పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అంబరీష వికుక్షి రుక్మాంగద శుక
పుండరీకులు మున్ను దద్భూరిసౌఖ్య
మనుభవించిరి తద్భక్తజనుల కేవు
రకు నిజస్థాన మది రమ్య మకలుషంబు.

487


క.

పొగడిన వరాహమూర్తగు
భగవంతుని భూమిఁ గాంచి పరమరహస్యం
బగు శ్లోకద్వయ మచ్చటి
నిగమశిఖార్థయుతమున్ మనీష నొసంగెన్.

488


వ.

ఆవరాహచరమశ్లోకంబులు రెండు నివి:


శ్లో.

స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియోనరః
ధాతుసామ్యేస్థితేస్మర్తా విశ్వరూపంచ మామజమ్.


శ్లో.

తతస్తంమ్రియ మాణంతు కాష్ఠ పాషాణ సన్నిభమ్
అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిమ్.

489


తే. గీ.

అదియె వైకుంఠవర్ధనం బనఁగఁ దగిన
యనఘమగు యోజనద్వయ మన్నియెడలఁ
దన్మహాక్షేత్ర మెంతపర్యంత మక్షి
గోచరం బగు నది వేగఁ గూర్చు ముక్తి.

490


శా.

అం దానందమయం బనా నొకవిమానాగ్రేసరం బొప్పు శ్రీ
కందంబై పరిశుద్ధసత్త్వమయమై కల్యాణమై మ్రొక్కినన్
జిందున్ బాపము లంటఁ దాపము విసర్జించున్ బ్రశంసించినన్
గుందుం దుష్టరజస్తమోగుణనిజాంకూరోగ్రసంసారముల్.

491


ఆ. వె.

ఆది కృతయుగంబునందు వైకుంఠమ
ధ్యమున నుండి తానె యరుగుదెంచె
నవ్విమానరాజ మౌర మత్సంకల్ప
మహిమ లోకసజ్జనహితముగను.

492


వ.

విమానపశ్చాద్భాగంబునఁ బ్రాకారమధ్యంబున సుదర్శనమును
లక్ష్మియు సర్వకామంబుల నిచ్చుచుండు మఱియును.

493