పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

189


క.

ఇత్తెఱఁగు సెప్పి మఱియును
నత్తామరసాననునకు హరి కారుణ్యా
యత్తుఁ డయి శంఖచక్రాం
కోత్తము గావించి మంత్ర ముపదేశించెన్.

38


శా.

ఈమంత్రంబు విరించి మజ్జనకుఁ డి ట్లేకాంతమై నాకుఁ దాఁ
బ్రేమం బారఁగఁ జెప్పె మీ రిపుడు సాభిప్రాయచేతస్కులై
యీమార్గంబున శంఖచక్రధరులై యీమంత్రరత్నోన్నతిన్
శ్రీమద్విష్ణుపదంబు నొందెదరు సుశ్రీనిత్యులై యిమ్ములన్.

39


వ.

అని యిత్తెఱంగున నుపదేశించిన దేవమునివాక్యంబులు విని
యత్తపోధనసత్తము లుత్తమంబగు ప్రపత్తిమంత్రాయత్త
చిత్తులై విష్ణుసాయుజ్యంబు వడసి రట్లు గావున భూపాలోత్తమా!
నీవును శాశ్వతం బగు విష్ణులోకంబుఁ బొందు చిత్తంబు గలదేని
యీమంత్రదీక్షాప్రకారంబున సుదర్శనపాంచజన్యధారణంబు
చేసి నారాయణచరణంబులు శరణంబుగా నాశ్రయింపుము.

40


ఆ.

సర్వలోకవిభుఁడు సరసిజగర్భుండు
నారదునకు నాకుఁ గోరి మంత్ర
మిచ్చె దీని సురమునీంద్రుండు నైమిశా
రణ్యమునుల కిచ్చెఁ బ్రమద మెసఁగ.

41


మ.

ఇది యత్యంతరహస్యమంత్ర మిల ని ట్లెవ్వారికిం దూర మా
త్రిదశేంద్రాసురసిద్ధకిన్నరమునిశ్రేణు ల్గనంజాల రీ
సదుపాయద్వయ మేఁ బరాశరునకుం సమ్యగ్విధిం జెప్పితిన్
విదితంబైన ప్రపత్తి దీక్ష యిది యుర్వీనాథ! యాలించితే.

42


క.

శ్రీవిభునకంటె నధికము
భావింపఁగ లేదు తగఁ బ్రపత్తికి మిగులన్
భూవలయంబున మంత్రం
బేవిధమున లేదు దలఁప నిది నిజ మనఘా!

43