పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

హరికిఁ దలఁబ్రాలు వోసె భోజ్యాలతాంగి
రాధికాధరబింబధారాళతరసు
ఛారసోన్మిశ్రమోహౌషధంబు నిగ్గు
మించి తల కెక్కినను వెడలించె ననఁగ.

284


ఉ.

ఒప్పులకుప్ప రుక్మిణి సహోదరనేయములైన లాజలిం
పొప్ప రమాప్తమూర్తి మది నుండగ వేల్చెఁ గృశానునందు మైఁ
గప్పె వినీలధూమరుచికజ్జలసజ్జలబిందువారముల్
జిప్పిలె లోచనాబ్జములచెంత జనుల్ ప్రమదంబు నొందఁగన్.

285


తే. గీ.

మంజుమంజీరమాణిక్యపుంజకాంతి
వాహినీమధ్యమున కరవనజమత్స్య
మకరరేఖలు వెలయ నశ్మము వధూప
దమున మెట్టించె శౌరి చిత్తంబు గరఁగ.

286


తే. గీ.

విమలశాల్యన్న మాజ్యాన్నవీనముద్గ
శర్కరాపూపఫలరసక్షౌద్రదధిప
రంబు లానందముగఁ బ్రమదంబుతో భు
జించి రప్పుడు భూసురశ్రేష్ఠు లచట.

287


క.

గోపాలమౌళి యాత్మా
రోపణ మగ్నికి ఘటించె రూఢిం జైద్య
క్ష్మాపతి తేజఃపావకు
నీపగిది హరింతు ననుచు నెఱిఁగించుగతిన్.

288


వ.

ఇవ్విధంబునం గల్యాణంబు పరిపూర్ణం బగుటయు నవ్వాసుదేవుండు
ప్రమోదంబు వహింపుచు సకలోత్సవంబులు ననుభవించె నంత
నొక్కనాఁడు.

289


సీ.

అఖిలవిచిత్రవాద్యములు గాంధర్వవి
                       ద్యారూఢవివిధనృత్యములు భూసు
రాశీర్వచోఘోష మఖిలదేశాగత
                       రాజన్యమాన్యపరంపరలును
గంధమాల్యోల్లోచకంబులు పుణ్యసా
                       ధ్వీశుభగీతముల్ దివిజముక్త
కుసుమవర్షంబులు గురుతరోద్దీపిత
                       కరదీపకోటులు గజతురంగ