అబలా సచ్చరిత్ర రత్నమాల/తఱిగొండ వెంగమాంబ

వికీసోర్స్ నుండి

తఱిగొండ వెంగమాంబ

క. కందునమాటల సామెత| లందముగా గూర్చి చెప్ప నవి తెనుగునకుం
   బొందై రుచియై వీనుల| విందై మరి కానిపించు విబుధుల కెల్లన్.

తఱిగొండ వెంగమాంబ వసిష్ఠగోత్రికుడును, నందవరీక బ్రాహ్మణుడును నగు కృష్ణయ్య యను నాతని పుత్రిక. ఈమె వాసస్థానము కడపమండలములోని తఱిగొండయని యూహింపబడుచున్నది. వెంగమాంబ తెలుగునందు విద్వాంసురాలని యామెచే రచింపబడిన గ్రంథములే వేనోళ్ల దెలుపుచున్నవి. వేంకటాచలమాహాత్మ్యమునం దీమె ఆశ్వాసాదిని వేసిన శ్లోకములవలన సంస్కృతము నందును నీమెకు గొంత పరిచయము గలదని తోచుచున్నది. ఈమె బాలవితంతువు. వేదాంతగ్రంథ పఠనమువలనను, గ్రంథరచనవలనను, కడపమండలములోనేగాక తెనుగుదేశమునం దంతటను వెంగమ్మగారి కీర్తి విస్తరిల్లెను. కాన జను లామెయం దధిక విశ్వాసము గలిగి దేశాచార ప్రకార మామెపై ననేక కథలను జెప్పుకొనసాగిరి. అవియనియు నిందుదాహరించుట యనావశ్యకముగాన నొకటి రెంటిని మాత్ర మిందుదాహరించెదను.

వెంగమాంబ గ్రంథరచనచేయుచు నేకాంతముగా నొక గదిలో కూర్చునుచుండెను. అచటినుండి యామె యీవలికి రాగానే యామె ముఖమునం దానందమును, దేహమునందు సుగంధమును గానవచ్చుచుండెనట. ఇందువలన నామె వదిన లామెయందు దోషము గలదని తలచి, దానిని కనిపెట్టుటకయి యా గది ద్వారముకడ కాచియుండిరట. అంత గొంతసేపటికి లోపల నెవ్వరో పురుషుడు నవ్వినట్టును,నృత్యము చేసినట్టును వారికి వినబడెనట. అందుపై వారు తమ భర్తలను బిలిచి, తామువిన్న సంగతులను తెల్పిరట. అట్లందరు గుమిగూడి వెంగమ్మను తలుపుతెరువమనగా, ఆమె నిర్భయంగా తలుపుతీసెనట. అప్పుడు వారా యర్రనంతను శోధించి పురుషుని నెవ్వనిగానక యామె నడుగగా శ్రీకృష్ణుడు దప్ప నన్యపురుషుడేల వచ్చునని పలికెనట. ఇవి యన్నియు నామె భక్తివిశేషమును దెలుపు కథలేగాని వేరుగాదు.

వెంగమాంబ తన జీవితకాలమునం దంతను శిరోజములను తీయలేదని చెప్పెదరు. ఆమె బహుదినములు శిరీజముల నుంచుకొనినందున జను లామె యన్నదమ్ములను బహిష్కరించెదమని బెదరించిరి. వారంతటితో నూరకుండక శంకరస్వాములవారు రాగా నాలోకగురువున కీమెసంగతి విన్నవించిరి. అందుపై నా స్వాములవారు వెంకమ్మను బిలిచి నీశిరోజములు తీయించుకొమ్మని చెప్పెను. అందుకామె యించుకయు జంకక పరమేశ్వరు డిచ్చినవి మనుజులేల తీయవలెననియు, అందువలన పరపురుషస్పర్శదోషము కలుగుననియు, ఒక పర్యాయము తీసినవి మరల రానియెడల నది పరమేశ్వరునకు సమ్మతమనియు, అట్లుగాక మరుదినముననే మరల వెండ్రుకలు మొలచుటచే నది పరమేశ్వరునకు నసమ్మతమని స్పష్టముగా దెలియుచున్నదనియు వాదించెను. అంతటితో నూరకుండక గురు వాజ్ఞాపించగా బంధువులామెను బట్టుకొని బలవంతముగా కేశవపనము చేయించిరనియు, అందుపై నామె నదికిపోయిస్నానముచేయగా వెంటనే పూర్వమువలనే కేశములు మొలిచెననియు, అదిగని గురువులును, బంధువులును మిగుల నాశ్చర్యపడి యట తరువాత నామె జోలి మానిరనియు గొందరు చెప్పెదరు. ఏది యెట్లున్నను వెంగమాంబగారికి వితంతుస్త్రీలకు కేశవపనము చేయుట కిష్టములేదనుట వాస్తవము.

