పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

205

నావికులు మమ్ము గురుతుపట్టి మాయాపదకొరకు బరితపించుచు మిక్కిలి నైపుణ్యముగా బదిదినములకు సింహళద్వీపమునకు జేర్చిరి. అతనిరాకకై వేచిఉన్న సింహకేతుడు కుమారుని వృత్తాంతమంతయువిని మిక్కిలి శోకించుచు నప్పుడే మకరందుని బట్టాభిషిక్తుని జేసెను. అతండు రోలంబ కావించిన ఘోరకృత్యము లన్నియు దండ్రికెఱింగించి నన్ను బట్టమహిషిగా స్వీకరించి రోలంబను జెరసాలం బెట్టింప నియమించిన నేను గరుణించి విడిపించితిని. నేను మహారాజభోగము లందుచున్నను నీవు లేకపోతివనియు, నీవున్న దీనికెంత సంతసింతువో యనియు రేయిం బవలు చింతించుచునే యుంటిని.

కొన్ని సంవత్సరములు గడచినంత నాకు నా తల్లిదండ్రులజూడ వేడుకపుట్టి కోరిన సుహృదయుండై న నాదయితుండు నామాట మన్నించి చతురంగసేనలతో బెక్కుయోడలం గట్టించుకొని యప్పుడే పయనమయ్యెను. మొన్నటిదినంబున కీపట్టణంబు జేరితిమి మా సన్నాహమంతయుజూచి నా తండ్రి శత్రుసైన్య మనుకొని వెరచుచు నప్పుడే సంధికి రాయబారము నంపెను.

అప్పుడు మేము శత్రువులము కాము. మీ కాప్తులము, మిమ్ము జూడవచ్చితిమి. వెఱవవలదని ప్రత్యుత్తరమువ్రాయ నతండప్పుడే సంతసించుచు కానుకలంగొని మా యొద్దకు వచ్చెను. మే మతనికి నమస్కరించి యెదురనిలువంబడియుండ నేమియుం బలుకక యూరక చూచుచున్న నవ్వుచు మకరందుడు ఆర్యా! ఈ జవ్వనియెవ్వతియో! యెఱుంగుదువా యని అడిగెను. అంతలో నేను సై పక హా! తండ్రీ నన్ను మరచితివా అని పై బడి విలపించితిని.

అతండు నన్ను గురుతుపట్టి యెత్తుచు నూరడించి మమ్ము గోటలోనికి దీసికొనిపోయి మా వృత్తాంతమంతయు నా తల్లికి జెప్పెను. ఈరెండుదినంబులు గడచిన వృత్తాంతమంతములం జెప్పికొనుచు గడియలాగున వెళ్ళించితిమి. నేటి యుదయంబున నెద్దియో ప్రసంగముమీద నీ కంఠాభరణ మొక యాడుది తీసికొనివచ్చి యీ యూరిలో నమ్మ జూపినదట. దాని కెటులవచ్చినదో చెప్పినదికాదని మా తల్లి నాకు జెప్పినది.

ఆ మాటవిని నేనదరిపడుచు నా యాడుదానవు నీవేయగుదువని నిశ్చయించి యప్పుడే నిన్ను దీసికొనిరా దూతలం బుచ్చితిని. దైవానుగ్రహంబున మనమందరము బ్రతికి యొకచోట గూడితిమి. ఈ దినంబెంత సుప్రభాతంబని సంతసించుచున్న సమయంబున మకరందు డచ్చటికివచ్చి నన్ను జూచి మిక్కిలి యబ్బురం బందుచు నా వృత్తాంత మడుగుటయు వారిరువురకు నోడ మునిగినది మొదలు నాటి వరకు జరిగిన విశేషముల నన్నియుం జెప్పితిని.

నా మాటలు విని వారు తమ పుత్రికంగూర్చి చింతింపుచు నప్పాపం జూడ నప్పుడే కాశీకిఁ బోవ బయనమైన వారించుచు నే నిట్లంటిని. మీ రిట్లు పెద్దసన్నాహముతోబోయి యడిగిన నబ్బాలిక వృత్తాంత మెవ్వరును జెప్పరు. ఇప్పటికి బదియాఱే