128 సాహిత్య మీమాంస
ఉజ్వలతరమై ఆమెను శ్రీరామునకు ప్రేమసర్వస్వముగను, జనకున కాదరసామగ్రిగను, కౌసల్యాదులకు గృహలక్ష్మిగ నొనరించెను.
హిందువులలో స్త్రీలు అత్యంతాదరపాత్రములు, గృహలక్ష్ములు; తత్కుటుంబముల మానమర్యాదలకు వారే ఆధారములు; పతులను, నత్తమామల భక్తితో గొల్చుతూ పుత్రులను, మఱదులను స్నేహముతో నాదరింతురు. ఇంత ప్రాముఖ్యత చెందియూ వారు స్వాతంత్ర్యము, స్వేచ్ఛాచరణము నపేక్షింపరు. వారికదిలేని లోటులేదు. చూడండి.
శ్లో|| "పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే
పుత్రస్తు స్ధవిరేకాలే స్త్రియోనాస్తి స్వతంత్రతా||"*
తండ్రి రక్షించు కౌమారదశను యవ్వ
నమున పెన్మిటి యోగక్షేమముల నరయు
ముసలితనమున పెంచును ముద్దుబిడ్డ
డుండ బోవదు స్వాతంత్ర్య మువిద కెపుడు.
సంతానమును తొమ్మిదినెలలును మోసి కని వారిని సదా లాలించి పాలింపవలయును గాన వారికి పరాధీనత స్వభావ సిద్ధము, ప్రాపంచికబంధము లెక్కుడు; భక్తి ప్రేమ స్నేహములచే కుటుంబములోని వారల బంధించి వారి ప్రేమపాశముల తాము తగులువడుదురు. ఈపరస్పరప్రేమ బంధమే హిందూకుటుంబసంస్థల దృఢపరచుచున్నది. అందువలననే అన్యోన్యప్రేమ పెరిగి సాంద్రము కాగా దానికిని భక్తికిని సమ్మేళనము సంభవించుచున్నది. ఇట్టి సమ్మిళన సూత్రము