పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

సింహాసన ద్వాత్రింశిక


బున మదిఁ దల్లడిల్లుచును బొబ్బలు వెట్టుచు నొక్కవృద్ధకా
మిని పఱతెంచి వారల సమీపమున న్మొరచేసి యేడ్చుచున్.

17


ఆ.

పొలములోన జింకఁ బులి వట్టు కైవడి
వడి నెదిర్చి సంధ్యవార్చువేళ
గంగలోన మొసలి మ్రింగెను నాపతి
ననదఁ గావరయ్య యయ్యలార!

18


వ.

అనుచుం బెదవులు దడుపుచు దీనవదనయై మ్రొక్కిన నక్కజంబుగా నక్కామిని యక్కఱఁ జక్కఁబెట్టలేమి నక్కటా యనుచు నొక్కటియు ననలేక విప్రజాతి గావున నొండొరులమొగంబులు చూచుచు నున్నెడ నిగుఱు గప్పిన నిప్పు చొప్పున యప్పురుషరత్నం బప్పుడ దిగ్గున లేచి.

19


క.

తల్లీ!యిఁక నుల్లంబునఁ
దల్లడ మందకుము మొసలితలఁ ద్రెంపుదు నీ
వల్లభు విడిపింతును నే
కల్లోలిని గలఁతు హల్లకల్లోలముగన్.

20


ఆ.

అనుచు నభయమిచ్చి యటఖడ్గసహితుఁడై
గంగఁ జొచ్చి రాజపుంగవుండు
కొంకులేక యీఁది ఱంకెలు వేయుచుఁ
గడిఁది మొసలిఁ దృణముగా దలంచె.

21


ఆ.

పిడుగుకంటె మిగుల బెడిదమౌ నడిదంబు
పూని డాసి వ్రేసి దానిఁ ద్రుంచి
యంటఁగోఱ లెడపి గంటి మంత్రించుచు
బడుగుబాఁపనయ్య వెడలనడిపె.

22


క.

నిజనామము దలఁచిన నం
బుజనాభుఁడు వచ్చి మొసలిఁ బొరిగొని కరుణన్