వెంగమాంబగారికి నిష్టములేని ఈకృత్యము ఏ స్త్రీలకును సమ్మతంబు కానేరదు. మన దేశమునందు నంధపరంపరగా వచ్చిన యీ యాచారమునకు గాదనలేక కొందరు యువతులు సమ్మతించినటుల నగుపడినను వారి యంతరముల యందు నపిరిమిత దు:ఖము కలిగియే యుందురు. వారివారి భర్తల మరణసమయమున కంటెను కేశవిసర్జన కాలములయందే వా రధికదు:ఖితు లగుచుండిరి. వపనకర్మవలన దమకును, దమ భర్తలకును నిజముగా బుణ్యలోకములు దొరుకునని వారికి నమ్మకమున్నయెడల వారా సమయములయందు దు:ఖించుటకు మారుగా నమితసంతోషమును బొందవలసినదే. స్త్రీలు పతిహీనులై యలంకార రహితులై మంగళకార్యములకు దూరలై మితిమీరిన దు:ఖవహ్నిలో బొరలుచుండ సుఖమునందున్న వారి బంధువులు మంచిమాటలతో వారి శోకాగ్ని నార్పుటకు మారుగా, బర మేశ్వరుడిచ్చిన కిరీట మనదగిన కేశకలాపమును నేలపాలుచేసి యా దు:ఖాగ్నిలో నెయ్యిబోసి ప్రజ్వలింప జేయుదురు. ఇది యెంతటి యన్యాయము. ఈ దురాచారము సహగమనముకంటెను దక్కువ క్రూరమైనది యయినను, గొందరు యువతులకిది సహగమనము కన్నను విశేష భయంకరమయినదని తోచుచున్నది. వారిట్లు విరూపులై నలుగురులో నవమానకరమగు నిట్టి బ్రతుకు బ్రతుకుట కంటెను సహగమనము చేసి యొక గడియ దు:ఖముతో దేహము విడచుట నూరురెట్లెక్కువ సులభమని తలచుచున్నారు. వారు సహగమనము లేకపోవుటకు వివేషచింత నొంది దాని మాన్పినవారినే క్రూరులని నిందింపుచున్నారు. సాధారణముగ పురుషులకయినను దుస్సహమగు నవమానము కలిగి బ్రతుకుటకంటెను, మరణమే సుఖదాయకముగ నుండునని తోచుట సహజము. ముందు దమ కవమానము కలుగునని తెలిసి యాత్మహత్య చేసికొనిన పురుషు లెందరో కలరు. ఇందువలన సహితము నవమానముకంటె మరణమే మేలని జనులకు దోచునని మనకు దెలియుచున్నది. కాన నస్మద్దేశ బాంధవులందరును మన దేశములోని స్త్రీలకు గలుగుచున్న యీ వ్యసనకరమగు నవమానమును దొలగింప బ్రయత్నింతురు గాత.

