పుట:భాస్కరరామాయణము.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఘననినదంబు భీకరముగా నొనరింపుము వాలి యామహా
ధ్వని విని సంగరంబున కుదగ్రసముద్ధతి వచ్చునట్లుగన్.

198


క.

శూరుఁడు శత్రునిగర్జన, మారఁగ విని సైఁప కలుక నడరును రిపుపై
నారులకడ బీరము మగ, వారికిఁ గడుఁబెద్ద యగుచు వాలుచు నుండున్.

199


వ.

కావున వాలి యధికశూరుండును దారాదిచారాన్వితుండును నీకు నజయ్యుండు
నగుట నీగర్జనంబు విని సైరింపక కోపాటోపంబున నిన్నుఁ బ్రహరింప సంగరం
బునకు వచ్చు వచ్చి నాదృష్టిపథంబునం బడిన వాలి నవలీల సమయించి నాప్రతి
న సఫలంబుగాఁ జేయుదు నని పలికిన నుత్సహించి రామునానతిఁ గిష్కింధా
ద్వారంబు చేరి ప్రళయామోఘమేఘాఘంబు లుఱిమినగతి భూనభోంతరాళం
బు పగుల నార్చె నప్పు డమ్మహానాదంబు విని బెగడి గోవృషంబులు పఱచె
సకలవనచరులు నాకులమానసు లయిరి మృగంబులు రణంబున జర్జరితాంగం
బు లయి విడివడినహయంబులకరణిం బఱచె ఖగంబులు క్షీణపుణ్యగ్రహంబు
లంబోలెఁ బుడమిం బడియె బిలంబుల మహానాదంబులు సెలంగె నాసమయంబున.

200


ఉ.

ఆనినదంబు వాలి విని యాగ్రహనిగ్రహచండభూరికో
పానల మాత్మలో నెరయ నగ్నికణంబుల నక్షు లీనఁగా
భానుజుమీఁద వేగమునఁ బాదహతిన్ ధర గ్రుంగ శారద
స్థానము దాఁటి పోవునెడఁ జయ్యన నడ్డము వచ్చి భీత యై.

201

వాలికిఁ దార హితోపదేశంబు సేయుట

శా.

వాలిం దార గవుంగిలించుకొని జీవస్వామి నీకుం గడున్
మే లేఁ జెప్పెదఁ గోపమున్ విడువు నెమ్మిన్ నాహితాలాపముల్
పోలంగన్ విను మర్కనందనుపయిం బోఁ జూచునుద్యోగ మీ
వ్వేళం బథ్యము గాదు నిల్వుము మదిన్ వీక్షింపుమా కర్జమున్.

202


మ.

అని నీచే నటు మోఁదులం బడి కడుం బ్రాణార్తుఁడై పాఱిపో
యినసుగ్రీవుఁడు క్రమ్మఱన్ భయము లే కేతెంచి ని న్నాహవం
బునకుం జీరఁగ రాక సూడ బలవిస్ఫూర్తిన్ నినున్ గెల్చి వే
తనుఁ గావం గలబల్లిదుం డొకఁడు మీఁదన్ లేక రాఁ డింతలోన్.

203


ఉ.

అంగదుచేత వింటి విను మత్తెఱఁ గర్కజుఁ డాత్మవాంఛ దీ
ర్పం గలవీరుఁగా నెఱిఁగి శ్రీరామునితోఁ దగ మైత్రి సేసె నా
రంగ దినేంద్రపుత్రునకు రామవిభుండు మహాసహాయుఁ డై
సంగడి వచ్చినాఁ డతఁడు సంగరకర్కశుఁడున్ బలాఢ్యుఁడున్.

204


చ.

అరబలసూదనుండు శరణాగతవత్సలుఁడున్ లసద్గుణా
కరుఁడు నజయ్యుఁడున్ విజయకర్మఠుఁడున్ రఘురాముఁ డాసహో
దరుఁడును నట్టివాఁడ రణదర్పమునం బటుచాపహస్తు లై