పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

పసిఁడిసంపెంగవిరిచాయ భామమేను
నలువ గావించెఁ గాకున్నఁ బొలఁతి నాస
జగికల తదీయకళికచేఁ దగు నొనర్చె
మనుజులకు మచ్చు చూపఁబూనునె యతండు.

259


ఆ. వె.

అంబుజంబు పూర్ణిమాంభోజవైరి యొ
క్కటియ కమ్మటంచు గారవించి
యతివమోముచెంత నతనుండు తనవాలు
ముట్ట నిలిపె ననఁగ మోము దనరె.

260


క.

ఘనవదనకళాప్తికి ముద
మునఁ జంద్రుఁడు రెండురూపములు గైకొని ని
ల్చెను నేఁడు రెండువంకలు
ననఁగా రాజాస్యచెక్కుటద్దము లమరెన్.

261


తే. గీ.

రాజు తమ్ముల హెచ్చించి రహి యొసంగఁ
దలఁపఁడను వార్త నిజముగా నెలఁతమోము
రాజలక్ష్మి వహించి నిరంతరంబు
తమ్ములను గొంచెపడఁజేసి తానె మించె.

262


తే. గీ.

అక్షియుగళి విశాలమాయ యరగౌనె
మధురభాషాచమత్కృతి మణిపురంబు
తను లతిక గాఁగ సతికిఁ జిత్రంబె కంఠ
భాగమునఁ జూడ శంఖసంపత్ప్రశస్తి.

263


క.

లలనామణిభుజములు బిస
ములె యగుఁ గాకున్న సిరులు పూనిన హస్తో
జ్జ్వలజలజములు నురోజం
బులపేరిటి జక్కవలును బొలుచునె చెంతన్.

264


తే. గీ.

తగుబిలము పొన్నపువ్వును దెగడునాభి
చేరికఁ దనర్చు నింతినూగారుతీరు
నీలఫణి తేఁటిచాలును బోలి యమర
మధ్యమాయాసమాగతమహిమ మెఱయ.

265