అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 7

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౭ - శివాజీ

క్రీ. శ. 1674లో శివాజీ పట్టాభిషేకము చేసికొనెను. అందుచే నాతనిబొక్కసము చాల తగ్గిపోయెను. తర్వాత నతఁడు బిజాపూరు రాజ్యమునందు చాలచోటులలో దోపిడి చేసినను ఎక్కువధనము దొరకలేదు. దక్షిణాపథమునందలి పలుచోటులను ఆతఁ డప్పటికే దోచియున్నాఁడు. ఈతని దాడికి భయపడి పెక్కువ్యాపారస్థలములు పాడైపోయినవి. దక్షిణ దేశమున నేటి మదరాసుతీరము సుభిక్షముగా నుండుటయే గాక శివాజీ కంట నింకనుపడలేదు. ఈదేశమందలి జనులు నిరాడంబరజీవులై సౌఖ్యముగ నుండిరి. ఇచ్చటి రేవుపట్టణములు అతిప్రాచీనకాలమునుండియు విశేషవ్యాపారముల కాటపట్టు లగుటయేగాక ఇచటిగనులు తఱుగని సౌభాగ్యముగా నుండినవి. ఈ ధనమంతయు చాలవఱకు దేవాలయములకును ధర్మకార్యములకును ఖర్చగుటయేగాక విశేషముగా జనులకు దాఁచుకొనుటకును ఆభరణములు చేయించుకొనుటకును మిగులుచుండెను.

విజయనగరసామ్రాజ్యము పడిపోయినతర్వాత దక్షిణదేశము పెక్కురాజ్యము లాయెను. వీనిలోవీనికి కలహము లేర్పడెను. తమకు సాయముచేయుటకై ఈరాజ్యములు గోలకొండ బిజాపూరు మొదలైన మహమ్మదీయరాజ్యముల సాయమును వేడుటచే తురుష్కుల పలుకుబడి హెచ్చసాగెను. మొగలాయీల బలముచే ఉత్తరమున రాజ్యమును విస్తరించుట అసాధ్యమైనందున బిజాపుర గోలకొండరాజ్యములు దక్షిణమునకు వ్యాపించుటకు ప్రయత్నించుచుండినవి. ఇందుచే గోలకొండవారు కడప, ఉత్తరార్కాడు జిల్లాల భాగమును పాలారువఱకును జయించిరి. బిజాపూరువారు కర్నూలు, బెంగళూరు, ఉత్తరముననున్న మైసూరు భాగములను, పాలారు కొల్లడముల నడిమి మదరాసుభాగమును, వేలూరు మొదలు తంజావూరువఱకు ఆక్రమించిరి. శివాజీ సోదరుఁడైన వెంకాజీ తండ్రివలెనే ఆడిల్‌షాక్రింది సర్దారుగా నీప్రదేశములను పాలించుచుండెను. ఇతనికి జింజిప్రాంతభాగము తండ్రివలన వచ్చినట్టిది.

ఈలోపున మధురనాయకులకును తంజావూరి ప్రభువులకును స్పర్ధలువచ్చి తంజాపురిపాలకుని మధురవారు చంపివేసిరి. గతించినరాజుయొక్క కొమారుఁడు బిజాపూరు ఆడిల్‌షాకు మొఱపెట్టుకొనఁగా నాతఁడు వెంకాజీని సాయము పొమ్మనెను. వెంకాజీ తంజావూరిని జయించి మధురవారిని పాఱద్రోలి ఆరాజ్యమును తానేహరించెను; చుట్టునున్న వారినికూడ జయింప యత్నించుచుండెను. ఈనడుమ క్రీ. శ. 1675 సం, ఏప్రిలునెలలో శివాజీసైనికులు బిజాపురభూములలో కొల్లగొట్టుచు గోలకొండ రాజ్యములోనికి ప్రవేశించి ఏతగిరి (నేటి యాద్గీర్)ని పూర్తిగా దోచుకొని హైదరాబాదువఱకును వచ్చి వెడలిపోయిరి.

