ఆత్మచరిత్రము 52
మోహము మున్నగు హేయభావములకు గుఱియగుచున్నది. దీనిలో మొదటిది కడపటిదియు నాపరమశత్రువులు. ఈశత్రులబారినుండి నన్నుఁ దప్పింపుమని వినయాతిశయమున వేడుకొనుచున్నాను."
"భగవానుడా ! రాఁబోవు సంవత్సరము దసరానాఁటికి నే నెటు లుందునో తెలియదు. గతదసరాకును ఇప్పటికిని నాలో నెంతయో మార్పు కానుపించుచున్నది. ముఖ్యముగ పవిత్రుఁడగు జీససుప్రభువుమూలమున నే నిపుడు సత్యదైవభక్తుఁడ నైతిని. లోకమునుగుఱించి నా యభిప్రాయము లిపుడు గంభీరములు నాగరికములునై విరాజిల్లుచున్న యవి. ఇపుడు నేను పూర్వమువలె గాక నీతిపరుఁడను ఆరోగ్యవంతుఁడను !"
పైన నుల్లేఖింపఁబడిన దినచర్యభాగములనుబట్టి, మామనసున కిపుడు క్రైస్తవమత సంపర్కము కొంత సోఁకినట్టు తేటపడఁ గలదు. కాని, యెపుడైన నేను సంపూర్ణక్రైస్తవమత విశ్వాసి నైనటుల నాకు జ్ఞప్తిలేదు. ఆ మతగ్రంథములఁ గల భక్తిపోషకములగు ప్రార్థనాదుల పోకడలుమాత్రము కొన్ని నే నిపుడు బాహాటముగఁ గైకొంటిని. జీససుమహాశయుఁడు చూపిన రాజమార్గమున నడచుటకు నాభక్తి యిపు డభ్యాసపడెను. ఇదివఱకు వైష్ణవమువలెనే, ఇపుడు క్రైస్తవముకూడ, నాభక్తికాంత ధరించిన వస్త్రవిశేషముమాత్రమె. క్రైస్తవమతాభిమానము నాకు పట్టుపడుటకుఁగల సందర్భము నొకింత నిచట ప్రస్తావించెదను.
'నేను రాజమంద్రికళాశాలలోఁ జేరినది మొదలు, అందలి యుపాధ్యాయులలో నెల్ల శ్రీమల్లాదివెంకటరత్నముగారు నాకుఁ