పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగులో నారదీయపురాణాలు

తెలుగులో క్రొత్తలంక విశ్వనాథకవికి పుత్రుడైన మృత్యుంజయకవి రచించిన 'బృహన్నారదీయం' అన్న పేరుతో వొకటి - కంజర్ల చెన్నయామాత్య పుత్రుడైన శ్రీమదల్లాడు నరసింహకవి విరచించిన 'నారదీయపురాణం' అన్నపేరు గల కృతివొకటి కనిపిస్తున్నది. మృత్యుంజయకవి విరచితమైన 'బృహన్నారదీయ' తాళపత్రప్రతులు మద్రాసుప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలోనూ, కాకినాడలో వున్న ఆంధ్రసాహిత్యపరిషత్తులోనూ వున్నాయి. ఇటీవల పిఠాపురంలోని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంవారు సేకరించి భద్రపరచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రిసర్చ్ ఇన్ట్సిట్యూట్‌కు అప్పగించిన 160 తాళపత్రగ్రంథాలలోనూ మృత్యుంజయకవి విరచితమైన 'బృహన్నారదీయం' ఆరాశ్వాసాలగ్రంథంగా కొంత అసమగ్రంగా లభించింది. కీర్తిశేషులు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు ప్రకటించిన ముద్రితాముద్రితగ్రంథసూచికాగ్రంథంలో కాకినాడ, మద్రాసు, తంజావూరులలో వున్న తాళపత్రగ్రంథనామాది విషయాలు ప్రకటించడం జరిగింది. ఈగ్రంథంప్రకారం చూస్తే మద్రాసులోని ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలో వున్న మృత్యుంజయకవి రచించిన "బృహన్నారదీయం" అసమగ్రంగా వున్నట్లు, కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో వున్న 'బృహన్నారదీయపురాణం' సమగ్రంగా వున్నట్లు పేర్కొనబడింది. అల్లాడు నరసింహకవి విరచించిన 'నారదీయపురాణం' ప్రతి కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో అసమగ్రంగా వున్నది. మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలోమాత్రం నరసింహకవికృతమైన 'నారదీయపురాణం' సమగ్రంగా వున్నది. అయితే నరసింహకవి విరచించిన నారదీయపురాణం ముద్రితమై మనకు లభిస్తున్న సంస్కృత నారదీయమహాపురాణంతో సరిపోల్చిచూస్తే యిది మహాపురాణానికి సంపూర్ణమైన అనువాదం కాదని ముందుముందు నిరూపితమౌతుంది. అయితే మృత్యుంజయకవి రచించిన బృహన్నారదీయం లభ్యమైనదానినిబట్టి చూస్తే మృత్యుంజయకవి నారదీయమహాపురాణాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువాదం చేయాలని సంకల్పించాడేమో నని అనిపిస్తుంది. మృతుంజయకవి అవతారికలో తన వంశాదికవిషయాలను ప్రస్తావిస్తూ -

"సకలవిద్వత్కవీంద్రుని సమ్మతించి
ప్రస్తుతింపంగఁ గావ్యముల్ విస్తరించి
పలుకనేర్తును నుభయభాషలను నేను
నబ్బురంబుగ మృత్యుంజయాఖ్యకవిని."