పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఆజానుబాహు నీలాంబుదనిభదేహుఁ
                       గౌస్తుభాభరణు లోకైకశరణుఁ
బీతకౌశేయుఁ గంపితమహాదైతేయు
                       ధవళాబ్జనేత్రు నుత్తమచరిత్రు
మానితాఖండలు మణిమయకుండలు
                       సులలాటు వైఢూర్యశుభకిరీటు
భక్తజనాహ్లాదుఁ బద్మజనుతపాదు
                       వేదాంతనుతలోలు విబుధశీలు


తే. గీ.

విశదమందస్మితముఖారవిందవిందు
సమధిగమ్యసమంచితాచారచారు
వైజయంతీశుభశ్రీనివాసు వాసు
దేవుఁ గృష్ణుని ముదము సంధిల్లఁ గాంచి.

248


ఆ. వె.

నాతపఃఫలంబు నాభాగ్యదేవత
నామనోరథంబు నాబలంబు
నామహోదయంబు నాపుణ్యసంపద
యిటు లభించె ననుచు నిచ్చనలరి.

249


వ.

ఆముచికుందుం డిట్లనియె. దేవా! నే నిక్ష్వాకుకులసంభవుండ, మాంధాత
పుత్రుండ, ముచికుందుండ. దేవకార్యం బొనర్చి యలసి యిట నిద్రించు
చున్నవాఁడ. శంకరపితామహచక్రహస్తేంద్రానలాగ్నిచంద్రసూర్యులలో
నేఘనుండ వని యడిగిన. నేఁ గృష్ణుండ. నిన్నుం గృపాకటాక్షవీక్ష
ణంబున నీక్షింపవచ్చిన చక్రధరుండ. ఇంక నొండుజన్మంబున
బ్రాహ్మణుండవై భజించి ననుం జెందెదవని పల్కి భక్తానుగ్రహకారియై
యతని వీడ్కొనియె.నంత జరాసంధుండు పునరాయోధనసన్నద్ధుండై
యరుగుదేర విశ్వకర్మచే సముద్రమధ్యంబున ద్వారకాపురంబుఁ
గల్పించుకొని మథురాజనసహితుండై యాహరి యం దధివసించె
నప్పుడు.

250

శ్రీకృష్ణుఁడు రుక్మిణీసత్యభామలఁ బరిణయమాడుట

ఆ. వె.

ఘనుఁడు రైవతుండు కంజాతసంభవా
నుజ్ఞచేత నిజతనూజ సకల
లోకధన్య రేవతీకన్య నర్పించె
హలధరుండు బెండ్లియాడెఁ బ్రేమ.

251