పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

251


వ.

అని జ్యేష్ఠాదేవిని నియమించి కలిరాజున కిచ్చి మఱియునుం
దరుప నయ్యంభోనిధియందు వారుణీదేవి జన్మించిన శేషున
కిచ్చిరి మఱి తంద్ర యుదయించి వైనతేయునకు భార్య యయ్యె.
నంత నప్సరోగణంబును గంధర్వులును నైరావతంబును నుచ్చై
శ్శ్రవంబును ధన్వంతరియును బారిజాతంబును గామధేనువును
జన్మించిన దేవేంద్రున కిచ్చి రంతఁ బ్రభాతసమయంబున ద్వాదశీ
దివసంబున.

120


క.

కమలాప్తోదయవేళన్
గమలోదయ మగుట సార్థకంబగు ననఁగాఁ
గమలాదేవి జనించెను
గమలముతో సురలనేత్రకమలము లలరన్.

121


ఉ.

సూరెలనుండి దేవతలు చూచుచు [1]మ్రొక్క పదాఱువన్నెబం
గారముతమ్మిమీఁద నవకంబగు క్రొత్తమెఱుంగుబొమ్మ నా
గారవమారు మేను వెలిగన్నులుఁ దిన్ననినవ్వుమోమునున్
దోరపుఁజన్నులుం గలిగి తోఁచెఁ బయోనిధిమీఁద రమ్యయై.

122


వ.

ఇవ్విధంబున సకలలోకమాతయగు నమ్మహాదేవి యుదయించె
నప్పుడు పుష్పవృష్టి గురిసె బ్రహ్మాదిమునులు యాశీర్వాదంబులు
నింద్రాదిదేవదైత్యదానవయక్షాదుల జయ జయ స్తోత్రంబు
లుం గిన్నరగంధర్వగాననినదంబులు నప్సరోగణనృత్య
వాద్యంబులు నొక్కటఁ జెలంగ దిక్కు లతినిర్మలంబు లయ్యె;
నగ్నులు ప్రసన్నార్చులై వెలింగె; పుణ్యవాయువులు వీచెఁ; దద
నంతరంబ చంద్రుం డుదయించి తారకాధిపతి యయ్యె; నతండు
లోకమాతతోఁ బుట్టుటం జేసి లోకమాతులుండనం బ్రసిద్దుండయ్యె;
మఱియు లోకపావనియును జగజ్జననియు నగు తులసి జన్మించి
విష్ణుపదపూజార్హ యయ్యె నయ్యవసరంబున.

123
  1. మ్రొక్కి (ము)