300
ఇందుకభిమన్యుఁడొసఁగు నుత్తరమునెట్లు తెలిపిరో విలోకింపుఁడు:-
ఇంచుక యేని శంకఁ గొన కిట్లనఁ జెల్లునె? నీవు గాన సై
రించితి, నాదు మామ భళిరే! యనఁ దండ్రి శబాసనన్, గురున్
మించి, కృపుం గలంచి, యటు మీఁద సుయోధను గర్ణునొంచి, య
భ్యంచిత కీర్తి నించెద, భయంపడనేల? రథంబుఁ ద్రోలుమా.
సైంధవుని విజృంభణ మిట్లు పేర్కొన బడిను:-
సింధు నృపాలుఁడెంత? యనిఁ జీరికిఁ గొందునె? పోర మద్భుజా
బంధురశక్తి మున్నెఱిఁగి పాఱఁడె? యంచని భీముఁడేచి రా
గంధగజాసురారి వర గర్వమునన్ సివమెత్త నాఁగె, నా
సైంధవుఁడౌర! దైవ కృపచాలిన శ్వానము సింహమౌ గదా!
అభిమన్యుని విక్రమమును, శాత్రవులయక్రమమును, అతని నిర్యాణమును నొక పద్యమున నిట్లు వర్ణింపఁబడెను:-
చాపము నెక్కుపెట్టి రిపుజాలము మారి మసంగినట్లు వాల్
తూపుల నేపడంప మది దోఁపక కర్ణుడు దుస్ససేనుఁడున్
జాపగురుండధర్మమని జంకక యొక్కట దూఁకి పైకొనన్
బాపపు దైవమేమియన! బాలుని కాలుని ప్రోలు చేరిచెన్.
మంగళ సిద్ధి కొరకు, అభిమన్యుఁడు మరల బ్రతికింపఁబడిన ట్లీ క్రింది పద్యము చెప్పఁబడెను.
అల సుభద్రయు నుత్తర హర్షమంద
నన్న ముదమొంద, జగమెల్ల నబ్రమందఁ
బాండవేయులు నిజ పదాబ్జంబు లంద
మరల బ్రతికించె హరి యభిమన్యు నంద.