పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

తులసి యెటువలెఁ బ్రియంబగు
జలజాక్షున కట్ల ప్రీతి సంపాదించున్
వెలయఁగ ద్వాదశి యేత
త్ఫల మేమని చెప్పఁగల నృపాలవతంసా!

58


తే. గీ.

ఘనతతోశయనము మదంగపరివర్త
నంబు నుత్థానమున సంకరంబు మెఱయు
హరిదినంబుల నుపవాస మందకున్న
హృదయశల్యంబు వెట్టిన ట్లెనసియుండు.

59


ఆ. వె.

అనిన భగవదుక్తి యనుమాన మొనరించు
నట్టినరుఁడు బాహ్యుఁ డద్దురాత్ము
సద్గుణంబులెల్ల శవవిభూషణములు
వంచకుండు వాని నెంచనేల?


క.

ఏకాదశి[1]వంటి వ్రతం
బేకలుషాత్ముండు సే యఁడిల నెన్నిక దా
నాకలుషాత్ముని సుకృతం
బాకడ భస్మాహుతి యగు ననియెన్ శ్రుతియున్.

61


క.

గురుశాసనానులంఘన
శరణాగత[2]సుజనహరణ చక్రాయుధ వా
సరభోజనములు దురితాం
తరములకున్ సమము లనుచుఁ దలఁచిరి పెద్దల్.

62


వ.

కావున శుక్లపక్షేకాదశీదినంబున నుపవసించి నారాయణభజనంబు
సేయుము. తులసీదళసమ్మిశ్రతీర్థంబుతో హరినైవేద్యంబు భుజించు
వారు షోడక్యలాబూబింబజంతుఫలకళింగకరకంబులు వాసు
దేవార్చనావిధికి నర్హంబులుగా వశనభక్షకధేనుక్షీరఘృతంబు
లెప్పటికి హరికి నర్పింపఁదగదు. హవిష్యంబున విష్ణునివేదితాన్నంబు
సేయవలదు. భక్త్యాదరంబులు నారాయణనివేదితాన్నంబు భుజించిన
సంసారసాగరంబు తరియింతు రనిన శాండిల్యుని వచనంబులు విని
పరాశరుండు సర్వంబు నాచరింపుచు నారాయణాచలంబున నారాయ
ణానుగులైన దత్తాత్రేయశాండిల్యమైత్రేయాదులతో నుండె ననిన విని
మునీంద్రు లిట్లనిరి.

63
  1. కంటె
  2. జనన