పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

కుండినపతి యధిగతలో
కుం డినతేజుండు భీష్మకుం డనఘుం డా
ఖండలవైభవుఁ డవనీ
ఖండలసద్గుణకలాపకలితుఁడు వెలయన్.

252


తే. గీ.

ఇలఁ దగిరి రుక్మముఖ్యులు హేమశైల
ధీరు లనఘాత్ము లేవు రాశూరుసుతులు
వారికవరజ రుక్మిణి వసుమతీశ
కన్య గా దెంచ నంబుధికన్య గాని.

253


తే. గీ.

భోజకన్యకు మానసాంభోజసీమఁ
గలితమై కృష్ణపక్షంబు గలుగు టరుదె
భవ్యతరమైన ధమ్మిల్లబంధసీమఁ
గృష్ణపక్షంబు గరిమ మిక్కిలియుఁ దనర.

254


తే. గీ.

అధిపు జన్మాష్టమీదిన మాలతాంగి
ఫాలభాగాంతరంబునఁ బరిభవింప
నర్ధచంద్రుండు గాన్పించె నతిశయమునఁ
బర్వములలోన నుత్తమపర్వ మగుచు.

255


తే. గీ.

అజుఁడు శృంగారరసధార లతివమోముఁ
దమ్మి యలరార నరుదుగాఁ దాల్చె ననఁగ
నఖిలలోకములకుఁ జోద్య మావహిల్ల
నలికులాసితవేణి బొమ్మలు దలిర్చె.

256


క.

నిరతహరికథామృతరస
పరిపూర్ణత కూపలీల భాసిలు నా రుం
దర దనకర్ణంబులు సిరిఁ
బరఁగు త్రిదోషఘ్నరసశుభస్ఫూర్తి దగన్.

257


ఉ.

చేరలమీఁద నెక్కుడగు చెల్వు నటింపఁ జకోరలక్ష్మితోఁ
దోరపుఁజాయ కల్మిఁ దులఁదూఁగి మెఱుంగులు గాదె బోయె మిం
చౌ రహిఁ బూని కాయజశితాస్త్రము లేకరసాన దేరె నా
నారమణీలలామకు నొయారము గుల్కుచుఁ బొల్చు నేత్రముల్.

258