పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ప్రతినికేతనచిత్రపటమంటపంబును
                       బ్రత్యంగణాంచితభవ్యనవ్య
కర్పూరమృగమదగంధిలంబును బ్రతి
                       ద్వారరంభాస్తంభదామకంబుఁ
బ్రతిరాజవీథి సద్భటతోరణంబును
                       బ్రతినిమేషాహతపటహరవము
ప్రతిభూసురాశీఃప్రపంచసంధానంబు
                       ప్రత్యహనవసవారంభకంబు


తే. గీ.

ప్రతిరథాశ్వగజశ్రీశుభక్రమంబు
ప్రతికులస్త్రీపురుషకళాభ్యంచితంబు
ప్రతిసమోజ్ఝితశృంగారబంధురంబు
నైననగరంబు కనుపండు వయ్యె నపుడు.

280


వ.

అప్పుడు శోభనాలంకారభాసురంబైన తననగరిలోనఁ గృష్ణుండు
మంగళస్నానం బాచరించి వివిధభూషణశోభితుండై కల్యాణగృహ
వితర్దికపై బంధుజనసహితుండై రుక్మిణియుం బరిణయోచితశృంగా
రంబు మెఱయ నెచ్చెలులు దోడ్కొనిరాఁగ నూత్నరత్ననిర్మితంబైన
శోభనగృహంబుచెంత నిల్చె నప్పుడు వివిధవాద్యధ్వనులు వసుదేవ
బలభద్రోదితతచ్ఛుభసంభ్రమంబులును వెలసి యప్పుడు గర్గాదు
లిది శుభముహూర్తం బని పలుక మంత్రపూతంబైన హరిచేఁ దనకు
రుక్మిణికన్యక యాత్మదానం బొనర్చినఁ గైకొని భీష్మకునకు ధన్యత్వం
బొసంగె నప్పుడు మరియును.

281


తే. గీ.

శుభకరంబైన మంగళసూత్ర మపుడు
కట్టెఁ గృష్ణుండు రుక్మిణిగళమునందు
నకుహకోక్తుల మాధుర్యమందనుండు
గళమునకు మెచ్చొసంగినకరణి గాఁగ.

282


క.

తలఁబ్రాలు వోసెఁ గృష్ణుండు
కలకంఠీమణికి భీష్మకన్యకకుఁ బయో
జలధిసుధాకణములతో
వెలువడి చనుదెంచు కమలవిధమునఁ దనరన్.

283