మాదన్నమహామంత్రి ఆలోచించెను. విజయాపురమందలి దక్షిణప్రదేశములను జయించి ఆంధ్రసామ్రాజ్యమున చేర్పఁదలంచెను. ఇట్టిసందర్భమున శివాజీతో సంధి కుదుర్చుకొని అతనితోచేరి దక్షిణదేశమును జయించి పంచుకొనుట మంచిదని ఆతనికి తోఁచినది. వెంటనే శివాజీతో సంధికి తానీషాను అతఁడు ఒడంబరుపసాగెను–బిజాపురములోని కర్ణాటక దేశమును తానాషాగారికొఱకు శివాజీ జయించి ఇచ్చివేయవలసినది; దండయాత్రాకాలమున దొరకిన లూటీనంతయు శివాజీ తనకు గ్రహింపవలసినది–ఇట్లు నిబంధనలు కుదుర్చుటకు మాదన్న ప్రయత్నింపసాగెను.

శహాజీ చనిపోవునప్పుడు వెంకాజీ బాలుఁడు. ప్రపంచానుభవము చాలని తనకుమారునికి సాయముగా రఘునాథనారాయణహనుమంతె అనువానిని ఏర్పాటుచేసి శహాజీ మరణించెను. ఇంతకాలము ఈ హనుమంతె తానేప్రభువైనట్లు ఎల్లకార్యములను జరుపుచుండెను. వెంకాజీ నేఁడు పెద్దవాఁడు; హనుమంతుని పెత్తనమును సహింపలేకపోయెను. పైగా హనుమంతె నానామాయోపాయములచేత విస్తారము ధన మార్జించియుండెను. వెంకాజీ హనుమంతుని పాతలెక్క లడిగెను. హనుమంతె వెంటనే తనయుద్యోగమునకు రాజీనామా నిచ్చి కాశీయాత్రకు పోవునట్లు నటించి తన ఆస్తినంతయు తీసికొని జనార్దనుఁడను తమ్మునితోకూడ బయలుదేరెను. తంజాపురినుండి బిజాపురమునకు పోయెను. అచ్చట తనసామర్థ్యముచే నొక మంత్రిపదవి సంపాదించెను. ఇంతలో శివాజీ ఇతనిని తనకడకు పిలిపించెను. హనుమంతె పూనానగరమునకు పోయిచేరెను.

వెంకాజీమీఁద పగ తీర్చుకొనవలయునని హనుమంతె తలఁచియుండెను. అందులకై శివాజీని దక్షిణదేశముపై దండెత్తుమని హనుమంతె పురికొల్పుచుండెను. శివాజీకి తమ్ముని రాజ్యముమీఁద ఇంతవఱకు అపేక్షలేదుగాని హనుమంతుని దుర్బోధవలన ఇప్పడు ఏర్పడసాగెను. ఈకాలమునకు సరిగా రాజకీయపరిస్థితి శివాజీకి అనుకూలమాయెను. మొగలాయీ పాదుషా పంజాబులో యుద్ధమొనరించి ఢిల్లీకి వచ్చియుండినను ఆతనిసైన్యము లింకను పంజాబునందేయుండెను. బిజాపూరు సుల్తాను సికందరు బాలుఁడు. అందుచేత వజీరుపదవికి అంతఃకలహములును హత్యలును జరుగుచుండినవి. భలోల్‌ఖాన్ అను నతఁడు క్రొత్త మంత్రియాయెను. మొగలాయీలు మఱియెుకని మంత్రిత్వమునకు సహాయము చేయఁగోరి బిజాపూరువిూఁదికి దండెత్తిరి. కాని వారిసైన్యము లింకను రాలేదు.