ఈమె మిక్కిలి వృద్ధురాలయి కాలధర్మము నొందెను. 1841 వ సంవత్సరము వరకీమె జీవించియున్నట్లు తెలియుచున్నది. బాలవితంతువైనందున నీమెభర్త నామగోత్రము లెచటను గానరావు. వెంగమాంబచే రచియింపబడిన గ్రంథములలో రాజయోగసార మను వేదాంతపరమయిన ద్విపద కావ్యమును, వెంకటాచల మహాత్మ్యమును మాత్రమును ముద్రింపబడి యున్నవి. వీనిలో రాజయోగసారము భాగ వతము నందలి తృతీయ స్కంధాంతర్గతమైన కపిలదేవహూతి సంవాదమునుగొని, మిగుల రసవంతముగాను, సులభముగాను, ద్విపదకావ్యముగా రచియింపబడినది. దీనిలో సామాన్య జనంబులగు గూడ సులభముగా తెలియునటుల వేదాంతము వివరింపబడినది. వేంకటాచల మహాత్మ్యమునందు విష్ణుమూర్తి పద్మావతిని వివాహమాడిన కథ మిగుల చిత్రముగా జెప్పబడియున్నది. కడమగ్రంథములేవియు ముద్రింపబడనందున, వానిని గురించి యేమియు వ్రాయుటకు వీలులేదు. "ఈమె కవిత్వమునం దల్ప దోషము లక్కడక్కడ గానవచ్చుచున్నను మొత్తముమీద కవన మతికఠినముగాక, మృదుమధుర రచనను గలదియయి యున్నద"ని కవిచరిత్రమునందు రాయబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులవారీమె కవిత్వమును బొగడిరి. ఇట్టి వారిచే బొగడొంద దగిన విద్యయు, గవిత్వశక్తియు గలిగినను నామె యిసుమంతయు గర్వము లేక మిగుల వినయవతిగా నుండెనని రాజయోగసారములోని యీ క్రింది ద్విపదలు వెల్లడించు చున్నవి.

ద్వి. వినరయ్య కవులార విద్వాంసులార
    వినరయ్య మీరెల్ల విమలాత్ములార
    ఘనయతిప్రాస సంగతులు నే నెరుంగ
    వరుస నాక్షేపింపవలదు సత్కృపను

ఈమె రచియించిన గ్రంథములు తఱిగొండ నృసింహస్వామి కంకితములు చేయబడినవి. ఈమె శృంగార రసాధి దేవత యగు కృష్ణుని భక్తురాలయినను, ఆమెకు దన గ్రంథ ములయం దెక్కడను శృంగార వాక్యములను జొప్పింప నిష్టము లేక యుండెను. అందువలనను నామె కృష్ణుని నిట్లు స్తుతియించెను.

శా. శృంగారా కృతితోడ వచ్చిమనముల్ శృంకోసారంబుతో
    డం గూడంబుగ జెప్పు నీవనిన నట్లే జెప్పలేకున్న నన్
    ముంగోపంబున జూచి లేచి యట నే మ్రొక్కంగ మన్నించి త
    చ్ఛృంగారోక్తులు తానె పల్కికొను నా శ్రీకృష్ణు సేవించెదన్.

ఇందువలన దన గ్రంథములయందు శృంగార వాక్యముల నిముడ్చుటకు దన కెంతమాత్రము నిష్టము లేకుండగా సందర్భానుసారముగా నా గ్రంథములయం దక్కడక్కడ వచ్చిన శృంగారపద్యములను శ్రీకృష్ణుడే రచియించెనని యామె తెలుపుచున్నది. ఈ విద్యావతి కవనరీతిని దెలుపుట కయి ముద్రితగ్రంథములోని కొన్ని పద్యము లిందుదాహరించి యామె చరితము ముగించెదను.

వేంకటాచలమాహాత్మ్యము

ఉ. రామనృపాల, ఘోరతర రావణశౌర్యవిఫాల, భవ్య సు
   త్రామ సురార్య యోగిజన తాపసపాల, కృపాలవాల, శ్రీ
   భూమిసుతాత్మలోల, పరిపూర్ణసుకీర్తివిశాల, వానర
   స్తోమముతోడ వచ్చు మిము జూచి కృతార్థులమైతి మిద్ధరన్. ఆ 1

చ. విని యది భీతి నొందుచు వివేకముతో ద్విజు మోముజూచి యి
   ట్లనియెను జారకాంతను మహా విషసర్పమునంటి యెవ్వరై
   నను గడతేరినారె నిను నమ్మిన భార్యను వీడి నన్ను బొం
   దిన నిహమున్ బరంబు చెడు ధీరతతో జను బ్రాహ్మణోత్తమా! ఆ 4

రాజయోగ సారము.

ద్వి. సంపద గలిగిన సామర్థ్యమనుచు
    సొంపుమీరిన తుచ్ఛసుఖ మిచ్ఛయించి
    కామాంధులై తమ గతి గానలేక
    భామల వలలోన బడి లేవలేక
    తరగని యీషణత్రయవార్ధిలోను
    మరిమరి మునుగుచు మమత రెట్టింప
    నాలుబిడ్డల కని యర్థంబు గూర్చి
    కాలంబు నూరకే గడుపుచునుండి

* * * *

    పుట్టుచు గిట్టుచు పొరలుచుండెదరు.


_______