పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అప్పుడు.

274


ఆ. వె.

శౌరి చక్కఁదనము సత్వాతిశయలస
ద్గుణము లఖిలవిబుధకోటివలన
వింతవింత గాఁగ విని వినిశిత
కంతుకుంతనిహతిఁ గ్రాగి క్రాగి.

275


క.

ఆరుక్మిణి యొకవిప్రుని
సారజ్ఞునిఁ బిలిచి కలితసంకేతరహ
స్యారూఢశోభనోత్సవ
చారుతరాత్మీయవృత్తసందేశంబుల్.

276


వ.

తెలియం బల్కి కృష్ణుసాన్నిధ్యమునకుం బంపిన నాభూసురునివలనఁ
గృష్ణుండు తద్వృత్తాంతంబంతయు విని యతిరయంబున దారుకానీత
స్యందనం బెక్కి బలరామసహాయంబుగాఁ గుండినపురంబునకుం జని
భీష్మకుం డెదురుకొని యొక్కయుచితసౌధంబున నునుప నుండె
నంత.

277


సీ.

హరి యద్భుతము గాఁగ నరిగి రుక్మిణిఁ బట్టి
                       రథముపై నిడుకొని రామసహితుఁ
డై మాగధాదులతో మొనయై చైద్యుఁ
                       డని సేయఁ దద్బల మణఁచివైచి
గర్వాంధుఁడై రుక్మి గవిసిన నతని యో
                       ధావళి నురుమాడి హరి కఠోర
కరవాలమున నొంపఁ గదిసిన భీష్మక
                       కన్యక విడిపింపఁ గనలి వాని


తే. గీ.

కచవిఖండన మొనరించి కాచి యనిచి
పాంచజన్యంబుఁ బూరించి బహుళజైత్ర
చిత్రవాదిత్రఘోషంబు చెలఁగ ద్వార
కాపురంబున కేఁగె శృంగారలీల.

278


వ.

ఇట్లు కృష్ణుండు ద్వారకాపురముఁ బ్రవేశించి రుక్మిణిం బరిణయంబగుటకు
నుత్సాహంబు మెఱయనుండిన గర్గుండు శుభముహూర్తంబు నిశ్చ
యించె నప్పుడు.

279