పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

కదిసె బాణుఁ డెదిరి కయ్యంబునను శౌరి
జక్రియును నుదారచక్రధార
నతనిబాహుశాఖలన్నియు ఖండించె
నాల్గు దక్కఁ దత్క్షణంబునందు.

370


వ.

అంత హరుండు ప్రార్థించిన హరి కరుణ వహించి ప్రహ్లాదవంశజుండు
గావున వీనిం గాచితి ప్రమథాగ్రేసరుండవైన నిన్నుఁ గొలిచి యుండుంగాక
యని బాణుని మన్నించి యాహరుని వీడ్కొల్పిన నాఘనుండు నిజేచ్ఛం
జనియె నంతఁ దనకూఁతునకు ననిరుద్ధునకు ననేకశుభావహోత్సవం
బులు గావించి యయ్యుషాజనకుం డంపఁ గృష్ణుండు తమవారిం దోడ్కొని
మంగళవాద్యంబులతో బలసన్నాహంబు మెఱయ ద్వారకాపురంబు
ప్రవేశించె నంత.

371

నృగమహారాజు వృత్తాంతము - పౌండ్రకవాసుదేవుఁడు

క.

ఒకనాఁడు వనవిహార
ప్రకటోత్సాహంబు మెరసి ప్రద్యుమ్నకుమా
రకముఖ్యు లలసి విమలో
దకమునకై పాడునూతిదరినుండి తగన్.

372


క.

వికలాసమరూపంబునఁ
గృకలాస మొగర్చుకొనుచుఁ గృకలాసము దా
నొకటి పొడచూప దరికిన్
బెకలింపఁగలేకయున్నఁ బేర్చినవేడ్కన్.

373


వ.

కృష్ణుం డాకృకలాసకంబు చేరంజని.

374


చ.

కరమునఁ బట్టి యెత్తిన జగన్నుతదివ్యశరీరమున్ బరి
స్ఫురితసురత్నకుండలవిశోభితభూషణముల్ మనోహరాం
బరమును బూని యొక్కనరపాలకుఁడై యది శౌరిఁ గాంచి ని
ర్భరసుఖవార్ధిఁ దేలి బహుభంగుల నెంచి నుతించి వేడుకన్.

375


క.

ఇక్ష్వాకుకులనృపుఁడఁ బా
పక్ష్వాంకమృగాదనంబ భయహేతు మదీ
యక్ష్వేడ విన్నయంతనె
భిక్ష్వాకారమున విమతబృందం బేఁగన్.

376