అబలా సచ్చరిత్ర రత్నమాల/గణపాంబ

వికీసోర్స్ నుండి

గణపాంబ

ఈమె బేటం రాజునకు భార్య; గణపతిదేవునకు గూతురు. ఈ గణపతిదేవుడు క్రీ.శ. 1257 వ సంవత్సరము నుండి 1262 వ సంవత్సరము వరకును నోరుగంటి రాజ్యమును బాలించిన రాజేయై యుండినచో నీ గణపాంబ రుద్రమదేవికి గూతురై యుండును. కాని యిందునకు బ్రబల నిదర్శనము లేవియు గానరాకున్నవి. గణపాంబయు దన పతిమరణానంతరమునం దాతని యేలుబడిలో నుండిన యారువేల గ్రామములను మిగుల నేర్పుతో బాలించెను. ఆమెమిక్కిలి యౌదార్యవతియై యనేక విధములైనధర్మకార్యములను జేసెను. ఈమె ధర్మకృత్యములను జరితమును దెలుపు శిలాశాసనమొకటికృష్ణా మండలములో జేరియున్న గుంటూరుతాలుకాలో నున్నది. దానిలోని కొన్ని సంగతులు నిందు బొందుపరచెదను.

మిగుల ప్రసిద్ధిగాంచిన కాకతీయవంశమునందు అనేక ప్రభువులు రాజ్యము చేసినమీదట వైరిభీకరుడగు బేట రాజు సింహాసనా రూడుడయ్యెను. శివునకు బార్వతివలెను, విష్ణువునకు లక్ష్మీవలెను, ఈబేటరాజునకు గణపాంబ ధర్మపత్ని యయ్యెను. ధర్మకరకపురిని మిక్కిలి యోగ్యముగా బాలించి బేటరాజు కీర్తిశేషుడయ్యెను. తదనంతరం బాతని భార్యయగు గణపాంబ సింహాసన మెక్కెను. ఈమె భర్తయొక్క సుగతి నభిలషించి యాయనపేరిట ధన్యకటకపురమునందొక దేవాలయము నిర్మించెను. యీ యుద్ధములోనే యీ రాణి బంగారు శిఖరముగల యింకొక గుడిని గట్టించి దానిలో బేటేశ్వరుడను లింగమును బ్రతిష్ఠింపచేసెను. ఈ గుడికినై యీదేవి ఫలవంతమగు బీనదీవియను గ్రామము నొసంగెను. ఈ మహనీయురాలు ధన్యకటకపురిలో 12 గురు బ్రాహ్మణోత్తములకు 12 భూవసతులు 12 గృహములును దాన మొసంగెను. ఈమె తనతండ్రియగు గణపతిదేవునిపేర గణపేశ్వరుని (శివుని) యాలయ మొకటి కట్టించెను. ఈ గుడికై యీరాణి చింతపాడు గ్రామము నొసంగెను. ఈ రాణి హస్తములు సతతము శివుని నర్చించుటయందే వినియోగించెను. శివుని మహాత్మ్యమును బ్రకటించు శ్లోకములే ఆమెకానందము నిచ్చుచుండెను. ఈ రాణి వేదములయం దధిక విశ్వాసము కలది కావుననే విశాల రాజ్యక్లేశము కలిగి యున్నను ఆనందముతో దినములు గడపెను. రెండవపార్వతి యనదగిన యీమె మహాత్మ్యము నెవ్వరు తగినట్టుగ వర్ణింప గలరు? ఈ మహనీయురాలి చరితముగురించి యింతకంటెనధిక మేమియు దెలియదు. కాన విధిలేక మిగుల చింతతో దీనిని ముగించుచున్నదాన.


_______