషవేషము దాల్చి యనేకాస్త్ర శస్త్రములను ధరియించి కాళికాదేవి ప్రత్యక్షమైనది యనినట్టుగా రాజపుత్రుల సభలోకి బ్రవేశించెను.

సుకుమారమగు మేనితో బురుషవేష ధారిణియు: శస్త్రధారిణియునై వచ్చిన విరాబాయిని గనినతోడనే యచటి రజపూతువీరు లాశ్చర్యమగ్న మానసులయిరి. స్వాతంత్రేచ్ఛయు, స్వధర్మాభిమానమును హృదయనం దుండుటవలన నామె కాంతి మిగుల ప్రజ్వరిల్లెను. ఆమె మిగుల రోషముతో గూడియున్న రాజపుత్రులలో నిట్లనెను. "శూరాగ్రేసరులగు రజపూతులారా! మీరిట్లధోముఖులై చింతిల్లుచు నెవరికొరకు నిరీక్షింపుచున్నారు. మీయందలి శౌర్యధైర్యాది క్షత్రియ గుణము లెటుపోయెను? చితూరుసంస్థానమిపుడే పౌరుష హీనమయ్యెనా? ఇచటి రజపూత వీరులందరు కేవలము శ్వాసోచ్ఛ్వాసముగల పురుగులై పోయిరా ? వీరమాతయగు భారతవర్షము నేడే నిస్తేజమై పోయెనా? మీరు శూరులవంశములయందేల జన్మించిరి? అటుల జన్మించినవారు వైరులకు వెన్నిచ్చి యేల పారివచ్చితిరి? ఇప్పుడింద రేకీభవించి యేమి చింతించెదరు? చితూరు నలంకరించువాడును, మన ప్రాణసమానుడు నగు మహారాజును శత్రువులు కారా గృహ బుద్ధుని జేయగా స్త్రీలవలె చేతులకు గాజులు తొడుగు కొని యింటనుండుట కేల సిగ్గుపడకున్నారు? నేనిట్లు బాహాటముగా మిమ్ము నవమానపరుపుచుండగా మీరు విని యెట్లు సహించెదరు? ఇంతకంటె యుద్ధముచేసి వైరులచే జంపబడుట సర్వోత్తమము కాదా? శూరాగ్రేసరులగు సరదారులారా! మీరిటుల నుపేక్ష చేయకుడు! మీకు గలిన పౌరుష హీనతయను కళంకముసంపూర్ణముగా గడుగుడు. మీకుగల శౌర్యధైర్యాధిగుణముల నగుపరుప నిదియే సమయము. లెండు నడుపుడు. మరియొకరి రాకకు నిరీక్షింపనేల? ఒరలనుండి మీమీ ఖడ్గములను తీయుడు. "జయహర! జయమహాదేవ" యను రణఘోష మొనర్పుడు. తీవ్రగతి నరిగి సంగ్రామరంగమునందు మీమీ ప్రతాపములను గనుపరుపుడు! నేనిదే యుద్ధమునకు బోవుచున్నదానను."

ఇట్లని యామె యొకగుర్రము నెక్కెను. అప్పుడు రజపూతులందరు తమ యౌదాసీన్యమును వదలి యుద్ధసన్నద్ధులైరి. మేకలుగానున్న యా వీరులు విరాబాయి ప్రోత్సాహముచే శార్దూలములుగా మారిరి! అందువలన నా భీమ పరాక్రములందరును నేకవాక్యతగా జయఘోష మొనర్చిరి. అపుడు వారందరు "యుద్ధమునందు శత్రువులను జంపెదము లేక వారిచే జచ్చెదమే కాని పగరకు వెన్నియ్యమ"ని ప్రమాణములు చేసిరి.

విరాబాయియు వారి యావేశమును, దృడనిశ్చయమును గని విశేష ప్రోత్సాహము గలదియై యుద్ధమునకు వెడలెను. ఆమె తన సైన్యముతో నాకస్మికముగా నాకొన్న యాడుసింగమువలె శత్రుసైన్యములపై నకస్మాత్తుగా బడెను. అందువలన విజయానందమునం దోలలాడుచుండిన యగ్బరు సైన్య మీ ప్రళయమున కోర్వజాలక నలుదిక్కులకు బారదొడగెను. వారిని బోనియ్యక పట్టుకొని విరాబాయి సైనికులు కాలాంతరుద్రుల భంగియంతము నొందింపసాగిరి. వారికి వుత్సాహకరముగా వీరాబాయి తానును అనేక తురుష్కులను వీరస్వర్గమునకు నంపుచుండెను.

ప్రళయాగ్నిని బోలిన యామె పరాక్రమము గని యగ్బరత్యాశ్చర్యమును బొందెను. ఆయన జడునివలె నేమియు దోచక నిశ్చేష్టితుడయి నిలువబడెను. అప్పుడా క్షత్రియవీరుల యుత్సాహంబు రెట్టింప, మ్లేచ్ఛసైన్యముల ననేకరీతుల బాధింపదొడగిరి. బాదుషా తనకు జయము కలుగుటకు మారుగా నపజయ మగుటగని చేయునదిలేక సంథిని దెలుపు పతాక మెత్తెను. తక్షణమే ఉదయసింహుని సహితము బంధవిముక్తుని జేసెను. పరాక్రమవంతురాలయిన విరాబాయివలన మహాబలవంతుడైన అక్బరునంతటి తురుష్క ప్రభువు సహితము జయ కాంక్షనుమాని హతశేషులగువారింగొని మరల తనపురి కేగవలసిన వాడాయెను. తదనంతర మా రజపూతులందరును విజయానందముతో సింహనాదములు చేయుచు విరాబాయి ననేకవిధముల గొనియాడుచు విరాబాయితోడను; వుదయసింహుని తోడను పురప్రవేశము చేసిరి. అంతకు బూర్వము తేజోహీనమైన చితూరుపట్టణము రాణిగారి విజయవార్త విని మరల తన దివ్యతేజమును బొందెను. జనులందరును పరమానంద భరితులయిరి. విరాబాయి జయమును గాంచి విశేష తేజస్విని యయ్యెను. పురవాసులందరా వీరరజపూతులను, రాణిగారిని మంగళ వాద్యములతో నెదుర్కొని వారిపై పుష్పవృష్టి చేయుచు రాజభవనములో బ్రవేశపెట్టిరి! ఇట్లు జన్మమందెప్పుడును యుద్ధమెరుగనిదయ్యును ఒక క్షణములో తన శౌర్యముచే విరాబాయి "గొప్ప శూరస్త్రీ" యన్న బిరుదునుబొంది, ప్రస్తుత చరిత్రమునకు శిరోలేఖముగా నున్న శ్లోకార్థమునే స్థిరపరచెను.!


_______