పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గల్పాంతరంబునఁ గుబేరుండై జనించు. అశ్వంబేని స్యందనంబేని
గజంబేని కల్యాణతీర్థతీరంబున నిచ్చిన స్వారాజ్యం బనుభవించి
స్వారాజ్యంబు నొందు. అచ్చట మౌక్తికంబు లొసంగిన ముక్తభేద
బాంధవుండై హారాలంకృతవక్షస్కుండై తారాపథంబు నొందంగ
లఁడు. కల్యాణతీర్థతీరంబునఁ గాంచనవికారంబేని రజతవికారంబేని
యొసంగిన నాచంద్రతారకంబుగాఁ జంద్రలోకంబు నొందంగలరు.
కల్యాణతీర్థోదకంబు ఘటంబునం దెచ్చి సజ్జనుల కిచ్చిన వారి పితృ
గణంబులు తృప్తింబొందు. కల్యాణతీర్థసన్నిధి బాలకుల కధ్య
యనంబులు సేయించిన వక్తలై ధన్యులై మేధావులైన పెక్కండ్రు
పుత్రులం గందురు. ఎవ్వరు కల్యాణతీర్థతీరంబున నధ్యాత్మవిద్య
యుపదేశింపుదురు వారు మత్సహాయంబైన యుపదేష్ట్రుపదంబు
నొందంగగలరు. కల్యాణతీర్థతీరంబునఁ దిలదానంబు చేసినఁ బాపంబులు
తిలప్రమాణంబులై నాశంబునొందు. కల్యాణతీర్థంబునఁ గనకాద్య
లంకృతకన్యాదానంబుఁ గావించిన ధరణీతలంబున ధనధాన్య
సంపన్నుండై పుట్టి శ్రీభూనీళాసంయుక్తుండైన మత్పదంబుం బొందం
గలరు. కావున మునీంద్రులారా! ఇచ్చటనే యుండి నన్ను సేవింపుండని
పలికి నారాయణుం డానందమయసంజ్ఞింతంబగు విమానంబునందు
రమతోఁ గూడియుండెనని నారదుండు పలికిన మునీంద్రులు హర్షంబు
నొంది రంత.

178


తే.

యాదవాచలమాహాత్మ్య మరసి యతుల
భక్తి పఠియించి వినువాఁడు భగవదిష్ట
తముఁడు వానిగృహంబునఁ గమలగేహ
వెలయు నాపుణ్యఘనుని యవిద్య తొలఁగు.

179


క.

[1]యదుగిరిమహత్త్వ మెవ్వని
సదనంబున నుండు వాఁడె సత్తముఁ డతి సం
పద లాయువు నారోగ్యము
సదమలమతులైన సతులు సకలము గలుగున్.

180


చ.

సకలజనేప్సితార్థములు చాల నొసంగుచు సర్వదేవతా
నికరకులాధిపత్యమున నిల్చి రమారమణుండు యాదవా
ద్రి కుహరసీమనుండి వినుతించినవారికి నిచ్చు వేడ్క నం
ఘ్రికమలసేవనాధికపరిస్పుటరాజ్యరమావిశేషముల్.

181
  1. యదుగరి