పుట:Womeninthesmrtis026349mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము.

భారతదేశ చరిత్రలో వివిధకాలములలో స్త్రీలస్థితి యెట్లుండెనో తెల్పు గ్రంథములను వ్రాయుటకై నేను సంకల్పించు కొనినట్లు నేనిదివఱలో రచించియుండిన "వేదకాలపు స్త్రీలు" అను గ్రంథముయొక్క యుపోద్ఘాతములో చెప్పియున్నాను. ఆగ్రంథముల ప్రయోజనమును వాని రచనావిధానమును గూడ నట వివరించియుంటిని. అప్పటికే నేను స్మృతి కాలపు స్త్రీలను గూర్చి కూడ కొంత పరిశీధనము చేసియుంటిననికూడ తెల్పితిని. ఈలోపున నాపరిశోధన పూర్తియై తత్ఫలితముగ నీగ్రంథము వెల్వడుచున్నది.

ఋషులచే వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథములకే స్మృతులని పేరు. వేదములను మనస్సుననిడికొని వీనిని ఋషులు స్మరించుటచేతనే (శ్రుతింవశన్తిమునయ: స్మరన్తిచతథా స్మృతిం) వీనికి స్మృతులను నామమువచ్చినదని మనవారు చెప్పియున్నారు. ధర్మశాస్త్ర ప్రవర్తకులైన ఋషుల నామములు యాజ్ఞవల్క్యస్మృతిలో నీయబడినవి.

     మన్వత్రివిష్ణుహారీత యాజ్ఞవల్క్యోశనాంగిరా:
     యమా స్తంబసంవర్తా: కాత్యాయనబృహస్పతీ
     పరాశరవ్యాస శంఖలిఖితా దక్షగౌతమౌ
     శాతాతపో వసిష్ఠశ్చ ధర్మశాస్త్ర ప్రయోజకా: [యాజ్ఞ 1-4,6]