పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

పద్మపురాణము


ఆ.

ఊర్ధ్వపుండ్రహీనుఁ డొగిఁ జేయు సంధ్యాది
కర్మమెల్ల నసురగణము[1]పాలఁ
బడుట నిక్క మతఁడు పటుఘోరరౌరవ
నరకకష్టములను నలిననేత్ర!

86


సీ.

పుణ్యమృత్తిక నూర్ధ్వపుండ్రంబు ద్విజునకుఁ
        గస్తూరికాతిలకంబు రాజ
తతికి వైశ్యులకు గందమున బొట్టే కాల
       మపరజాతికి భూతి నడ్డ మిడుట
యగు నెల్లజనులకు హరిభక్తి గలిగిన
       నూర్ధ్వపుండ్రము దాల్చు టుత్తమంబు
హరికంటె నన్యదేవార్చనంబులును ద్రి
       పుండ్రంబు మొదలైన పుండ్రములును


తే.

నర్హములు గావు విప్రున కాతఁ డెట్టి
కులజుఁడైనను బుధుఁడైన నలికమునను
భస్మ మిడునేని సత్క్రియాబాహ్యుఁ డండ్రు
సకలవేదార్థవిదులును శైలతనయ!

87


వ.

అట్లు గావున సర్వవర్ణధారణయోగ్యంబు నూర్ధ్వపుండ్రప్రకారం
బెట్టి దనిన దండాకారంబును సుపార్శ్వంబును సుశోభనంబును
సుభగంబును సుదీర్ఘంబును విపులంబును విరళమధ్యంబును
విష్ణుపదసన్నిభంబునుంగా నిడవలయుఁ దన్మధ్యప్రదేశంబున
హరి లక్ష్మీసమేతుండై వసియించియుండు నట్లగుటం జేసి.

88


క.

నడుమ నెడ మీక యెవ్వఁడు
గడువేఁడుక నూర్ధ్వపుండ్రకం బిడెనే న
య్యెడమున హరి వసియింపక
కడువేగఁ దొలంగిపోవుఁ గమలయుఁ దానున్.

89
  1. పాలఁ, బడుట నిక్క (ము)