పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణుఁడు వృకాసురుని భంజించుట

చ.

వృకుఁడను దైత్యుఁడొక్కఁ డతివీరుఁడు నారదమౌనిఁ గాంచి కౌ
తుకమున మ్రొక్కి నాకు దయతో నజవిష్ణుహరత్రయంబులో
సకలము నిచ్చి శీఘ్రమె ప్రసన్నత నొందెడివేల్పు దెల్పు మ
య్యకలుషమూర్తిఁ గొల్చి హృదయంబునఁ గల్గిన కోర్కె వేడెదన్.

415


వ.

అనిన నారదుం డిట్లనియె.

416


తే. గీ.

బాణరావణముఖ్యులౌ భక్తులకు మ
హేశ్వరుఁడు వేగ ఫల మిచ్చు నిద్ధమహిమ
నట్లు గావున నద్దేవు హరు మహాను
భావుఁ గొల్వుము దానవప్రభువతంస.

417


వ.

అని నారదుం డెఱింగించి చనిన దానవుండు పంచముఖు నఖిముఖుం
జేయందలంచి.

418


క.

బలునిష్ఠ నసుర నిజతను
పలలము ఖండించి చిత్రభానునిలో ని
శ్చలుఁడై వేల్చి పిదపఁ దన
తల యసి ఖండించి వేల్వఁదలఁచిన యంతన్.

419


క.

హరుఁడు ప్రసన్నుఁడు గాఁ దన
కర మూనినవానిశిరము ఖండములై యి
ద్ధరఁ బడుఁగా కని వేఁడిన
వర మిచ్చిన హరునియందె వంచన మెఱయన్.

420


వ.

అతని శిరంబుపై దనుజుండు కరం బిడందలంచిన హరుండు భీతిం
బరువెత్తె నంత.

421


క.

వటుఁడై హరి లంబశిఖా
వటుఁడై చనుదెంచి దైత్యవరునిం గని నీ కే
మిటికిం బరువిడనని త
క్కుటిలత్వము దెలియ మాయఁ దొలఁకఁగఁ బలికెన్.

422