పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

పరమపురుష కృష్ణ పరమదయానిధి
పరమయోగివంద్య పరమహంస
పరమధామయుక్త పరమశుభాకార
పరమతత్త్వ మీవ పావనాత్మ.

377


వ.

ఏ భవత్ప్రతిగా జగతీసురు లగణేయంబులగు ధేనువుల దానం బొనర్చితి
నందు నొకరికి నిచ్చిన ధేనువు నొకనికి నజ్ఞానంబున ధారవోసియిచ్చితి.
అన్యోన్యమత్సరంబున నున్న యాభూమీసురులలో నొకవిప్రుండు నన్ను
గృకలాసపం బగుమని శపియించె తచ్ఛాపదుఃఖంబు నీవలనం గడచితి నని
పల్కి యానృపాలుండు దివ్యలోకంబునకుం జనియె నంత.

378


ఉ.

పౌండ్రక వాసుదేవుఁ డురుబాహుపరాక్రమగర్వసంపదన్
గాండ్రతనంబు గాంచి మురఖండనుతోఁ గలహంబు పూని తా
వేండ్రములైన బాణముల వేఁచెదఁ జు మ్మొకభద్రదంతి యా
పుండ్రరసాలముంబలె రిపున్ నిను నొంచెద సాహసంబునన్.

379


ఆ. వె.

తెలియ నీవు వాసుదేవాహ్వయమున క
ర్హుఁడవే ధరిత్రి నుగ్రశాస
నప్రతాపకీర్తినయశాలినగు నాకు
దగుఁ బ్రసిద్ధి నెంచఁ దత్పదంబు.

380


వ.

అని ఇట్లనుమాటలు దూతకుం దెలిపిన నతండు చనుదెంచి యానృపతి
యాడినట్లు విన్నవించినఁ గృష్ణుండు కోపంబు మెఱయ నిట్లనియె.

381


తే. గీ.

కదలివచ్చితి నిలుమను కదనమునకు
శాకినీ ఢాకినీ పిశాచములకెల్ల
విందు చేసెద పౌండ్రకవిభుని మాంస
ఖండము లఖండజయలక్ష్మిఁ గాంచి యపుడు.

382


వ.

అని పలికి దూత మరలనంపి జయభేరి వేయించి రథం బెక్కి యనేక
బలంబులు గొలువం గృష్ణుండు కదలిన.

383


క.

రెండక్షోహిణు లిరుగడ
నుండఁగఁ బౌండ్రకుఁడు నిలిచె నుగ్రతఁ గాశీ
శుండును మార్కొనియెం దా
నండ నిజాక్షోహిణీత్రయంబు చెలంగన్.

384