హైందవ స్వరాజ్యము/పదునైదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునైదవ ప్రకరణము.


ఇటలీ భారత భూములు.


సంపా: మీరు ఇటలీ సాదృశ్యము తెచ్చియుండుట మంచిదే. మెజనీ చాల గొప్పనాడు. మిక్కిలి మంచినాడు. గారిబాల్డీ గొప్ప వీరుడు. ఇరువురుపూజ్యులు. నారి జీవితము లనేకవిషయముల మనకనుసరణీయములు, అయిన ఇటలీలో నుండిన స్థితికిని భారత భూమిస్థితికిని మిక్కి-లి తారతమ్యముకలవు. మొదట మెజినీ గారిబాల్డీలకు పరస్పరము కల భేదము నాలోచించుట ఆవశ్యకము. ఇటలీని గురించి మెజీని ఏయుద్దేశము పెట్టుకొనెనో అయుద్దేశము నేటికిని కొనసాగియుండలేదు. మానవధర్మములకు గురించి అతడు వ్రాసిన గ్రంథములో ప్రతిమానవుడు సామ్రాజ్యమును మొదట సంపాదింపవలయునని వ్రాసినాడు. ఇటలీలో ఇది యేర్పడలేదు. గారి బాల్డీ మెజీని పెట్టుకొనిన ఈ దృష్టిపథము పెట్టుకొనలేదు. గారిబాల్డీ ఆయుధము లిచ్చెను. ప్రతియిటాలియను వానిని ధరించెను. ఆస్ట్రియ యిటలీలు జ్ఞాతులైనందున వారి నాగరక మేకమయియే యుండినది. నాకు కన్ను పొడచిన వీరు కన్ను పొడచుటయే అవసరమై యుండనది. గారిబాల్డీ కోరినది ఆస్ట్రియా ప్రభుత్వమునుండి ఇటలీ వేరుపడ వలయుననిమాత్రమే. మంత్రి కేవరు చేసినకుతంత్రములు ఇటలీకి సంబంధించిన ఆనాటిచరిత్రకు కళంకాపాదకములు. దాని వలన ఫల మేమియైనది. ఇటాలియనులు ఇటలీని పరిపాలించుటను జేసి ఇటలీప్రజ సుఖమందుచున్న దందు రేని మీరంధకారమున బడి చూడలేకున్నారు గాని మరేమియును గాదు. మెజీని ఇటలీ స్వతంత్రము కాలేదని స్పష్టముగా చూపినాడు. ఆపదమునకు విక్టరు ఇమాన్యుల్ ఒకయర్థము చెప్పి నాడు. మెజీనీ మరియొక యర్థమును చెప్పినాడు. ఇమాన్యుల్ , క్రేవర్ - గారిబాల్డీతో సహా ఇటలీయనిన ఇటలీరాజును అతని సహకారులు ననిమాత్ర మాలోచించిరి. మెజీని ఇటలీ యన తద్దేశప్రజ, రైతాంగమంతయు నని యాలోచించెను. ఇమాన్యుల్, నిజముగా ఆ ఇటలీకి సేవకుడు. మెజీని మానసముననుండిన ఇటలీ ఇంకను దాస్యమును బాయలేదు. జాతీయంతటికిని సంబంధించినయుద్ధము పొసగినప్పుడు ఇరువురురాజుల లాభాలాభములుమాత్రమే యాలోచింప బడెను. ప్రజను చదరంగములోని కాయలవలె ఈ రాజు లుపయోగించుకొనిరి. ఇటలీలో పనివార లీనాటికిగూడ అసౌఖ్యమునబడి కొట్టుకొను చున్నారు. కాబట్టి వారు హత్యలు కావించుట, తిరుగుబాటులు చేయుట జరుగుచున్నది. ఎప్పుడును వారు విప్లవముకలిగింతురను భయము కలదు. ఆస్ట్రియాసైన్యములు ఇటలీ వెడలిపోయిన తరువాత ఇటలీవారికేమి యంతగొప్పలాభము కలిగినది. ఏమియు లేదు. వట్టినామకార్థము లాభముమాత్రము సమకూరినది. ఏసంస్కారములకొరకు యుద్ధము జరిగెనో ఆసంస్కారము లింకను ఇటలీలో అంగీకృతముకాలేదు. ప్రజల సాధారణస్థితి నాడెట్టు లుండెనో నేడును అట్టులేయున్నది. అట్టిస్థితి ఇక్కడ కలుగజేయవలెననిమీకు నిస్టముకాదుకదా ! భారతభూమిలోని కోట్లకొలది ప్రజలు సుఖమందవలయునేకాని మీచేతికి రాజ్యభారము దొరకిన చాలునని మీరాలోచింపరు కదా! నిజ మిదియే యగునేని మన మొక్క విషయ మాలోచించవలెను. కోట్లప్రజలకు స్వరాజ్య మబ్బు మెట్లు. అనేక సంస్థానాధీశ్వరులు పాలనలో నుండుప్రజలు మిక్కిలి బాధలుపడుచున్నా రని మీరంగీకరింపవలసి యుందురు. కరుణ కొంచెముకూడ చూపక ఆయధిపతులు, ప్రజలకు కష్టములు కలిగించుచుందురు. వారి నిరంకుశత్వము బ్రిటిషువారినిరంకుశత్వమునకంటె ప్రబలతరము ఆనిరంకుశత్వము మీరు కావలయునందు రేని మనమెప్పుడును అభిప్రాయములలో నేకీభవింపజాలము. ఇంగ్లీషువారు వెడలి పోయిన స్వదేశసంస్థానాధీశ్వరులకాలిక్రిందపడి ప్రజ నలిగిపోవచ్చును అను ఏర్పాటునకు నే నెప్పుడును సమ్మతింపజాలను. అది నాదేశభక్తి కాజాలదు. దేశాభిమానమునకు నామతమున సర్థము దేశప్రజలక్షేమము, సౌఖ్యము. - ఇంగ్లీషువారిమూలక ముగా అది నడుగునేని నేను వారికి తలవంచువాడ. ఏఇంగ్లీషు వాడైనను భారతభూమిలోని నిరంకుశత్వమును పోగొట్టి స్వాతంత్ర్యము సంపాదించుటకు తనజీవితమును ధారపోయునెడల అతనిని భారతపుత్రునివలెనే నే ప్రేమింతును.

