పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

203

యమై విమర్శింప నాగూఢచారుల కెద్దియో కలహమువచ్చి యొండొరులపై నేరములు మోపుచు తుదకు జరిగిన వృత్తాంతమంతయు నాతోజెప్పిరి

అప్పుడు నేను మిక్కిలి పరితపించుచు నెవ్వరికింజెప్పక యాక్షణమునందే యోడ సన్నాహము చేయించుకొని బయలువెడలి వచ్చితిని. దైవకృపచే గాలిత్రోపు నన్నీదీవికే తీసికొనివచ్చినది. మిమ్మిందు బొడగాంచితిని. నాకతంబున మీరు దారుణదుఃఖంబు లనుభవించితిరి. యేమిచేయుదును? గతంబునకు వగచినం బ్రయోజనము లేదుగదా యిప్పుడు మాదీవికిం బోవుదమురండు. మీయెదుటనే రోలంబకు సంకిళులు వైచి చెఱసాలం బెట్టించెద కల్పవల్లిం బెండ్లియాడితినని నా తండ్రికిజెప్పి పట్టమహిషిగా జేసికొనెదను అని యెన్నియో మాటలు చెప్పి మాహృదయపరితాపము వాయజేసెను. అత డమ్మఱునాడే నావికులింకను మంచిగాలి విసరుటలేదని చెప్పినను వినక యక్కలముల రెంటిని జాపలెత్తించి పయనము సాగింపజేసెను. గాలి ననుసరించి యోడలు నడుచుచుండుటజేసి యతివేగముగా బోయిబోయి నాలుగు దినములలో మేమెక్కినయోడ జంబూద్వీపమును సమీపించెను. ఇఁక గడియలో రేవు చేరుదుమని తలంచుకొనుచున్న సమయములో నొకసుడిగాలి వచ్చి మా ఓడను గిరగిరద్రిప్పి నీటిలో ముంచివేసినది.

ఆయోడ మునుగువరకు నేను కల్పవల్లి గనిన శిశువును జంకనిడికొని యుంటిని. నీటిలో బడినతోడనే నేనాశిశువును వదలక దైవగతిచే జేతికి దొరకినబల్ల నూతగాబూని మునుంగక బైకిదేలి మునుపటి యలవాటుచొప్పున బిడ్డను మునుంగ కుండ బట్టుకొని నాశక్తి కొలంది నీదుచుంటిని. ఆయలల రాయడిచే పై కెగసినప్పుడు తీరముదాపున నున్నటులే కనంబడినది. అడుగంటినప్పుడు నూతిలో నుండునటులే తోచునది.

అట్టిసమయమున నేను జీవితాశవదలి దైవమును ప్రార్థింపుచుంటిని. ఇంతలో నొకచిన్నయోడ దైవికముగా మాయొద్దకు వచ్చినది. అందొకయువతియు బురుషుడును కూర్చునియుండిరి ఆ దయాళుండు నన్ను జూచి నావ నిలిపి మెల్లన మమ్ము దానిలోని కెక్కించుకొని తీరమునకుం దీసికొనిపోయెను. అందు నేను సేదదీర్చుకొని నీటితాకుడున జెక్కుచెదరక మెరయుచున్న యాబాలిక యాయువునకు వెరగుపడుచు వారడుగ నావృత్తాంతమంతయు సమయోచితముగాజెప్పి నా మిత్రుల గురించి విచారించుచుండ నాపుణ్యాత్ముం డోదార్చుచు నా కిట్లనియె.

బోటీ! మాది కాశీపట్టణము. నా పేరు విష్ణుశర్మ నేను బ్రాహ్మణుడ. నాకు మడిమాన్యము లేన్నియేని కలవు. ఈబాలికను మాకిమ్ము మేము ప్రాణప్రదముగా బెంచుకొనెదము. నీవును మాయొద్దనుండవచ్చును. ఏ కొదవయు నుండదని పలికిన విని నేనించుక ధ్యానించి పరమనిర్భాగ్యురాల నాకీశిశువేలనని యప్పుడే కన్నీరు విడుచుచు నాపసికూనను వారిచేతులలో నుంచితిని. అమ్మఱునాడే యా బ్రాహ్మణుడు ఆశిశువును దీసికొని స్వగ్రామమునకు బోయెను.