ఇట్టిసమయమున మాదన్న బిజాపురమును రక్షింపనెంచెను. భలోలుఖాను శివాజీతో స్నేహముకోరెను. మాదన్న కోరినదియు నదియే. వెంటనే మాదన్న శివాజీతో భలోలుఖానునకు సంధి కుదిర్చెను. భలోలుఖాను బిజాపురమువారితరఫున శివాజీకి మూఁడులక్షలరూపాయలు బహుమతిగా నిచ్చుటకును, తమ తూర్పువైపు కృష్ణాతీరపుటెల్లను కాపాడుటకును మొగలాయీలను తఱుముటకును లక్షహొన్నులు, (బంగారు నాణెములు) ఏటేట ఇచ్చుటకును మాదన్న మాటమీఁద ఒప్పుకొనెను. ఈసందర్భమున శివాజీ ఉత్తరమునుండి తనకెట్టి ఆపదయు రాదని గ్రహించెను. ఈకట్టుబాట్లను ఎక్కువకాలము జరుపవలయునని ఆతనియుద్దేశముకాదు గాన తాత్కాలికముగా అనుకూలమని ఆతఁడు ఒప్పుకొనెను. నిలుకడలేని బిజాపూరు ప్రభుత్వముతో ఎట్టిస్నేహమును చాలకాలము జరుగదని ఆతఁడు ఆలోచించెను. బిజాపూరువా రిచ్చిన ధనమును మాత్రము గ్రహించెను. అప్పుడు శివాజీ ఒక ఉపాయముచేసెను. మొగలాయీ వారినుండి బిజాపురమును కాపాడునట్టిపనిని తప్పించుకొనెను. ఎట్లనఁగా బిజాపురముమీఁదికి దండెత్తనుండిన మొగలాయీ రాయబారితో తానొక సంధి కుదుర్చుకొనెను. అంతకు రెండేండ్ల నుండి మొగలాయీలు శివాజీతో యుద్ధముచేసి విసిగియుండిరి; తమకు భయపడి భలోల్‌ఖాను శివాజీతో చేరఁగానే వారికిని కొంతకష్ట మైనది, భలోలుఖానుమీఁద పైయెత్తుగా మొగలాయీ రాయబారి తానును శివాజీతో సంధి కోరినందువలన శివాజీకి మంచిదేయైనది. తన ద్రవ్యాకర్షణమునకును దక్షిణ దేశ దండయాత్రకును అనుకూలమని శివాజీ వెంటనే ఒప్పుకొని, తాను కర్ణాటకదేశముమీఁద దండెత్తి తిరిగివచ్చులోపల దాదాపొక సంవత్సరకాలము బిజాపురమునకు మొగలాయిల వలన బాధలేకుండిన తాను శ్రమపడకయే వారిని రక్షించినట్లగునని, అట్టియేర్పాటుమీఁద సంధిషరత్తులు కుదిర్చెను.

ఇన్ని వ్యవహారములలోను మాదన్నమంత్రియున్నాఁడు. శివాజీయుద్దేశము నాతఁడు కొంతవఱకు గ్రహించెను. దక్షిణ దేశములమీఁదికి శివాజీ కొల్లఁగొట్టుటకు బయలుదేరిన గోలకొండ గతి యేమగును? బిజాపురమును తాత్కాలికముగా కాపాడుటయైనది. మొగలాయీలవలన భయము లేదు. మఱి శివాజీనికూడ స్నేహితుని చేసికొనిన మొగలాయీలను పూర్తిగా నిలుపవచ్చునని తలఁచి మరల శివాజీతో రాయబారము జరిపెను. బిజాపురమునకును శివాజీకిని సఖ్యము కలిపినవాఁడు తానేగదా. శివాజీకి మాదన్నకడకుండి రాయబారముపోయి గోలకొండవారికిని మహారాష్ట్రనేతకును సఖ్యము కుదిరినది. మాదన్న సంవత్సరమునకు ఒకలక్షహొన్నులు శివాజీకి గోలకొండను కాపాడుట కిచ్చుట కొప్పుకొనెను. ప్రహ్లాదనిరాజీ అను మహారాష్ట్రుని శివాజీ తనరాయబారిగా గోలకొండకు పంపెను.

శివాజీకికూడ గోలకొండవైభవమును చూడ వేడుకాయెను. హైదరాబాదునకేఁగు తనరాయబారి కాతఁడు తనయభిప్రాయమును తెలిపెను. ప్రహ్లాదనిరాజీ అందులకు తగిన సంవిధానమును కుదుర్పుమని మాదన్నను వేడెను. అప్జల్‌ఖానును కూల్చినవానితో ఏకాసనమందు కూర్చుండిన నేమగునోయని తానాషా మొదట భయపడెను. ప్రహ్లాదనిరాజీ చాలనమ్మకము కలుగునట్లు పలికెను. మాదన్నయు శివాజీ తమకుద్రోహ మొునర్పఁడనియు నాతనికి మొగలాయీలే వైరులనియు దృఢముగా తానాషాను నమ్మించెను. పైగా శివాజీతో ముఖాముఖిగా మాటలాడుటవలన పెక్కుఅనుకూలము లున్నవనియు తెలిపెను. తానాషా సమ్మతించెను. శివాజీతరఫున ప్రహ్లాదనిరాజీ తమదక్షిణదేశవిజయములలో కొంతభాగము తానాషాకిచ్చుట కొప్పుకొనెను.