పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

227


తే.

సకలలోకంబు లెల్లను సంహరింపు
రుద్రభీమాహ్వయంబుల రూఢికెక్కు
మనిన నద్దేవు నానతి నర్థిఁ జేసి
లీలఁ బొలియింతు నాయాయివేళ[1]లందు.

21


వ.

మఱియు నద్దేవుండు తనదు నేత్రయుగళంబునం జంద్రసూర్యు
లను, శ్రోత్రంబులయందు వాయువును దిక్కులను, ముఖంబున
నింద్రాగ్నులను, నాసికను మైత్రావరుణులను, బాహుయుగ
ళంబున నశ్వినులను సంధ్యామరుద్గణంబులను, రోమకూపంబుల
నోషధులను వనంబులను, త్వక్కున శైలసముద్రంబులను
గవాదిపశుపక్షిజాతంబును, వదనంబున బ్రాహ్మణులను, భుజం
బుల క్షత్రియులను, ఊరువుల వైశ్యులను, పాదంబుల శూద్రులను
బుట్టించి తాను సకలభూతంబులం బ్రవేశించి సచేతనులం గావించె
నట్లు గావున సనాతనుండగు విష్ణుండు జగత్ప్రాణుండై జగదుత్పత్తి
స్థితిలయకార్యంబులు గావించుచుఁ ద్రిగుణాత్మకుండై త్రివిధ
నామంబుల విహరించుచుండు నది యెట్లనిన.

22


తే.

బ్రహ్మయును దానె మఱి ప్రజాపతులయందు
నంతరాత్మయుఁ దానెయై యఖిలజగము
నురుతరంబుగఁ బుట్టించుచుండు నెపుడు
నున్నతస్థితితోడఁ బ్రద్యుమ్నుఁ డనఁగ

23


క.

మనువులయందును ఘనులగు
జననాథులయందుఁ దాన సంప్రాప్తుండై
యనుపమముగ రక్షించుచు
ననిరుద్ధుఁ డనంగ నెగడు నచ్యుతుఁ డెపుడున్.

24


వ.

సంకర్షణరూపంబు దాల్చి విద్యాబలసమన్వితుండై కాలస్వరూ
పంబున రుద్రయమహృదయంబులం బ్రవేశించి జగత్సంహా
రంబు గావించును అవి యద్దేవుని యంతర్యామ్యవస్థ లనంబడు
మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ దశరథరామ

  1. నేను (మ-తి-హై)