పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అదితిదేవికి దివ్యంబులైన కుండ
లంబు లిడి యింద్రుచేఁ బూజనంబు లొంది
నందనంబున కేఁగి సనందనాది
వందితుఁడు పారిజాతంబు వన్నెఁ జూచె.

317


వ.

చూచి యాదివ్యమహీజాతంబు గైకొని.

318


క.

ఖగరాజుమీఁద నిడుకొని
ఖగవీథిం జనఁగ శరనికరవర్షములన్
ఖగవాహనులై కురిసిరి
ఖగముఖ్యులు దివిజరాజు గర్వము మెఱయన్.

319


క.

అపరాజితాధిపుఁడు హరి
యపరాజితమూర్తి యైన యమరేంద్రుఁడు శౌ
ర్యపరాజితుఁడై యుండఁగ
సపరాజితుఁ జేసి యతని ననిచెన్ బురికిన్.

320


వ.

ఇ ట్లనిచి కృష్ణుండు నిజనగరంబు ప్రవేశించి సత్యభామాగృహంబునఁ
బారిజాతంబు నిల్పి యారాజకన్యల ననేకరూపంబులు ధరియించి
బహువిధసుఖంబు లనుభవించుచు నుండె నంత.

321

ప్రద్యుమ్నవృత్తాంతము

శా.

వింత ల్మీఱ నవంతిదేశపతు లావిందానువిందుల్ శుభ
స్వాంతుల్ సోదరి మిత్రవిందకు ఘనస్వాయంవరశ్రీల న
త్యంతప్రీతిగ రాజులం బిలిచి యాస్థానిన్ విజృంభింపఁగా
నెంతే సంభ్రమ మొప్పఁ గృష్ణుఁడు భుజోదీర్ణప్రతాపోగ్రుఁడై.

322


వ.

ఆమిత్రవింద నపహరించి నిజపురంబునకుం దెచ్చి యాకన్యకను
వరించి హరి శుభంబున నున్న యంత.

323


ఉ.

కోసలదేశ మేలు నృపకుంజరుఁ డొప్పగు నగ్నజిత్సమా
ఖ్యాసుభగుండు తత్తనయయై తగు నాగ్నజితిన్ దటిత్ప్రభా
భాసురగాత్రిఁ జక్రి వృషభప్రవరంబుల మూఁటినాల్గిటిన్
గేసరియట్లు పట్టి పెళకించి జయించి వరించె నంతటన్.

324