పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కాశీమజిలీకథలు - మూడవభాగము

తరువాత నేనాస వదలక యాదంపతుల జాడదెలియ సముద్రప్రాంతపట్టణంబు లరయుచు దిరుగుచుంటిని. నాగ్రహచారదినంబు లెంత క్రూరమయినవో చూడుడు. ఒకనాడు వారి వృత్తాంతము విమర్శింప కలిఘాతానగరంబునకు బోయితిని. నవరత్నస్థాపితమగు రాజపుత్రి కంఠాభరణమొండు నామెడలో నున్న యది. దారిభత్యమునకై నేనా భూషణము నాయూరి యంగడిలో నమ్మజూపితిని. రాజభటు లదిచూచి యింత విలువగల నగ నీకెటులవచ్చినదని యడిగిరి. నేను నిజముచెప్పిన బ్రమాదమని యెద్దియో బొంకితిని నామాటవలన నారాజభటులనుమానము చెంది యా వస్తువుతో గూడ నన్నా రాజస్థానమునకు గొనిపోయిరి

ఆభూపతి యామండనము తనపుత్రిక ధరించునదిగా గురుతుపట్టి నీకిది యెట్లువచ్చినదని నన్నడిగెను. నిజముచెప్పిన రాజపుత్రి దుశ్చారిత్రము లోకులకు వెల్లడియగుటయేకాక మఱేమియు లాభములేదని తలచి ప్రాణవ్యయమునకు సమ్మతించి యతడెన్నివిధముల నడిగినను నిజముజెప్పక నిది నడచుచుండ మార్గములో దొరికినదని చెప్పితిని. నామాటలతడు నమ్మక మిక్కిలి కోపించుచు నాకప్పుడు యావజ్జీవము కఠినశిక్ష విధించెను. చావదెగించియున్న నాకతని డండన యేమి వెరపు గొల్పెడిది.

నేనాశిక్షకు మిక్కిలి సంతసించుచుండ నప్పుడే నన్ను రాజభటులు చెరసాలకు గొనిపోయి యందుంచిరి. నేను గారాగారక్లేశముల పదునాలుగువత్సరము లనుభవించితివి. అంత నొకనాడు రాజభటులు నాయొద్దకువచ్చి సంకెళుల విప్పి నన్ను సబహుమానముగా రాజుగారి యంతఃపురమునకు దీసికొనిపోయిరి. అందు నారాకకై యెదురుచూచుచున్న కల్పవల్లి నాకన్నులం బడినది. నాయవస్థజూచి యాచిన్నది గోలుననేడ్చుచు నన్ను బిగ్గరగా కౌగలించుకొనినది.

నేనును విస్మయశోక సంభ్రమములు మనంబునం బెనంగొన బెద్దతడవు పరవశనై వాపోయితిని. అప్పుడయ్యువతి నన్నోదార్చుచు సఖీ! నీవెట్లు బ్రతికితివి? నాకంకణాభరణము గురుతుబట్టి నిన్ను జెఱసాల బెట్టిరట. నిజమేమిటికి జెప్పితివి గావు. నిన్నందు బిట్టుగా నిర్భంధించిరిగాబోలును. కటకటా? ఏమిచేయుదునని విలపింప నూరడింపుచు మీరెట్లు బ్రతికితిరి ? ఇచ్చటికెట్లు పచ్చితిరి? నీ ప్రియుం డెందున్నవాడు? అని యడిగిన గల్పవల్లి యిట్లనియె.

ఇంతీ! ఆయోడ మునుగువఱకు మేమిరువురము నొక శయ్యయందు గూర్చుండి సంగీతము బాడుకొనుచుంటిమిగదా? అదిమునిగినతోడనే యాశయ్యయే మాకు దెప్పయై తెప్పున తేలినది. దాని యాదారమున సముద్రములో మునుంగక గాలివిసరున గొట్టికొనిపోవుచుంటిమి. శుభాశుభఫలంబులు దైవికములుగదా! అంతలో నొకయోడ మాయొద్దకు వచ్చుటయు నానావికులు మమ్ముజూచి తొందరజెందుచు వడిగా దానిలోని కెక్కించుకొనిరి. ఆఓడ విమర్శింపగా మనవెనుక రాజకుమారుడు వెళ్ళివచ్చినదైనది.