పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ఏతదీయాంశమే సుమీ యే నటంచు
నమ్మహీకాంత నిజమండలాకృతిం ద
దవయవంబులలోన నొండయ్యె ననఁగ
బెళుకుఁజాయల నాయింతిపిఱుఁదు దనరె.

266


క.

చక చక నేమించిన యా
ముకురానన యూరుయుగము మోహనకాంతుల్
ప్రకటించి మెఱయఁ “గదళీ
సకదాచన" యనిరి బుధజనంబులు బళిరే.

267


తే. గీ.

ధన్యతారుణ్యవీరరత్నంబు బాల్య
విగ్రహంబునకై వచ్చి విజయమంది
యపుడు కతనిల్పు శరధులయట్లు మెఱసెఁ
గలితరుచి పొల్చుకన్య జంఘాయుగంబు.

268


తే. గీ.

కలికిచాయ నిశాలీల కడకుఁ దరమఁ
బొదలె నరుణోదయస్ఫూర్తి పదములందు
నబ్జవికసనమును హంసకారవంబు
నచ్చటనె మోహనంబుగా నావహింప.

269


వ.

పాదరేఖాకలితధ్వజకలశాతపత్రచిహ్నయై పరిపూర్ణయౌవనయగు
నారుక్మిణీసుందరి కాంచనాంబరచందనానులేపనమహాభూషణసురభి
మాల్యాలంకారభాస్వరయై యున్నయంత నారుక్మిణికిం బరిణయంబు
సేయుటకై.

270


క.

శిశుపాలుం డర్హుఁడు హరి
పశుపాలుం డనుచు రుక్మి పాణిగృహీతీ
వశగతు భీష్ము నొడంబడ
నిశితమతిం దెలుప లగ్ననిశ్చయ మైనన్.

271


వ.

వారు శిశుపాలునిం బిలువనంపిన.

272


క.

మాగధసాళ్వాదులతో
సాగర ముప్పొంగె ననఁగఁ జైద్యుఁడు మదవ
న్నాగరథహయపదార్భటి
నాగరకులు మెచ్చ వచ్చె నవ్యస్ఫూర్తిన్.

273