ఇంతేకాదు. ఇటలీవలెపోరాడుట భారతభూమి ఆయుధములను ధరించినంగాని పొసగదు. మీరీవిషయము నాలోచించినట్లు, కానరాదు. ఇంగ్లీషువారు చక్కగా సాయుధులై యున్నవారు. దానికి నే జంకుటలేదు. కాని ఒక్కటిమాత్రము స్పష్టము. సాయుధులమై వారితో పెనగవలసినచో భారతపుత్రులలో వేలకొలది ఆయుధముల ధరింపవలసియుందురు. అది జరుగవలయుననిన ఎన్ని యేండ్లుపట్టునో ఆలోచించునది. అదిగాక భారతభూమిని విపులముగా సాయుధమొనర్చుటకు నర్థము మనము యూరోపునాగరకమున లయమగుట యగుచున్నది. అప్పుడు మనస్థితియు యూరోపుస్థితివలెనే కరుణాకరము కాక మానదు . ఈపరిణామమే మనము కోరునట్లైన ఆనాగరకమున చక్కగా శిక్షితులైనవారు మనదేశములోనుండుట అత్యావశ్యకమగుచున్నది. అప్పుడు కొన్ని కొన్ని హక్కులకై మనము పోరాడవచ్చును. కొన్ని సంపాదింపవచ్చును. కాలముగడుప వచ్చును. నిజమేమనగా భారతజాతి సాయుధముకాదు. అట్లు కాకుండుటయే మేలు. చదువరి: మీరు విపరీతాలోచనలు చేయుచున్నారు. అందరు సాయుధులు కానక్కర లేదు. మొదట కొందరిని ఇంగ్లీషు వారిని చంపి భయోత్పాతముకలిగించిన యెడల తరువాత ఏకొందరు సాయుధులై నను పనులను నెర వేర్పగలరు. రెండు రెండున్నరలక్షల జనమును మనము నష్టపడవలసి యుందుము. ఆ మాత్రము త్యాగముచేయగలమేని మనదేశము మనపాలగును. చిల్లరయుద్ధముతో ఇంగ్లీషువారిని జయించవలెను.

సంపా: ఈపవిత్రభూమిని మీ రపవిత్రముచేయుట మీతలంపు. హత్యలుచేసి భారతభూమిని సంరక్షించుచింత తోచి నప్పుడే మీకు దేహము వడకుట లేదా ! మనకు కర్తవ్యము మనలను మనమే చంపుకొనవలెను. ఇతరులను చంపనాలోచించుట పౌరుషహీనత్వము. ఇతరులను జంపి మీ రెవరికి స్వాతంత్ర్యము సంపాదింప తలచుచున్నారు. భారతజాతిలో కోటాను కోట్లు దానిం గోరరు. నేటి నవ నాగరకము దిగద్రావి గర్రున త్రేపువా రిట్టియాలోచనలు చేయుదురు. హత్యచేసి పైకెక్కిన వాడు జాతిని సుఖపెట్టుననుమాట కల్ల. ధింగ్రాకార్యమువలనను అట్టి యితరకార్యములవలనను హైందవభూమి లాభము పొందిన దనుకొనువారు మిక్కిలి పొరబడుచున్నారు. ధింగ్రా దేశాభిమానియే కాని అతని యభిమానము అంధప్రాయము. అతడు తప్పుదారిబడి దేహమును ధారపోసినాడు. తత్ఫలము తుదకు చెరుపేకాని వేరుకాదు. చదువరి: అయిన ఇంగ్లీషువారు ఈహత్యలచేత భయపడి నారనియు అందుచేతనే మార్లీ సంస్కరణములు ప్రసాదితము లైనవనియు మీరంగీకరింతురా?

సంపా: ఇంగ్లీషువారు ధైర్యాధైర్యములజాతి, తుపాకిమందు ఆజాతిని సులభముగా ఆలోచనకు దించునని నానమ్మకము. మార్లేప్రభువు భయపడి సంస్కారము చేసినాడనుట నిజముకావచ్చును. ఆయిన భయముచే నిచ్చినది. భయము వీడినతోడనే మరల పుచ్చుకొనవచ్చును.