పుట:Womeninthesmrtis026349mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

స్మృతికాలపుస్త్రీలు

ఇంతవఱకును పురుషుని పునర్వివాహమును విచారించితిమి. ఇక సహజముగ స్త్రీపునర్వివాహమును చర్చింపవలసియుండును. కాని యే స్మృతిలోను గూడ నే సమయమునను గూడ స్త్రీకి పునర్వివాహమంగీకరింపబడలేదు. మీదు మిక్కిలి స్త్రీకి పునర్వివాహము కూడదను ప్రత్యక్షవచనము లనేకములున్నవి.

ఇంచుమించుగ నన్ని ధర్మశాస్త్రములలోనుగూడ 'పూర్వ మితరునిచే వివాహిత కానిదానిని వివాహమాడవలెన'ని కలదు.

     అసవర్ణా పూర్వశాస్త్ర విహితాయాం
     యధర్తుగచ్ఛతః పుత్రాన్తేషాం కర్మభిస్సంబంధః
(ఆ.ధ.సూ.2-11-1)

     గృహస్థస్సదృశీం భార్యాంవిందేతానన్య పూర్వాంయవీ
     యసీం
(గౌ. 4-1)

     అవిప్లుతబ్రహ్మచర్యోలక్షణ్యాంస్త్రి యముద్వహేత్
     అనన్యపూర్వికాంకాంతాంతామనపిండాం యవీయసీం
(యాజ్ఞ. 1-53)

( ఈ వాక్యముల యర్థములు ' వధూవరార్హతలు ' అను నధ్యాయములో తెలిసికొనవచ్చును.)


వసిష్ఠుడు అక్షతయోనిని వివాహమాడవలెనని చెప్పుచున్నాడు.

       అస్పృష్టమైధునామ వరయవీయసీం (వసిష్ఠ. 8-1)

దీనినిబట్టి వసిష్ఠుని మతములో యక్షతయోనిగనున్న స్త్రీని వివాహమాడవచ్చునని మాత్రమే తెలియుచున్నది. అట్టి స్త్రీ వితంతువగుచో నామెను వివాహమాడవచ్చునని యాతని మతమైనట్లీ క్రింది శ్లోకమువలన తెలియుచున్నది.

      పాణిగ్రాహే మృతేబాలా కేవలం మంత్రసంస్కృతా
      సాచేదక్షతయోనిస్స్యాత్పున స్సంస్కారమర్హతి.
                                     (వసిష్ఠ. 17 - 14)

(మంత్రసంస్కృతయు నక్షతయోనియునగు బాలికకు భర్తమరణించుచో నామె మఱల వివాహ సంస్కారమున కర్హురాలు.)

ఇట్టి పునర్వివాహములో కన్యాదానముండదు. దానమై మంత్రసంస్కారము కాకుండ భర్తను కోల్పోయిన స్త్రీకే మఱల దానము గలదని యీక్రింద శ్లోకమువలన తెలియు చున్నది.

       అద్భిర్వాచా చదత్తాయాం మ్రియాతాదౌవరోయది
       నచమంత్రోపనీతాస్యాత్కుమారీ పితురేవసా
                                         (వసిష్ఠ 17-12)

(కన్య యుదకముచేతను వాక్కుచేతను నీయబడినదై మంత్రసంస్కృత కాకుండగనే భర్తను కోల్పోవుచో నామె తండ్రికే చెందును.) మంత్ర సంస్కారమైన పిమ్మట నామె తండ్రికి చెందదు. కావుననే మంత్ర సంస్కారము కాకుండిన కాలములో నామె తండ్రికి చెందునని చెప్పబడినది. నారదుడు కూడ నట్టి స్త్రీకి పునర్వివాహము నంగీకరించినాడు. కాని యామె పునర్భువని యంగీకరించినాడు.

      కన్యైవాక్షతయో నిర్యాపాణిగ్రహణదూషితా
      పునర్భూః ప్రథమాప్రోక్తా పునస్సంస్కారమర్హతి
                                      (నారద. 12-16)

కావుననే నారదు డట్టి స్త్రీ యేడువిధములగు పరపూర్వలలో నొకతెనుగనంగీకరించినాడు.

      పరపూర్వా స్త్రీయస్త్వన్యా: సప్తప్రోక్తా యథాక్రమం
                                           (నారద. 12-45)

అని యేడువిధముల పరపూర్వలను పేర్కొనుటలో నారదుడు పైమాటలను చెప్పియున్నాడు.

నారద వసిష్ఠులు దక్క మఱియే స్మృతికారుడును నక్షతయోనికా పునర్వివాహము నంగీకరింపలేదు.