పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

హరి కనకరత్నభవన బాహ్యస్థలమున
నిలిచి యద్భుతమైన యీనిలయ మెట్లు
చొత్తునని భీతిఁ గలఁగి రాజిలు వసించు
కొలువు మొగసాల చొఱలేక కొంకికొంకి.

406


క.

భయ ముడిగి సాహసికని
శ్చయమున నానగరు చొచ్చి తద్భోజనుతా
ప్రియభాషలతోఁ జొక్కుచు
నయుతార్కస్ఫూర్తి మెఱయ నాదిమమూర్తిన్.

407


వ.

కాంచి యవ్విప్రుండు.

408


క.

గడగడ వడఁకుచు దీవన
లిడ మ్రొక్కి బహూకరించి యిల్లాలు ప్రియం
బడరన్ రత్నకలశమున
బడిబడి జల మొసఁగ శౌరిపదములు గడిగెన్.

409


వ.

ఇట్లు తనపదములు గడిగి నిజపూర్వవృత్తాంతంబు దెలుప లజ్జావనత
వదనుండై కానుక సమర్పింపనేరకయున్న కుచేలుని చేలాంచలంబున
నున్న యటుకులు భక్తపారిజాతంబైన యాకృష్ణుండు తానె పరిగ్ర
హించి యతని ననిచిన.

410


క.

అప్పతి సంపద యొసఁగఁడె
తప్పదు మత్పూర్వకలితదారిద్య్ర్యము నా
యొప్పమి యే మనుకొనియెద
నిప్పుడు నావంటి దీనుఁ డెందును గలఁడే.

411


వ.

అని చింతించుచు నతండు నిజపురంబుఁ బ్రవేశించె నంత.

412


క.

కలధౌతపూర్ణగేహం
బులు మణిసౌధములు దివ్యభూషణనికరం
బులు మత్తద్విపనాదం
బులు భూరిసుగంధవస్తుపూర్ణతయుఁ దగన్.

413


వ.

కనుపండువై రమామందిరంబైన నిజమందిరంబుఁ బ్రవేశించి భార్యా
పుత్రసహితుండై కుచేలుండు సుఖంబున నుండె నంత నొక్కనాఁడు.

414