పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

తత్తీర్థోత్తరసీమ మించు నొకవింతన్ బద్మతీర్థంబు రా
జత్తోయోత్థితఫుల్లహల్లకవనీసంపన్నమై సద్గుణో
దాత్తుండైన సనత్కుమారుఁడు తదుద్యత్పద్మపూజన్ సుప
ర్వోత్తంసంబు ననున్ భజించె సనకాదుల్ వెంట సేవింపఁగన్.

504


ఆ. వె.

జగతిఁ బద్మతీర్థసంపుల్లపద్మాక్ష
మణికలాపదివ్యమాలికాంక
కంఠులైనవారు ఘనులు వైకుంఠోప
కంఠసౌధవీథిఁ గాంతు రెలమి.

505


మ.

ఘనమై పావనమై విశుద్ధతరమై కల్యాణతీర్థంబుచు
ట్టును గానంబడి యష్టతీర్థి దగ నేఁడు న్నాఁడు చూపట్టి య
మ్మనురాజంబున యోగులున్ బుధులు సమ్యగ్భక్తిఁ గీర్తించు నం
తనె సిద్ధించు నభీష్టముల్ మునిఁగినం బ్రాపించవే పుణ్యముల్.

506


తే. గీ.

సర్వతీర్థములందుఁ బ్రశస్త మట్టి
తీర్థ మేతన్మహాతీర్థతీరసార
తులసికాకాండమణిభూష వెలమిఁ దాల్చు
ఘనులఁ జూడ మహాపాతకములు దొలఁగు.

507


సీ.

జనుఁడు స్థానాంతరంబునఁ జేయు పుణ్యంబు
                       లెలయఁ బుణ్యక్షేత్రముల నొనర్పఁ
దద్దశగుణమయి తనరు పుణ్యక్షేత్ర
                       కల్పితపుణ్యసంఘముల మించు
పుష్కరంబునఁ జేయు పుణ్యంబు తచ్ఛత
                       గుణమయి పుష్కరగణితపుణ్య
మునకంటెను బ్రయోగమున సహస్రగుణమై
                       చెలఁగు పుణ్యము మహర్షిక్షేత్రమునను


తే. గీ.

గోటిగుణమగు బుణ్యంబు సూటిగ శత
కోటిపుణ్యంబు యాదవక్షోణిధరము
నందు మద్భక్తసన్నిధి నయ్యెనేని
కోటికోటిగుణము పుణ్యకోటు లెంచ.

508